Wednesday, 24 January 2024

జనాభా- పర్యావరణం -స్త్రీ వాదం. వ్యాసం

 జనాభా- పర్యావరణం -స్త్రీ వాదం

----------------------------------------------


ఎక్కడైతే స్త్రీలకు తమ శరీరాలపై తమకే అధికారం ఉంటుందో ఎక్కడైతే వారేం చేయాలో ఏం చేయకూడదో వారే నిర్ణయించుకోగలరో ఎక్కడైతే వారికి ఓటు హక్కు ఉంటుందో ఎక్కడైతే వారు విద్యావంతులో అక్కడ శిశు జననాల శాతం తగ్గుతుంది అనేది ప్రపంచవ్యాప్తంగా సోషియాలజిస్టులకు ఉన్న అవగాహన. ఎక్కడైతే స్త్రీ లకు ఈ అనుకూవతలు లేవో అక్కడ జననాల శాతం ఎక్కువ, గృహ హింస ఎక్కువ. మనదేశం జనాభాలో  చైనాను దాటేసి ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. ఈ సందర్భంగా కూడా మనదేశంలో దీనిపై పెద్దగా చర్చ జరగడం లేదు. పాలకులకు దీనిపై ధ్యాస ఉన్నట్లు కూడా మనకు కనిపించడం లేదు. మన దేశంలో చివరి జనాభా గణన 2011లో జరిగింది. కరోనా పాండెమిక్ వలన 2021 లో జరగలేదు అనుకున్నా మళ్ళీ ఈ రోజువరకు దాని గురించిన ఆలోచన కూడా ఎక్కడా ఉన్నట్టు కనబడటం లేదు. కరోనా సమయంలోనే అమెరికా యూకేలు జనభా గణన చేయగలిగాయి. మనదేశం అదే సమయంలో కొన్ని రాష్ట్రాలలో ఎలక్షన్లను పెట్టగలిగింది కానీ జనగణనను మాత్రం వాయిదా వేసింది. 1872 నుండి మనదేశంలో ప్రతీ పది సంవత్సరాలకూ  జనగణన జరుగుతున్నది. 1941 లో 61లో 71లలో యుద్ధాలవలన గణన కొంత ఆలస్యంగా జరిగినా  ఇలా పూర్తిగా జరగకుండా ఉండటం దేశ చరిత్ర లో ఇదే మొదటిసారి. ఈ సారి దాదాపు పదివేల కోట్ల రూపాయల ఖర్చు రావొచ్చని అంచనావేసినా యాభైకోట్లమంది చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న డిజిటల్ ఇండియాగా ఆన్లైన్ మెథడ్ లో కూడా గణన చేసుకునే అవకాశం ఉంది. జనగణన లేకపోతే పాలసీలను చేయడమూ కష్టమే. కానీ  పాలసీలకంటే మనకిపుడు గుళ్ళే ముఖ్యంగా ఉంటున్నాయి కనుక ప్రభుత్వాల తప్పిదము కూడా లేదేమో. ఐతే ఇపుడు140కోట్లు అని చెబుతున్నది ఐక్యరాజ్యసమితి డాటా ఆధారమే తప్ప నిజమైన జనగణన కాదు. మనం చైనా జనాభా ను నిజంగా దాటేశామా లేదా అనేది అపుడే తేలుతుంది. 2024 ఎలక్షన్ల తర్వాత జనగణన ఉండబోయే అవకాశం ఉంది. 


ఐతే చైనాలో జనాభా తగ్గుముఖం పట్టింది. దానికి ఎన్నో కారణాలు. 1981 లో జనాభా నియంత్రణ కోసం "ఒక్కబిడ్డ చాలు" అని కఠిన చట్టాలు చేసింది. ఒక వేళ 1981 లో చైనా ఆ చట్టం చేయకపోయి ఉండింటే ఈ పాటికి 220కోట్ల జనాభాతో నిండిపోయేది చైనా. అంటే ఈ చట్టం వల్ల చాలామటుకు జనాభా నియంత్రణ జరిగిందన్నట్టే. ఐతే 2015 లో ఈ చట్టాన్ని ఎత్తేసి ఇద్దరిని కనండి అని చెప్పింది. విచిత్రం ఏమంటే ఈ చట్ట సవరణ తర్వాత కూడా చైనా జనాభా ఏమంతగా పెరగలేదు. ఇప్పుడు కొత్తగా వీలైనంత ఎక్కువ మందిని కనండని చైనా ప్రభుత్వం బోధించడం మొదలు పెట్టింది. ఎందుకంటే గత ఎనిమిదేళ్ళుగా వరుసగా జనాభా సగటు అంతకంతకూ తగ్గుతూ వచ్చింది. చివరికి అది  ప్రస్తుతం ఏ పరిస్థితి కి చేరిందంటే చైనా ప్రభుత్వమే పూనుకుని జనాభా పెంచకపోతే విపత్కర పరిస్థితులు రాబోతాయని ప్రకటించేంతగా. జనాభాలో ముసలివాళ్ళు అధికంగా ఉండే దేశంగా చైనా మారింది. కొత్త తరంవారు పుట్టుక రావడం లేదు. కొత్త తరం రాకపోతే ఆర్థికంగా దేశం చితికిపోతుందనే భయాన్ని ఏ దేశమైన ప్రకటిస్తే దానిని డయపర్ల బిజినెస్ చేసుకునేవారి భయంగా కొఫీ అన్నన్ అప్పట్లో కొట్టివేశాడు. కానీ చైనాకు ఇపుడు అదే భయం పట్టుకుంది. జనాభా పెరగకపోతే ఆర్థికంగా చితికిపోతామేమో అనే యం మొదలైంది. ఒకవైపు జనాభా పెరిగేకొద్దీ సహజ వనరులు తరిగి పర్యావరణ విధ్వంసం జరుగుతుంది కాబట్టి  జనాభాను తగ్గించుకోవాలని ప్రపంచ దేశాలు ఆలోచిస్తుంటే దానికి విభిన్నంగా చైనా జనభాను పెంచండని పిలుపునిస్తోంది. 


ఇక్కడ ముఖ్యంగా గమనించవలసినది ఏంటంటే "ఒక్క బిడ్డ మాత్రమే"పాలసీని ఎత్తేసినా కూడా చైనాలో జనాభా పెరగకపోవడానికి కారణం - స్త్రీ విద్య. అక్కడ చదువుకున్న యువత వివాహాల పట్ల విముఖత చూపిస్తున్నారు. ముఖ్యంగా పెరుగుతున్న గృహ హింసలు ఆడవారిపై దాష్టీకాలను చూసి మాకొద్దు బాబోయ్ ఈ పెళ్ళిళ్ళు అంటున్నారు. పైగా విడాకులు తీసుకోవాలంటే కూడా ఒప్పుకోకుండా బలవంతపు సంసారాలు కొనసాగేలా వస్తున్న కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. అంతేకాకుండా అక్కడ ఫెమినిజం ప్రభావం కూడా పెరిగింది. ప్రభుత్వాలు ఫెమినిస్టులను అరెస్టులు చేసి సతాయిస్తున్నా పెరుగుతున్న ఇంటర్నెట్ వాడకం, సోషల్ మీడియాలు ఫెమినిస్ట్ ఐడియాలజీని పట్టి లేపుతున్నాయి. చైతన్నాన్ని నింపుతున్నాయి. శిశువులను కనండని పిలుపునిస్తున్నారు సరే మరి ఆ శిశువును కనే స్త్రీ కి రక్షణ ఏదీ అని అడుగుతున్నారు. భర్తల రూపంలో, కుటుంబ బంధాల రూపంలో వ్యవస్థీకృతమైన అణచివేతను ఇంకేమాత్రం భరించలేమంటున్నారు. మాతృత్వం చుట్టూ అల్లుకున్న రొమాంటిసైజేషన్ ని కూల్చేస్తూ ఇది గృహహింస లో భాగమని గుర్తించగలుగుతున్నారు. కనబోయే పాప ఆడ శిశువైతే, పెరిగి పెద్దయ్యాక కూడా పరిస్థితులు మారుతాయని గ్యారెంటీ లేనపుడు కని పాడులోకంలోకి తీసుకురావడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. రాబోయే పర్యావరణ విధ్వంసాలకు యుద్ధాలకూ శిశువులను ఎందుకు ఆహ్వానించాలనే కొత్తరకం ఊహలతో యువత నిండిపోతున్నారు. (ఇలాంటి వారిని హైదరాబాద్ లో కూడా చూశాను) ఇదంతా చైనా ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమనే వారూ ఉన్నారు కానీ దేశభవితను నిర్ణయించేది యువతే. ఆర్థికంగా బలమైన దేశమైనప్పటికీ స్త్రీ కి రక్షణలేని సమాజాన్ని వారు ఆహ్వానించలేకపోవడం ఆలోచనలో జరుగుతున్న విప్లవం అని చెప్పకతప్పదు. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ కూ స్త్రీ విద్యకూ స్త్రీ సాధికారతకూ సంబంధం చాలా లోతుగా ఉందని చెప్పక తప్పదు.


విరించి విరివింటి 

24.1.24

Wednesday, 10 January 2024

సినిమాతో ప్రపంచం. వ్యాసం

సినిమాతో ప్రపంచం.

How to understand world from cinema.

An insight 


-----------------------


ఈ కాలం కాలేజీ పిల్లలతో మాట్లాడేటపుడు పూర్తిగా వేరే లోకం పిల్లలతో మాట్లాడుతున్నామనే స్పృహ మనకు ఉండాలి. ఒకప్పుడు ఫిక్షన్ మాత్రమే చదివిన వారి మాటలకూ ఫిక్షన్ తో పాటు నాన్ ఫిక్షన్ కూడా చదివిన వారి మాటలకూ తేడా స్పష్టంగా కనబడేది. ఐతే ఈ కాలం పిల్లలు ఫిక్షన్ చదవడం అటుంచి కేవలం ఫిక్షన్ మాత్రమే "చూసిన" వారు. చదివిన వారు కూడా కాదు. నాన్ ఫిక్షన్ అంటే వారి వరకు కేవలం పాఠ్య పుస్తకాలే. 


