Thursday, 11 April 2024

The Roots of organic life

 Old text


పర్యావరణ దినోత్సవం సందర్భంగా గిరిజనుల మాటలు విందాం. విని ఒకసారి ఆ దిశగా ఆలోచిద్దాం.

-------------++


మేజర్ మూగీ సమ్నర్ ఆస్ట్రేలియాలోని నేరిండ్ఝెర్రీ తెగకు సంబంధించిన పెద్దమనిషిగా, ఆ సంస్కృతికి డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. మొన్న సత్య శ్రీనివాస్ గారి "మట్టి గూడు" పుస్తక ఆవిష్కరణ సమయంలో, వాడ్రేవు చినవీరభద్రుడు గారు ఈ నేరిండ్ఝేర్రీ తెగ గురించి ఉటంకించారు. ఆ తెగ కథ చాలా ఆసక్తి కరమైనది. వెస్టర్నజేషన్ వలన ఎన్నో జాతులు తెగలు సంస్కృతులు అంతరించి పోతున్న తరుణంలో, ఆస్ట్రేలియా మూలవాసులైన ఈ తెగలు తమను తాము ప్రపంచానికి పరిచయం చేసుకుంటున్నాయి. తద్వారా తమ ఉనికిని, తమ సంస్కృతిని నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మూగీ సమ్నర్ ఈ సంస్కృతిని నిలుపి ఉంచడం దిశగా కృషిచేస్తున్న మేధావి. మట్టి గూడు పుస్తకం చదివిన తరువాత మనం గొప్పవి అనుకుటున్న సంస్కృతులన్నీ గిరిజన సంస్కృతులను ఆటవికమైన సంస్కృతులుగా, అనాగరికమైన సంస్కృతులుగా ముద్ర వేసి మనలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మనం తెలుసుకుంటాం. మనకు పరిచయమున్న సంస్కృతులలోని ఇనార్గానిక్ లైఫ్ కూ మనకు పరిచయంలేని కొండజాతి సంస్కృతులలోని రిచ్ ఆర్గానిక్ లైఫ్ కూ సంబంధం లేదని తెలుసుకున్నపుడు, మనదసలు జీవరహిత సమాజమని గ్రహించగలుగుతాం. (ఆర్గానిక్ లైఫ్ కీ ఇనార్గానిక్ లైఫ్ కీ గల తేడాను సత్య శ్రీనివాస్ తో నేను చేసిన ఇంటర్వ్యూలో మీరు గ్రహించగలరు). కానీ నిజమైన ఆర్గానిక్ లైఫ్ మూలాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూలవాసుల జీవితాల్లో ఉన్నాయని చెప్పే వారు మనకు కరువయ్యారు. ఆ ప్రయత్నంలో సత్య శ్రీనివాస్ గారు ఉన్నారు. మేజర్ మూగీ సమ్నర్ ఇంటర్వ్యూ కూడా మనల్ని ఆ వివరాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఈ మొత్తం ఇంటర్వ్యూ The Roots of Organic life రెండు భాగాలుగా అనువాదం చేస్తున్నాను. 


------------ The Roots of organic life (part 1)-----------

నా పేరు మేజర్ సమ్నర్.

నేను నారింజేరి దేశం సభ్యుడను.

కూరంగ్ అనే ప్రదేశానికి చెందినవాడను. అది దక్షిణ ఆస్ట్రేలియాలో ఆగ్నేయ ప్రాంతంలో ఉంటుంది.

మా జాతి ప్రజలు ఆస్ట్రేలియాలోని అన్ని జాతుల ముందుగా వేలవేల సంవత్సరాలనుండి ఇక్కడ జీవించారు.

మాజాతి ప్రభుత్వ అధికారులతోనూ, చర్చి అధికారులతోనూ పరిపాలించబడతాము.

ఇది ఎక్కడైనా ఒకటే. అమెరికా, కెనడా వంటి ఎన్నో దేశాలలో గానీ ప్రపంచమంతటా ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది. వారు మా కల్చర్ ని, మా భాషనూ, మా పండుగలనూ, సాంప్రదాయాలనూ కొల్లగొట్టారు. 

మాకు ఇంగ్లీషు నేర్పించారు. స్కూలుకు పంపించారు. ఇలా చేస్తే మాకు మంచి జరుగుతుందని చెప్పారు. 

కానీ ఈరోజు అవన్నీ నేర్చుకోవడమే మంచిదని అనుకుంటాను. అలా నేర్చుకోకపోతే మేమీదేశంలో బతకలేని పరిస్థితి. ఈ సమాజంలో బతకి బట్టగట్టాలంటే  ఈ మార్పు తప్పనిసరి.

కానీ మేము ఎక్కడినుండి వచ్చాము?. దేశంలోని ఏ ప్రాంతం నుండి, ఏ సంస్కృతి నుండి వచ్చాము?

మా పుట్టుక కథలేమిటి?. మా నారింజేర్రి గురించి, మా నేల ఆవిర్భావం గురించి కథలేమిటి?.

