Thursday, 29 October 2015

Sick leave ( poem)

విరించి ll సిక్ లీవ్ ll
...............................
నా టేబుల్ కి ఎదురుగా
ఒంటరిగా కూర్చుని వున్న
అతడిని చూస్తే
ముడతలు పడిన రాళ్ళ ను చూసినట్టుంది

అయస్కాంతంలా అతుక్కుపోయే ఆ కళ్ళు
ఆకాశపు ఆవలి గట్టుని
దిగుడు బావుల్లోంచి వెతుకుతున్నట్టున్నాయి

పొగ గొట్టాల్లాంటి చేతివేళ్ళ నడుమ
ఎన్ని ఆలోచనలు బీడీ పొగలా మారివుంటాయో..

ఆ మసిబారిన పెదవుల నడుమ
ఊపిరితిత్తులు కాలిన వాసన

యంత్రపు శబ్దాల్ని చెవులకు బిగించుకుని
ఏకబిగిన మాట్లాడే అతడి మాటల్లో..
నామీదొక నిర్దాక్షిణ్యమైన నిర్లక్షం.

అపుడపుడూ మా మధ్య తారసిల్లే నిశబ్దంలోకి
అతడు కొత్తగా తొంగిచూస్తున్నట్టు కనిపించాడు.

తెరలుగా లేచే దగ్గు అంకాల నడుమ
నీటి ఒరిపిడికి నునుపు తేలి
బయటపడిన మైలు రాయిలా కనిపించాడు

సరే...సిక్ లీవ్ కి డాక్టర్ సర్టిఫికేటే కదా...!
ఇస్తానన్నాను.
రాసిస్తే మౌనంగా తీసుకున్నాడు.

శరీరాన్ని ఒక ఎక్స్ప్రెషన్ గా మార్చినవాడి దగ్గరినుంచి
నేనే ఎక్స్ప్రెషన్నీ ఆశించలేదనే చెప్పాలిపుడు.

అతడి కాలి కింద నలిపేసిన బీడీ ముక్కలో
అస్పష్టంగా ఒక నిప్పుకణం కనిపిస్తోందిపుడు.

28/10/15

Sunday, 25 October 2015

Telangana news of tomorrow

రేపటి తెలంగాణా వార్తలు
.................................        
* అంతరించి పోతున్న పులులు..ఐటం గర్ల్ లు గా మారి భారతదేశంలో కనుమరుగవుతున్న పులులు.

* ఐటం గర్ల్ స్థానం కోసం సడన్ గా పోటీ పెరిగిందంటున్న సినీ రాజకీయ విశ్లేషకులు

* తమని చివరికి ఒక దొంగతో పోల్చినందుకు మనోభావాలు దెబ్బతిన్నాయంటున్న ఐటం గర్ల్స్.

* ఐటం గర్ల్ ను సభా ప్రాంగణం లో చూసి కేరింతలు కొట్టి విజిల్లేసిన ఆంధ్రా జనం.

* ఐటం గర్ల్ గా మారినందుకు ఊరేగింపుగా పండగ చేసుకుంటూన్న అభిమానులు.

* తన బిడ్డ ఐటం గర్ల్ గా మారినందుకు అడవిలో ఉరేసుకున్న పులి.

* కొత్త ఐటం గర్ల్ కోసం ఐటం సాంగ్ ను రెడీ చేసుకుంటున్న దర్శకేంద్రుడు.

* ముంబాయి భామల అవసరం లేకుండా ఎట్టకేలకు తెలుగు నేలలోనే దొరికిన ఐటం గర్ల్.

* కొత్తగా వచ్చిన ఐటం గర్ల్,  తొడగొడుతూ,  మీసం తిప్పుతూ  డాన్స్ ఇరగదీసిందంటున్న అభిమాన సంఘాలు.

* చీకట్లో పనిచేసినందుకే తనకీ ఐటం గర్ల్ ఛాన్స్ ఒచ్చిందటున్న ఈ కొత్త భామ.

* తప్పించుకున్న పులి ఐటం గర్ల్ గా మారిందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్న జూ అధికారులు.