ఐతే సినిమాలు సమాజం మీద మనుషుల విలువల మీద ప్రభావం చూపుతాయా అనేది నేను వాళ్ళకు వేసిన ప్రశ్న. ఐతే ఒక్కొక్కరు ఒక్కో సమాధానం ఇచ్చారు. కొందరు చూపుతుందనీ తమ మిత్రులు కొందరు సినిమాలు చూసే అమ్మాయిలకు సైట్ కొడుతుంటారనీ ఫైంటిగులు చేస్తుంటారనీ కొందరంటే, చాలామంది అదేం లేదనీ చూసి మరిచిపోతుంటామనీ సమాధానం ఇచ్చారు. 


ఏదైనా రెండు నిమిషాల అడ్వర్టైజ్మెంట్ పలానాది కొనమని పదే పదే చెప్పడం వలన అది మన మీద ఇంపాక్ట్ చూపినపుడు రెండు మూడు గంటల సినిమా మన మీద ప్రభావం చూపుతుందా చూపదా అని అడిగాను. "చూపదు. అది వేరే ఇది వేరే. అడ్వర్టైజ్మెంట్ పదే పదే చూపిస్తారు. సినిమా ఒక్కసారే చూస్తాం కాబట్టి ప్రభావం ఉండదు అన్నాడు" ఒకబ్బాయి. నిజమే ఒక సినిమా చూపించకపోవచ్చు. కానీ వచ్చే ప్రతి సినిమా ఒకే రకమైన భావజాలాన్ని మోస్తూ అవే విలువలు వేరు వేరు సినిమాలలో రిపీటెడ్ గా చూపబడుతుంటే వాటి ప్రభావం ఉంటుందా ఉండదా అని అడిగాను. ఆలోచించి చెబుతామని అన్నారు. వారిని ఇంకో విషయం కూడా ఆలోచించమని చెప్పాను. ప్రతిరోజూ సినిమాలను ఆహారంలా తినే పరిస్థితిని తెచ్చిన ఓటీటీ గురించి చెప్పాను. గతంలో సగటున ఒక వ్యక్తి నెలకు ఒకటి రెండు సినిమాలు చూసే రోజులలో సినిమా ప్రభావం ఉండకపోయేదేమో. కొడవగంటి కుటుంబ రావు గారు కూడా సినిమా ల ప్రభావం సమాజంపై ఉంటుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు.  కానీ ఇపుడు ఓటిటీ ప్రభావమా అని రోజూ సినిమా చూడవలసిందే..చూసిండేది ఊరికే ఉండకుండా పదిమందికీ రికమెండ్ చేయాల్సిందే. ఇపుడు సినిమా దగ్గరకు మనం పోవడం లేదు. సినిమానే మన దగ్గరకు వచ్చింది. మన ఇంట్లోనుండి మన చేతిలో సెల్ఫోన్ లోకి వచ్చేసింది.  రోజర్ మాన్వెల్ అనే సినీ విమర్శకుడు ఏమంటాడంటే "సినిమాలు భోజనం లాంటివి అపుడపుడూ మంచిభోజనం దొరుకుతుంది. కానీ రోజూ భోజనం చేయాల్సిందే" నని. ఆయన పాతకాలపు విమర్శకుడు కాబట్టి వచ్చే ప్రతి సినిమా చూసేవాడేమో. ఐతే ఈ కాలం వారు ఓటీటీ వలన ప్రతి సినిమా ప్రతివారూ చూసే పరిస్థితి ఉంది. ప్రతిసినిమా చూడటానికి నేనేమైనా విమర్శకుడినా అనుకోవాల్సిన పనిలేదు. ఓటీటీకి Subscription చేశాం కాబట్టి అవసరమున్నా లేకున్నా చూడాల్సిందే.   అలా ఎడతెగకుండా చూస్తూ ఉన్నప్పుడు సహజంగానే లోపాలంటూ ఒక విమర్శకుడు బయలుదేరుతాడు కదా. వివిధ దేశాల వివిధ భాషల సినిమాలను చూస్తున్నపుడు లోపలెక్కడో ఒక కంపారేటివ్ స్టడీవంటిది మొదలవంతుంది కదా. మన సినిమాలేంటి వేరే భాషల దేశాల సినిమాలేంటి అనే ధోరణి ఒకటి మొదలవాలి కదా. కానీ అలాంటిదేదీ ఈ యువతలో మొదలవలేదు అనిపిస్తుంది.


ఎందుకంటే వీళ్ళకు కాస్త వయసు వచ్చి తెలివి వచ్చేసరికి కేవలం ఫిక్షన్ మాత్రమే "చూసే" ఒక చారిత్రక సందర్భంలోకి అడుగు పెట్టేశారు.. అందునా ప్రతిరోజూ సినిమా చుట్టూనే ఓటీటీలు టీవీ ప్రోగ్రాంలతో నిండిన ఒక సందర్భంలో ఉన్నారు. అందుకే తాము సినిమా చూస్తామే తప్ప సినిమాను విమర్శించం అనీ విమర్శించడం మహాపాపం అనీ అన్నట్టుంటారు. ఐతే ఇటువంటి వారికి మొత్తానికి "సినిమా" అంటే ఇష్టం. కాబట్టి అది యే సినిమా ఐనా సరే ఇష్టపడుతుంటారు. వారు కష్టపడి తీస్తారు కాబట్టి విమర్శించకూడదని సినిమావాళ్ళకు విధేయత చూపుతుంటారు. అంతగా విమర్శించదలిస్తే "మీరు తీసి చూపండి చూద్దాం" అని ఎద్దేవా చేస్తూ ఉంటారు. వీళ్ళల్లో కొందరికి సినిమా మీద కంటే సినిమా హీరోలమీద ప్రేమ ఎక్కువ. ఆ హీరో ఎలాంటి సినిమా తీసినా వారికి నచ్చుతుందంతే. బాగాలేదనడానికే కాదు వారిలో వారు బాగాలేదని అనుకోడానికి కూడా ఇష్టపడరు. ముఖ్యంగా సినిమా విమర్శ అనేదొక సాహిత్యమనీ దానిని చదివితే తప్ప సినిమాని ఎలా అనలైజ్ చేయాలో తెలుస్తుందన్న విషయం వీరికి తెలియదు. ఐతే ఇలాంటి యువతతో పాటు జీవితంలో ఫిక్షన్ మాత్రమే చదివిన పెద్దవారు కూడా ఇలాంటి ధోరణి, అంటే సినిమాను విమర్శించరాదు,అనే ధోరణిని కలిగిఉంటారు. నాన్ ఫిక్షన్ పుస్తకాలు మనిషిలో ఒక క్రిటికల్ ఫ్యాకల్టీ ని డవలప్ చేస్తాయి. కానీ వాటిని చదివే నాథుడులేడు.


ఐతే ఈ పెద్దవారితో వచ్చిన చిక్కేమిటంటే  OTT పుణ్యమా అని తమ దైనందిన జీవితంలో సినిమా ఒక భాగంగా నిండిపోయిందనీ ఎవరు ఏ సినిమా బాగుందని చెబితే దానిని వెంటనే చూసేందుకు conditioned ఐపోయి ఉవ్విళ్లూరుతూ  నిరంతరం తమను తాము ఎంటర్టైన్మెంట్ కి మాత్రమే పరిమితం చేసుకున్నామనీ ఇది తమలో వచ్చిన మార్పు అనీ గుర్తించడంలో విఫలమౌతుంటారు. రోజూ టంచనుగా సినిమా చూడటమే తమ మీద పడిన ప్రభావమని గుర్తెరగకుండా సినిమాల వలన ఎలాంటి ప్రభావం ఉండదని చెబుతుంటారు. ఆ మధ్య ఒకాయన పోర్న్ సినిమాల ప్రభావం చూసేవారిపై ఏమీ పడదనీ పైగా  పోర్న్ ఫిలింస్ వలన స్త్రీలపై అత్యాచారాలు తగ్గినట్టు ఆధారాలున్నాయని అన్నారు. అంటే సినిమా ప్రభావం ఉన్నట్టే కదా అన్నాను. ఆయన దృష్టిలో ప్రభావం అంటే చెడు ప్రభావం మాత్రమే. మంచి ప్రభావం ఉన్నపుడు చెడుప్రభావం కూడా ఉంటుంది కదా.


కాశ్మీరీ ఫైల్స్, కేరళ స్టోరీ వంటి సినిమాలు ప్రాపగాండా సినిమాలు అన్న వారు వాటిని చూసిన జనాలు సినిమా థియేటర్లలోనే ఆవేశంతో రగిలిపోయినవారిని చూసినవారు ఇలాంటివి ఓట్లకోసం పాలకుల ప్రాపకం కోసం తీస్తుంటారనేవారు సైతం "అబ్బే సినిమాలు ప్రజలను వారి ఆలోచనలను అస్సలు ప్రభావితం చేయవు" అని అనడం చూస్తుంటాం. ఐతే ఈ డిబేట్ చాలా పురాతనమైనదే.  ఇపుడంటే సినిమాలు వచ్చాయి కాని ఒకప్పుడు నాటకాలు మనుషులపై ప్రభావాన్ని చూపేవి. 