ఈ రోజు ఈ దేశంలో మా స్వంత భాషను కొంత మాట్లాడుతుంటాం. రాసుకోని ఆ భాషను మేము మాట్లాడగలం. కానీ మా అలసత్వం వలననో, ఇంగ్లీషు భాష నేర్చుకోవడం చాలా సులభం కావడంవలననో, మా భాషను కోల్పోయాం. 

మా నాట్య రీతులు, మా కళలకు సంబంధించిన, మా పుట్టుకకు సంబంధించిన కథలుగా చెప్పే మా నాట్య రూపాలు, జంతువులను అనుకరించే, జంతువుల వేటను అనుకరించే మా నాట్య కదలికలు, వీటి ద్వారా మేమెవరమనేది ప్రపంచానికి చెబుతాం. ఈ దేశంలో మా మూలవాసి తత్వాన్ని ఈ నృత్యాల్లో చెబుతాం. నేను ప్రపంచంలోని ఎన్నో దేశాలు తిరిగాను, లండన్, ఇండియా, దక్షిణ కొరియా, కెనెడా, అమెరికా, న్యూజీలాండ్ వంటి దేశాల్లో నృత్య రీతులనూ, పండుగలనూ చూశాను. కెనెడాలోని వినేపేగ్ చుట్టుపక్కల కొన్ని తెగలను చూశాను. ఎన్నో ఇతర ప్రదేశాలనుండి మూలవాసుల ద్వారా ఆహ్వానాన్ని అందుకున్నాను. మేము అంతా కలిసి మా అడవులకోసం మా పిల్లల కోసం నృత్యం చేశాం. నదికోసం నది ముందర నాట్యం చేశాం. మాప్రజలు, నా కుటుంబం అలాగే మాతో కలిసి వచ్చే జాతుల ప్రజలూ అందరూ నాట్యం చేస్తారు. ఆ విధంగా ప్రపంచం చుట్టేసి వచ్చాను. ఓరెగాన్ లో ఉండే అడవులనుండి వచ్చాను. వారిని చూసి వచ్చాను. వారు తమ ప్రజలను చూసుకునే విధానాన్ని చూశాను. వారి సంస్కృతిని చూశాను. వారి సాంస్కృతిక కేంద్రం ద్వారా వారు చేసే పనులనూ చూశాను. ఈ దేశంలోని మూలవాసులు కూడా అటువంటి పనులు చేయవలసిన అవసరం ఉంది. కానీ అదే విధంగా మేము మా ప్రాంతాన్ని, సంస్కృతినీ పరిరక్షించుకోవాలి. మా భూమికి మేమెలా సంబంధం నెరపుతున్నామో చూసుకోవాలి. 


మూలవాసుల దినోత్సవమని మనమొక రోజును గుర్తించాం. ఆ రోజు మేము దక్షిణ ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలలో ఉండే పలు పాఠశాలలకు వెళ్లి, ఆ చిన్న పిల్లలతో ఒక రోజైనా గడుపుతుంటాం. కానీ అటువంటి ప్రోగ్రాంలు పెద్దవారితో చేస్తే కూడా బాగుంటుందనుకుంటున్నాం. మేము పెద్దలను కూడా ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మూలవాసులమైన మేము ఈ దేశాన్నీ, ఈ నేలనూ ఎలా ప్రేమిస్తామో గౌరవిస్తామో ఒకరినొకరం ఎలా గౌరవించుకుంటామో మేము చెప్పవలసిన అవసరం ఉంది. మేము జంతువులను వేటాడే విషయంలో కూడా జంతువును చంపిన తరువాత మాకు ఒక సాంప్రదాయ నృత్యం ఉంటుంది. ఒక పాట ఉంటుంది. అందులో ఆ జంతువు ఆత్మను గౌరవించడం ఉంటుంది. అది మాకోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. కానీ ఈ పద్దతి ప్రపంచంలోని ప్రజలు మరచిపోయారు. వారంతా తమ గురించి తామే ఆలోచించడం లో మునిగిపోయారు. ఇతరుల గురించి, తమ నేల గురించి ఆలోచించడం మరిచారు. మేము నృత్యం చేసేటపుడు మా పితరులను కూడా మాతో వచ్చి కలిసి ఆడమని వేడుకుంటాం. మీరెందుకలా చేస్తారని మీరడగవచ్చు. కానీ మేము అలాగే ఉన్నాం, అలాగే ఉంటాం. మా పితరులను మా జీవితాల్లోకి ఆహ్వానించుకుంటాం. అంతే కాకుండా మేము నృత్యం చేసేముందు కూడా మా పితరుల పర్మిషన్ తీసుకుంటాం. మా గురించి, మా నృత్యరీతుల గురించి ఇతరులకు తెలియజెప్పాలనుకున్నపుడు కూడా మా పితరుల అనుమతి అవసరం. మేము వారిని రమ్మని ఆహ్వానిస్తాం. అటువంటి సందర్భాల్లో మాతో కలిసి ఉండమంటాం. నేను చెప్పగలిగిందల్లా మా ప్రజల గురించి. మా సృష్టి కథల గురించి. ఇతరుల కథల గురించి చెప్పడానికి మాకేం హక్కు ఉందని? మాకే హక్కూ లేదు.


