డామిట్ కథ అడ్డం తిరిగింది. పాత్రలు అక్కడే ఆగిపోయాయి
............................................................................
నాటకంలో ఆ నాటకం రాసిన రచయిత స్టేజీమీద చచ్చిపోతాడు. "డెత్ ఆఫ్ ద ఆథర్" అని నిర్దక్షిణ్యంగా ప్రకటించేస్తాడు రోలాండ్ బార్త్.. కంటి ముందు కదలాడే సజీవ పాత్రలు, ఆ పాత్రల్ని రక్తి కట్టించే నటులు అందరూ కలిసి రచయితను స్టేజి మీదనుంచి, ప్రేక్షకుల హృదయాల్లోంచి అప్పటికైతే తోసేస్తారు. నాటకం ముగిసిపోతుంది. కొంత కాలానికి నాటకంలోని పాత్రలూ చచ్చిపోతాయి. రచయితా' పాత్రలు కట్టిన నటులూ అందరూ చచ్చిపోతారు. ఆ నాటకాన్ని చవి చూసిన ప్రేక్షకుడు మాత్రం చచ్చిపోడు. తనకు తాను మరో ప్రేక్షకుడై పుట్టుకొస్తాడు. ఆ ప్రేక్షకుడు ఒక కవి అయ్యుంటే అసలే చావనీయడు. ఎవరినీ చావనీయడు. నాటకాన్నీ, రచయితనీ, పాత్రల్నీ, నటులనీ ఎవరినీ చావనీయడు. అలాంటి రచయిత గురజాడ, అలాంటి రచన కన్యాశుల్కం, అలాంటి కవి శివసాగర్. "డామిట్! గురజాడా ! " అనే కవితా శీర్షికతో మరలా గురజాడనీ ఆయన పాత్రల్నీ పునరుజ్జీవింప జేసి తీసుకొస్తాడు మనముందుకు. అలాంటి కవి ఒట్టి కవే కాదు విమర్శకుడు కూడా. మార్సిష్ట్ దృక్పథంతో గతి తార్కిక చారిత్రక భౌతిక వాదం తెలిసిన వాడే అయితే ఇక కవితే ఒక విమర్శగా మారిపోయే అవకాశం ఎక్కువ కదా.
ఈ కవితలో శివ సాగర్ అదే చేస్తాడు. అది కవిత మాత్రమే కాదు.1890 వ దశకం లో వచ్చిన గురజాడ కన్యాశుల్కానికి 1980 వ దశకంలో వస్తున్న విమర్శ ఈ కవిత. ఒక రచన విలువను కొలమానాలతో నిర్ణయించే విమర్శకుల స్థాయి నుంచి దాటి, చారిత్రక, తాత్విక నేపథ్యాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకునే విమర్శకుల స్థాయిని దాటి, ఆ రచన వర్తమానానికి, సమీప భవిష్యత్తుకు ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అని విశ్లేషించుకునే విమర్శకుని స్థాయికి ఎదిగి, దానిని ఈ కవితలో సాధిస్తాడు కవి. గురజాడ రచన పుట్టిన విజయనగరం ప్రాంతం అప్పట్లో కన్యాశుల్కమనే సాంఘిక దురాచారానికి లోనయ్యి, ముక్కుపచ్చలారని పుత్తడి బొమ్మలని కాటికి కాళ్ళు చాచే వృద్ధులకిచ్చి డబ్బుకోసం పెళ్లిళ్ళు చేసేవారు. ఇలాంటి సాంఘిక సమస్యని నాటకాంశంగా తీసుకుని ఆ వ్యవస్థని అధిక్షేపిస్తూ గొప్పటి సటైర్ ని పండించారు గురజాడ గారు. కథలో కన్నీరు, కథనంలో వైచిత్ర్యమూ, మాటల్లో హాస్యమూ, శిల్పంలో వ్యంగ్యమూ, పాత్రల్లో సహజత్వమూ కలగలిపి ఆనాటి బ్రాహ్మణ అగ్రకులంలోని అభిజాత్యాల్ని సంస్కరణా చైతన్యమనే దుడ్డుకర్రతో చితకబాదారు. అగ్నిహోత్రావధానులూ, గిరీశం, లుబ్దవధానులూ, మధురవాణి, బుచ్చమ్మ, అచ్చమ్మ, అసిరిగాడు, అందరూ ఆనాటి సమాజానికి ప్రతినిధులు. నాటకం అయిపోయింది. అందరూ ఇండ్లకు వెళ్లిపోయారు. కొంతకాలం గడిచిపోతుంది. 'గొప్ప నాటకం' అన్న వారందరూ కొంత కాలానికి మరచి పోయారు. ఎందరో పోయారు. కాలం చేశేశారు. ఇపుడు ఎక్కడో ఒక కవి ఆ పాత్రలన్నీ ఏమైపోయాయని ఆలోచిస్తాడు. ఇఫుడున్న సమాజంలో వారు ఎలా ఉండేవారో అని ఊహిస్తూ కూచుంటాడు. ఊహతో సరిపుచ్చుకోక 'తత్వఘానం' తెలిసిన కారా మాస్టారునో, 'మహోదయం' రాసిన కెవీ రమణా రెడ్డినో కలిసి కించిత్ మంతనాలాడి బేరీజు వేసుకుంటాడు.
