Saturday, 22 April 2017

మతం ఒక అబ్నార్మల్ జెనిటికల్ మ్యుటేయన్

తర్కం ఎక్కడ ఆగపోతుందో అక్కడ మతం మొదలవుతుంది. తర్కాన్ని ఏది నాశనం చేయగలో అదే మతంలా అవతరించగల శక్తిని సంతరించుకుంటుంది. మతాన్ని అవలంబించే వారిలో తర్క జ్ఞానం కించిత్తయినావుంటే ఉరేసుకు చస్తానన్నాడట వెనకటికొకడు. వారి నోటిదూల మంత్రాలకూ, చేతివాటం కనికట్టులకూ చింతకాయలూ, శెనగపప్పులూ రాలేట్టయితే, మానవుడి పరిణామం ఇప్పటికీ జానెడు గుడ్డ అడ్డం పెట్టుకునే దెగ్గరే ఆగి ఉండేది. కానీ ఈ చేతి వాటం కనికట్టు రాయుల్లే మన మతగురువులు. "ప్రాచీన క్రిస్టియన్ సన్యాసి ప్రజల కోసం, వారి విముక్తి కోసం శరీరాన్ని శుష్కింప జేసుకుంటే, ఆధునిక సన్యాసి తన వ్యక్తిగత విముక్తికోసం ప్రజల శరీరాలను శుష్కింపజేస్తాడు అంటాడు" మార్క్స్ మహాశయుడు. ఇటువంటి స్వార్థ సన్యాసులతో, వాజమ్మలతోటే మతం మొదలుతుంది. కానీ ప్రత్యక్షం, ప్రమాణం, అనుమానం పద్దతిలో మొదలై ముందుకు సాగేది తర్కం. ప్రాచ్య పాశ్చాత్య మేధావులంతా తర్కాన్నే ఆశ్రయించారు. మన దగ్గరున్న అంగీకృత్య ఖండనం పాశ్చాత్య డయాలెక్టికల్( dialèctical) కి దగ్గరి సంబంధం కలిగి ఉంటుందనటంలో సందేహం లేదు. ఎందుకటే అప్పటి ప్రపంచ మేధావులు తర్కాన్నే ఆశ్రయించారు తప్ప మతాన్ని కాదు. గ్రీకు 'జీనో' మొదలు పెట్టిన తర్కం సోక్రటీస్ నుండి, ప్లేటో నుండి ముందుకు సాగి హెగెల్ తో జడలు విప్పి, వాద ప్రతివాద, సమన్వయ వాదాది త్రిక తర్కం (గతి తార్కికం)గా అవతరించింది. ప్రపంచానికి భాష్యం చెప్పిన తత్వవేత్తలు మతం గుప్పిటిలో దాదాపు ఇరుక్కు పోలేదు. ప్రాచీన ఋషులెవరూ ఏ మతానికీ బంధీ కాలేదు. కానీ జన సామాన్యం తత్వ శాస్త్రాన్నే కాదు తత్వ వేత్తలనీ వదిలిపెట్టింది. సోక్రటీసుకు విషమిచ్చి చంపేసింది. అరేబియన్ తత్వవేత్త ఇబన్ రుష్ద్ పుస్తకాలనూ తగులబెట్టింది, డార్విన్ పుస్తకాలను తగులబెట్టింది. మనదేశంలో లోకాయత, భౌతికవాద దర్శనాలు నామరూపాలు కోల్పోయాయి. మొదటినుండీ మతం తర్కాన్ని నాశనం చేయడం వలననే వృద్ధి చెందింది. తర్కాన్ని నాశనం చేయకుండా మతం మనలేదు. ఆల్జీబ్రానూ, జామెట్రీని కలిపి కార్టీజియన్ సిస్టం( Cartesian system) సృష్టించిన డెకార్టే (Descartes) వంటి గణితజ్ఞుడైనా తర్కం సహాయంతోటే దేవుడి ఉనికిని నిరూపించగలమనీ అన్నాడే తప్ప నమ్మకాలతో దేవుడి ఉనికిని గుడ్డిగా ఒప్పుకోలేదు. లెక్కలు చూస్తేగానీ తిక్కలు కుదరవని ఊరకే అనలేదు కదా.  "బ్రైటర్ దాన్ థౌజండ్ సన్స్ ( Brighter than thousand suns) పుస్తకంలో చెప్పినట్టు శాస్త్రవేత్తలను రాజ్యాధినేతలు తప్పు మార్గం పట్టిస్తే...తార్కిక జ్ఞానంగల మనుషులను మతాలు తప్పుదారి పట్టిస్తాయన్న విషయం మధ్య యుగాల చరిత్రను చూస్తే అర్థమౌతుంది. తత్వ శాస్త్రం మతం కలిసిపోవడమూ, మత కోణంలో తత్వ శాస్త్రాన్ని వివరీంచటమూ, తత్వాన్ని మత భావనల అభివృద్ధికి గురిచేయడమూ పరమ పాండిత్యంగా ఆవిర్భవించి పాండిత్య వాదానికి( Scholasticism) తెరలేపింది. మౌఢ్యానికి వ్యతిరేకమనిపించిన బౌద్ధం తాంత్రిక కౌగిలింతల్లో తేలియాడింది. యోగ మార్గం కన్నా జ్ఞానమార్గం గొప్పదన్న గీత "యజ్ఞం వలన మోక్షం వస్తుంద"ని చెప్పక తప్పింది కాదు. (అది ఖర్చుతో కూుకున్న పనిగనుక జ్ఞానంతో సరితూ గదని అందులో సవరణ).