నేను నారింజేర్రి తెగకు చెందినవారిమైనప్పటికీ మా చుట్టు పక్కల ఉండే తెగల పండుగలకు అపుడపుడూ వెల్తుంటాం. అక్కడ నేను వారి పండగలలో పాల్గొనడానికి అనుమతి తీసుకుంటా. వారి పండగలను కలిపి జరుపుకోవడం వలన వారు ఆ సాంప్రదాయాలను మరిచిపోరు. ఆ విధంగా నేను వారిని ప్రోత్సహిస్తూ ఉంటాను. ఎందుకంటే వేల యేండ్లుగా జరుగుతున్న వేడుకలను మరలా వెలుగులోకి తీసుకురావడమన్నది ఒక రోజులో ఒక వ్యక్తితో జరిగే విషయం కాదు. మేము ఒకరి వేడుకలను ఒకరం గౌరవించుకుంటాం. వారి పద్దతులనుండి, వేడుకలనుండి ఎంతో నేర్చుకుంటాం. ఆ విధంగా సమాజంలో ఆ పురాతన పద్దతులను తీసుకువచ్చి, సమాజాన్ని పరిపుష్టం చేయవలసిన అవసరం కూడా ఉందనుకుంటాను. ఎందుకంటే మన ప్రపంచం ఇపుడు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచమంతా డబ్బుచుట్టు తిరుగుతోంది. ప్రజలందరూ స్వార్థం వైపే మొగ్గుచూపుతున్నారు. అంతా నేను,నేను, నాది అనుకుంటున్నారు. నాకేం కావాలి అనే ఆలోచిస్తున్నారు కానీ, ప్రపంచానికేం కావాలన్నది కాదు. చుట్టూ ఉండే మనుషులకేం కావాలన్నది కాదు. నేను నేను అనుకోవడంలో తప్పేమీ లేదు కానీ, పంచుకోవడమన్నదే లేకపోతే ఎట్లా?. నీ స్నేహితులతో బంధువులతో పంచుకోవాలి, ప్రజలతో పంచుకోవాలి, ఈ దేశ ప్రజలతో పంచుకోవాలి. ఇతర దేశాలతో పంచుకోవాలి. ఈ దేశం చాలా పెద్దది. ఇతర దేశాలనుంచి ఈ దేశానికి వచ్చేటపుడు, ముందుగా మాతో మాట్లాడాలి. మేము వారిగురించి ఏమనుకుంటామో వారు ముందుగా అర్థం చేసుకోవాలి. వారు ఇక్కడికి రావడాన్ని మేమెలా అనుకుంటామో వాల్లు తెలుసుకోవాలి. నేను ఒక గిరిజనుడితో మాట్లాడినపుడు, అతడు ఒక మాట అన్నాడు. ఈ దేశంలో మూలవాసులు, మూలవాసులు కాని వారూ ఉన్నారు. అటువంటపుడు ఈ ప్రభుత్వాలు గట్టిగా ఎందుకు ప్రశ్నించవు?. మా సరిహద్దులను దాటుకుని వచ్చే వారిని ఎందుకు ప్రశ్నించవు?. ఆధునికులు మొబైల్ ఫోన్లతో సాటిలైట్లతో మా నేల మీదకు వస్తున్నపుడు, వారు ఎందుకని మా పర్మిషన్ తీసుకుని రారు?. అన్నాడు. నేను ఆ విషయమై ఆలోచించాను. ప్రభుత్వాలు ఆ పని చేయాలనుకుంటాను. ఎవరంటే వారు ఇక్కడకు వచ్చి మేమేం దుస్తులు ధరించాలి, ఏ పనులు చేయాలి,ఏం చదవాలి ఏం చదవకూడదు అని చెప్పడం ఎందుకు?. 