"ప్రవహించే కాలాన్ని
నీ పాత్రల పరిణామంతో
కొలుస్తున్నాను
కలహించే కాలాన్ని
నీపాత్రల పరిణామంతో
లెక్క కడుతున్నాను"
అక్కడితో ఆగక గురజాడతో ఏకంగా పేచీ పెట్టుకుంటాడు. ఏమని పేచీ?. ఆయన పాత్రలు సజీవమైనవని పేచీ. అవి చావకుండా ఇంకా బతికి ఉండటమే కాక కాలంతో పాటు మార్పు చెందుతున్నాయంటాడు. ఇంకా ఏమంటాడో చూడండి
"గురజాడా!
ఏం చెప్పను?
నీవు సృష్టించిన పాత్రలు
నీవు పెట్టిన హద్దుల్లో లేవు
పాత్రలు తీన్తేర్ అయిపోయాయి
కొన్ని పాత్రల పత్తా కూడా లేదు
పత్తేదారు చేయగల్గిందీ లేదు.
డామిట్! కథ అడ్డం తిరిగింది
పాత్రలు హద్దుమీరి పోయాయి"
ఇక ఒక్కో పాత్ర ప్రస్తుతం ఏం చేస్తుంది, ఏ పరిస్థితుల్లో వుంది అనేది కవితలో సింహ భాగం. ఈ పాత్రలన్నీ తమ హద్దులు దాటిపోయాయి. ఒక వస్తువులా నిర్దిష్టమైన పరిమాణం, నిర్ధారిత గుణమూ కలిగిన పాత్రలు పరిమాణం హద్దులు దాటి గుణాత్మక పరిణామానికి లోనవుతాయి. కాలానుగుణంగా అభివృద్ధి చెందుతాయి. గిరీశం ఏం చేస్తున్నాడుకున్నారు? సంస్కరణ వాదంతో, మాటకారి తనంతో పబ్బం గడుపుకునే చదువుకున్న బడాయికోరు గిరీశం, తన పరిధి హద్దుల్ని దాటిపోతాడు. 1980 దశకంలో మన రాష్ట్రంలో గిరీశం పేరు చెబితే మనకు గురజాడ పాత్ర గిరీశం ఒకరే గుర్తుకు రావాలి. కన్యాశుల్కం సినిమాలో ఆ పాత్ర పోషించిన వారు కూడా మనకు గుర్తుకువస్తే అది మన బాధ్యత కానే కాదు.
"రాజాగారి అండతో
తన యలోక్వెన్సీ తో
జాతిని లొంగదీసుకుని
దిబ్బ రాజ్యానికి
మహా మాంత్రికుడయ్యాడు
ప్రస్తుతం లోకాన్ని
మరమ్మత్తుఱచేస్తున్నాడు
పామర జనం కోసం
ప్రతి రోజూ ప్రాణాలర్పించి
తిరిగి,విచిత్రంగా లేస్తున్నాడు
తన జాతి కోసం
హెవెన్ లోని కరప్టెడ్ గాడ్ తో
డైలీ కొట్లాడుతున్నాడు
బ్రహ్మర్షి విశ్వామిత్రుడై
త్రిశంకు స్వర్గాన్ని
సృష్టించాలనుకుంటున్నాడు
నీ గిరీశం వెనుకటి గిరీశం కాదు
పరశు రాముడై
గొడ్డలి పట్టుకు తిరుగుతున్నాడు
'నా పేరు గిరీశమే
నినద భీషణ శంఖము
దేవదత్తమే కబడ్దార్!!'