మనం గ్రీకుల కాలంలో సాహిత్యాన్ని చూస్తే ముఖ్యంగా నాటకాల రూపంలో చాలా వీరోచితమైన గాధలు కనిపిస్తాయి. అక్కడ ఆ గాథలను రాసే రచయితను మనం గమనిస్తే అతడికి ఎలాంటి పరిమితులూ లేవు. ఊహకు పగ్గాలు లేవు. దేవుళ్ళు మనుషులతో మాట్లాడతారు. దేవదూతలు పాటలు పాడుతారు. నిజ జీవితంతో ఎలాంటి సంబంధం లేకుండా పాత్రల జీవితాల్ని ఊహాత్మకంగా చిత్రించడానికి వెసులుబాటు ఉండింది. అదేంటి నిజజీవితంలో ఇలా జరగదు కదా అని అడిగే విమర్శ కూడా ఏది లేదు. జీవితాతీత విమర్శాతీత భావనలను చాలా తీరికగా కథలుగా మలచేందుకు అనుగుణమైన స్థితి ఒకటి ఉండింది. ఐతే ఈ నాటకాలు ఆ పాత్రలు ప్రజల నిజజీవితంలో ఎలాంటి ప్రభావం చూపాయన్నది ఆసక్తికరమైన అంశం. ధైర్యాన్నీ వీరత్వాన్నీ పగనూ రాజ్యాధికారాన్నీ ఆదర్శాలుగా ఆ కథలు నిలపడంతో ఆ ప్రజలు వాటిని తమవిగా చేసుకున్నారు. గ్రీకులు చేసిన యుద్ధాలలో వారి సాహిత్యం లోని వీరోచిత గాథలలోని వీరుల శౌర్యప్రతాపాలు ప్రతిబింబించేవి. అంటే సాహిత్యం కళల యొక్క ప్రభావం వాటిని చూసి ఆనందించే ప్రజల మీద, వారి ఆదర్శాల మీద వారి విలువల మీద తప్పక ఉంటుంది. ఐతే ఆ సాహిత్యం లో నాటకాలలో చూపిన లార్జర్ దాన్ లైఫ్ పాత్రలతో తామే ఐడెంటిఫై కావలసిన అవసరం సాధారణ ప్రేక్షకుడికి లేనేలేదు. అతడికి ఈ పాత్రలన్నీ కల్పిత పాత్రలని స్పష్టంగా తెలుసు. కనుక ఆ పాత్రలకంటే ప్రభావం కంటే ఆ పాత్రల విలువల ఆదర్శాల ప్రభావమే ప్రేక్షకుడి మీద ఉంటుంది.


అలాగే "కరమజోవ్ సోదరులు" నవలలో డాస్టోయవస్కీ ఒక ఆసక్తికరమైన స్త్రీ గురించి వివరిస్తారు. ఆమె ఊహాలోకాల్లో విహరించే పాత తరానికి చెందిన అమ్మాయి అంటాడు. షేక్స్పియరు నాటకంలోని ఒఫీలియాతో తనను తాను పోల్చుకుంటూ తను కావాలనుకుంటే ఎంతో అలవొకగా పెళ్ళి చేసుకోతగిన ఒక వ్యక్తితో కూడా పెళ్ళి చేసుకోకుండా తానే లేనిపోనివి ఊహించుకుని పెళ్ళికి తానే అడ్డంకులు కలిగించుకుంటూ చివరికి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని వర్ణిస్తాడు. (Ophelia syndrome కి ఈ క్యారెక్టర్ కీ సంబంధం లేదు). అందుకే స్లావేకియన్ తత్వవేత్త జిజెక్ ఏమంటాడంటే - మనం ఫిక్షన్ ని తగినంత సీరియస్ గా తీసుకోవడం లేదని. Pervert's guide to cinema అనే డాక్యుమెంటరీలో ఆయన సినిమాలపై ఫ్రాయిడియన్ లాకానియన్ పద్దతులలో అద్భుతమైన విమర్శ చేస్తారు. నిజానికి ఫిక్షన్  నిజానికంటే నిజమైనదంటాడు జిజెక్. ఉదాహరణకు ఒఠ వీడియో గేంను ఆడేటపుడు ఆ ఆటలో వలె ఒక సాడిస్ట్ గా రేపిస్ట్ గా తన పర్సొనాని ఆ వ్యక్తి కలిగి ఉంటాడంటాడు. తనకు తాను చాలా బలహినమైన వ్యక్తిగనుక దాని స్థానంలో తాను చాలా బలమైన వ్యక్తిననీ, సెక్సువల్ గా శక్తివంతుడననీ ఒక సూడో ఇమేజ్ ని అతడు ఏర్పరుచుకుంటాడు. ఐతే ఇదే విషయాన్ని మనం ఇంకోరకంగా చదివితే బలమైన సాడిస్ట్ లేదా దారుణమైన రేపిస్ట్ అనేదే అతడి నిజమైన వ్యక్తిత్వం. కానీ సమాజం అలా ఉండటాన్ని ఒప్పుకోదు కనుక తనను తాను తగ్గించుకుని its just a game అనుకుంటూ ఆడుతుంటాడు. ఈ వర్చువల్ స్పేస్ లో తను స్వతంత్రంగా ఉండగలుగుతాడు. అక్కడ తనకు లభించే ఐడెంటిటీ అతడి true self కి దగ్గరగా ఉంటుంది అంటాడు. 


అంటే ఏమి? ఇది కేవలం సినిమానే, కేవలం ఫిక్షన్ మాత్రమే అనడం వలన అతడు సులువుగా అందులోని పాత్రలతో తాదాత్మ్యం చెందడం అతడి true self అనేదతడు గ్రహించవలసి ఉంటుంది ప్రస్తుత ఓటీటీల కాలంలో సెల్ఫోన్లను బాత్రూమ్ లలోకి కూడా తీసికెళ్ళి తమకు నచ్చినదానిని రహస్యంగా చూసుకునే  ఒక వాతావరణం ఏర్పడిన తర్వాత కూడా ఇది కేవలం ఫిక్షనే ఇది వ్యక్తి మీద ఎలాంటి ప్రభావమూ చూపదు అనేవాదనలో వ్యక్తి నిజ స్వరూపాన్ని కనబడనీయకుండా చేయడమే. వ్యక్తి స్వతహాగా క్రూరుడు. దుర్మార్గుడు. అవకాశవాది. రేపిస్ట్. దానిని ఒప్పుకోనంత వరకు సినిమా కేవలం ఫిక్షన్ లాగా అందులోని విపరీత పాత్రలు కేవలం పాత్రల్లాగా కనిపిస్తూ ఉంటారు. ఐతే    సినిమాలతో ఏదో విధంగా సంబంధం ఉన్న రచయితలు, కవులు సినిమాలు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపవని వాదించడం కనిపిస్తుంది.  సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయా చేయవా అనే దానికంటే సమాజం సినిమాను ప్రభావితం చేస్తుందాలేదా అనేది ముఖ్యమని గుర్తించాలి. ఏ విలువలనైతే ఒక సమాజం తనలో కాలానుగుణంగా ఇముడ్చుకుంటుందో మార్చుకుంటుందో అవే విలువలు సినిమాలలో పునరుద్ఘాటించబడతాయి. పునరుద్ధరించబడతాయి. ద్విగుణీకృతం చేయబడతాయి. సినిమా తీసేవారి భావజాలాలు కూడా సినిమాల్లోకి ప్రవహిస్తూ ఉంటాయి. పలానా డైరెక్టరంతా ఫక్తు బ్రాహ్మణ వాదాన్ని రుద్దాడు అనేవారు కూడా సినిమాలు ఎలాంటి ప్రభావం చూపవని వాదన చేస్తుంటారు.  సినిమా పెట్టుబడులు పెట్టేవారు భూస్వాములైతే ఆ సినిమాలలో ఫ్యూడల్ విలువలూ వ్యాపారులైతే వ్యాపారుల విలువలూ పూజారి వర్గం వారైతే బ్రాహ్మణ విలువలూ కనిపిస్తుంటాయనేది జగమెరిగిన సత్యం. దేశ కాలమానాలకు అనుగుణంగా సినిమాలు సాహిత్యమూ సాగుతుంటాయి. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి కథలు చదివితే తెలుగు ప్రాచీన సాహిత్యం మొత్తం చదివినట్టే అంటుంటారు విమర్శకులు. చార్లెస్ డికెన్స్ నవలల్లో అండర్ వర్ల్డ్ జీవితాన్ని తెలుసుకోవచ్చునంటారు. ఫ్రెంచ్ సాహిత్యం చదివి ఫ్రాన్స్ దేశ చరిత్రను తెలుసుకున్నాను అన్నాడు కారల్ మార్క్స్. అందుకే సాహిత్యం సమాజాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో సమాజం సాహిత్యాన్ని అంతే ప్రభావితం చేస్తుంది. సినిమాకు కూడా ఇది వర్తిస్తుంది. అందుకే సినిమా ద్వారా ప్రపంచ స్థితిగతులు అర్థం చేసుకోవచ్చంటాడు స్లావోజ్ జిజెక్..In order to understand today's world, we need cinema, literally.


అందుకే మోడెర్న్ సినీ కథకుడి స్థితిని మనం మొదట అంచనా వేయాలి. అతడు కేవలం తనకు తోచినది రాస్తూ పోతున్నాడనుకోవడానికి లేదు. గ్రీకు నాటక రచయిత వలె వీక్షకుడికి ఇదంతా వట్టి నటననే అనే స్పృహనేమీ అతడు కలిగించడం లేదు. పాత్రతో దేవతలో దేవదూతలో మాట్లాడటం లేదు. పాత్ర ధైర్యానికో వీరానికో ప్రతినిధి కాదు. పాత్రే నిజమైన మనిషివలె రియాలిటీని కప్పుకుని వచ్చినపుడు చుట్టూ ఉన్న జీవన పరిస్థితులు నిజజీవితాన్ని పోలినట్టు కనిపిస్తున్నపుడు  ఈ పాత్రలు నిజజీవితంలో నిజంగా ఉన్నాయేమో అనేలా పాత్ర చిత్రీకరణ ఉంటుంది.  కాబట్టి ఫిక్షన్షనేది నిజానికంటే ఎక్కువ నిజం. ఇది ఆ చూసే మనిషిలోన దాగిఉన్న realself కి ప్రతిరూపం. 