మీరు ఇక్కడ కట్టబడిన పార్క్ ను చూశారా?. ఈ ప్రదేశాన్ని ఇంగ్లండులాగా కనిపించేలా చేశారు. వాల్లు ఇక్కడికి వచ్చి ఈ నేల మీద ముల్లకంచెలు పెట్టారు. నీవు నేల సారాన్ని పెంచే వ్యవసాయం కోసం కాకుండా నేలను ఎందుకు తవ్వేసినా నీవు మనిషివి కానట్టే. నీవు సంస్కృతి లేని వాడివే. నీకు ఏ మతమూ లేనట్టే. నీవు ఏ విషయాన్నీ నమ్మని గండశిలలాటివాడివనే అర్థం. కానీ వారు మమ్మల్ని ఏ పర్మిషనూ అడగలేదు. వారికి అడగడానికి ఏమీ లేదు కూడా..వారు మా సంస్కృతి గురించి మమ్మల్ని అడగలేదు. మా మూలాల గురించి, వేలవేలగా మా నాలుకమీద తిరుగాడే మా మూల కథల గురించీ వారు తెలుసుకోవాలనుకోలేదు. నేను స్కూలుకి వెల్లినపుడు పిల్లలను అడుగుతుంటాను. మన మూలవాసుల కథలు తెలుసునా అని. పిల్లలను మీరు బైబిల్ ని నమ్ముతారా అని అడుగుతుంటాను. పిల్లలు ఔను అంటుంటారు. బైబిల్ కేవలం రెండు వేల సంవత్సరాల క్రితంది మాత్రమే. మా మూలాలు తెలిపే మా కథలు వేలవేల సంవత్సరాలవి. మా కథలెంత పురాతనమైనవో ప్రజలకు తెలియదు. మూలవాసుల చరిత్ర చాలా పురాతనమైనదని వాల్లే చెబుతూ ఉంటారు. కానీ వచ్చి మమ్మల్ని మార్చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మా నీరు స్వచ్ఛమైనది. మా నేల స్వచ్ఛమైనది. ఇక్కడి జంతువులూ సవచ్ఛమైనవి. మేం కంగారు వంటి జంతువులను, చేపలనూ బెర్రీ ఫలాలనూ వాటి అనుమతి తీసుకుని తిన్నాం. చాలా సంపన్నవంతంగా ఫలవంతంగా ఈ దేశంలో బతికాం. ఎపుడైతే ఇతర జాతులవారు ఇక్కడికి వచ్చారో, మా జీవన రీతులు మాయమవడం మొదలైంది. కొత్తగా వచ్చిన జజ్బులతో దేశం మొత్తం అతలాకుతలమయింది. కలరా, మీసిల్స్, స్మాల్ పాక్స్ ఈ దేశంలోకి వచ్చి సర్వనాశనం చేశాయి. కొన్ని మూలవాసి తెగలు ఇప్పటికీ ఇటువంటి జబ్లులంటే ఏమిటో కూడా ఎరిగి ఉండవు. తెల్లవారు వచ్చాకే ఇదంతా జరిగింది. తెలియని కొత్త జబ్బునబారిన పడి మా ప్రజలు మరణించారు. 

సహజీవనమనే అంశాన్ని తీసుకున్నపుడు మేము ప్రపంచానికి సహజీవనమంటే ఏమిటో కలిసి ఉండటమంటే ఏమిటో నేర్పించదలచుకున్నాం. ఈ దేశంలో,ఎంతో మందికి వారి మూలాలు తెలియదు. వారు ఏ తెగ నుండి వచ్చారో, వారి కుటుంబ మూలాలు ఏమిటో తెలియదు. అంతా కలగాపులగం గా ఉంటుంది పరిస్థితి. వేరు వేరు జాతుల వారు ఉండే ఈ దేశంలో వేరు వేరు జాతుల నడుమ వివాహాలు జరుగుతున్నాయి. ఇది చాలా మంచి పరిణామం ఎందుకంటే ప్రజల్లో ఉండే ఇతర జాతుల పట్ల ఉండే వివక్షలు తొలగుతాయి. కానీ, అది జరగాలంటే ముందు ఈ దేశంలో ఉన్న, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూలవాసులతో మాట్లాడటం జరగాలి. అలాగే మనమంతా ఏ మూలాలనుంచి వచ్చామో తెలుసుకోవాలి. అపుడే మనం ఔను మనమంతా ఒక్కటని చెప్పగలం. తమ పర బేధాలు లేకుండా చెప్పగలం. ఇది జరగకపోతే మన వినాశనం తప్పదు. రెండు నెలల కిందట, చంద్రుడిలో ఉండే గనులకోసం వెతుకులాట మొదలైందని విన్నాను. అదే జరిగితే ఏమౌతుంది. ఈ దేశంలోని పురుషులు ఇంకో గ్రహం మీదకు గని తవ్వకాలకోసం వెల్లడం చాలా దారుణమైన విషయం. మన దేశంలో జరిగే గని తవ్వకాలన్నీ నిజంగా మనకు అవసరమైనవేనా?. లేక కేవలం స్వార్థం తో లోభంతో పుట్టిన అవసరాలా?. 