అని గాండ్రిస్తున్నాడు
ప్రస్తుతం
కరప్షన్ చార్జీల్లో,
ఇరుక్కొని
విల విలా తన్నుకుంటున్నాడు"
ఇక మధురవాణి. శూద్రకుని సంస్కృతనాటకం 'మృచ్ఛకటికం' ప్రభావం కన్యాశుల్కం మీద ఉందని తెలుసు కాబట్టే మధురవాణి పాత్రని 'నీ వసంత సేన' అని అంటాడు కవి. బుద్ధి ఛెప్పగల ప్రజ్ఞ, సమయోచిత చొరవ గల మధురవాణి,
"కించిత్ తిక్క లేకుంటే
ఆమెలాంటి మనిషి మరి లేదని
అనిపించుకున్న మధురవాణి
'నీ వసంత సేన' మధుర వాణి
లోకం తీరుకు తిక్కరేగి, పిచ్చెక్కి
విశాఖ కరంచంద్ గాంధీ ఆస్పత్రిలో
చాలాకాలం కోమాలో వున్నది". విశాఖలో కరంచంద్ గాంధీ ఆస్పత్రి అంటే కింగ్ జార్జి ఆసుపత్రియే. దానికి ఇలా పేరు మార్చాలని అనుకున్నారట. అక్కడ కోమాలో ఉన్నది మధురవాణిగా పాత్ర వేసిన సినీ నటి అయితే కాదని తెలిసినా కవి సారూప్యతల్ని మన మీదకి వదిలాడేమో.
ఇక 'ప్యూర్ డైమండ్ 'బుచ్చమ్మ విడో హౌజ్ నుండి వచ్చేసి, నాస్తికుణ్ణి పెండ్లాడిందనీ, 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్' పద్యాన్ని గొప్ప ఇంగ్లీషులాగా భ్రమింపజేసిన గిరీశం శిష్యుడు వేంకటేశం, ఖాదీ బండార్ లో కొలువుతీరి ఉన్నాడనీ, సురేంద్రనాథ్ బెనర్జీ కావడం కన్నా ఎన్జీవో సూరీడు కాగల్గడం గొప్పనుకుంటున్నాడనీ అంటాడు కవి. అందరం మర్ఛిపోయిన అచ్చమ్మ, రంగనాయకమ్మలా కత్తిలాంటి కలం పట్టి మనుష్యుల్లాంటి పశువుల్ని
'బలిపీఠం' మీద నిలబెడుతున్నదట. ఇలా గురజాడ గుర్తించిన పాత్రలే కాకుండా ఆయన కూడా గుర్తించని పాత్రలు నేషనల్ కాంగ్రేసు లో ఓటరు మహాశయులయ్యారనీ, అగ్ని హోత్రావధానుల గేదెను కాసిన అసిరిగాడు కమ్యూనిష్టయ్యాడనీ, అసిరి గాడి అన్న దళిత సంఘాన్ని భుజాలకెత్తుకున్నాడనీ, స్పష్టమైన సామాజిక వర్గ విభజననీ, వర్గ సంఘర్షణనీ కవితలో చూపుతాడు కవి. ఇక్కడే కవి చారిత్రక భౌతికవాద దృక్పథాన్ని అవలంబించి కవిత్వం చేస్తాడు. ఇలా కన్యాశుల్కంలోని ప్రతీ పాత్రనీ వివరిస్తూ సాగుతాడు. గురజాడకు ఒక ప్రోగ్రేస్ రిపోర్ట్ లాగా సమర్పిస్తాడు కవి. ఆ రిపోర్ట్ ఇప్పటికీ అలాగే ఉంది. పెద్దగా మారిందేమీ లేదు.
"ఇదీ పరిస్థితి!
ఇదీ నీవు ప్రేమించిన
నీ జాతి ప్రోగ్రెస్ రిపోర్ట్!