పైన చెప్పుకున్నట్లు దాదాపు ఒకేరకమైన భావజాలాలుగల సినిమాలు , ఏ సినిమాలైతే ఫిక్షన్ ని నిజమైన నిజంలా చూపిస్తున్నాయో, ఏ నిజమైన నాన్ ఫిక్షన్ సాహిత్యాన్ని అబద్ధమని చెబుతున్నాయో,ఏ హీరోనైతే గొప్పగా చూపుతున్నాయో, ఏ చరిత్రనైతే మన నమ్మకాలకు అనుగుణంగా మారుస్తున్నాయో అవి పదే పదే చూపినపుడు ఆ విలువలే సమాజానివిగా ప్రతిబింబిస్తాయి. ఆ విలువలనే సమాజాలలోకి ఇంకిస్తాయి. ఆ విలువలను జనరలైజ్ చేస్తాయి. ఉదాహరణకు మడికట్టుకోవడం బ్రాహ్మణ ఇళ్ళలోనే కన్పించేది అందరిళ్ళల్లో ఉంటుందనిపించవచ్చు..పిండం కాకిముట్టడం దేశమంతా ఉందనిపించవచ్చు, తెలంగాణ మొత్తం తాగుతారనిచవచ్చు, రాయరసీమవాళ్ళంతా కత్తులు బాంబులు పట్టుకుని తిరగుతుంటారనిపించవచ్చు. ఈ భావజాలాలు ఎన్నికలలో కూడా ఓట్లుగా మలచుకోవచ్చు. అందుకే సమాజంలో మోస్ట్ వల్నరబుల్ గ్రూపైన యువత ఈ సినిమాలకు వాటి విలువలకు ప్రధానమైన టార్గెట్. రాసే రచయిత స్వతహాగా నేరాలూ ఘోరాలు చూసి ఉండకపోవచ్చు ఏ అమెరికాలోనో కూర్చుని భారతదేశ పల్లెల గురించి రాయవచ్చు. ఇంకా ఆలోచన ఎదగని, జీవిత నిజ స్వరూపం ఏదో తెలియని పరిణతి చెందిన మనసులు కలిగిలేని యువతీ సినిమాలందించే భావజాలాలను ఏమాత్రం పట్టించుకోకుండా సాగిపోతుందనే ఒక వాదన అసలు నిలుస్తుందా?. 


విరించి విరివింటి 

10/1/24

Monday, 1 January 2024

ఆత్మహత్యలు. వ్యాసం. నవతెలంగాణాలో ప్రచురితం.

 ఆత్మహత్యయలపై ఒక అవగాహన.

ఇది తీవ్రమైన సమస్య అంటే ఎవరూ పట్టించుకోవడం లేదు అనిపిస్తుంది. ప్రభుత్వాలు మొద్దు నిద్ర పోతున్నాయి. సుసైడ్ నోట్ అని ఈ వ్యాసానికి నేను పేరు పెట్టుకున్నాను. సూసైడ్ నోట్ లో ఉండే అంశాలలో ఒక ప్యాటెర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ ఎలా వచ్చిందో చెప్పడానికి చేసిన ఒక అనాలిసిస్ ఈ వ్యాసం. 


ఈ ప్రపంచంలో ప్రతీ సంవత్సరం సగటున పదిలక్షల మంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. పరిష్కారంలేని సమస్యగా శతాబ్దాల తరబడి మానవుడిని ఇబ్బంది పెడుతున్నది.  W.H.O  2019 గణాంకాల ప్రకారం రష్యాలో 21.6శాతం మరణాలు ఆత్మహత్యలుకాగా అమెరికాలో 14.5 శాతంగా ఉంది. మనదేశం  ఆత్మహత్య లలో41 వ స్థానాన్ని తీసుకుంది. ఐతే మనదేశంలో  NCRB 2020 లెక్కల ప్రకారం  ఆత్మహత్యలు11.3 శాతానికి పెరిగితే 2021 వ సంవత్సరంలో అత్యధికంగా 12 శాతానికా చేరాయి. ఒక్క 2021 సంవత్సరంలోనే 1.64 లక్షలమంది ఆత్మహత్య చేసుకున్నట్లు NCRB గణాంకాలున్నాయి. ఇది ప్రతీ సంవత్సరం పెరుగుతూండటం ఆందోళన కలిగించే విషయం. అత్యవసరంగా పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టవలసిన విషయం. చరిత్ర తెలిసినప్పటినుండి ఇప్పటిదాకా ఆత్మహత్య లతో చనిపోయిన వారి సంఖ్య మొత్తం మానవుడు చేసిన యుద్ధాలలో చనిపోయినవారి సంఖ్యను దాటిపోయింది. అంటే ఇదెంత తీవ్రమైన సమస్యనో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా యువతలో మరణాలలో మొదటి ప్రధానకారణం first main reason for death ఆత్మహత్య. కాబట్టి రాబోయే తరాలను కాపాడుకోవడానికైనా ఇపుడన్నింటికంటే ఎక్కువగా మాట్లాడవలసిన సమస్యగా అర్థం చేసుకోవలసిన సమస్యగా మనముందు నిలిచింది. 


ఆత్మహత్య అనేది చాలా సంక్లిష్టమైనది విషయం. బహుముఖీనమైనది. జీవ రహాస్యాలను, ఖగోళ రహస్యాలనూ ఛేదించిన మనిషి  నేటికీ ఆత్మహత్యలకూ ఇదీ కారణం అని చెప్పలేకపోడం ఈ విషయంలో ఉన్న సంక్లిష్టతను తెలియజేస్తుంది. ఏదైనా ఒక కారణం వలన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అని నిర్ధారించేలోపే అందుకు పూర్తిగా వ్యతిరేక కారణాలతో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. ఒక మనిషి మొదటినుంచి డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక రుగ్మతతో సతమతమౌతున్నాడు అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనుకునేసరికి అసలు ఎలాంటి మానసిక రుగ్మతలు లేని వ్యక్తి ఆత్మహత్య చేసుకుని కనిపిస్తాడు. చాలా బీదరికంలో ఉన్నాడు కుటుంబ పోషణ భారాన్ని మోయలేక, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు అనుకునేలోపే తరాల తరబడి తిన్నా తరగని ఆస్తులు కల వ్యక్తి ఆత్మహత్య చేసుకుని కనిపిస్తాడు. వయోభారం మోయలేక జబ్బులబాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని అనుకునే లోపే ఏ జబ్బులు లేని యువకుడు ఆత్మహత్యకు బలౌతుంటాడు. ఎవ్వరితోనూ కలవక ఒంటరి జీవితం గడిపే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అనుకునేలోపే అందరితో కలివిడిగా ఉంటూ మనమధ్య తిరిగే వ్యక్తి శవమై కనిపిస్తాడు. సమాజం ఆధునికమయ్యేకొద్దీ ఆత్మహత్యలు పెరుగుతాయని ఫ్రెంచి సోషియాలజిస్టు Emile Durkheim చెప్పే లోపే, లేదు ఆదిమ సమాజాలలోనే ఆత్మహత్యలు విపరీతంగా ఉండేవి అంటాడు Zilboorg అనే మరో సోషియాలజిస్టు.


అంతేకాక ఆత్మహత్యల గురించి స్టడీ చేయడంలో ఎన్నో సైంటిఫిక్ , మోరల్/ఎథికల్ అడ్డంకులు కూడా ఎదురవుతాయి. ఆత్మహత్యలను నోటిఫై చేయగలం కానీ అందుకు పూర్వరంగమైన ఆ ఆలోచనలను (suicidal ideation) , విఫల ప్రయత్నాలను(failed suicide attempts) నోటిఫై చేయలేం. Unnoticed గా ఉండిపోతాయి. ఎంత మంది ఆత్మహత్య చేసుకున్నారో అంతకు పదిరెట్లమంది లేదా వందరెట్లమంది బహుశా ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుండవచ్చు. అందులో ఎంతోమంది విఫల ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. ఆత్మహత్య చేసుకున్న తర్వాత వారి బంధువుల ద్వారా లభించే సమాచారం సెకండరీ ఇన్ఫర్మేషనే తప్ప చనిపోయిన వ్యక్తి చెప్పే సమాచారం దొరకదు. లెటరు రాసిపెట్టి ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా అది ఆ వ్యక్తి మొత్తం పర్సనాలిటీని పట్టి ఇవ్వదు. క్షణికావేశంలో చేసేసుకున్నాడని అనుకుటుంటాం.  చనిపోతాననుకున్న వ్యక్తి ఇతడే అని మనం ముందుగానే పసిగట్టలేము. ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కనిపిస్తే ఆపే ప్రయత్నం చేస్తామే తప్ప అతడీ స్థితికి ఎందుకు వచ్చాడని అతడితో మాట్లాడుతూ ఇన్వెస్టిగేషన్ చేయలేము. ఆత్మహత్య నుండి బయటపడిన వ్యక్తిని మళ్ళీ గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడిగి అతడెందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడో దానిని రాబట్టలేం. 


