Saturday, 28 November 2015

Kavitwa sandarbham 2- సరస్వతీ భక్తుల్లారా!..బ్రహ్మనే వెక్కిరిస్తారా!

సరస్వతీ భక్తుల్లారా!..బ్రహ్మనే వెక్కిరిస్తారా!
(కాళోజీ యాంటీ థీసీస్ లోంచి పుట్టుకొచ్చిన సింథెసిస్)

సాహిత్యానికేది ప్రమాణం. పదమా వాక్యమా అని ప్రశ్న వేసుకున్నపుడు, వాక్యమే ప్రమాణమని సమాధానం వస్తుంది.
పదం నిత్యం మార్పుకి గురవుతుంటుంది, మనుషుల కష్టాలూ బాధలు మారిపోతున్నట్టే పదాలూ మారిపోతాయి.
ప్రపంచ కష్టమే తన కష్టం కదా కవికి. బాధని ఒక కళగా అభ్యసించేవాడే కదా కవి.
కాలాన్ని పరిగెత్తించే వాడికి కాలానికి అనుగుణంగా భాష కూడా కావాలి. కొత్త పదాలు కావాలి.
వ్యాకరణం ఒక భాషలో ఉన్న వాక్యాల తీరు తెన్నులను విశద పరచటమే కాక,  కాలంతో పాటు  పదాలలో ఎటువంటి మార్పులు జరుగుతుంటాయో...మూల శబ్దమేదో, ప్రత్యయమేదో, ప్రత్యయం చేరటంతో శబ్దంలో వచ్చే మార్పులేవో, కాలానుగుణంగా ప్రత్యయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో, ఇలాంటి ఎన్నో విషయాల్ని వివరిస్తుంది.
ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, తెలుగు వారికి ఉన్న ఎన్నో సమస్యల్లో ఒక సమస్య,  ఎలాంటి తెలుగును సాహిత్యంలో వాడాలి అనేది.
ఇది ఎలాంటిదంటే వ్యాకరణం మన కోసమా...లేక మనం వ్యాకరణం కోసమా అనే ప్రశ్న వంటిది.

ఈ చర్చ ప్రధానంగా ఇరవైయవ శతాబ్దపు మొదటి అర్ధ కాలంలో తెర మీదికి వచ్చింది.
కావ్య భాష  అనబడే నిఘంటువు భాషకూ, ప్రతి రోజూ మనం మాట్లాడే తెలుగు భాషకూ అంతరం రాను రానూ విపరీతంగా పెరిగి పోయిందనే స్పృహ బహుశా అప్పటికి మనకు కలిగి ఉండటమే కారణం అయుండొచ్చు. బ్రిటీష్ పాలన తెచ్చిన ఆధునిక సాహిత్యం కూడా మనకీ స్పృహను కలిగించి ఉండవచ్చు.  తెలుగు కావ్య పరిశోధన చేసిన ఎందరో బ్రిటీష్ మేధావులు తోటి తెలుగు వారితో సరిగా మాట్లాడలేక పోయేవారట. మన వ్యాకరణం, నిఘంటువులు అన్నీ కావ్య భాషకు మాత్రమే రాసుకున్నవి కావటం వల్ల, ఎలా మాట్లాడాలో తెలియక తికమక పడేవారట. ఇలా గ్రాంధిక వ్యావహార భాషలుగా ఒక భాష చీలి పోయి వుంటే ఆ భాషని డైగ్లోస్సియా అంటారు. ప్రపంచంలోని ఇలాంటివి ఎన్నో భాషలున్నాయి. అందులో మన తెలుగూ ఒకటి.
మనకున్న సాహిత్యమంతా కావ్యాలే అనుకుంటే, వ్యాకరణ సూత్రానుసారమైన భాషనే కావ్యాల్లో వాడబడింది కాబట్టి ప్రస్తుత సాహిత్యానికి కూడా కావ్య భాషనే సరి అయినదని కొందరూ, కాదు వ్యావహారిక భాషనే సరైందని మరి కొందరూ వాదించారు. తెలుగు సాహిత్య లోకమంతా ఇలా యతాతథ వాదులూ, ఆధునిక వాదులని రెండు రకాలుగా చీలిపోయిందనుకోవాలి.