Amaravathi. A telanganite view

అవశేషాంధ్రలో అమరావతి..తెలంగాణైట్ వ్యూ
..........................................................
ఇక ఈ రోజు నుండి ఆంధ్ర ప్రజలు హైదరాబాదు మీద ఉండే మమకారాన్ని వదలుకుని తమ స్వంత రాజధాని మీద మమకారాన్ని పెంచుకుంటారని ఆశించవచ్చు. తెలుగు వారికందరికీ హైదరాబాదు మీది మమకారం ఈ రోజుదికాదు. అది ఒకే సారి తెగిపోమంటే తెగిపోదు. తెలంగాణా వచ్చిన మరుక్షణమే "మీరిక హైదరాబాదుతో ఉండే మానసిక బంధాన్ని తెంచివేయాల్సిందే" అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తట్టుకోలేక పోయారు. ఉద్వేగానికి గురయ్యారు. దీనికంతటికీ కారణం అయిన కేసీఆర్ ను విమర్శించటం వల్ల వారి మనస్సును కాస్త శాంతింపజేసుకునే వారు. అకస్మాత్తుగా రాజధాని లేకుండా ప్రజలు పాలకులు కొంత అస్థిరతను అనుభవించి ఉండింటారు. అది గమనించే చంద్రబాబు ఘనంగా ప్రతిష్ఠాత్మకంగా నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన చేపట్టి ఉండింటాడు. దీనితో చంద్రబాబు, హైదరాబాదు పట్ల ఆంధ్రా ప్రజలకు మానసికంగా ఉండే కనెక్టివిటీని సమర్థవంతంగా అమరావతి వైపు తిప్పగలిగాడు. ప్రజలలో హైదరాబాదును తన్నుకుపోయిన తెలంగాణా పట్ల ఉండే వ్యతిరేకత కూడా దీనివల్ల సమసి పోతుంది. ఇకపై పక్క రాష్ట్రంలో పుల్లలు పెట్టకుండా ఎవరి రాష్ట్రాన్ని వారు అభివృద్ధి చేసుకునే పనిలో పడటం వల్ల మాత్రమే మంచి జరుగుతుందని తెలుసుకుంటారు. తెలుగు వారంతా ఒకే రాష్ట్రంలో ఉండాలనే సెంటిమెంటు-సమైక్య వాదులు, ఇకనైనా కాస్త నోరు మూసుకుని ఉండే అవకాశం ఉంది. పనీ పాట లేక ఎంత సేపూ తెలంగాణా ప్రభుత్వాన్నీ, కేసీఆర్ నూ, తెలంగాణా ప్రజలనీ చులకన చేసి మాట్లాడే వెధవలకీ, పత్రికలకీ, ఛానల్స్ కి, ఇకపై వేరే పని దొరికింది కాబట్టి, వారి నోరూ కూడా మూలనపడే అవకాశముంది.

ఎటొచ్చీ రాయలసీమ వాసులు అసంతృప్తితో ఉన్నారు. అమరావతివల్ల సమీప భవిష్యత్తులో రాయలసీమకు ఒచ్చే లాభమేమీ కనిపించటం లేదనే ఉద్దేశం వారిలో కనిపిస్తున్నది. ఇప్పటికే ఒకసారి కర్నూలు ని రాజధానిగా చూసుకోవటంలో అవకాశాన్ని కోల్పోయిన వారు, మరలా ఇంకోసారి రాజధాని తమకి రాకుండా కాకుండా పోయిందనే బాధలో ఉన్నారు. ఇదే సమయంలో ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర కల కూడా సాకారమౌతుందనే దిశగా ప్రజలు ఆలోచిస్తున్నారు. అయితే ప్రజల్లో ఈ కోరిక ఎంత బలంగా ఉన్నదో..ఎంత బలమైన నాయకత్వం దీనిని పార్లమెంటుదాకా తీసుకు పోగలదో అనేది మునుముందు మనకు తెలిసే అవకాశమున్నా ప్రస్తుతానికి ఈ అంశం అకడక్కడా మిణుకుమంటూ కనిపిస్తుంది. తెలంగాణా కల అరవై యేండ్లకు సాకారమయింది. చైతన్య వంతులైన ప్రజలు, సమర్థ నాయకత్వం రెండూ కలిస్తేనే ఇలాంటి ఉద్యమాలు ముందుకు సాగుతాయి. ప్రత్యేక తెలంగాణా కల ఏ ఒకరిద్దరి కలనో కాకుండా యావత్ తెలంగాణా ప్రజల కల కనుక, ఆ ప్రజల్లోంచే ఒక బలమైన నాయకత్వం పుంజుకుంది. ప్రజల్లో బలంగా ఆ కోరిక లేనిదే ఒక్క కేసీఆర్ ఏమీ చేయలేడని, కేసీఆర్ మీద మాత్రమే నిప్పులు చెరిగే ఆంధ్రా మిత్రులు ఈ సందర్భంగా తెలుసుకోవాలి. అదే విధంగా ప్రత్యేక రాయల సీమ ని కాంక్షించే వారు మొదట ప్రజల్లో ఆ కోరిక ఎంతవరకు ఉందనేది తెలుసుకోవాలి. తెలంగాణాలోలాగా పల్లె పల్లెలో మనిషి మనిషిలో గూడు కట్టుకుని ఉన్న ఆ సాహిత్యం నిజంగా ఉందా అని పరిశీలించుకోలాలి. ఒక నాయకుణ్ణి విమర్శించటమో ఇంకో నాయకుణ్ణి పొగడటమో చేసినంత మాత్రాన ప్రత్యేక రాష్ట్రం రాదని, ప్రజల్లోనే ఉద్యమమన్నది రావాలని తెలుసుకోవాలి.