ఐనా కానీ ఆత్మహత్యల విషయంలో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కొత్త అవగాహనలు పెరుగుతూనే ఉన్నాయి. ఆత్మహత్యల చుట్టూ పేరుకుని ఉన్న అపోహలు తొలగిపోతూ ఉన్నాయి. ఐతే సినిమా వంటి మాధ్యమాలు, మీడియా వాటినింకా ప్రాథమిక దశలోనే అర్థం చేసుకుని తప్పుగా చూపిస్తూ ఉంటాయి. ఆత్మహత్య చేసుకునేవారు స్వార్థపరులన్నట్టుగా డైలాగులు రాయడం కనిపిస్తుంది. ఇలాంటి తప్పుడు ఐడియా జనాలలోకి పోకూడదు. ఆత్మహత్యను స్వార్థమని అనడం వాళ్ళని స్వార్థపరులు అనడం stigmatize చేయడమే. దీనివలన అందాల్సిన సహాయం అందకపోగా విక్టిమ్ బ్లేమింగ్ మొదలౌతుంది. క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మీడియా రాసేస్తుంది. అపుడు కూడా విక్టిమ్ దే తప్పు, చదువుకున్నాడుగా ఆ మత్రం ఆలోచించలేడా వంటి అని అనడం మొదలౌతుంది. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించే వాడు ఎప్పుడూ చేసుకోడు అనడం. ఇది కూడా అపోహే. అలాగే సుసైడ్ చేసుకున్నాడు లేదా అటెంప్ట్ చేశాడు అంటే అతడు మానసిక రోగి అనడం. ఇదెంత అసంబద్ధమైనదో అంత భయంకరమైనది కూడా. డిప్రెషన్ లో ఉన్నాడనుకోవడం అందుకు కౌన్సెలింగ్ ఇప్పిస్తే ఆత్మహత్య ఆలోచనలు తగ్గిపోతాయనుకోవడం కనిపిస్తుంది. కానీ నిజానికి డిప్రెషన్ తో బాధపడేవారిలో suicidal ideation తప్పనిసరిగా ఉండాలని లేదు. డిప్రెషన్ ఉన్నవారిలో ఐదు శాతంకంటె తక్కువ మందిలోనే ఈ ఆలోచనలు ఉంటాయి. కానీ ఆత్మహత్యకు పాల్పడిన అందరిలో డిప్రెషన్ ఉంటుందనడం వలన లేదా మరేదో మానసిక జబ్బు ఉందని తలపోయడం వలన మనం సమస్యను తప్పుదారి పట్టించడమే ఔతుంది.  సూసైడ్ చేసుకుంటావా లేదా అలాంటి ఆలోచనలు వస్తుంటాయా?  అని ఒక కౌన్సిలర్ అడగడం వలన కూడా ఆ వ్యక్తి లో అలాంటి ఆలోచనలు మొదలవుతాయని మొగ్గతొడుగుతాయని మరో అపోహ. అందుకే అసలు అడగనే కూడదు. ఆ మాటనే మాట్లాడకుండా జాగ్రత్త పడాలనే ధోరణి ముఖ్యంగా తల్లిదండ్రులలో కనిపిస్తూ ఉంటుంది. కౌన్సెలింగ్ కి వెళితే అలాంటి ప్రశ్నలనడిగి మా పిల్లల్లో లేని ఆలోచనలను వారే తెప్పించారు అంటుంటారు. కానీ అడగడం వలననే వారిలో ఉన్న ఆలోచనలు తెలుస్తాయని మనం అవగాహన చేసుకోవాలి. ఆత్మహత్యలు వంశపారంపర్యంగా వస్తాయని వాటిని మనం ఆపలేమనే అపోహలు ఉంటాయి. ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలని ఒక వ్యక్తి డిసైడ్ అయ్యాక మనం ఏం చేసినా ఆపలేమని, వారింక ఎప్పటికీ సూసైడ్ చేసుకోవలనే చూస్తూ ఉండిపోతారనీ అపోహ పడుతుంటారు. ఒకరింట్లో ఎవరైనా ఆత్మహత్య చేసుకుని ఉండింటే ఆ ఇంటి వారితో సంబంధం కలుపుకోవడానికి కూడా వెనుకాడేవారు ఉంటారు ఇలాంటి అపోహలవలన. ఆత్మహత్య చాలా అరుదైన విషయమనీ పాజిటివ్ థింకింగ్ లేకపోవడంలలననే ఆలాంటి ఆలోచనలు వస్తుంటాయనీ మరో అపోహ. ఇలాంటి వారిని ఆనందంగా ఉండగలిగేలా చేసి, పాజిటివ్ దృక్పథంలోకి మార్చడంతో వారిలో ఇంక ఆత్మహత్య ఆలోచనలు రానేరావనీ అనుకుంటారు. తప్పుడు ఆలోచనలు చేయడం వలననే ఇవి వస్తున్నాయి కనుక ఈ ఆలోచనలు చేయడం ఆ వ్యక్తి తప్పిదమే అని ఆ వ్యక్తి పై మరింత ఒత్తిడి పెంచుతూ ఉంటారు. లేదా ఏదో ఆశించి తమ అభీష్టం నెరవేర్చుకునేందుకు ఇదొక నాటకంలా చేస్తున్నారని అంటారు. ఆ ఒక్క కారణం తప్న మరేమీ లేదని చనిపోవాలని ఏమీ అనుకోవడం లేదనీ వీరే తలపోసి వారిని తిడుతూ ఉంటారు. దో చిన్న బ్లేడుతోనో మరో ప్రమాదంలేని విధంగానో ఆత్మహత్య చేసుకున్నట.లు చేసి భయపెట్టాలని చూస్తున్నారనీ ఒకేసారి చనిపోయేంత ధైర్యం ఉంటే చచ్చి చూపాలనీ గేలి చేస్తూ ఉంటారు. చూడండి ఎంత దారుణమైన అపోహలతో మనం వారిని చూస్తుంటామో. ఈ సకల విధాల అపోహలూ మనుషులను వాస్తవానికి ఎంతగా దూరంగా జరిపేస్తాయో గమనించండి. ఇవి అసలు సమయంలో మనలను సరైన పద్ధతిలో ఆలోచింపనీయవు. సరైన చర్యలను తీసుకోనీయవు. 


రోజూ మన చుట్టూ ఉండే వ్యక్తులే ఆత్మహత్యకు పాల్పడతారు. కానీ గుర్తించడం ఎలా?  ఎవరు ఎపుడు ఆత్మహత్యకు పాల్పడతారో మనం చెప్పలేం కాబట్టి మారుతున్న సామాజిక మానసిక పరిస్థితులపై నిరంతరావగాహన పెంచుకునే దిశగా పనిచేయాలి. సైకాలజిస్టులు సైకియాట్రిస్టులు సోషియాలజిస్టుల నడుమ exchange of information ఉండాలి. వాటిపై డిస్కస్ చేసుకోవడానికి వేదికలు ఏర్పడాలి. ముఖ్యంగా వ్యక్తిగత పర్సనాలిటీకి ఎంత ప్రాముఖ్యత ఉందో అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత మన సమాజ పోకడలకు నమ్మకాలకు జీవన పరిస్థితులమార్పునకు ప్రాముఖ్యత ఉంటుందని గుర్తెరగాలి. అంటే ఆత్మహత్యలను అర్థం చేసుకోవడంలో వాటిని నివారించడంలో సైకాలజిస్టులకు సైకియాట్రిస్టులకు ఎంతటి పాత్ర ఉంటుందో సోషియాలజిస్టు లకు అంతకుమించిన పాత్ర ఉంటుందనే అవగాహన మనకు పెరగాలి. ఫ్రెంచ్ సోషియాలజిస్టు ఎమిలీ డుర్కిం చేసిన పరిశోధనలు మనలని ఆత్మహత్యలలోని సామాజిక కోణాన్ని కొత్తగా చూడగలిగే శక్తిని ఇస్తాయి. ఆయన పరిశోధనలన్నీ 1897లోనే ఫ్రెంచిలో పబ్లిష్ అయి ప్రపంచాన్ని ఆలోచింపజేసింది. నేటికీ డుర్కిం పరిశోధన ఆత్మహత్యలకు సంబంధించిన గొప్ప పరిశోధనగా పరిగణించబడుతోన్నది. ఆ తర్వాత వివిధ పరిశోధనల ఆధారంగా ఈరోజు మనం ఆత్మహత్యల గురించిన అవగాహన పెంచుకుంటున్నప్పటికీ పైన చెప్పిన సైంటిఫిక్ ఎథికల్ కారణాలవలన ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నామని చెప్పక తప్పదు. ఫ్రెంచ్ లో ముద్రణ పొందిన తరువాత యాభై యేళ్ళకుగానీ డుర్కిం రచనలు ఇంగ్లీషులో లభ్యం కాలేదు. కానీ నూటా ఇరవైయేళ్ళ తరువాత కూడా ఆత్మహత్యలకు సంబంధించిన ఈ అవగాహనలు తెలుగు సమాజానికి అందకపోవడం కూడా కడు శోచనీయం. అందకపోవడమే కాక జ్ఞాన విస్తరణకు అవగాహనకు సరైన వేదికలు లేకపోవడం లేదా వేదికలను మనం ఏర్పాటు చేసుకోలేకపోవడం మన వెనుకబాటు తనాన్ని తెలియజేస్తుంది.