మనం మీడియా గురించి మాట్లాడుతూ ఉంటాం. విషయాలు బయటకు రావడానికి మీడియా ఎంతో అవసరమని వింటాం. కానీ మీడియా అనేది మూలవాసులకు సంబంధించినంత వరకూ నష్టకారకమే. టీవీల్లో, పత్రికల్లో ఎక్కడా మూలవాసుల ముఖాలు కనిపించవు. మీకు ఇక్కడి సిటీలు కనిపిస్తాయే కానీ ఇక్కడి మూలవాసులు మీడియాలో కనిపించరు. మా జీవితాల్ని ప్రపంచానికి చూపరు. మేము వేటలో పొందిన జంతు ఆహారాన్ని మొత్తం కమ్యూనిటీతో పంచుకుంటాం. కానీ ఆధునికులు తమ ఇంటిచుట్టూ కంచె నిర్మించుకుంటారు. ఇంకెవర్నీ లోపలికి రానీయరు. ఇంకో ఇరవై ముప్పై యేండ్ల తరువాత మనుషులు ఒకరికొకరు తెలియకుండా ఐపోతారు. ఇప్పటికే ఈ దేశంలో ఇంటి పక్కవాడి పేరు కూడా తెలియని వారు ఎందరో ఉన్నారు. నేను నాకు తెలియని వారితో మాట్లాడతాను. మాట్లాడితేనే కదా వారు నాకు తెలిసినవారు ఔతారు. మాట్లాడితేనే నేనెవరో ఎక్కడినుంచి వచ్చానో అవతలి వారికి అర్థమవుతుంది. వారి విషయాలు కూడా నాకు తెలుస్తాయి. పురాతన సమాజాల్లో లేని పోకడలు ఇపుడు కనిపిస్తున్నాయి. ఎదుటి వ్యక్తిని పలకరించేంత సమయం తీరిక ఎవరికీ లేవిపుడు. కానీ మొదట మనం పలుకరించడం మొదలు పెట్టాలి. అవతలివాడు పలుకకపోయినా పరవాలేదు. మొదట మనం పలుకరించడం మొదలు పెట్టాలి. ఏమో తరువాత ఎపుడైనా వాల్లూ స్పందించడం మొదలు పెడతారేమో. ఒక చిన్న విలువైన విషయాన్ని ప్రజల మనసులోకి ఇరికించటానికి ఎన్నో యేండ్లు పట్టవచ్చు. మన చుట్టూ పరిమితులు విధించుకుని మాట్లాడటం ఎంతవరకు సమంజసం. మనం ఓపెన్ అప్ కావాలి. మన గురించి, మన దేశం గురించి తెలుసుకోవడం చదువుకోవడం మంచిదే కావచ్చు. కానీ మనం తెలుసుకోవలసింది, చదువుకోవలసింది ఇతరులతో ఎలా మాట్లాడాలి ఎలా గౌరవించుకోవాలి అనే విషయం కూడా.


Part 2 ------------------------------------------------ 


నారింఝేర్రీ ప్రజలు వారి వారి సరిహద్దులు దాటి బయటకి పోతున్నారు. ఇతర మూలవాసుల కథలు వినడానికి పోతున్నారు. వాటిని విని మరల మాకు తెలియజేస్తున్నారు. ఇది మనకోసం మన స్వార్థం కోసం చేసుకోవడం కాదు. మనం ఇతరులను వినడం నేర్చుకోవాలి. వారి విద్యను మనం మన దేశానికి తీసుకురావాలి. మనం అందుకే బయటకు వెల్లాలి. ప్రజలను కలవాలి. ఇతర ప్రజల జీవితాలలో మనం ఒక భాగం కావాలి. మీడియాను ఉపయోగించడం ద్వారా మనం దానిని సాధించవచ్చు. అపుడే ప్రజలు ఒకరిని ఒకరు వినడం మొదలు పెడతారు. మనమంతా గ్లోబల్ వార్మింగ్ గూర్చి మాట్లాడుకోవాలి. మనం కార్లనూ టీవీలను ఉపయోగిస్తున్నాం. మనం కాల్లీడుచుకు కూర్చుని ఏదో ఒక జాతి మీద ఈ నిందను మోపలేం. మీవలననే ఇది జరిగిందని అనలేం. మనమంతా ఇందులో భాగస్వాములమే. ఈ దేశంలోకి ఎన్నో జాతులు వలస వచ్చాయి. వారు వారి వారి కల్చర్ ని ఇక్కడకు తీసుకు వచ్చారు. దానితో పాటు కొంత నెగేటివిటీని కూడా తీసుకువచ్చారు. మేము ధూపం ఇచ్చే వేడుకను చేసుకుంటాం. కాథలిక్కులలాగే. మా పూర్వీకులను ఈ నెగేటివిటీని తొలగించమని ప్రార్థిస్తూ ఈ ధూప వేడుకలు చేసుకుంటాం. ఇపుడు ఈ దేశంలో ప్రతీ ఒక్కరూ ఈ ధూప వేడుక లో పూర్వీకులను ప్రార్థిస్తే, ఇంకా మనం మంచిగా బతుకుతామేమో. మూలవాసులు వారిలో వారు పెండ్లిల్లు చేసుకున్నంతకాలం ఎటువంటి ఇబ్బందులూ లేవు. ఇపుడు పరిస్థితి లేదు. మనం అందరం ప్రజలం కలిసి ఉండాలి. జంతువులతో పక్షులతో వేరు వేరు జాతులతో కలిసి ఉండాలి. మన మధ్యన ఉన్న విబేధాలు కలిసి నాట్యం చేయడం ద్వారా మాట్లాడటం ద్వారా పెండ్లిల్లు చేసుకోవడం ద్వారా సమసిపోతాయి.