ఏది ఏమైనా అవశేషాంధ్ర ప్రదేశ్ కి ఒక రాజధాని ఉండటం, నిజమైన తెలంగాణా వాదులకి, పట్టిన దయ్యం విడిచిందన్నంత ఊరట.

Highlites of Amaravathy inaugaration

అమరావతి శంకుస్థాపన హైలైట్స్.
..............,,........................
*రేవంత్ రెడ్డి సభా ప్రాంగణంలో కనబడగానే ఆంధ్రా జనం చప్పట్లు కొడుతూ కేరింతలు పెట్టారని ఒక టీవి ఛానల్ ఆంధ్ర ప్రజల్ని అవమానించింది.
మరీ దొంగను చూసి అంత ఆనంద పడే ప్రజలు ఆంధ్రా ప్రజలని అలా ఎలా చెప్పిందో అర్థం కాలేదు. ఆ ఛానల్ ఏదో సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదనుకుంటాను.

*"మా తెలుగు తల్లికీ మల్లె పూదండ" పాటను ఎందుకనో ఏడుపు పాటలా పాడిన సింగర్ సునీత. పాట ఎత్తుకున్నపుడు శ్రావ్యంగా వినిపించినా..పాట చివరికి వచ్చేసరికి మరీ బాధతో పాడుతున్నట్టుగా పాడింది. శంకుస్థాపన రోజు ఇలా పాడటమా?. నరేంద్ర మోడీ ఈ పాట విని ఖంగు తిన్నట్టే అనిపించింది.

*ఒక్క కేసీఆర్ ముఖం తప్ప అందరీ ముఖాల్లో ఎందుకనో నవ్వే కనిపించలేదు. ముఖ్యంగా మోడీ చంద్రబాబు అసలు నవ్వలేదు. మోడీ కి పుష్ప గుచ్ఛం ఇచ్చేటపుడు చంద్రబాబు ఎందుకనో వంగి వంగి నవ్వాడు. కేసీఆర్ మాత్రం చాలా నిర్మలంగా కనిపించాడు. వేదిక మీదే కాక కింద కూర్చుని ఉన్న నారా లోకేష్ తదితరుల ముఖాల్లో కూడా ఆనందం కనిపించనే లేదు.

*అనర్గళంగా ఉపన్యసించే కేసీఆర్ సూటిగా సుత్తి లేకుండా తెలంగాణా ప్రజల ఆకాంక్ష ని వినిపించారు. మూడు నిముషాల్లో తన ప్రసంగాన్ని ముగించేసాడు.

*చంద్రబాబు ఉపన్యాసం పేలవంగా సాగింది. గతం లో హైదరాబాదు నేనే కట్టాను అని అంటాడనుకున్నాం కానీ ఎందుకో ఆ ముక్క మరచినందుకేమో పేలవంగా ముగిసింది. ఎక్కడా ప్రత్యేక ప్రతిపత్తిని గురించి ఊసెత్తలేదు. పైన్నుంచి ఊసెత్తొద్దని ఆర్డర్స్ ఉండిండొచ్చు.