సూసైడ్ అనేది వ్యక్తిగతమైన అంశం కావొచ్చు కానీ సుసైడ రేట్ మాత్రం సూసైడ్ కి విభిన్నమైన సామాజిక అంశం అంటాడు డుర్కైం. ఒక సమాజంలో జరిగే ఆత్మహత్యల ఎక్కువ తక్కువలకు ఆ సమాజంలో జరిగే అంశాలతో అవినాభావ సంబంధం ఉంటుంది. ఈ సామాజిక అంశాలను అర్థం చేసుకోలేనంత వరకు వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే వ్యక్తిగత కారణాలను కనుక్కోలేము. డుర్కైం దృష్టిలో సమాజమే అసలు కారణం. సమాజం వ్యక్తులయొక్క భావోద్వేగాలను వారి ప్రవర్తనలను తన అదుపాజ్ఞలలో ఉంచుకుంటుంది. దీనినే ఆయన Anomy అంటాడు.  ఉదాహరణకు మనం అందరం అనుకుంటాం ఒకవ్యక్తి కటిక పేదరికంలో ఉన్నపుడు ఆ క్షుద్బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు అనుకుంటాం. కానీ డుర్కీం పరిశోధనలో ఇది తప్పని తేలింది. పేదరికం ఆత్మహత్యలను కలుగజేయదు. ఒక రకంగా ఇది ఆత్మహత్యలనుండి రక్షిస్తుందని చెబుతాడు. దీనికి విరుద్ధంగా ఏ సమాజం ఐతే చాలా వేగంగా ఆర్థిక లేదా పారిశ్రామిక ప్రగతిని సాధిస్తుందో, లేదా ఏ సమాజంలో ఐతే ఆర్థిక ప్రగతి కొత్త పుంతలు తొక్కుతూ నడుస్తుంటుందో ఆ సమాజంలో ఆత్మహత్యలు పెరుగుతాయి. ఈ వేగంగా అభివృద్ధి చెందే సమాజం తనదైన కొత్త భావోద్వేగాలనూ కొత్తరకం ప్రవర్తనలనూ వ్యక్తులలో ప్రవేశపెట్టి వాటిని తన అదుపాజ్ఞలలో ఉంచుకుంటుంది. అందుకే ఇపుడున్న ఆధునిక సమాజపు నిత్య కృత్యం ఈ Anomy. ఉదాహరణకు విద్యార్థులలో పెరుగుతున్న ఆత్మహత్యలను Anomy తో ఎలా అర్థం చేసుకోగలమో చూద్దాం. విద్య కార్పోరేటైజేషన్ జరిగి వేగంగా అభివృద్ధి చెందుతున్న మన సమాజంలో వచ్చిన మార్పులనే చూసుకుంటే మంచి మార్కులు , మంచి ర్యాంకులు రావడం అనే కొత్త భావోద్వేగం అందరిలోకీ ప్రవేశపెట్టబడింది. విద్యార్థులు తల్లిదండ్రులు బంధు మిత్రులు టీచర్లు అందరూ కూడా మంచి మార్కులు  మంచి ర్యాంకులు అనే అంశం చుట్టే తమ భావోద్వేగాలను కలిగి ఉంటారు. ఒక సంవత్సరం లో జాయిన్ ఐన పిల్లలను కూర్చోబెట్టుకుని పోయిన సంవత్సరం టాప్ పదిమంది విద్యార్థుల  పేర్లు చెప్పమంటే చెప్పలేరు. అంటే పోయిన సంవత్సరం టాపర్స్ ని ఈసంవత్సరం గుర్తుపెట్టుకోలేం అలాగే పది సంవత్సరాల ముందరి టాపర్స్ని అసలు ఎవరూ గుర్తుపెట్టుకోలేరు ఇది ఒక ఆబ్జెక్టివ్ ట్రూత్. కానీ ఈ సంవత్సరం జాయిన్ ఐన అందరికీ టాప్ ర్యాంక్  రావాలి అనే కొత్త భావోద్వేగం సృష్టించబడటం సొసైటల్ ట్రూత్. ఇపుడు డుర్కైం ఏమంటాడంటే విద్యార్థి ఆబ్జెక్టివ్ ట్రూత్ లో జీవించడం మానేసి సొసైటల్ ట్రూత్ లో జీవించడం మొదలెడతాడు. ఈ సమాజం అతడిని ఆబ్జెక్టివ్ ట్రూత్ నుండి బలవంతంగా సొసైటల్ ట్రూత్ లోకి నెట్టివేస్తుంది అని. ఈ సోషల్ ట్రూత్ లో విద్యార్థి టాప్ ర్యాంకు సాధించడం చాలా చాలా ముఖ్యమైన ఏకైక విషయంగా మారుతుంది. ఒక విద్యార్థి కష్టపడి చదువుతూ కాలేజీ లెవెల్ వరకు మంచి మార్కులతో పాసవడమే కాకుండా  డిగ్రీ లేదా పీజీ వరకు చదవగలగడం వాళ్ళ కుటుంబం లోనే మొదటి సారి అనుకుందాం. ఇది ఆబ్జెక్టివ్ ట్రూత్. కానీ అతడు ఒక మంచి ర్యాంకు స్టూడెంట్ గా మారకపోవడం సోషల్ గా అపజయంగా గుర్తించబడుతుంది. డిగ్రీ చేయడం పీజీ చేయడం అనే అతడి ఆబ్జెక్టివ్ లక్ష్యం ఇపుడు టాప్ ర్యాంకు సాధించడం అనే దానికి మార్చబడింది. ఉన్న కొన్ని సీట్లకు లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఉన్నా అందరిలక్ష్యం టాప్ ర్యాకు సాధించడమేగా మారిపోతుంది. అంటే ఆధునిక సామాజిక చట్రం ప్రతి  విజయాన్ని నిర్వచిస్తుంది. బేరీజు చేస్తుంది. ఏది సరైనది, ఏది కాదనేది సమాజమే చెబుతుంది. లక్ష్యాలను నిర్దేశిస్తుంది. మనం సరైన పని చేశామా లేదా అన్నది సమాజమే చెబుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా లక్ష్యాలకు ఎలాంటి సరిహద్దులు లేవని చెబుతుంది. ఎపుడైతే సరిహద్దులు లేవో ఈ విన్నింగ్ గేమ్ కి అడ్డూ అదుపు లేకుండా పోతుంది. మనం సినిమా సెలబ్రిటీలను చూసి ఉంటాం. వారికి డబ్బులో కానీ అభిమానంలో కానీ ఎలాంటి కొదువా ఉండదు. కానీ వారు చేరుకోవాలనుకున్న లక్ష్యాలకు సరిహద్దులు చెరిపివేయ బడ్డాక ఆ లక్ష్యం ఎప్పటికీ అందలేనంత దూరానికి చేరిపోతూనే ఉంటుంది. అందుకోలేని లక్ష్యాన్ని తట్టుకోలేక వీళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఒకరకంగా సమాజంలో ప్రివిలేజ్డ్ సెక్షన్ లవాళ్ళ జీవన విధానమే ఆదర్శవంతమైన జీవనవిధానంగా నిర్వచించబడుతుంది. ఆ ఆదర్శాలను అందుకోలేకపోవడం ఫెయిల్యుర్ గా చెప్పడడుతుంది. ప్రజలతో ఇదే నమ్మించబడుతుంది. ఒక విద్యార్థికి  నూటికి తొంభై ఐదు మార్కులు వచ్చి ఉంటాయి. ఆ విద్యార్థి వ్యక్తిగత విజయంగా కనుక దానిని తీసుకుంటే అతడు వచ్చిన సోషల్ బ్యాక్ గ్రౌండ్ కి అది చాలా పెద్ద విజయమై ఉండాలి. కానీ నూటికి నూరు మార్కులనే లక్ష్యం అతడికి ఈ కార్పోరేట్ సమాజం లక్ష్యంగా పెడుతుంది. విద్యార్థిగా అతడు వచ్చిన దూరాన్ని మరిచి వాళ్ళ తల్లిదండ్రులే ఎందుకు ఐదుమార్కులు తగ్గాయని గట్టిగా అడగడం మొదలు పెడతారు. బంధువుల అమ్మాయికి తొంభై ఏడొచ్చాయి నీకు రెండు మార్కుల తగ్గాయి నా తల ఎక్కడ పెట్టుకోవాలని తండ్రి ఆక్రోశిస్తాడు. ఫేస్బుక్ లో తోటి తల్లులు మా కొడుకుకి నూటికి నూరొచ్చాయని గర్వంగా పోస్ట్ పెడితే నీకు నూటికి తొంభై ఐదే వచ్చినందుకు పోస్ట్ చేయలేకపోయానని తల్లి కన్నీరు పెట్టుకుంటుంది. ఈ విద్యార్థి తన ఆబ్జెక్టివ్ ట్రూత్ నుండి సోషల్ ట్రూత్ కి నెట్టివేయబడ్డాడు. ఆ సోషల్ ట్రూత్లో ఇతడొక అపజయంపోందిన వాడు. సొసైటీ ఏర్పరచిన ఒక ఇమేజ్ (social image)/ social perfectionism లోకి తాను ఇంకా చేరలేకపోయాడు. ఇక తాళలేక చనిపోతాడు. ఇది Anomical suicide.


ఐతే ఇలా ఉన్న విద్యార్థులు/మనుషులు అందరూ ఆత్మహత్యలు చేసుకుంటారా?. చేసుకోకపోవచ్చు కానీ మొదట Anomy అనే పూర్వ రంగం సిద్ధమై ఉంటుంది. పైన చెప్పిన ఉదాహరణలోని విద్యార్థి ఆత్మహత్య చేసుకోవాలంటే Anomy అనే పూర్వరంగం మొదటి అంశమనుకుంటే  దీనితోపాటు మరో మూడు అంశాలు జతకూరుతాయి. 


1. సొంతమనుకునే వారు లేకపోవడం(Thwarted belonigingness). రెసిడెన్షియల్ కాలేజీలలో ఒంటరిగా ఉండిపోవడం. రక్త సంబంధికులకు దూరంగా ఉండటం వలన తాము ఒంటరివారిమనే భావన పెరిగిపోతుంది. దీనికి తగ్గ సంరక్షణ ఇచ్చేవారు కొరవడటం. అందరూ ఒంటరిగానే ఉన్నారుగా నీకేం రోగమొచ్చిందని తనవారే అనడం. చదువుకోవడం ఇంపార్టెంట్ ర్యాంకు రావడం ఇంపార్టెంట్ అంతేకానీ ఇవన్నీ పట్టించుకోనవసరం లేదని చెప్పినంత మాత్రాన ఒంటరితనం దూరమౌతుందా?. 


2. నేను భూమికి భారమనుకునే భావన.(perceived burdwnsomeness) తన ఉనికి తమ తల్లిదండ్రులకు భారమౌతుందనుకోవడం. తను బతికి ఉండటం తమ తల్లిదండ్రుల సామాజిక ఎదుగుదలకు ఆటంకం ఏర్పడుతుందనుకోవడం. వేరే విద్యార్థులు ర్యాంకులు,బంధువుల పిల్లలు ర్యాంకులు కొడుతుంటే తన అశక్తత తనవారికి తలవంపులు తెస్తుందనే భావన. 


3. తెగింపు.(Aquired dareness) కొందరిలో తమ శరీరానికి దెబ్బతగిలినా నొప్పి ఏమి కాదనే స్థితి ఉంటుంది. ఐతే సూసైడల్ ఆలోచనలు పెరిగేకొద్దీ నొప్పి తాలూకు భయాలు మెల్లిగా సన్నగిల్లడం మొదలౌతుంది్ చిన్న బ్లేడుతో కోసుకుని చూసినప్పుడు నొప్పి భరించగలిగే లాగే ఉందే అనే ఎరుక కలుగుతుంది. తెగింపు వస్తుంది. కొన్ని సెకన్లు ఓపిక పట్టడం అంతేకదా అనే మొండి ధైర్యం వస్తుంది. చిన్న దెబ్బ తగిలితేనే విలవిలలాడిపోయేవాడు అంత పెద్ద బిల్డింగ్ నుండి ఎలా దూకాడో అని అంటుండటం చూస్తుంటాం. దానికి కారణం మెల్లిగా నొప్పి సంబంధింత సంవేదనాశీలత తగ్గిపోవడమే. ఎపుడైతే నొప్పిని తట్టుకునే శక్తి (increaswd pain tolerance) కొత్తగా అలవడుతుందో మరణం పట్ల నిర్లక్ష్యం (carelessness on death)  పెరగడం మొదలౌతుంది. 


Anomy పూర్వ రంగమూ, పైన చెప్పిన మొదటి రెండు అంశాలు కూడా కలిసి  suicide ideation ని కలిగిస్తాయి. తెగింపనే మూడో అంశం జతైనపుడు మాత్రమే suicide attempt మొదలుకావొచ్చు. అది పరిపక్వమైనపుడు పూర్తిస్థాయి ఆత్మహత్య గా మారవచ్చు. పై  ఉదాహరణ విద్యార్థులను తీసుకుని చెప్పినా ఇది అందరికీ దాదాపు ఇలాగే సాగే common pathway గా ఉండే అవకాశం ఉంది. మనం సూసైడ్ నోట్లను పరిశీలిస్తే తమ ఒంటరితనాన్నీ నిస్సహాయతనూ తట్టుకోలేకున్నామనీ అలాగే తాము ఇతరులకు భారమైనామనీ తమ తల్లిదండ్రుల  expectaions (social truth ) ని అందుకోలేక పోతున్నామనీ తమను క్షమించమనీ రాసి ఉండటం గమనిస్తాం.