కావ్య భాషని కాదని, వ్యావహారిక భాషోద్యమాన్ని మొదటిసారి గిడుగు రామ్మూర్తి పంతులు గారు మొదలు పెడితే, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు వంటి వారు దాన్ని మరింత ముందుకి తీసుకు పోయారు. ఈ వ్యావహారిక భాషోద్యమానికి ఏమైనా చారిత్రకత తాత్వికత ఉందా అంటే, ఉంది అని చెప్పకతప్పదు.
దాని గురించి తెలుసుకునే ముందు అసలు కావ్య భాషంటే ఏమిటి?. తెలుగులో మొదటగా కావ్య భాష, మహాభారతాన్ని తెనిగించిన నన్నయతో మొదలైందని మనకు తెలుసు.
 నన్నయ భారత చరిత్ర కాలం రమారమి1050సం.

కోరాడ మహా దేవ శాస్త్రి గారి ప్రకారం,..(Historical grammer of Telugu-1961)
క్రీ పూ 600 నుంచి క్రీ. పూ. 300 వరకు చరిత్ర పూర్వ యుగం,
క్రీ పూ 300  నుంచి క్రీ..శ 1000  వరకు ప్రాచీనాంధ్ర యుగం,
క్రీ.శ. 100 నుంచి క్రీ. శ1600. వరకు మధ్యాంధ్ర యుగం,
క్రీ. శ1600 నుంచి నేటి వరకు ఆధునికాంధ్ర యుగం అనుకుంటే,

తెలుగులో ఆది కవి నన్నయ కాబట్టి, కావ్య భాష క్రీ.శ.1050 సమయంలో, మధ్యాంద్ర యుగంలో మొదలైందనుకోవచ్చు.
మరి అంతకు ముందు ఉన్న తెలుగేమిటి?.
దీనికి సమాధానం, బూదరాజు రాధాకృష్ణగారిస్తారు. ఆయన తెలుగునాట కావ్య భాష ఏనాడూ వ్యవహారంలో లేదని శాసనాధారాలతో నిరూపించారు. (Historical grammer of early Telugu -1963).
అంటే నన్నయ రాసినదైనా ఆనాటి వ్యావహారిక భాష కాదనేది అర్థమౌతుంది.

భాషా శాస్త్రం లో ఇటువంటి సిద్ధాంత గ్రంథాలు రాకముందే అభ్యుదయ కవులు సకల జనులకూ అర్థమయ్యే, వ్యావహారిక భాషలోనే సాహిత్య రచన జరగాలని ఉద్యమించారు.

మరి నన్నయ రాసిన మహా భారతానికి వ్యాకరణం ఏది? అంటే సమాధానం నన్నయ్యే చెప్పాలి.
శబ్దానుశాసనుడనని భారత అవతారికలో చెప్పుకున్న నన్నయే తెలుగుకి మొదటి వ్యాకరణం చేకూర్చి, సంస్కృత భారతాన్ని తెనిగించాడు. ఆ వ్యాకరణమే  నన్నయ కృత "ఆంధ్ర శబ్ద చింతామణి". ఇది సంస్కృత గ్రంథం.
భారత దేశంలో అచ్చు యంత్రం వచ్చాక అచ్చు వేయబడ్డ తాళ పత్ర గ్రంధాలన్నీ మను చరిత్ర, వసు చరిత్ర వంటి పౌరాణిక కావ్యాలకి అనుకరణలు మాత్రమేనని గమనించిన కందుకూరి వీరేశలింగం పంతులు, సంఘజనోద్ధరణకు ఇటువంటి భాష పనికిరాదన్నాడు. గురజాడ కూడా కదం తొక్కాడు. ఆ విధంగా ఇద్దరూ నవీన భాషోద్యమానికి చారిత్రక తాత్విక భూమికని కలిగించారు. ఆ అవసరాన్ని గుర్తించి వచన పద్య గద్యాల్ని ముందుకు నడిపించారు. తెలుగులో వ్రాయబడ్డా తెలుగు వారికి అర్థంకాని స్థితిలో కావ్య భాష ఉంది కాబట్టి, నిత్య జీవితంలోని భాషనే సాహిత్య భాషగా మార్చాలనే ఈ ప్రయత్నం, వడ్లమూడి గోపాలకృష్ణయ్య గారు వ్యావహారిక భాషా వ్యాకరణం అనే గ్రంథాన్ని రాసే దాకా కొనసాగింది.