*అలవాటులో పొరపాటుగా చంద్రబాబు ఉపన్యాసాన్ని ముగిస్తూ...జై హింద్...జై జన్మభూమి..అని మరోసారి జన్మభూమిని వేదికనెక్కించాడు. అంటే సింగపూరు ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రజలందరూ ఉచితంగా పని చేసి రాజధాని కట్టుకోవాలని పిలిపిచ్చాడేమో. జై ఆంధ్ర ప్రదేశ్ ..జై అమరావతి అనకుండా జై జన్మభూమి అనటం అర్థంకాలేదు.

*పచ్చని బట్టలలో వేదిక మీద ఉన్న వారందరికంటే చాలా నీట్ గా హుందాగా చంద్రబాబు కనిపించాడు. మాట్లేడపుడు కూడా చెప్పదలచుకున్నది చాలా చక్కగా ప్రజెంట్ చేశాడనిపించింది.

*వెంకయ్య నాయుడు ఒక కన్ను మూసుకుని మాట్లాడినా రెండు రాష్ట్రాల గురించీ..తెలుగు ప్రజల గురించి మాట్లాడటంతో, కేంద్రం ఇరు రాష్ట్రాల అభివృద్ధికీ సహాయాన్నందిస్తుందన్న సందేశమిచ్చారు.

*నరేంద్ర మోడీ హిందీలోనే మాట్లాడింటే బాగుండేది. వెంకయ్య నాయుడు తెలుగు అనువాదం వల్లనేమో ఆయన సహజమైన ఫ్లో కాస్త తగ్గినట్టనిపించింది. ప్రత్యేక ప్రతిపత్తిని గురించి గానీ, ప్రత్యేక ప్యాకేజీగానీ ఏదైనా చెబుతాడేమో అని నాలుగు వందల కోట్లు ఖర్చు పెడితే...ఇంత మట్టి మొఖాన కొట్టి పోయాడని జనాలు గుసగుసలాడుకుంటున్నారు.

*వేదిక మీద జరిగే అంశాలను వివరిస్తూ యాంకరింగ్ చేసిన సాయి కుమార్ అండ్ సునీతల మాట్లడే తీరు హుందాగా కాక సినిమా ఫక్కీలో జరిగింది. ఏదో సినిమా హీరోని మాట్లాడటానికి పిలుస్తున్నట్టు ఒక్కో నాయకున్ని పిలుస్తున్నపుడు ఆ నాయకులు కాస్త విసుక్కున్నట్టు కనబడింది.

*ప్రతిపక్ష హోదా ఉన్న నాయకుడు జగన్ ని చంద్రబాబు నాయుడు పర్సనల్ గా వెళ్ళి పిలిచి ఉంటే బాగుండేది. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సభలో లేకపోవటం ఒక లోటుగానే వుంటుంది.

*మొత్తానికి చంద్రబాబు నాయుడు అనుకున్నట్టుగానే శంకుస్థాపనా కార్యక్రమాన్ని అదరగొట్టారనిపించారు..

Tuesday, 20 October 2015

REM (poem)