మతం ప్రతివాదాన్ని(anti thesis) నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది. ఏ మతమైనా తన మార్గమే గొప్పది అంటుంది. తాను చెప్పిన దైవమే అసలైన దైవం అంటుంది. తను చూపించిన మార్గమే దేవుని చేరు ఏకైక మార్గమనీ అంటుంది. తన ప్రవక్తనే చివరి ప్రవక్త అంటుంది. దేవుడు జడ్జ్మెంటు ఇచ్చే రోజు ఒకటుంటుందని నమ్ముతుంది. ఇవన్నీ స్టేట్మెంట్లు అనుకుంటే, వాటికి వ్యతిరేకంగా ఎవరు ప్రతివాదాన్ని వినిపించినా, వెంటనే నాశనం చేయడమే మతం ఉనికికి చరమ మార్గం. పలానా పుస్తకంలో ఈ విధంగా రాశేశాడు దేవుడని చెబుతుంది మతం. అదంతా అపౌరుషేయం అంటుంది. దేవుడెందుకు రాశాడో, దేనితో రాశాడో, అసలేం పని లేక రాశాడో మనకు తెలియదు గానీ, అది అడిగే హక్కూ మనకు ఉండకూడదంటుంది మతం. ఆ విధంగా రాయబడి చెప్పబడీ ఉన్నందున ఆ విధంగానే చెయ్యాలి. వ్యతిరేకంగా చేస్తే దేవుడి పేరు చెప్పి మతానుయాయులే మనుషులను నాశనం చేయపూనుకుంటారు. మతమంటే మొత్తానికి తప్పొప్పుల పట్టిక తప్ప ఇంకేమీ కాకుండా పోతుంది. ఈ పలానాది ఇలా చేయాలి, అలా చేయకూడదు అని సూత్రమాలనొకటి తయారు చేసి పెడుతుంది. ఈ మూల సూత్రాలు కరడుగట్టిన తరువాత, మొదటికి ఎసరు బెట్టినట్టు, ఆ కాలానికి చెందిన విజ్ఞాన శాస్త్రాన్నీ తత్వ శాస్త్రాన్నీ భ్రష్టు పట్టిస్తుంటుంది మతం. ఖగోళ శాస్త్రంలో గ్రీకులు బాబిలోనియన్లు సాధించిన విజయాలకంటే ఉత్కృష్టమైన విజయాలను మూటగట్టుకున్న భారతదేశం,ఆ తరువాతి కాలంలో అందులోకి మత భావనలను చొప్పించి ఆస్ట్రానమీని ఆస్ట్రాలజీగా మార్చి పడేసింది. గ్రీకులు పైథాగొరియన్లు భారతీయులు వృద్ధి చేసిన అంక గణితం(number theory) చివరికి అంకెల జోస్యంగా( numeroĺogy) పరిణమించింది. భౌతిక శాస్త్రాలకు భాషగా ఉండవలసిన గణితం చివరికి కాకి లెక్కలకూ పిచ్చి గణనలకూ ఆలవాలమై పతనం చెందింది. గణితానికి మిస్టిసిజంను జతచేసే జాడ్యం క్రీ.పూ ఆరవ శతాబ్దానికి చెందిన పైథాగొరియన్ల నుండి మొదలైందని సరిపుచ్చుకున్నా, పాశ్చాత్య దేశాల్లో మధ్య యుగాల్లోనే(medieval period)  పరిణతి చెందింది. చివరికి దాని ప్రభావం వలన విజ్ఞాన శాస్త్రం వృద్ధి చెందిన ఈ కాలంలో కూడా అదే పాత చింతకాయ పచ్చడిలాంటి మతపిచ్చి మాటలను వినడం, భూమి బల్లపరుపుగా ఉందని నమ్మడమే అవుతుంది.