భాష లక్ష్యం అయితే, వ్యాకరణం ఒక లక్షణం. కానీ, లక్ష్యం స్థానంలో లక్షణమే ప్రధానమై కూర్చుదేంటని ప్రశ్నించే వారు తమ వాదాన్ని ఆ కాలంలో బలంగా వినిపించారు. 1952 లో శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయ స్వర్ణోత్సవాల సందర్భంగా శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు ఉపన్యసిస్తూ, ఫరీద్ అనే తెలంగాణా కవి రాసిన 'కన్నీటి కబురు' అనే పుస్తకాన్నీ అందులో వాడబడిన భాషనీ, శీర్షికతో సహా తీవ్ర పదజాలంతో విమర్శించారు. ఆ మరునాడు జరిగిన కవి సమ్మేలనంలో శ్రీ పాద వారి విమర్శకు ప్రతి విమర్శగా కాళోజీ రాసిన కవితే 'సరస్వతీ భక్తుల్లారా!'. శ్రీ పాద గారి విమర్శలో గ్రాంధిక తెలుగు భాషపై ప్రీతియే కాక తెలంగాణా భాషమీద అవహేళన కూడా ఉండిందనే విషయం, కాలోజీ గారు ఈ మధ్య కాలంలో తెలంగాణా రచయితల వేదిక ప్రథమ వార్షికోత్సవ సమయంలో ఇచ్చిన అధ్యక్ష ఉపన్యాసంలో స్పష్టమౌతుంది. గిడుగు రామ్మూర్తి గారితో స్ఫూర్తిని పొందానని చెప్పుకుని వచనంలో కథలు రాసిన శ్రీపాద గారు, ఇలా వ్యావహారిక భాషని విమర్శించటం, ఈ అన్య కారణాలు ఉన్నాయనే ఊహకి ఊతమిస్తోంది.

కైతకు లక్షణాలున్నాయి కోటొక్కటి                               కన్నులకద్దుకుని భక్తులు పూజకై దాచుకున్నట్లు                    హైడ్రాలిక్ బ్రేక్సు కూడా ఫేలవుతున్నపుడు
వానిలో వ్యాకరణం కూడా ఒక్కటి                                మా నోట రాలిన మాట                                                   ప్రణయ జలనిధి నింపదలచిన ప్రవాహాన్ని
మీకు దాని సూత్రాలే సర్వస్వం.                                  ఆనోటా ఆనోటా                                                            ఆపడానికి మీ ఆనకట్టలు పనికొస్తాయా ?
గొంతుకు పోసుకుని వ్రేలాడి సతతం                             వినవిందై మనసుకు పసందై                                            హిమాలయ పర్వతాలే తలలు వంచుకుంటున్నపుడు
చేస్తారు ఆక్రందన, అంటారు కవిత్వం                            జపించి జపించి                                                             ఎన్నెన్ని జన్మాలెత్తి
'కైతకు వ్యాకరణమే పరమావధి                                  సూత్రాలలో బిగించి                                                        ఎంత పొంకంగా రాసినా లేఖకుడు
కాదు అసలే కాదు' అన్నాడు దాశరథి                          సారస్వత పూజా ద్రవ్యంగా                                               మహా రచయిత అనబడడు
మా రచనలో వ్యాకరణం మాత్రమే లేదు                        భద్రపరుచుకున్నారు మీ వైయాకరణులు                              వలయాలూ, చతుర్భుజాలూ
మీ రచనంతా వ్యాకరణం. మరేమీ కాదు                        అప్పుడప్పుడూ మేమన్నదే అయినది                                   వివిధ కోణాకారాలు
వ్యాకరణ సూత్రాలు పెట్టితే భట్టీ                                   మీ అప్ప కవీయం, కౌముది                                              నీటుగా రాసే రేఖా గణితజ్ఞుడు
కాదెప్పుడూ కైత పాకం గట్టి                                       సరస్వతీ భక్తుల్లారా  !                                                     మహా చిత్రకారుడనబడడు
పాతబాటల బట్టియే నడువగలరు మీరు                        బ్రహ్మనే వెక్కిరిస్తారా  !                                                    చిత్రకారుడు గీసిన
మా నడకలో పడుతుంది క్రొత్త త్రోవలకు తీరు                  మెరుపువలె పరుగిడు                                                    జీవితముట్టిపడే చిత్తరువులో
శతాబ్దాల తరబడి ప్రవాహంలో పడి                               మా ఊహా తరంగాలకు                                                    అవయవాల సొంపునుజూపే
రాపిడి ఫుణ్యాన రూపు రేఖలు దిద్దుకున్న                     బక్కెద్దులనాపే                                                              ఎత్తువంపుల కాధారమైన గీతలు
ముద్దు వచ్చే రాల్లను శివలింగాలని                             పగ్గాలు పనికొస్తాయా?                                                    వంకరటింకరగా ఉన్నాయన్న లేఖకుడు -
                                                                                                                                                         మా రచనల్లో తప్పులున్నాయనే వైయాకరణి