మనం గణాంకాలను పరిశీలిస్తే ఆడవాళ్ళకంటే మగవాళ్ళలో ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతుంటాయి. ఐతే కారణం పైన చెప్పినదే. మగవాళ్ళ అవసరాలు సోషల్ అవసరాలు. ఆడవాళ్లవి వ్యక్తిగత అవసరాలు. మగవాళ్ళు సోషల్ ట్రూత్ లో ఎక్కువగా జీవించవలసిన అవసరం ఉంటుంది. ఒకరకంగా ప్రతీ సమాజం ఆధునీకరింపబడుతూ గ్లోబలైజేషన్ కారణంగా వేగంగా సామాజిక మార్పులను సంతరించుకుంటున్న తరుణంలో ఆత్మహత్యలు కూడా , హత్యల వలనే సర్వ సాధారణంగా మారుతాయేమో సమాజంలో ఒక భాగమైపోతాయేమో అనిపించకమానదు. ఆత్మహత్యలు జరగని దేశమంటూ భూమి మీద లేదు. అంటే ఇదొక నిశ్శబ్ద పాండెమిక్ గా వ్యాపించడం మొదలైంది. చరిత్రను పరిశీలిస్తే ఆత్మహత్యలు కూడా పాండెమిక్ లవలె wave లుగా వొచ్చి పోతున్నట్టు కనబడుతుంది. ఎపుడెపుడు సామాజికాభివృద్ధి వేగవంతమైందో అప్పుడు ఆత్మహత్యలు పెరగడం గమనించవచ్చు. యూరోప్ లో రెనిసా సమయంలో ఆత్మహత్యలు పెరగడం మనకు ఒక ఉదాహరణ. ఐతే మళ్ళీ గత కొన్ని దశాబ్దాలుగా సూసైడ్ రేట్ పెరగడం కనిపిస్తుంది. ఇది గ్లోబలైజేషన్ ఎఫెక్ట్. ఈ వేవ్ తగ్గాలంటే సామాజిక మార్పుల వేగాన్ని తగ్గించాలి. ఇది చేయలేం కాబట్టి ఆత్మహత్యలతో సహజీవనం తప్పదు. అందుకే నివారణల చర్యలపై మన దృష్టిని సారించకతప్పదు.


డేవిడ్ ఫిలిప్ అనే సోషియాలజిస్టు 1940 నుండి 1970 వరకు గల న్యూస్ పేపర్లను పరిశీలించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటకు తీశాడు. మార్లిన్ మన్రో ఆత్మహత్య చేసుకున్న తర్వాత దేశంలో 12 % ఆత్మహత్యలు పెరగాయియని అతడు గమనించాడు. ఎపుడెపుడైతే ప్రముఖుల ఆత్మహత్యలు న్యూస్ పేపర్ల హెడింగ్ లలో కనిపించాయో ఆ తర్వాత నెలల్లో దాదాపు అదే విధంగా ఇతరుల ఆత్మహత్యల వార్తలు పెరగడం గమనించారు. డేవిడ్ ఫిలిప్ అంతటితో ఆగలేదు. ఈ ఆత్మహత్యలకూ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లకూ కూడా లింక్ ఉందని గమనించాడు. ఎవరైనా ఒక ప్రముఖుడు ఆత్మహత్య చేసుకోవడాన్ని పేపర్ల హెడ్ లైన్ లలో వేసినప్పుడల్లా self car crash కేసులు పెరగడం గమనించారు. సెల్ఫ్ కార్ క్రాష్ కేసులన్నీ దాదాపు ఆత్మహత్యలే. అంతే కాకుండా ప్రముఖుల హత్యలు జరిగినపుడు కార్ యాక్సిడెంట్లు పెరగడం గమనించారు. అంటే కార్ యాక్సిడెంట్ చేయడం కూడా ఒకరకమైన హత్యాయత్నమే. ఇవన్నీ నిరూపిస్తున్నది ఒకటే -  వార్త అనేది కేవలం విషయాన్ని మాత్రమే తెలపడం లేదు అది  వల్నరబుల్ సబ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఒక మెసేజ్ ని చాలా శక్తివంతంగా కమ్యూనికేట్ చేస్తున్నది. కాబట్టి వార్తను వ్యాప్తి చేయాలనుకునే వారు దేనిని చేయాలి దేనిని చేయకూడదు అనే విజ్ఞతతో తో ఉండాలి. అంటే ఆత్మహత్యలు పెరగడంలో పెరుగుతున్న సమాచార విప్లవం దానిపై అడ్డూ అదుపూ లేకపోవడం కూడా కారణాలుగా కనబడుతున్నాయి.


అందుకే హత్యలు ఆత్మహత్యలు సాధారణంగా ఒక క్లస్టర్ గా ఒకే గ్రూపులో దాదాపు ఒకే రకంగా ఒక సబ్ కల్చర్ లాగా జరుగుతూ ఉంటాయి. ఒక ప్రేమోన్మాది యాసిడ్ దాడి చేసాడంటే వెనువెంటనే అటువంటి వాటిని వరుసగా చూస్తుంటాం. ఒక అమ్మాయి గ్యాంగ్ రేప్ కి గురైందంటే వెనువెంటనే అటువంటి కేసులే మరికొన్నింటిని చూస్తుంటాం. అలాగే ఒక బిజినెస్ మ్యాన్ ఒక హోటల్ రూంలో ఆత్మహత్య చేసుకున్నాడంటే వెనువెంటనే మరో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అలాంటి బిజినెస్ మనుషులే అదే విధంగా హోటల్ రూంలలో ఆత్మహత్య చేసుకోవడం చూస్తుంటాం. సినిమా హీరోలూ హీరోయిన్ల ఆత్మహత్యలు దాదాపు ఒకేరకంగా ఉండటం గమనిస్తాం. కాలేజీ స్టూడెంట్లు బిల్డింగుల మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారని తరచూ వింటుంటాం. విఫల ప్రేమికులు నదిలోకి దూకడాలు కూడా మనం చూసి ఉంటాం.  రైతుల ఆత్మహత్యలు దాదాపు పోతపోసినట్టుగా ఒకేరకంగా పురుగుల మందు తాగడం వలనజరుగడం ఎన్నో సార్లు చూసి ఉండింటాం. అంటే ఇవన్నీ ఒక ప్యాటర్న్ ని ఎందుకు కలిగి ఉన్నాయి?. సినిమా హీరోలు , ప్రేమికులు రైతులు ఇలా ఒక్కోక్కరు ఒక్కో సబ్ కల్చర్ అనుకుంటే వారి ఆత్మహత్యలు దాదాపు ఒకే రకమైన సబ్ కల్చర్ లో జరుగుతుంటాయి. అవి కూడా ఒకటి జరిగిన వెంటనే దాని గురించి మనం పేపర్లలో టీవీల్లో చూసేలోపు అటువంటివే మరికొన్ని దర్శనం ఇస్తుంటుంది?. క్లస్టర్ లాగా ఒకేచోట గుమికూడినట్లు  కనిపిస్తుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది?.

దీనినే పవర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ పవర్ ఆఫ్ ఇమిటేషన్ అంటాం. యాసిడ్ దాడి చేసే వాడు కేవలం యాసిడ్ మాత్రమే పోయడం లేదు. ఈ విధంగా యాసిడ్ పోయవచ్చు అని వాడిలాంటి ఇతర ప్రేమోన్మాదులకు కమ్యూనికేట్ చేస్తున్నాడు. గ్యాంగ్ రేప్ చేసేవారు రేప్ మాత్రమే చేయట్లేదు ఇలా చేయవచ్చు అని కమ్యూనికేట్ చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న బిజినెస్ మ్యాన్ ఆత్మహత్య చేసుకోవడమే కాక అచ్చం తనలాంటి స్థితిలో ఉన్న ఇతర వ్యాపారస్థులకు ఇదే పరిష్కారం అని కమ్యూనికేట్ చేస్తున్నాడు. పురుగులమందు తాగి చనిపోయిన రైతు ఇక వేరే మార్గంలేదని తోటి రైతులతో కమ్యూనికేట్ చేస్తున్నాడు. అంటే ఒక ఆత్మహత్య అచ్చం అలాంటి కండీషన్లోనే ఉండే ఇతరులకు, సులువుగా ప్రభావితం కాగలిగినటువంటి వారికి ( susceptible people)కి కమ్యూనికేట్ అయిందంటే ఆ ఇతరులు కూడా దానిని ఇమిటేట్ చేసే అవకాశాన్ని పెంచేస్తుంది. Imitation is a kind of self permission. ఇతరులు నడిచిన బాటలో నడవడం సులభం. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా ఏం చేస్తున్నాయంటే ఈ కమ్యూనికేషన్ ని చాలా సులభంగా చాలా ఎక్కువ మందికి చాలా తక్కువ సమయంలో అందజేస్తున్నాయి. 


నిజంగా ఆత్మహత్యలను ఆపాలనుకునే suicide sensitive సమాజాన్ని తయిరు చేయాలనుకుంటే ప్రజలలో చైతన్యం పలువిధాలుగా తీసుకుని రాగలగడం ఒక్కటే మార్గం. WHO ప్రకారం ప్రతీ మిలియన్ జనాభాకి 60 సైకియాట్రిస్టుల అవసరం ఉంటే మనదేశంలో ముగ్గురు మాత్రమే ఉన్నారనే ఈ ఒక్క వాస్తవం మనదేశం మానసిక పునరుత్తేజానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో చెబుతోంది. అంతేకాక మన సమాజం ఆత్మహత్య అనేది సామాజిక మూలాలున్న వ్యక్తిగత అంశమనే విషయంగా గుర్తించడానికి దానిచుట్టూ అనేక అపోహలూ ఉండిపోవడం అడ్డంకి. కాబట్టి సోషియాలజిస్టుల పాత్ర పెరగవలసి ఉన్నది. ముఖ్యంగా రాబోయే సామాజిక ఆర్థిక కుదుపుల సమయాలను సోషియాలజిస్టులు  ముందుగానే గుర్తించి సైకాలజిస్టులకు సమాచారం ఈయగలిగితే పెరగనున్న ఆత్మహత్యలను ఆపేందుకు ఒక అవకాశం కలుగుతుంది. స్టూడెంట్స్ ఆత్మహత్యల విషయంలో మనదేశం ప్రథమస్థానంలో ఉన్న సందర్భంలో సమాజంలోని వివిధ నిపుణుల మధ్యన సహకారం తప్ననిసరి కావలసిన తరుణం ఆసన్నమైంది. మీడియా పాత్ర కేవలం ఇబ్బడిముబ్బడిగా ఆత్మహత్య విషయాలను పాపులర్ వైరల్ చేయదగిన అంశాలలాగా పరిగణించకుండా ప్రజలలో చైతన్యం తీసుకువచ్చే దిశగా ఉండకపోతే రాబోయే విపత్తును మనం సంపూర్ణంగా ఎదుర్కోలేం.