ఈ మధ్య ఇంకో వాదన మొదలైంది. ఆ వాదన మత ప్రారంభకులను మహానుభావులుగా ఊహించే వాదన. ఆ మత ప్రారంభకులు ఏదైతే రాశారో, ఏదైతే చెప్పారో అది అన్నింటికంటే సర్వోత్తమం, సర్వోత్కృష్టం అంటారు వీరు. మత ప్రారంభకులు ప్రాణం పోయినా పొరపాటున కూడా తప్పు రాయరు, తప్పు చెప్పరు అనే ఒక ఫాల్లసీ వీరిని నడిపిస్తూ ఉంటుంది. తర్కంతో సాగే విజ్ఞాన శాస్త్రం దీనికి పూర్తి భిన్నంగా వాదిస్తుంది. పూర్వులు చెప్పిన దానిని సవరించుకుంటూ, అభివృద్ధి చెందుతూ సత్యం వైపుకు సాగేది విజ్ఞాన శాస్త్రమైతే, పూర్వులు చెప్పిందే పరమ సత్యమని , ఇక అనుమానానికీ, తర్కానికి ఏ మాత్రం చోటివ్వకుండా మతం సాగుతుంటుంది. ఈ వాదన ప్రకారం మతానికి సంబంధించిన ఆ పలానా పుస్తకంలో చెప్పినదంతా అత్యద్భుతమే...పరమ సత్యమే కానీ ఆ మతాన్ని అనుసరించే వారు దానిని సరిగా అవగాహన చేసుకోలేకపోవటం వలనో, లేదా తప్పుగా అర్థం చేసుకోవటం వలననో మాత్రమే ఇన్ని మత సంబంధ మారణ హోమాలు జరిగాయనో వాదిస్తుంది. మతానుయాయుల్లో లోపాలుంటాయి గానీ, మతంలో, మత సూత్రాల్లో లోపాలే ఉండవంటుంది విచిత్రంగా. మతానుయాయుల్లో లోపాలు ఉన్నపుడు ఆ మతాన్ని ప్రారంభించిన అర్భకులలో లోపాలు ఎందుకుండకూడదు అని మనం వీరిని అడగకూడదు. అడిగితే ఠారుమని నిటారుగా పైకిలేస్తారు. వీరి వాదన ప్రకారం మత ప్రారంభకులు దివ్య పురుషులన్నమాట. సగం అడ్డ గోచీలు కట్టుకుని, ప్రసార సాధనలు కూడా సరిగా చేయలేని పరమ అనాగరికమైన కాలం నాటి ఈ అమాయక మానవులు పరమ దివ్య పురుషులుగా ఎలా అయుంటారో వీరు తప్ప బహుశా ఏ విజ్ఞాన శాస్త్రమూ చెప్పలేదనుకుంటా. అంతే కాకుండా మత సూత్రాలు గొప్ప నీతివంతమైన ఆలోచనలకు పునాదులని కూడా వీరు వాదిస్తారు. ఇంకా ఎక్కువ మత కిక్కుగనక తలకెక్కింటే, అసలు తమ మతమే గొప్ప సైన్సు అనీ వాగుతారు. మతంలో చెప్పిన దానికీ నేటి సైన్స్ కీ బీరకాయ సంబంధాల్ని లాగి లాగి కకూన్లలాగా చుట్టచుట్టుకుంటారు. ఆ పురాతన కాలపు నీతి ఇప్పటి ఈ కాలపు నీతికి, సైన్సుకూ ఎట్లా అతుకుతుందో వారికే తెలియాలి. కప్ప బురద నుండి పుడుతుందని నమ్మిన అజ్ఞానాంధకార ప్రజలుండిన సమాజంలోని కిరాతక నీతి ఈ సమాజానికి సరిపోతుందని నమ్మే వారు ఏ బురదలో దొర్లుతుంటారో చెప్పడమూ కష్టమే. వాటిని ఈ కాలానికనుగుణంగా మార్చాలని అనుకోకపోవడానికి ఈ మత ప్రారంభ అర్భకుల మీది ఎనలేని అతి ప్రేమనే.