ఈ కవితలో, " సరస్వతీ పుత్రులారా..బ్రహ్మనే వెక్కిరిస్తారా" అనే వాక్యం చాలా తీవ్రమైన ధిక్కారాన్ని సూచిస్తుంది.
సరస్వతీ పుత్రులంటే వ్యాకరణం తెలిసిన పండితులు. బ్రహ్మ  అంటే కవు. కవి బ్రహ్మ అని తిక్కన బిరుదు.
బ్రహ్మనే ఆది కవి అంటాం. అతడు రచిస్తాడు కాబట్టి, విరించి అంటాం.
బ్రహ్మ రూపాలైన కవుల్ని, ఓ సరస్వతీ పుత్రులైన పండితులారా వెక్కిరిస్తారా? అని కవి ఆక్షేపణ.

గద్య తిక్కన వీరేశలింగం గారు 'సరస్వతీ నారద సంవాదం' అని ఒక కవిత రాశారు( 1887 ).
పదహారవ శతాబ్దంలో స్పెన్సర్ అనే కవి రాసిన టియర్స్ ఆఫ్ మ్యూజెస్ (Tears of Muses) అనే కవితను పోలి వుంటుంది
మ్యూజెస్ అంటే గ్రీకుల ఆరాధ్య చదువుల దేవత, మన సరస్వతీ అమ్మవారిలాగే.
ఒక రోజు నారదడు తన తల్లి సరస్వతి దేవి చాలా విచారకర వదనంతో ఉన్నట్టు గమనించి, కారణమేమని అడుగుతాడు.
నా బిడ్డలైన కవులు, రసాన్ని వదిలిపెట్టి పైపై మాటలతో విన్యాసాలు చేస్తున్నారనీ,
భావాన్ని కోల్పోయిన తన మాటలు తనకే అర్థం కాకుండా ఉన్నాయనీ,
వ్యాకరణాదులతో అలంకరించి తనకు సంకెల్లు వేస్తున్నారనీ, అవి నొప్పిని కలుగజేస్తున్నాయనీ సరస్వతీ దేవి బాధ పడుతుంది.
కవయః నిరంకుశః.
నిరంకుశత్వం భావ రసాల్ని పిండుకోవటంలో కాక భాషకు సంకెల్లు వేయటంలో ఏంటని అడిగినట్టుగా ఉంది కదూ ఈ సంవాదం. ఎంతో విశాలమైన సాహిత్యాన్ని, వ్యాకరణం బంధిస్తున్నట్టుగా వుంది కదూ..
ఏం సరస్వతీ భక్తులారా...బ్రహ్మనే వెక్కిరిస్తారా..?
"మా రచనలో వ్యాకరణం మాత్రమే లేదు
మీ రచనంతా వ్యాకరణం, మరేమీ కాదు".

మిగిలిన కవిత మొత్తం ఇవ్వబడిన అంశానికి యాంటీ థీసీస్ లాగా ఉంటుంది. ఒక ఆర్గ్యూమెంట్ ని వ్యతిరేకించటానికి సాగే ప్రతి వాదం లాగా సాగుతుంది. కాబట్టి తన వాదనకి తగ్గ సపోర్ట్ కోసం దాశరథిని కూడా ఖోట్ చేస్తాడు కవి.
"కైతకు వ్యాకరణమే పరమావధి
కాదు అసలే కాదు అన్నాడు దాశరథి" అని. ఇది కవితకు వచ్చిన అదనపు బలం.