నీవు ప్రేమించిన నీ దేశం
నేడు రగులుతున్న రణరంగం
గుండెలేని మనిషి లేనట్లే
జెండాలేని మనిషి
ఇవ్వాల ఇక్కడ ఎవరూ లేరు"
గురజాడ రచనే కావచ్చు, మరేదైనా రచన కావచ్చు, ఆ కాలం నాటి పరిస్థితుల్లో ప్రగతిశీలమా కాదా అనే అంశం అభ్యుదయ రచనకు గీటురాయి అని అనుకున్నపుడు, నికరంగా ఈ పలానా సాహిత్యం యొక్క చరిత్ర ఇదీ, తాత్విక నేపథ్యం ఇదీ అని తెలియని రచనలని కూడా కేవలం వాచ్యార్థ పదబంధాలకు తల బాదుకుని బొప్పికట్టించుకుని మార్సిష్టు దృక్కోణంలో చీల్చి చెండాదాలనుకునే ఆధునిక విమర్శకులకి తన కవితలోనే చివరలో ఒక సంతృప్తికర సమాధానంలా ఒక వాక్యం ఉంటుంది. "చారిత్రక విభాత సంధ్యల/ మానవ కథ వికాసమెట్టిది?" అని. ఈ చారిత్రకత అనే ఇరు సంధ్యల నడుమదే కవికి ప్రధానంలా కనిపిస్తుందిక్కడ. చరిత్ర తొలి సంధ్యను వెతుకుతూ పోవాలి. మలి సంధ్యని వర్తమానంలో కనుగొనాలి కాబట్టి, చరిత్ర పూర్వం గురించిన బాధ ఈ కవికి లేదనేది స్పష్టం. మార్సిష్టు సాహిత్య విమర్శలోని పెద్ద దోషమే ఇదని వేల్చేరు వారు చెప్పే ఉన్నారు. నూతన పరిస్థితులనుంచి నూతన సత్యాలు ఉద్భవించినా వర్తమానంలోకి విరుచుకు పడని మనం గురజాడ పాత్రల్ని శివసాగర్ లా ఇంకాస్త ముందుకి కూడా జరపలేకున్నాం. అక్కడే ఆగిపోయి వున్నాం. డామిట్ కథ అడ్డం తిరిగింది. పాత్రలు అక్కడే ఆగిపోయాయి.
27/1/16
............................................................................
నాటకంలో ఆ నాటకం రాసిన రచయిత స్టేజీమీద చచ్చిపోతాడు. "డెత్ ఆఫ్ ద ఆథర్" అని నిర్దక్షిణ్యంగా ప్రకటించేస్తాడు రోలాండ్ బార్త్.. కంటి ముందు కదలాడే సజీవ పాత్రలు, ఆ పాత్రల్ని రక్తి కట్టించే నటులు అందరూ కలిసి రచయితను స్టేజి మీదనుంచి, ప్రేక్షకుల హృదయాల్లోంచి అప్పటికైతే తోసేస్తారు. నాటకం ముగిసిపోతుంది. కొంత కాలానికి నాటకంలోని పాత్రలూ చచ్చిపోతాయి. రచయితా' పాత్రలు కట్టిన నటులూ అందరూ చచ్చిపోతారు. ఆ నాటకాన్ని చవి చూసిన ప్రేక్షకుడు మాత్రం చచ్చిపోడు. తనకు తాను మరో ప్రేక్షకుడై పుట్టుకొస్తాడు. ఆ ప్రేక్షకుడు ఒక కవి అయ్యుంటే అసలే చావనీయడు. ఎవరినీ చావనీయడు. నాటకాన్నీ, రచయితనీ, పాత్రల్నీ, నటులనీ ఎవరినీ చావనీయడు. అలాంటి రచయిత గురజాడ, అలాంటి రచన కన్యాశుల్కం, అలాంటి కవి శివసాగర్. "డామిట్! గురజాడా ! " అనే కవితా శీర్షికతో మరలా గురజాడనీ ఆయన పాత్రల్నీ పునరుజ్జీవింప జేసి తీసుకొస్తాడు మనముందుకు. అలాంటి కవి ఒట్టి కవే కాదు విమర్శకుడు కూడా. మార్సిష్ట్ దృక్పథంతో గతి తార్కిక చారిత్రక భౌతిక వాదం తెలిసిన వాడే అయితే ఇక కవితే ఒక విమర్శగా మారిపోయే అవకాశం ఎక్కువ కదా.