కాలం మారే కొలదీ మానవుని ఆలోచన పరిపక్వం కావలసిన అవసరం ఉంటుంది పరిణామ రీత్యా. కానీ దానిని పరిపక్వం కానీయకుండా పురాతన నమూనాలోనే ఉంచేయగలది మతం మాత్రమే. ఆదర్శ సమాజాలూ, స్వేచ్ఛా సమాజాలు ఉద్భవించాలంటే మతమన్నదే మొదటి అడ్డంకి. మానవ సమాజ పరిణామానికి అది గుదిబండ. మతం ఉండగా మానవుడు కొత్తగా ఆలోచించే అవకాశం ఎక్కడిది?. ఏది కొత్తగా ఆలోచించవలెనన్నా అదే మత భావనలను ఆలంబన చేసుకుని వీరు సాధించే పరిణామం ఏమిటి?. భారత దేశంలోని పురాతన కాలపు ఋషులూ, గ్రీకు లాటిన్ లలోని తత్వ వేత్తలే ఈనాటి ఆధునికులకంటే నయం. ఋగ్వేద ఋషులు పునర్జన్మలకోసం, మరణానంతర దివ్య జీవనం కోసం కక్కుర్తి పడలేదు సరికదా, ఇటువంటి భావజాలంతో భవిష్యతరాలకు ఇబ్బందులు సృష్టించలేదు, పైగా భౌతిక సుఖలాలసతను దివ్య జీవనమనుకున్నారు. తమకు తెలియని ప్రపంచాన్ని పలు విధాలుగా తెలుసుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేసారు. ఇప్పటి ఆధునికులు ఈ పూర్వీకులు కనుక్కున్న ఆ మాత్రం విషయాల్ని దివ్య పుస్తకాలుగా చదువుకుని తలలు బొప్పికట్టించుకుంటున్నారు. పొరపాటునో, గ్రహపాటునో ఆ పురాతన అర్భకులు తాము కనుక్కున్న విషయాలను ఏదో రూపంలో దాచి ఉంచి పెట్టడమే ఆ తరువాత కాలంలో మత దరిద్రం మనకు చుట్టుకోవడానికి కారణం. వారు దాచి పెట్టి ఉంచడమేమోగానీ ఆధునికులకు మా తాతల మూతులు నేతులు నాకాయని చెప్పుకుంటూ తమ మత గొప్పదనమంతా పూర్వీకుల గొప్పదనమే అనే పటాటోప రోగాలతో సంచరిస్తూంటారు. ఆ విధంగా మతం మనిషికి ఆతడి భావజాలానికీ సంఘర్షణలేని ఒక రెడీమేడ్ వాతావరణాన్ని సృష్టిస్తుంది. అంతా రెడీమేడ్ వష్తువులు వచ్చేసాయని మనం ఇపుడు వాపోతుంటాం గానీ, మతమంటేనే రెడీ మేడ్ ఆలోచనలుగల భావజాలం. అందుకే అది తర్కాన్ని చిదిమేస్తుంది. అసత్యం నుంచి సత్యానికీ, చీకటి నుండి వెలుగుకూ, మృత్యువునుండి అమరత్వానికీ పరిణామం చెందాలనే అద్భుత పరిణామాత్మక స్లోగన్ ని ఇచ్చిన బృహదారణ్యకోపనిషత్తు మతం కోరలలో చిక్కి చివరికి దేవుడి పూజా గదిలో కుంకుమా పసుపుల మధ్యన పూజలు అందుకుంటుంది.

ఈ దేశంలోగానీ మరేదేశంలోగానీ యుగయుగాలుగా మత భావనలకూ రాజ్యాధికారాలకూ, రాజకీయాలకూ విడదీయరాని సంబంధ బాంధవ్యాలు ఉండటం కనిపిస్తుంది. మానవుని ఆలోచనల పరిణామానికి మతం దానిని అంటి పెట్టుకుని ఉన్న రాజకీయాలూ రెండూ ప్రతిబంధకాలే. ప్రతీ వస్తువునూ  వ్యాపారం చేయగలిగిన కాపిటలిజం కాలంలో మతం కొత్త వ్యాపారంగా ప్రజల ముందుకొచ్చింది. దైవ చింతనం, మననం, ధ్యానం ఇపుడు లాభదాయక వ్యాపారాలు. దోపిడీ వర్గాలకు అందివచ్చిన నూతన మార్గాలు. కాలానుగుణంగా మతం తన దోపిడీ రూపాన్ని మార్చుకుంటూ మనిషిని తన సహజ పరిణామానికి దూరంగా ఉంచుతూనే ఉంది. మతం మానవుని పరిణామ దశను ముందుకు సాగనీయకుండా చేసే అబ్నార్మల్ జెనెటికల్ మ్యుటేషన్(  abnorma genetical mutation). దీనికి విరుగుడు తార్కిక చింతననే. తాము తార్కికులమనీ, ఆధునీకులమనీ, అభ్యుదయ వాదం మీద కూచున్న స్వేచ్ఛా పక్షులమనీ చెప్పే మహానుభావులు, మత భావనలను వదిలి పెట్టకుండా ఎలా తార్కికులయ్యారో చెప్పవలసి ఉంటుంది. వారి తార్కిక శక్తి ఏ పురాతన మత భావనలను నిలపటానికి ఉపయోగించుకుంటున్నారో ఆత్మ విమర్శ చేసుకోవలసి ఉంటుంది.