కవితలో మొదట వ్యాకరణాన్ని నిర్వచిస్తాడు.
"కైతకు లక్షణాలున్నాయి కోటొక్కటి,
వానిలో వ్యాకరణం కూడా ఒక్కటి".

ఆ తరువాత కవిత మొత్తం ఆక్షేపణలతో స్టేట్మెంట్స్ తో సాగుతుంది.

ప్రతి వాదాన్ని పదే పదే బలంగా వినిపించాలి కాబట్టి, ఇటుకలు ఒకదాని తరువాత ఒకదాన్ని పేర్చినట్టు..థీసీస్ కి వ్యతిరేకంగా యాంటీ థీసీస్ ను ఒక క్రమ పద్ధతిలో నిర్మిస్తాడు కవి. ఇది మోడర్నిస్టు పద్దతి. ఈ క్రమంలో వ్యాకరణాన్ని బక్కెద్దులతో, ప్రళయ జలధిని ఆపలేని ఆనకట్టలతోనూ పోలుస్తాడు. వైయాకరణులను వలయాలూ చతుర్భుజాలూ రాసుకునే రేఖా గణితజ్ఞులతోనూ పోలుస్తాడు. జీవితముట్టిపడే చిత్రాన్ని చూసి, అవయవాల సొంపును చూసి, ఎత్తు వంపుల కాధారమైన గీతలు వంకరటింకరగా ఉన్నాయనుకునే రేఖాగణితజ్ఞుడిలాంటి లేఖకుడా..నీవా మా రచనల్లో తప్పులు వెతికేది అంటాడు.
ఈ కవితలో అప్పకవీయమనే శబ్దముంది. అపడపుడూ మేము మాట్లాడిన మాటలే మీ అప్పకవీయమైనదని అంటాడు కవి. నన్నయ సంస్కృతంలో రాసిన 'ఆంధ్ర శబ్ద చింతామణి'ని తెలుగు చేసిన వాడు, పదిహేడ శతాబ్దానికి చెందిన కాకునూరు అప్పకవి. అదే 'అప్పకవీయం'. మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ వాస్తవ్యుడు కావడం వల్లేమో..ఈ అప్పకవీయం చాలా అవమానాల్ని మోస్తోందనిపిస్తోంది. అప్పకవిని కాళోజీ కూడా వదిలి పెట్టలేదు మరి.

ఏది ఏమైనా, వ్యావహారిక భాషోద్యమం రావటం, ఒక చారిత్రక అవసరం అయింది. దాని తర్వాత వచ్చిన అభ్యుదయ కవిత్వాలకి, అస్తిత్వ వాదాలకీ ఈ ఉద్యమం ఆలంబనగా నిలిచింది. అయితే వ్యావహారిక గ్రాంధిక భాషోద్యమాలు సైంద్ధాంతిక విబేధాల్నే కాక ప్రాంతీయ వ్యక్తిగత విబేధాల్ని కూడా మోసి ఉండవచ్చు అనిపిస్తుంది. అందువలన చైతన్యమూ మాధుర్యమూ వివేకమూ అందించవలసిన సాహిత్యం, తగవులనీ అణచివేతనీ కూడా అందించాయి. ఆ పునాదుల్లోంచి పుట్టుకొచ్చిన మనం ఆధునిక భాషని అందిపుచ్చుకున్నామేగానీ, ఆధునికతను కాదు. పాత భాషని ఒదిలించు కోవటంతో పాటు ఆ జీవన మాధుర్యాన్నీ, స్నేహశీలతనూ ఒదిలించుకున్నాం. పాత కొత్తల్లోని మంచిని గ్రహించి మనకు మనమే కొత్తగా సింథెసిస్ ని రూపొందించుకోలేకున్నాం.
చివరికి కాలమే గెలిచింది. మన భాషలో మనం కవిత్వం రాసుకునే రోజులొచ్చాయి.
చివరికి కాలమే గెలవాలి. సాహిత్యం మధురంగా, చైతన్య వంతంగా సాగాలి. పరిణామం చెందాలి.
అందుకే
కవి బ్రహ్మ, కాలో యం బ్రహ్మ. కాళోజీ బ్రహ్మ.

25/11/15

No comments:

Post a Comment