ఈ దేశం లోకి వచ్చిన ఇతర జాతుల వారు మాతో ఏమీ మాట్లాడలేదు. మాతో ఏమీ మాట్లాడకుండానే మేము ఎలా జీవించాలో శాసించడం మొదలు పెట్టారు. నాకు గుర్తు వుంది. మా నాయనమ్మ మా ఏరియాలో కొత్తగా స్థాంపించిన రేషన్ షాపు నుండి సరకులు తెచ్చుకునేది. తరువాత ఆ షాపు వేరే చోటకు తరలించబడింది. ఐనాగానీ ప్రజలు ఆ రేషన్ కోసం అంతంత దూరం వెల్లి సరుకులు తెచ్చుకునేవారు. అంటే ప్రజలు ఈ రేషన్ ఆహారానికి అలవాటు పడిపోయారు. వేటాడటం మరచి పోయారు. ఇపుడు ఫలితంగా డయాబెటిస్ గుండె జబ్బులు ఇంకా రకరకాల జబ్బులు. ఇవన్నీ మేము తినే ఆహారాన్ని మరవడం వల్ల వచ్చినవే. మేము ఎంత తిరిగినా ఈ దేశంలోనే తిరిగాం. వేరే దేశాలకు పోయి మేము అక్కడ మా పద్దతులను నేర్పించాలనుకోలేదు. మేము అందరి పద్దతులనూ గౌరవిస్తాం. ఈ రోజు ఆ గౌరవం లేదు. ఎందుకంటే మనం వెస్టర్న్ పద్దతులలో చదువుకున్నాం. వారి పద్దతిలో వారు మా పిల్లలను చదువుకోమన్నారు. మా పిల్లలు వారిని వారు కొత్తగా వేరేగా అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు. నేనొక పుస్తకం చదివాను. ఒక ముసలామె రాసింది. ఆమెను ఒక మహారాణి అని అంటుంటారు. మా సంస్కృతిలో రాణులు రాజులూ ఉండరు. అదంతా పాశ్చాత్య సంస్కృతి. ఆమె ఒక పుస్తకంలో రాసింది. ఆమె చిన్న పిల్లగా ఉన్నపుడు మిషనరీ స్టేషన్ దగ్గర నివసించేదిట. ఒక చర్చి ఉండేదట. అందులో ఒక పెద్ద పుస్తకం ఉండేదట. ఆ పుస్తకంలో ఇద్దరు వ్యక్తులు ఉండేవారట. వారు పెద్ద తోటలో నివసించే వారని అందులో రాసారట. ఆ తోటలో వారు నివసించేటపుడు అక్కడికి ఒక పెద్ద పాము వచ్చిందట. ఆ పాము వచ్చాక ప్రజలు ఒకరిని ఒకరు చంపుకోవడం మొదలు పెట్టారంట. ఆ పాము వచ్చాక వారు తమను తాము చూసి సిగ్గుపడటం మొదలు పెట్టారంట. వారు వారి శరీరాలు చూసుకుని సిగ్గుపడుతూ బట్టలతో కప్పేసుకున్నారంట. ఆమె ఏం చెప్పేదంటే..తెల్ల వారు అటువంటి పాములని చెప్పేది. తెల్లవారు వచ్చాకనే మేము మమ్మల్ని చూసుకుని సిగ్గుపడటం మొదలు పెట్టాము. మా శరీరాలను చూసుకుని సిగ్గు పడ్డాం. ఒకరినొకరం చంపుకున్నాం. మేము అల్కాహాల్ తాగడం మొదలు పెట్టాము. మాకు అంతకుముందు తెలియనివెన్నో చేయడం మొదలు పెట్టాము. తెల్లవారు మొదట మా దేశానికి వచ్చినపుడు, వారిని మేము మా పితరులుగా భావించాము. వారే ఈ రూపంలో తిరిగి వచ్చారని అనుకున్నాము. కానీ త్వరలోనే మేము గుర్తించామేమంటే మా దేశం రేప్ కి గురైందని. మా ప్రజలు రేప్ చేయబడ్డారని. వారు మా పితరులు కాదని మేమపుడు గుర్తించాం. ఈరోజు మాకు జరిగిన నష్టానికి ఇంకెవరినో బ్లేమ్ చేయవలసిన అవసరం లేదు. మా నష్టానికి మేమే కారకులం అనుకోవాలి. మేము ఇపుడు ఆల్కాహాల్ తాగుతాం. సిగరెట్ తాగుతాం. మేం చాలా ఎక్కువగా తింటాం, ఇవన్నీ చేస్తూ ఇంకెవరినో వేలెత్తి చూపడం చేయలేం. నేను మందుకీ, పొగకూ దూరమై ముప్పై యేండ్లయింది. అందరినీ అలాగే ఉండమని చెబుతుంటాను. ఎందుకంటే అది మన సంస్కృతి కాదు కాబట్టి.