22/4/17
 Virinchi Virivinti

Tuesday, 18 April 2017

జోకులు చేసే నష్టం

"మొరిగే కుక్కలు కరువవు" అనేది సామెత. కానీ మొరిగే కుక్కలైనా కరుస్తాయేమోగానీ, హాయిగా నవ్వేసే శత్రువెపుడూ తుపాకీతో కాల్చడు అంటాడు కోనార్డ్ లోరెంజ్. రేసిస్ట్ సెక్సిస్ట్ జోక్స్ పెరిగిపోతున్న ఈ సోషల్ మీడియా కాలంలో రేసిస్ట్ సెక్సిస్ట్ జోక్ ల విషయంలో లోరెంజ్ చెప్పిన మాటలు ఎంతవరకు నిజమన్నది చర్చ చేయవలసిన అవసరం ఉంది.  లోరెంజ్ ఇటువంటి రేసిస్ట్ జోక్స్ ప్రమాదభరితంగా లేనంత వరకూ ఆమోదించవచ్చు అంటాడు. మనుషుల్లో ఇతర జాతుల పట్ల ఉండే హింసాత్మక ప్రవృత్తిని కొంతవరకైనా రేసిస్ట్ జోక్స్ నిలువరిస్తాయని అతడి వాదన. మానవుడు హింసను కలిగివుండడమన్నది అతడి సహజ గుణం. ముఖ్యంగా తనకంటే ఇతర జాతుల పట్ల అతడు తప్పక ద్వేషాన్ని కలిగివుంటాడు. అది అతడి సహజ నైజం అనేది మనం అవగాహన చేసుకోకపోతే, అహింస అనే ఆదర్శాన్నీ, నిర్మిత సత్యాన్నీ పట్టుకుని వేల్లాడతాం. మనిషిలోపలుండే హింసా ప్రవృత్తి బయటపడటానికి ఏదో ఒక కవాటమనేది అవసరం. ఆ కవాటాన్ని బలవంతంగా మూసి ఉంచటం వలన అది ఏదోరోజు మనిషిని చంపేంత హింసాత్మకంగా బయటపడక తప్పదు. కానీ రేసియల్ జోక్స్ ఆ కవాటాలని ఎప్పటికప్పుడు తెరచి ఉంచుతాయి కాబట్టి ఆ అగ్రెషన్ ఎప్పికప్పుడు తగ్గుతూ ఉండి, సాటి మనిషిని చంపడానికికు బదులు జోక్ కి నవ్వడంతో  ఆగిపోతుంది లేదా పలుచనపడిపోతుంది అనేది ఈ వాదం. ఈ వాదం సారం ఏమంటే, రేసిస్ట్ సెక్సిస్ట్ జోక్స్ అవసరమే అనేది.

 "మనుషి ఆలోచించగల జంతువు" అన్నారు అంటే అతడూ జంతువనే కదా. జంతువుల్లో ఉండే లక్షణాలు మనిషికీ ఉండాలి. కుక్కలనే తీసుకోండి. వీధి కుక్కలు ఎపుడైనా ఒక బొచ్చుకుక్క కనబడితే వెంటనే మొరగటం మొదలు పెడతాయి. మూకుమ్మడిగా మొరిగి తమ కంటే వేరుగా కనిపించే బొచ్చుకుక్కను గేలి చేస్తాయి. మనిషికీ అదే లక్షణం వచ్చి ఉంటుంది. తనకంటే వేరేగా కనిపించే జాతివాడిమీదో, మతం వాడి మీదో, కులం వాడి మీదో మొరగకపోతే, వదురుబోతు తనాన్ని తగినంత చూపకపోతే అతడి హింసా ప్రవృత్తి తృప్తి పొందటం జరగదు. "తిట్టడం" లేదా అంతకంటే తీవ్రమైన "చంపటం" బదులు "నవ్వటం" అనే దాన్ని ప్రవేశ పెట్టడం తద్వారా జాతుల వైరం కాస్తా జాతుల స్నేహంలా మారిపోతుందనుకోవటం ఇటువంటి ఆలోచనల వచ్చిన ఉపాలోచనలు.