విరించి ll రెం (REM) II
................................
తలుపులెవరో బాదుతున్నారు.
అతడి ఒంటి నిండా రక్తం.
కాదు అతడి ఒంటి నిండా ఇంకు
వేలమంది ముందు వేదికనెక్కాను నేను
తలుపులు పగులగొట్టేశారు వాళ్ళు
ఇవ్వాల్సిందే గద్దించారు వాళ్ళు
ఒక ఇనుప ముక్క నా చేతిలో వుంది
ఎన్ని పదాలు కూర్చాను..ఎంతగా శ్రమించాను
అతడి ఒంటి నిండా రక్తం
కాదు కాదు అది రక్తం కాదు ఇంకు
వాళ్ళు నా ఇంటిలోకి దూరారు.
వాళ్ళు తలుపులు బద్దలు కొట్టేశారు.
నా భార్యా పిల్లలు ఎగిరి గంతేశారు.
నా తల్లిదండ్రుల కళ్ళ లో ఆనందం
అతడిని దారుణంగా చంపేశారు.
అవును అతడినే చంపేశారు
ఎంతగా నా వాళ్ళ ని దూరం చేసుకున్నాను.
నా చేతిలో ఒక కాగితం ముక్క ఉంచారు.
చంపి అవతలికి ఈడ్చేశారతన్ని.
జనాలందరూ చప్పట్లు చరిచారు
హాలంతా మారు మ్రోగేలా చప్పట్లు
ఇచ్చి తీరాల్సిందే పూనకం పట్టిన వాడిలా అరిచాను
నల్ల బ్యాడ్జీ ధరించి ఊరేగింపుగా నిరసన చేశాం
అలమారాలో అందంగా అలంకరించబడిన బహుమతి
ఇంటినిండా జనం గుమిగూడారు
పత్రికల్లో నా ఇంటర్వ్యూలు,ఫోటోలు.. నా మీద ఆర్టికల్సూ
అలమారా బద్దలు కొట్టేశారు వారంతా
నా నరాలు బిగుసుకున్నాయి
గుండెలనిండా గర్వం ఉప్పొంగింది
కాళ్ళు పట్టి ఒక మూలకి పాడేశారతని శవాన్ని
ఆనంద భాష్పాలు నా కంటిని కప్పేశాయి
నిన్నెపుడో మరచారు జనం అన్నారు వాళ్ళు
ఇది అన్యాయం అక్రమం అని గట్టిగా అరిచాం అందరమూ
ఎన్ని పదాలు కూర్చాను..ఎంతగా శ్రమించాను
ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపాను
ఎంతగా నా వారిని దూరం చేసుకున్నాను
అలమారాలోంచి బహుమతిని బయటకు లాగారు
నేను నా భార్య పిల్లలూ, అందరం అడ్డుకున్నాం
ఇస్తావా ఈయవా ఈ బహుమతిని..వారంతా బెదిరించారు
ఆ పెద్దమనిషి..నవ్వుతూ  నా మెడలో మెడల్ వేశాడు
నీ పుస్తకం నేనూ చదివాను గొప్పగా ఉందంటూ బహుమతి అందించాడు
గట్టిగా అరుస్తున్నాను నేను
నశించాలి నశించాలి దౌర్జన్యం నశించాలి
అతడి ఒంటినిండా రక్తం...కాదు కాదు అది ఇంకు
ఇంటినిండా జనం గుమిగూడారు...
ఇది అరుదైన బహుమతని కొనియాడారు
మరొక్క సారి ఆలోచించుకోండని ప్రాధేయపడింది భార్య.
అసలు ఇచ్చేయటమేంటని కసరుకున్నారు పిల్లలు

నాది నాది అని అరిచాను నేను
నాకిచ్చారు నాకిచ్చారని ఏడ్చాను
వెనక్కిచ్చేసేయ్ గద్దించారు వాళ్ళు
నా ఇన్నేళ్ళ కష్టం..ఇన్నేళ్ళ శ్రమ,కృషి
నా పదాలు..నా వాక్యాలు..నా కవితలు..
నా పేరుప్రఖ్యాతులు...నా బహుమతి
గట్టిగా నవ్వారు వాళ్ళంతా
నిన్నెపుడో మరచి పోయారు జనం..
వెనక్కిస్తే మళ్ళీ ఇపుడు గుర్తుచేసుకుంటారన్నారు
చరిత్రలో రాస్తారన్నారు.
అతడి ఒంటి నిండా రక్తం...అవునదిరక్తం
కాదది ఇంకు
ఆయన చచ్చి పోయాడు
నన్ను వీళ్ళు చంపేశారు
నా బహుమతిని చంపేశారు
ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో చంపేశారు..
అందరూ ఇచ్చారు..నీవూ ఇచ్చేయాలన్నారు
నిరసన జెండాలెత్తి...వెనక్కివ్వాల్సిందేనని అరుస్తున్నాను నేను
ఇంకొక్కసారి ఆలోచించండంటోంది భార్య

మూసి వుంచిన నా కనుగుడ్లు వణుకుతున్నాయి
నా నరాలు కండరాలు బిగుసుకున్నాయి
అతడు చచ్చిపోయాడు.
తెగిన ఏనుగు తలలు, కంకాళాలు
తలకిందులుగా నడిచే మనుషులు
జడలు విరబోసుకుని నవ్వే పిశాచాలు
వికృతమైన రూపంతో మీదికొచ్చిన దయ్యం...