ఈ కవితలో శివ సాగర్ అదే చేస్తాడు. అది కవిత మాత్రమే కాదు.1890 వ దశకం లో వచ్చిన గురజాడ కన్యాశుల్కానికి 1980 వ దశకంలో వస్తున్న విమర్శ ఈ కవిత. ఒక రచన విలువను కొలమానాలతో నిర్ణయించే విమర్శకుల స్థాయి నుంచి దాటి, చారిత్రక, తాత్విక నేపథ్యాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకునే విమర్శకుల స్థాయిని దాటి, ఆ రచన వర్తమానానికి, సమీప భవిష్యత్తుకు ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అని విశ్లేషించుకునే విమర్శకుని స్థాయికి ఎదిగి, దానిని ఈ కవితలో సాధిస్తాడు కవి. గురజాడ రచన పుట్టిన విజయనగరం ప్రాంతం అప్పట్లో కన్యాశుల్కమనే సాంఘిక దురాచారానికి లోనయ్యి, ముక్కుపచ్చలారని పుత్తడి బొమ్మలని కాటికి కాళ్ళు చాచే వృద్ధులకిచ్చి డబ్బుకోసం పెళ్లిళ్ళు చేసేవారు. ఇలాంటి సాంఘిక సమస్యని నాటకాంశంగా తీసుకుని ఆ వ్యవస్థని అధిక్షేపిస్తూ గొప్పటి సటైర్ ని పండించారు గురజాడ గారు. కథలో కన్నీరు, కథనంలో వైచిత్ర్యమూ, మాటల్లో హాస్యమూ, శిల్పంలో వ్యంగ్యమూ, పాత్రల్లో సహజత్వమూ కలగలిపి ఆనాటి బ్రాహ్మణ అగ్రకులంలోని అభిజాత్యాల్ని సంస్కరణా చైతన్యమనే దుడ్డుకర్రతో చితకబాదారు. అగ్నిహోత్రావధానులూ, గిరీశం, లుబ్దవధానులూ, మధురవాణి, బుచ్చమ్మ, అచ్చమ్మ, అసిరిగాడు, అందరూ ఆనాటి సమాజానికి ప్రతినిధులు. నాటకం అయిపోయింది. అందరూ ఇండ్లకు వెళ్లిపోయారు. కొంతకాలం గడిచిపోతుంది. 'గొప్ప నాటకం' అన్న వారందరూ కొంత కాలానికి మరచి పోయారు. ఎందరో పోయారు. కాలం చేశేశారు. ఇపుడు ఎక్కడో ఒక కవి ఆ పాత్రలన్నీ ఏమైపోయాయని ఆలోచిస్తాడు. ఇఫుడున్న సమాజంలో వారు ఎలా ఉండేవారో అని ఊహిస్తూ కూచుంటాడు. ఊహతో సరిపుచ్చుకోక 'తత్వఘానం' తెలిసిన కారా మాస్టారునో, 'మహోదయం' రాసిన కెవీ రమణా రెడ్డినో కలిసి కించిత్ మంతనాలాడి బేరీజు వేసుకుంటాడు.
"ప్రవహించే కాలాన్ని
నీ పాత్రల పరిణామంతో
కొలుస్తున్నాను
కలహించే కాలాన్ని
నీపాత్రల పరిణామంతో
లెక్క కడుతున్నాను"
అక్కడితో ఆగక గురజాడతో ఏకంగా పేచీ పెట్టుకుంటాడు. ఏమని పేచీ?. ఆయన పాత్రలు సజీవమైనవని పేచీ. అవి చావకుండా ఇంకా బతికి ఉండటమే కాక కాలంతో పాటు మార్పు చెందుతున్నాయంటాడు. ఇంకా ఏమంటాడో చూడండి
"గురజాడా!
ఏం చెప్పను?
నీవు సృష్టించిన పాత్రలు
నీవు పెట్టిన హద్దుల్లో లేవు
పాత్రలు తీన్తేర్ అయిపోయాయి
కొన్ని పాత్రల పత్తా కూడా లేదు
పత్తేదారు చేయగల్గిందీ లేదు.