"పొలిటికల్ కరెక్ట్ నెస్ (political correctness)" అనే పదం భాష ద్వారాగానీ, పాలసీల ద్వారాగానీ ఇంకే విధంగానూ ఒక గ్రూపు ప్రజలకు అవమానకరంగా ఉండకూడదనే విషయాన్ని  సూచిస్తుంది. మనదేశంలో ఈ పదం పెద్దగా తెలియదనే చెప్పాలి. చాగంటి వారి ప్రవచనాల్లో అదేదో సామెతది తప్పే తప్ప తమది కాదు అని చెప్పటమూ ఇటువంటి పొలిటికల్ కరెక్ట్ నెస్ యాటిట్యూడ్ లేకపోవటమే. రేసిస్ట్ సెక్సిస్ట్ జోకుల్లో కూడా పొలిటికల్ కరెక్ట్ నెస్ దృక్పథం ఉండదని చెప్పాలి.  రేసిస్ట్ జోక్స్ ఖచ్ఛితంగా ఒక వర్గం వారిని కించపరుస్తాయి. వాటిలో జోక్ పేల్చేవాడూ, నవ్వేవాడు ఒకడైతే, బాధ పడేవాడు ఇంకొకడు ఉంటాడు. అయితే జోక్స్ ఎవరు ఎవరితో చెబుతున్నారు అనేది చాలా ముఖ్యమంటారు సోషియాలజిస్ట్లు. ఒకే జాతికి చెందిన వారందరూ ఒక చోట కూర్చుని ఇంకో జాతి వారి గురించి జోకులు చెప్పుకుని నవ్వుకోవడం ఒక రకం. మగవారంతా కూర్చుని ఆడవారి గురించి జోకులు వేసుకోవడం. మొగుళ్ళందరూ కూర్చుని భార్యల గురించి జోకులు వేసుకోవడము, తెల్లవాడు నల్లవాడి మీద, హెటిరో సెక్సువల్ హోమో సెక్సువల్ మీద, ఒక మతం వాడు ఇంకో మతం మీద, ఒక వర్గం వాడు ఇంకో వర్గం మీద, ఇత్యాదివి. సాధారణంగా ఆధిపత్య వర్గాల వారు అణచివేత వర్గాల వారి మీద, పీడకులు పీడితుల మీద ఇటువంటి జోకులు వేసుకుని నవ్వుకుంటారు. ఇటువంటి జోకులు చెప్పేవారు, వాటికి నవ్వేవారూ తప్పకుండా రేసిస్టులూ, సెక్సిస్టులూ అయ్యుంటారు. టార్గెటెడ్ గ్రూపువారందరూ అణచివేత వర్గానికి చెందిన వారై ఉంటారు.

రేసిస్ట్ సెక్సిస్ట్ జోకులు, సమజంలో పాతుకుపోయి ఉండే నిమ్నోన్నతాలను, వాటి చుట్టూ పేరుకుపోయి ఉన్న నమ్మకాలను, ముందే ఏర్పాటు చేసుకున్న భావనల ( prejudices)నూ స్థిరీకరిస్తాయి. ఇటువంటి జోక్స్ విభిన్న జాతుల మధ్య సఖ్యతను ఏర్పరుస్తాయని ఒక వాదన ఉంది. మన "రస్సెల్ పీటర్" లాంటి వాళ్ళు విభిన్న జాతుల వారిని ఒక చోట కూర్చోబెట్టి రకరకాల రేసిస్ట్ జోక్ లు వినిపించేస్తూ తామేదో సాదించేస్తున్నాం అనుకోవడం జరుగుతూ  ఉంటుంది. విభిన్న జాతుల వారు ఒక చోట కూర్చుని కలిసి నవ్వుకోవడం వలన మేలు జరుగుతుంది, వారిలో ఉండే రేసిస్ట్ భావనలు ఆ విధంగా పలుచనపడి పోతాయనేది ఈ వాదన లోని సారం. కానీ వాస్తవాలు ఇంకో రకంగా ఉంటాయనేది వాస్తవమే. రేసిస్ట్, సెక్సిస్ట్ జోక్ లలో ఉండే సామాజిక జీవన విధానానికీ, వాస్తవ జీవితంలో ఉండే సామాజిక జీవనానికీ సంబంధం ఒక రబ్బర్ బ్యాండుతో పోల్చడం జరిగింది. ఉదాహరణకు రబ్బర్ బ్యాండు లోపల మన సమాజం ఒప్పుకునేంత మేరకు భావనలు ఉంటే, రబ్బరు బ్యాండుకు బయట ఉన్నదంతా మన సమాజం ఒప్పుకోనిదే అనుకుందాం. ఇపుడు ఈ రకమైన జోక్ లు రబ్బర్ బ్యాండును సాగదీయడం ద్వారా, సమాజంలో ఒప్పుకోని వాటిని కూడా రబ్బర్ బ్యాండు లోపలికి తీసుకువచ్చి మనతో ఒప్పిస్తాయి. ఒక మైనారిటీ వర్గం వారిని దూషించటం తప్పు అనేది సోషల్ నార్మ్ అనుకుంటే, ఈ జోకుల ద్వారా ఆ నార్మ్ తొలగించబడుతుంది. దానికి "జస్ట్ ఎ జోక్" అని పేరు పెట్టబడుతుంది.