చెమటలు చెమటలు..
నిద్రలోంచి దుడుక్కున లేచి కూర్చున్నాను నేను
మనోజవం మారుత తుల్య వేగం..
అలమారాలో బహుమతి నవ్వుతూ కనిపించింది.
ముఖం కడుక్కున్నాను.
నిరసన వాదులంతా బయట నాకోసం వేచి ఉన్నారు.
వెనక్కివ్వాల్సిందే..ఇక తప్పదు.

20/10/15

Siraa pootha (poem)

విరించి ll సిరా పూత ll
.................................................................
పరిస్థితులు ప్రచండ వేగంగా మారిపోతున్నందుకేమో..
ప్రపంచానికి కావలసినంత తీరిక దొరికినట్టున్నది
నా ఏడుపు మీద పడి ఒకటే ఏడుస్తున్నది.

రాయీ రప్పల నడుమ ఎండుతున్న మొండి తలకాయతో
పెన్ను రీఫిల్ లోకి గాలివూపుకుంటూ బతికేవాడిని
సిరా వాసనలోంచి పచ్చి రక్తపు వాసనని పిండాలని
బొట్లు బొట్లుగా అక్షర కొలిమిలో కాలిపోయే రసవాదిని

ఈ లోకం దూరంగా విసిరేయబడిన అసైలమని తెలిసికూడా
ఒక చేతిలో స్వర్గాన్నీ ఒక చేతిలో పరుసవేదినీ చేజిక్కించుకుని
ఊహల్లోంచి, చరిత్రల్లోంచి పదాలై జారిపోయే మనుషులకోసం
ఆశగా ఆత్రంగా వెతుకుతూ  పుస్తకాల్లోకి ఉరికినవాణ్ణి
చివరికి సమాధి పలకలమీది పదాలుగా మిగిలిపోయే
మనుషుల కథల్ని అదృశ్యంగా అల్లిందెవరో...

అదిగో..కలత నిద్రలో నడిచే ఆ పిచ్చివాళ్ళిపుడే వచ్చారు.
సిరానూ, మకిలి మనసుల్నీ నా ముఖమంతా పులిమి
నేనొక కవితగా కథగా నిలబడగలనో లేదో చూద్దామని బెట్టు చేశారు.

చచ్చిబతికిన వాడెపుడూ జీవితాన్ని కొత్తగానే చూడాలనుకుంటాడు
తెల్లని గోడమీది చిన్న మరకైనా పెద్దదిగానే కనిపిస్తుంటుంది.
మంచులా కురిసిన ఆశ, క్షణాల్లో నిరాశగా ఘనీభవిస్తుంటుంది
కాళ్ళ కింద జేబుర్లాడుతున్న చీకటి మెట్లకోసం తడుముకుంటుంది.
ఏ ఆకాశ వాణో..స్నేహితుడేసిన భుజం మీది చెయ్యో..
పలికే పదాలు నిజమైనపుడు పెదవులెందుకు వణుకుతాయని అడిగినట్టుంటుంది.
పౌర్ణమి ఆటుపోటుల తాకిడి దాటిన సముద్రానికి కాసింత తీరిక దొరికితే..
అలలన్నిటినీ అదిమి ప్రశాంతంగా పాడ్యమి నిదుర చేయాలని ఉంటుంది.

అయినా వేగంగా తిరిగే ప్రపంచంకదా..
కావలసినంత తీరిక దొరికినట్టున్నది.
నా ఏడుపు మీద పడి ఒకటే ఏడుస్తున్నది.
నా ఏడుపు చూసి నేనే నవ్వుకుంటానని దానికి తెలియనట్టున్నది.

17/10/15

Wednesday, 14 October 2015

Kankara raallu (poem)

విరించి ll కంకర రాళ్ళు ll
.....................................
మనమిద్దరమూ కలిసి తిరిగే రోజుల్లో
వారంతా ఎంతటి అనుమానాస్పదంగా చూసేవారు..!