డామిట్! కథ అడ్డం తిరిగింది
పాత్రలు హద్దుమీరి పోయాయి"
ఇక ఒక్కో పాత్ర ప్రస్తుతం ఏం చేస్తుంది, ఏ పరిస్థితుల్లో వుంది అనేది కవితలో సింహ భాగం. ఈ పాత్రలన్నీ తమ హద్దులు దాటిపోయాయి. ఒక వస్తువులా నిర్దిష్టమైన పరిమాణం, నిర్ధారిత గుణమూ కలిగిన పాత్రలు పరిమాణం హద్దులు దాటి గుణాత్మక పరిణామానికి లోనవుతాయి. కాలానుగుణంగా అభివృద్ధి చెందుతాయి. గిరీశం ఏం చేస్తున్నాడుకున్నారు? సంస్కరణ వాదంతో, మాటకారి తనంతో పబ్బం గడుపుకునే చదువుకున్న బడాయికోరు గిరీశం, తన పరిధి హద్దుల్ని దాటిపోతాడు. 1980 దశకంలో మన రాష్ట్రంలో గిరీశం పేరు చెబితే మనకు గురజాడ పాత్ర గిరీశం ఒకరే గుర్తుకు రావాలి. కన్యాశుల్కం సినిమాలో ఆ పాత్ర పోషించిన వారు కూడా మనకు గుర్తుకువస్తే అది మన బాధ్యత కానే కాదు.
"రాజాగారి అండతో
తన యలోక్వెన్సీ తో
జాతిని లొంగదీసుకుని
దిబ్బ రాజ్యానికి
మహా మాంత్రికుడయ్యాడు
ప్రస్తుతం లోకాన్ని
మరమ్మత్తుఱచేస్తున్నాడు
పామర జనం కోసం
ప్రతి రోజూ ప్రాణాలర్పించి
తిరిగి,విచిత్రంగా లేస్తున్నాడు
తన జాతి కోసం
హెవెన్ లోని కరప్టెడ్ గాడ్ తో
డైలీ కొట్లాడుతున్నాడు
బ్రహ్మర్షి విశ్వామిత్రుడై
త్రిశంకు స్వర్గాన్ని
సృష్టించాలనుకుంటున్నాడు
నీ గిరీశం వెనుకటి గిరీశం కాదు
పరశు రాముడై
గొడ్డలి పట్టుకు తిరుగుతున్నాడు
'నా పేరు గిరీశమే
నినద భీషణ శంఖము
దేవదత్తమే కబడ్దార్!!'
అని గాండ్రిస్తున్నాడు
ప్రస్తుతం
కరప్షన్ చార్జీల్లో,
ఇరుక్కొని
విల విలా తన్నుకుంటున్నాడు"
ఇక మధురవాణి. శూద్రకుని సంస్కృతనాటకం 'మృచ్ఛకటికం' ప్రభావం కన్యాశుల్కం మీద ఉందని తెలుసు కాబట్టే మధురవాణి పాత్రని 'నీ వసంత సేన' అని అంటాడు కవి. బుద్ధి ఛెప్పగల ప్రజ్ఞ, సమయోచిత చొరవ గల మధురవాణి,
"కించిత్ తిక్క లేకుంటే
ఆమెలాంటి మనిషి మరి లేదని
అనిపించుకున్న మధురవాణి
'నీ వసంత సేన' మధుర వాణి
లోకం తీరుకు తిక్కరేగి, పిచ్చెక్కి
విశాఖ కరంచంద్ గాంధీ ఆస్పత్రిలో
చాలాకాలం కోమాలో వున్నది". విశాఖలో కరంచంద్ గాంధీ ఆస్పత్రి అంటే కింగ్ జార్జి ఆసుపత్రియే. దానికి ఇలా పేరు మార్చాలని అనుకున్నారట. అక్కడ కోమాలో ఉన్నది మధురవాణిగా పాత్ర వేసిన సినీ నటి అయితే కాదని తెలిసినా కవి సారూప్యతల్ని మన మీదకి వదిలాడేమో.