ఇవన్నీ మనం ఆలోచిస్తూ క్రోడీకరిస్తే ఏమర్థమవుతుందంటే...మూల వాసులూ, మూలవాసులు కాని వారు కలిసి పోవాల్సిన అవసరం ఉంది అని. ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రపంచం ముగియకుండా ఉండాలంటే ఆ పని చేసి తీరాలి. ఈ దేశం అనావృష్టిలో మగ్గుతోంది. వాతావరణం కలుషితమయింది. ఇపుడు పండిస్తున్న పంటలు ఎక్కువ నీటిని ఆశిస్తాయి. దానివలన జంతువులకు గొర్రెలకు తాగడానికి నీరు లేవు. కొంత నీరు మాత్రమే ఈ దేశంలో మిగిలి ఉంది. అన్నింటికీ మించి నీటిని జాగ్రత్తపరిచే వారు కరువయ్యారు. నదులలో నీటిని నింపడం గురించి మాట్లాడుతూ ఉంటారు. నదుల నుంచి నీటిని బియ్యం పడించడానికి పత్తి పండించడానికి మల్లిస్తుంటారు. వారికి పర్మిషన్ ఎవరిచ్చారు?. ఆస్ట్రేలియావంటి డ్రై ల్యాండ్ లో వరి పత్తి పండించడానికి ఎవరు వారికి పర్మిషన్ ఇచ్చారు?. ఆస్ట్రేలియా ప్రపంచంలో అన్నిదేశాలకంటే డ్రై దేశం. దానిలో దక్షిణ ఆస్ట్రేలియా మరీ ఎక్కువ. వరి పత్తి పండించడం. డ్యాములు కట్టడం. ఒక్కో డ్యామ్ సిడ్నీ హార్బర్ అంత పెద్దగా ఉంటుంది. చాలా నీటిని నిలువ ఉంచుకుంటారు. వరి పత్తి పొలాలకు మల్లించుకుంటారు. చాలా నీరు వృధాగా పారుతూ ఉంటుంది. ఈ దేశ మూల వాసులు వారి తోటలను పెంచుకోలేని పరిస్థితి. తాగడానికి సరిగా నీల్లు దొరకని పరిస్థితి. ఒకరోజు సరి సంఖ్యలో ఒకరోజు బేసి సంఖ్య వాహనాలలో తిరగాలి. ప్రజల జీవితాలు ఇలా మారటం చూస్తే సిగ్గేస్తూ ఉంటుంది. ఇందంతా ఏమిటనుకున్నారు?. ఇదంతా లోభత్వం. ఇదంతా స్వార్థం. నేను నా సంపాదన అనే స్వార్థం. మనం అనేది కాదు. అంతా నేను అనుకునేదే. ఈ దేశంలోనే కాదు. ప్రపంచమంతా ఇలాగే ఉంది. ఇంగ్లండ్ లో లాగా ఇంగ్లీషు మాట్లాడటం వచ్చేసింది. ఇంగ్లండు పార్లమెంటు వారికి ఈ దేశంలో ఇతర దేశాలలో సెటప్ ఉండాలి. ఇంగ్లీషు మాట్లాడేవారు కావాలి.