అంకం తరువాత అంకంగా
ఒక షేక్స్పియర్ నాటకంలా
మన ఉద్వేగాలూ మన స్నేహాలూ
కలిసి జీవించేవి ఆ రోజుల్లో

ఇబ్బడిమబ్బడిగా మనుషులు తిరిగే వీధుల్లో
తెలియని ముఖాల మధ్య వెలిగి పోయే తెలిసినముఖాల్లా
అటునుంచి నీవూ ఇటు నుంచి నేనూ ఒకరికొకరం ఎదురుపడినపుడు
సంవత్సరాల తరబడి కలువని ప్రేమ జంటలాగ
ఒకరి ఛాతి మీద ఒకరి ఛాతిని వుంచి గట్టిగా హత్తుకునే వాళ్ళం

అయిదురూపాయల ఇరానీ ఛాయ్ ని వన్ బై టూ తాగుతూ
మధ్య మధ్య లో మలాయ్ లో చక్కర కలుపుకుని తింటూ
ఛాయ్ వాడు చేతులెత్తి దండం బెట్టి నెట్టివేసే వరకూ
గంటలు గంటలు అమ్మాయిల గురించి మాట్లాడుకునే వాళ్ళం

మిరపకాయ బజ్జీలోడి దగ్గర ముక్కులోంచి కారే కన్నీటిని తుడుచుకుంటూ
కట్లెట్ బండీ దగ్గర ప్యాస్ నింపిన పానీపూరీని
నోరంతా తెరచి కుక్కుకుంటూ
ఇండియా గ్రేట్ నెస్ గురించి చర్చించుకునే వాళ్ళం

చార్మినార్బ స్టాప్ లో బస్ గురించి వెయిట్ చేసే వారి మధ్యన కూర్చుని
దేశ రాజకీయాల గురించి, సినిమా హీరోల గురించి
ఊగిపోతూ  గొడవపడి..అదే కోపంతో వెళ్ళి పోయేవాళ్ళం

అడ్డదారిలో వచ్చి ట్రాఫిక్ పోలీసుకి దొరికి జేబులంతా గుల్ల చేసుకున్నపుడు
నో స్మోకింగ్ జోన్ లో స్మోకింగ్ చేసిన పొల్లగాడిని పొటుకు పొటుకు తిట్టి పంపించినపుడు
తెలంగాణోళ్ళమని చిన్న చూపు చూసిన సాలే గాణ్ణి పడేసి తొక్కినపుడు
అవసరమొచ్చిన ప్రతీ అడ్డమైన సందర్భాల్లో
మా కీ కసం అంటూ మనం చెప్పిన అబద్ధాల్లో..
ఊపర్ వాలాకీ కసం అంటూ మనం చెడగొట్టిన ప్రమాణాల్లో..
బేగం బజార్ సెంటు సీసాల్లాగా అమాయకమైన స్నేహమే గుభాళించేది.

ఆ రోజుల్ని ఈ రోజు గుర్తు చేసుకున్నప్పుడు
మనల్ని అనుమానాస్పదంగా చూసిన ముఖాలే గుర్తుకు వస్తాయి.
పాత బస్తీ అల్లర్ల లో మనల్ని చెదరగొట్టిన కంకర రాళ్ళే గుర్తుకు వస్తాయి

నేను హిందువుననీ
నీవు ముస్లిమువనీ..
మన స్నేహం ఈ లోక సమ్మతం కాదనీ
నమ్మకాల్ని కలిగున్న వారెవరూ
మనిషికి మరో మనిషి స్నేహం తప్ప
ఇంకేమీ అవసరం లేదని నమ్మగలిగిన వారైతే అయ్యుండరు

ఒక సూర్యుడూ..ఒక చంద్రుడూ
కలిసి ఉండలేరనుకునే లోకానికి
మనం గ్రహణాల్ని ఊతంగా చూపించలేక పోయాం
గ్రహణం మూఢనమ్మకం కాదు
ఆకాశం లో జరిగే అద్భుతమని చెప్పలేకపోయాం

అందుకే కదా నేస్తం
ఒకనాడు చిన్న చిల్లు కూడా లేని మన స్నేహం లాగే
ఇపుడు మనమధ్య పెరిగిన గోడకు చిన్న చిల్లు కూడా లేకపోయింది
ఇన్షా అల్లాహ్ అనుకుంటూ నీవు, నేను బాగుండాలనీ
రాముడి గుడిలో చేతులు జోడించి నేను, నీవు బాగుండాలనీ
కోరుకోవటమొక్కటి మనకు దేవుడిచ్చి ఉండకూడదనే మనం కోరుకుందాం.
మనరోజొకటి మనకోసం మునుముందు వేచి ఉంటుందనే ఆశపడదాం.

14/10/15