ఇక 'ప్యూర్ డైమండ్ 'బుచ్చమ్మ విడో హౌజ్ నుండి వచ్చేసి, నాస్తికుణ్ణి పెండ్లాడిందనీ, 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్' పద్యాన్ని గొప్ప ఇంగ్లీషులాగా భ్రమింపజేసిన గిరీశం శిష్యుడు వేంకటేశం, ఖాదీ బండార్ లో కొలువుతీరి ఉన్నాడనీ, సురేంద్రనాథ్ బెనర్జీ కావడం కన్నా ఎన్జీవో సూరీడు కాగల్గడం గొప్పనుకుంటున్నాడనీ అంటాడు కవి. అందరం మర్ఛిపోయిన అచ్చమ్మ, రంగనాయకమ్మలా కత్తిలాంటి కలం పట్టి మనుష్యుల్లాంటి పశువుల్ని
'బలిపీఠం' మీద నిలబెడుతున్నదట. ఇలా గురజాడ గుర్తించిన పాత్రలే కాకుండా ఆయన కూడా గుర్తించని పాత్రలు నేషనల్ కాంగ్రేసు లో ఓటరు మహాశయులయ్యారనీ, అగ్ని హోత్రావధానుల గేదెను కాసిన అసిరిగాడు కమ్యూనిష్టయ్యాడనీ, అసిరి గాడి అన్న దళిత సంఘాన్ని భుజాలకెత్తుకున్నాడనీ, స్పష్టమైన సామాజిక వర్గ విభజననీ, వర్గ సంఘర్షణనీ కవితలో చూపుతాడు కవి. ఇక్కడే కవి చారిత్రక భౌతికవాద దృక్పథాన్ని అవలంబించి కవిత్వం చేస్తాడు. ఇలా కన్యాశుల్కంలోని ప్రతీ పాత్రనీ వివరిస్తూ సాగుతాడు. గురజాడకు ఒక ప్రోగ్రేస్ రిపోర్ట్ లాగా సమర్పిస్తాడు కవి. ఆ రిపోర్ట్ ఇప్పటికీ అలాగే ఉంది. పెద్దగా మారిందేమీ లేదు.
"ఇదీ పరిస్థితి!
ఇదీ నీవు ప్రేమించిన
నీ జాతి ప్రోగ్రెస్ రిపోర్ట్!
నీవు ప్రేమించిన నీ దేశం
నేడు రగులుతున్న రణరంగం
గుండెలేని మనిషి లేనట్లే
జెండాలేని మనిషి
ఇవ్వాల ఇక్కడ ఎవరూ లేరు"
గురజాడ రచనే కావచ్చు, మరేదైనా రచన కావచ్చు, ఆ కాలం నాటి పరిస్థితుల్లో ప్రగతిశీలమా కాదా అనే అంశం అభ్యుదయ రచనకు గీటురాయి అని అనుకున్నపుడు, నికరంగా ఈ పలానా సాహిత్యం యొక్క చరిత్ర ఇదీ, తాత్విక నేపథ్యం ఇదీ అని తెలియని రచనలని కూడా కేవలం వాచ్యార్థ పదబంధాలకు తల బాదుకుని బొప్పికట్టించుకుని మార్సిష్టు దృక్కోణంలో చీల్చి చెండాదాలనుకునే ఆధునిక విమర్శకులకి తన కవితలోనే చివరలో ఒక సంతృప్తికర సమాధానంలా ఒక వాక్యం ఉంటుంది. "చారిత్రక విభాత సంధ్యల/ మానవ కథ వికాసమెట్టిది?" అని. ఈ చారిత్రకత అనే ఇరు సంధ్యల నడుమదే కవికి ప్రధానంలా కనిపిస్తుందిక్కడ. చరిత్ర తొలి సంధ్యను వెతుకుతూ పోవాలి. మలి సంధ్యని వర్తమానంలో కనుగొనాలి కాబట్టి, చరిత్ర పూర్వం గురించిన బాధ ఈ కవికి లేదనేది స్పష్టం. మార్సిష్టు సాహిత్య విమర్శలోని పెద్ద దోషమే ఇదని వేల్చేరు వారు చెప్పే ఉన్నారు. నూతన పరిస్థితులనుంచి నూతన సత్యాలు ఉద్భవించినా వర్తమానంలోకి విరుచుకు పడని మనం గురజాడ పాత్రల్ని శివసాగర్ లా ఇంకాస్త ముందుకి కూడా జరపలేకున్నాం. అక్కడే ఆగిపోయి వున్నాం. డామిట్ కథ అడ్డం తిరిగింది. పాత్రలు అక్కడే ఆగిపోయాయి.
27/1/16