నిజానికి చెప్పాలంటే ఇటువంటి జోక్స్ భిన్న జాతుల వారిని దగ్గర చేయడం అటుంచితే,  అవి అప్పటి దాకా మనలో దాచి పెట్టబడిన ఇన్హిబిషన్స్ ని వదిలించుకునేలా చేస్తాయి. ఉదాహరణకు ఆడవారి గురించి ఒక చోట ఒకతను జోక్ లు చెబుతున్నాడనుకుందాం. అతడు చెప్పే జోకులలోని తీవ్రతను బట్టి వింటున్న వారిలో ఇన్హిబిషన్సు తొలగిపోతాయి. ఇపుడు వింటున్న వారిని కూడా అటువంటి జోక్ లు చెప్పమని అడిగినపుడు, వారు కూడా అప్పటిదాకా బయట ఎక్కడైనా చెప్పాలంటే ఏమనుకుంటారో అనుకునే విధంగా ఉండే జోక్స్ ను కూడా ఆ సమయంలో అతి సులువుగా తడుముకోకుండా చెప్పగలుగుతారు. అంటే రేసియల్ జోక్స్ వారిలోపల ఉండే ఇన్హిబిషన్ ని తొలగించేస్తాయి. ఒక వ్యక్తి గురించి గుంపులో ఎవరైనా ఒకరు నెగెటివ్ గా చెప్పినా గుంపులోని అందరూ చిలువలు పలువలుగా ఆ వ్యక్తి గురించి నెగెటివ్ గా చెబుతూ  ఆనందించడం వంటిదే ఇది కూడా. ఇపుడు అలా చెప్పబడిన వ్యక్తి తారస పడినపుడు ఆ గుంపులోని వారు ఏ విధంగా ప్రవర్తిస్తారో..రేసియల్ జోక్ లను విని ఆనందించిన వారు కూడా జోక్ విక్టిమ్స్ ఎదురు పడినపుడు అటువంటి అవగాహననే కలిగి ఉంటారు. ఉదాహరణకు ఒక గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ సెక్సిస్ట్ జోక్ లు వినక ముందు కంటే విన్న తరువాత, వుమన్ ఆర్గనైజేషన్ లకు గవర్నమెంట్ ఫండింగ్ అవసరమే లేదన్నారట.