విరించి విరివింటి

Literature of 30 seconds. Essay

 Literature of 30 seconds.

A long essay on short messages.


అర్థమయ్యేలా రాయగలగడం ఒక డెమొక్రటిక్ విధానం. అర్థంకాకుండా రాయాలనుకోవడం అనేది పండిత ప్రకర్షలోంచి, ఎక్కువ తక్కువల్లోంచి వచ్చే ఒక ఆధిపత్య భావన. ఒక విషయం అర్థం కావాలంటే దానికి సరైన కంటెంట్ ఉండాలి. దానికి హేతుబద్ధమైన వివరణ ఉండాలి. అర్థమైనపుడే ప్రజలకు ఆ విషయం పట్ల అవగాహన పెరుగుతుంది. అర్థం కావడం ప్రజాస్వామిక అవసరం. అర్థం చేయించడం విద్య యెక్క ప్రధాన లక్ష్యం. ఐతే రాను రానూ ప్రభుత్వాలు, ప్రజలు దీనిని మరచిపోయారు. ఎక్కడైతే ప్రజలలో విషయావగాహన పెరగదో హేతుబద్ధత పెరగదో అక్కడ నిజమైన ప్రజాస్వామ్యం ఉండే అవకాశం లేదు. ప్రజలను మూఢులుగా తాము చెప్పినదానిని మరోమాట లేకుండా ఒప్పుకునేలా చేయగలగడం అధికార కాంక్షకు సామాజిక సింబాలిజమ్.


ఎక్కడైతే ఆలోచనలకు బదులు భావోద్వేగాలు ప్రజల మైండ్ (PUBLIC MIND) లోకి చొప్పించబడతాయో అక్కడ ప్రజాస్వామ్యం ఉండటం నిలవడం కష్టమౌతుంది. ప్రాపగాండా అనేది ఆలోచనలను లేకుండా చేయడం వలన సులువుగా సాగుతుంది. కాబట్టి ఇపుడు ప్రజలను ఆలోచన రహితులుగా చేయడమెలా అనేదే ప్రధానమైన సాహిత్యం. ఇదే "ముప్పై సెకనుల సాహిత్యం" లా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రాజ్యమేలుతున్నది. ఇపుడు రాజకీయ నాయకులను చూస్తే వారు నిజమైన ప్రజల పక్షపాతులుగా ప్రజా సమస్యలను తీర్చే నిఖార్సైన పనిమంతులుగా కనిపించరు.  వాళ్ళు ప్రాపగాండా ఆర్టిస్టులుగా కనిపిస్తారు. ప్రజలు ఏది నమ్మాలి ఏది ఇష్టపడాలి అని అతడు అనుకుంటాడో దానిని ప్రాపగాండా చేసే ఆర్టిస్టుగా అతడు ఉంటాడు. అందుకోసమే ఆలోచన కలిగించే సాహిత్యాన్ని తమకు అనుకూలంగా పెద్దగా ఆలోచించనవసరం లేకుండగా మలచుకోవడమే ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ నాయకులు సాధించగలిగిన ఘన విజయం. 


ట్విట్టర్ లు షార్ట్ వీడియోలు ఇతర సోషల్ మీడియాలలో కనబడే చిన్నపాటి రైటప్ లు ప్రజలు ఇచ్చే కామెంట్స్ అన్నీ మూడునాలుగు ముక్కల్లో ఉండాలనే నియమానికి మనమంతా ట్యూన్ చేయబడ్డాం. ఇదే మనలని ఆలోచనా రహితులుగా చేయగలిగేటటువంటి అతి పెద్ద కుట్ర. దీనివలన ఏమౌతుందంటే ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ (ప్రాపగాండాలో భాగంగా) ఫీడ్ చేయబడుతుందో అదే విషయాన్ని అతడు నమ్మడం జరుగుతుంది. నీవు ఒక ఆలోచన చేస్తున్నావంటే ఒక అభిప్రాయానికి వచ్చావంటే ఆ ఆలోచనకు నీవు రావడానికి లేదా ఆ అభాప్రాయానికి నీవు రావడానికి నీకంటూ సొంత హేతుబద్ధత ఉండనవసరం లేదిపుడు. ఎవరో చెప్పారు కనుక నీవు నమ్మితే చాలు. పలానా రంగు గల కూరగాయలు పలానా మతానికి సంబంధించినది అని ఫీడ్ చేస్తే ఔను నిజమే అని నమ్మేంత దారుణ స్థితికి ప్రజలు పడిపోతారు. హీరో వేసుకున్న లోదుస్తుల కలర్ మా మతానికి చెందినది అంటే మా మతాన్ని కావాలని అవమానిస్తున్నారని రాస్తే నిజమేనని నమ్మి ఉద్యమాలు చేసే వారొచ్చేశారు. వీరందరికీ ఆలోచనా సామర్థ్యాలు ఎందుకు పోయుంటాయి?. ఏ మార్పు వీరినాలా చేసింది. సమాధానం ఒకటే షార్ట్ మెసేజింగ్. ముప్ప సెకనుల సాహిత్యం. ఒక గేమ్ లో ఇండియా టీం గెలుస్తుందా ఆస్ట్రేలియా టీం గెలిస్తుందా అని అడిగితే బాగా ఆడే టీం గెలుస్తుంది అని చెప్పాలంటే కొంత హేతుబద్ధతతో కూడిన ఆలోచన అవసరం. లేదు ఇండియా టీమే గెలుస్తుంది అని చెప్పాడనుకోండి. ఎందుకు అని అడిగితే ఇది "నా గట్ ఫీలింగ్" అంటాడు. ఆలోచనల స్థానంలో గట్ ఫీలింగ్ లు వచ్చి కూర్చున్నాయి. ఈ గట్ ఫీలింగ్లు అనబడే భావోద్వేగాలనే ఓటర్లలో రాజకీయ నాయకులు ఆశించేది. భావోద్వేగాలను సృష్టించడం చిటికలో పని . అవి రెడీ మేడ్ దుస్తులవంటివి. ఆలోచనలను కల్పించడమే కష్టం. నూలు వడకడం దగ్గరనుండి మొదలెట్టాలి. 


షార్ట్ మెసేజ్ లు షార్ట్ వీడియో లు అలాగే చిన్న వ్యాసాలు రాయండని చెప్పేవారు హక్స్లీ Brave New World propogandists. ఈ రోజు ఆలోచనలమీద వీళ్ళే విజయం  సాధించి ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఒక విషయం పట్ల వివరణను ముప్పై సెకండ్లకంటే ఎక్కువ ఇస్తే భరించలేనంత ప్రజలను మేధావులను తయారు చేయడంలో వారు డెఫినెట్ గా విజయం సాధించారు.  యాభై పదాలలో విషయం చెప్పగలగాలి. బ్రివిటీ లేకపోతే అతడు మేధావేకాదు. అతడిని చదవనవసరమే లేదనే ధోరణిని ప్రజలలో కలిగించడంలో ఈ ప్రాపగాండిస్టులు విజయం సాధించరు. ఒకప్పటి మతసంబంధ సూత్రాలలా మాత్రమే ఈరోజు మనకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఈ రోజు మనం చదువుతున్నది మేధావుల ఆలోచనలను కాదు. వారి స్టేట్మేంట్స్ ని. వారు తమ అభిప్రాయాలను చిన్న పది పదాలలో చెప్పేస్తారు. వారు ఆ అభిప్రాయానికి ఎలా వచ్చారో రాయలంటే వారికి వ్యాసమే రాయాల్సి ఉంటుంది. కానీ ఇపుడు వారు ఆ అభిప్రాయానికి ఎందుకు వచ్చారో చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు మూడు ముక్కల్లో చెప్పేశారు కాబట్టి  ఇంక పనైపోయింది. చదివే పాఠకులకు అవసరం లేదు. మూడు ముక్కలే చాలు. పెద్ద వివరణలు అనవసరం. ప్రజలు పడుకున్నప్పుడు కూడా బ్రేవ్ న్యూ వరల్డ్ ప్రాపగాండిస్టు తన ప్రాపగాండాను చేస్తూనే ఉంటాడు(Hypnopaedia). ఉన్న అధికారాన్ని భజనచేయడానికీ ప్రజలను ఆలోచనారహితులుగా చేయడానికీ వారిని కండీషనింగ్ చేయడానికి హక్స్లీ చెప్పిన ప్రాపగాండిస్టులకి దొరికాన ఆయుధమే literature of 30 seconds. 


ఒక వ్యాసం రాయడానికి తన వాదనను చెప్పదలచుకున్న అంశాన్ని చెప్పడానికి రచయితకి చాలా నిజాయితీ అవసరం ఔతాయి. భావోద్వేగాన్ని చెప్పడానికి గట్ ఫీలింగ్ లను చెప్పడానికి అవేమీ అవసరం లేదు కదా. ఎవరూ దేనినీ వివరించనవసరం లేని ఒక వాతావరణాన్ని మొదట సృష్టించడం అనేది జరిగాక కదా ఎవరూ దేనినీ ప్రశ్నించలేని ఆలోచించలేని స్థితికి మనం చేరుకునేది. అందుకే Brave New World ప్రాపగాండిస్టులు గెలిచారు. మనం ఓడిపోతూనే ఉంటాం. 


విరించి విరివింటి

1/1/24