ప్రపంచానికి ఇపుడు మూలవాసులతో మాట్లాడే సమయం ఆసన్నమయిందనుకుంటాను. మా సంస్కృతిని కథలను వినాలి. ఈ నేల ఎందుకు సృష్టించబడిందో...ఈ నదులు కొండలూ పర్వతాలూ ఎందుకు సృష్టించబడ్డాయో తెలుసుకోవాలి. కొన్ని జంతువులు మనకు నాచీ నబడతాయి. నాచీ అంటే మా భాషలో మిత్రుడు. అటువంటి జంతువులను చంపడానికి వీలు లేదు. మనుషులు నివసించే చోట ఆ జంతువులు సుఖంగా ఉండాలి. ఇదంతా మన ప్రకృతిని కనిపెట్టుకుని ఉండటం. దాని బాగోగులు చూసుకోవడం. మనం ఈ ప్రపంచంలో కొన్నింటి బాగోగులు చూసుకోవాలి. అపుడే అవి జీవించగలుగుతాయి. అందులో కొన్ని జంతువులు ఉంటాయి. నీరు ఉంటుంది. వాటి బాగోగులు మనం చూసుకోవాలి. ఎందుకంటే మన దేశంలోని ప్రతీ భాగం మనలోని ఒక భాగం వంటిది. ఈ ప్రపంచంలోని ప్రతీ భాగం మనలో ఒక భాగం వంటిది. మనం ప్రపంచంలో ఒక భాగం. ప్రపంచంలోని మూలవాసుల నమ్మకం ఇది. ఈ భూమి మన తల్లి వంటిది. మనం దీని నుండి వచ్చాం. మరలా దీనిలోకే వెల్లిపోతాం. మనల్ని పూడ్చిపెట్టినా కాల్చివేసినా మరలా మనం మన తల్లిలోపలికే పోతాం. మా కథలు వీటి గురించి ఉంటాయి. మన దేశంలోని భాగాలను రక్షించుకోవడం. జంతువులను రక్షించుకోవడం. జంతువులు తినే ఆహారాన్ని రక్షించుకోవడం. జంతువుల ఆహారాన్ని నాశనం చేస్తే ఆ జంతువును నాశనం చేసినట్టే. ఒక జంతువును నాశనం చేస్తే నీవు దాని తినే ఇంకో జంతువునీ నాశనం చేసినట్లే. ఇది డోమినో ఎఫెక్ట్ లాంటిదే. ఒక దానిని జరిపితే అన్నీ కింద పడిపోతాయి కదా..అలాంటిదే. అందుకే మనుషులు ఆలోచించాలి. వారు చేసే పనులు దేనిని నాశనం చేస్తున్నాయో ఆలోచించాలి. యూరోపియన్లు తీసుకు వచ్చిన జంతువులు ఇక్కడ వాటిని నాశనం చేశాయి. చేపలను తినే యూరోపియన్ కఫ్ లు ఇక్కడికి ఎందుకు తేబడ్డాయి?. అవి మర్రీ నదిలోని చేపలన్నింటినీ నాశనం చేశాయి. కెయిన్ టోడ్ ని ఈ దేశం నలు మూలల్లోకి ప్రవేశ పెట్టారు. ఎందుకని?. ఇపుడు మనం ఏం చేయాలంటే కూర్చుని మాట్లాడుకోవాలి. ఆలోచించాలి. ఎవరికి వారు అన్నీ తెలుసనుకోవడం వలన లాభం లేదు. అపుడే మనం ఒకరినుంచి ఒకరం నేర్చుకోగలం. నేను మా మూలవాసులకే కాకుండా ఇతర పిల్లలకు కూడా ఈ నేల గురించిన విషయాలు నేర్పుతుంటాను. మనం ఈ భూమి మీద ఎక్కువ కాలం జీవించం. మన చుట్టూ ఉండే చిన్న ప్రదేశంలో మనం మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. ఇలా మనం ఇపుడు చేస్తే తప్ప అస్తవ్యస్తమై ఉన్న ఈ ప్రపంచం ఎపుడో గానీ తాను ఉన్నది ఉన్నట్టుగా మారడం మొదలవుతుంది. పాడైపోయిన నేలలు, నాశనం చేయబడుతున్న నదులు, సముద్రాలూ, సముద్ర జీవులూ, పక్షులూ, ఇవన్నీ రక్షింపబడతాయి. ఇవన్నిటికీ ఈ ప్రపంచంలో స్థానం ఉంది. యూరోపియన్లు మా ప్రదేశానికి వచ్చి మమ్మల్ని పనికి పెట్టుకున్నారు. ఇక్కడి నేలనూ వాతావరణాన్ని ఇంగ్లండులో ఎలా ఉంటుందో అలా తయారు చేసుకున్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారో ఆ దేశం లాగా కనిపించేలా ఈ దేశాన్ని మార్చుకున్నారు. వాల్లు వారి దేశంలాగా కనిపించడాన్ని ఇష్టపడితే వారి దేశంలోనే బతకవచ్చును కదా. ఇక్కడకు రావడం ఎందుకు?. కానీ ఇపుడేం చేయలేం. మనం ఒకరికొకరం తెలుసుకోవాలి. ఒకరినుండి ఒకరం నేర్చుకోవాలి. వేరు వేరు మతాలూ, సంస్కృతులూ ఉన్నవారు ఇపుడిక్కడున్నారు. మనం అందరం కలిసి జీవించాలి. ఎవరికైనా సమస్య వస్తే ఒకరికొకరు మాట్లాడుకోవాలి. వారు మాతో మాట్లాడాలి. మేము ఎలాంటి అడ్డుగోడలూ పెట్టబోం. మాకు అడ్డుగోడలు అవసరం లేదు. మూల వాసులు శతాబ్దాల తరబడి ఎవరినీ దోచుకోలేదు. ఎవరినీ నాశనం చేయలేదు. కాలరాయలేదు. మేము అందరినీ కావాలనుకున్నాము. మాకు అందరూ కావాలి. మాకు మా నైబర్స్ కావాలి. 

నేను ప్రజలు నా మాట వింటారని నమ్ముతాను. నా మాటలతో శృతికలుపుతారని నమ్ముతాను. ప్రపంచంలోని మూలవాసుల వాణిని వినాల్సిన అవసరం ఉందని ప్రజలు గుర్తిస్తారని నమ్ముతాను. ఒకరినొకరం తెలుసుకుంటూ నేర్చుకుంటామని నమ్ముతాను. నన్ను మాట్లాడించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.  


End of interview


Translated into telugu by

 విరించి విరివింటి

No comments:

Post a Comment