" ఆ ఏముందీ ఇవి కేవలం జోక్స్ మాత్రమే కదా" అనుకునే వారు ఈ మధ్య కాలంలో ఎక్కువ. జోకును జోకులాగా చూడాలి అనేది వీరి ఫిలాసఫీ. వీరంతా చదువుకున్న పనికిమాలిన వారు అనాల్సి ఉంటుందేమో. పైగా ఈ మధ్య సెక్సిస్ట్ జోక్ లను ఆడవారే ఎక్కువగా షేర్ చేస్తూ కనిపిస్తారు సోషల్ మీడియాలో. ఆ మధ్య ఓ సినిమా విలన్ కం హాస్య నటుడు జయ ప్రకాష్ రెడ్డి ఏవో సెక్సిస్ట్ జోక్ లు లైవ్ లో చెబుతుంటే, స్వయంగా ఆడవారే పడీ పడీ నవ్వటం మనం చూసే ఉంటాం. ఇటువంటి వారు గుర్తుంచుకోవలసిన విషయం ఒకటుంది. ఒక రీసెర్చిలో కొంత మంది మగవారికి న్యూట్రల్ జోక్స్ ని వినిపించినప్పటికంటే, సెక్సిస్ట్ జోక్స్ వినిపించినపుడు వారు ఆడవారిని రేప్ చేయడం తప్పేమీ కాదనే భావనని వ్యక్తపరిచారట. ఆడది ఒక సెక్స్ ఆబ్జెక్ట్ అనే భావనని ఈ సెక్సిస్ట్ జోక్స్ వారిలో స్థిరీకరించాయన్నమాట. కాబట్టి సెక్సిస్ట్ జోక్స్ షేర్ చేస్తూ తాము గొప్ప కామెడీ లవర్స్ మి అని చెప్పుకునే ఆడవారందరూ తాము షేర్ చేసిన జోక్ ఇంకో రేప్ విక్టిమ్ ని తయారు చేస్తుందని గుర్తు పెట్టుకోక తప్పదు. ఈ మధ్య జబర్దస్త్ వంటి కామెడీ షో లలో ఆడవారిని కించపరచడం సమాజం ఒప్పుకోనంత స్థాయికి చేరిపోయింది. దానికి విక్టిమ్స్ ఎటువంటి వ్యతిరేకత చూపక పోవడం వలన రాను రానూ సమాజం దానికి అలవాటు పడుతుంది. అలవాటు పడిన తరువాత వచ్చే కామెడీ అప్పటిదాకా ఉన్న స్థాయి కంటే ఎక్కువగా ఉంటుంది. దాని పరిణామాలు సమాజంలో ఆడవారిని చూసే పద్దతిలో కనిపిస్తూ ఉంటుంది. పక్కింటి ఆడవారందరూ తన కోసమే కాచుకుకూర్చున్నారనుకునే మూర్ఖత్వాన్ని గ్లోరిఫై చేసే జోక్ లు వచ్చినంత కాలం, దానిని చూసి ఎంజాయ్ చేస్తున్నంతకాలం ఆడవారిని భోగవస్తువులుగా చూడటమన్నది స్థిరీకరణ చెందుతూ నే ఉంటుంది.

మన దేశంలో ఇప్పటికీ భార్యల పేరుతో ఆడవారిపై జోక్ లు వస్తూనే ఉన్నాయి. లావుగా ఉండే వారి మీదా, నల్లగా ఉండే వారి మీదా, బక్కగా ఉండే వారి మీద, ఎల్జీబీటీల మీదా జోక్ లు చాలా జుగుప్సాకరంగా ఉంటున్నాయి. ఈ మధ్య ఒక మిత్రుడు అసెంబ్లీలో థర్డ్ జండర్ కి కూడా చోటు కలిగించాలని సహృదయతతో పోస్ట్ పెడితే, ఇప్పుడున్న వారందరూ ఎవరనుకున్నారని ఒకాయన పరిహాసాలాడటం కనిపించింది. ఇది నిజంగా ఇపుడున్న మంత్రులను హేళన చేయడమా లేక థర్డ్ జండర్ ని హేళన చేయడమా?. ఇంకో ఆయన ఏకంగా ఒక జాతి మగవారి మగతనం అంటూ కీర్తిస్తాడు. మగతనం అంటే కార్య శూరత అనే అర్థంలో వాడటం బహుశా జబర్దస్త్ వంటి కామెడీ షో లు వచ్చాక పెరిగిందేమో. ఎందుకంటే ఆ జోక్ లు ఆ భావనను స్థిరీకరించేశాయి. కాబట్టి మన మాటల్లో, భాషలో, భావాల్లో పొంగి పొరలే రేసిస్ట్, సెక్సిస్ట్ భావనలకు బీజాలు వాటిని ప్రోత్సహించే జోకుల నుంచే మొదలవుతాయని మనం గుర్తించాలి. పొలిటికల్ కరెక్ట్ నెస్ భావనని పెంపొందించుకోవాలి.

17/4/17
Virinchi Virivinti.

Thursday, 13 April 2017

అల్ అబౌట్ టాయిలెట్

 Shit can also serve as a stuff for thought  అన్నారు పెద్దలు. అందుకే టాయిలెట్ ని కూడా ఫలవంతంగా ఉపయోగించుకోవాలన్న స్పృహనేమో అప్పట్లో న్యూస్ పేపర్లు కూడా టాయిలెట్లలోకి దూరి పోయేవి. ఇపుడు సెల్ ఫోన్స్ వచ్చేశాక ఉదయం పూట ఏకంగా వాట్సప్ అండ్ ఫేస్బుక్ కూడా టాయిలెట్ల నుండే ప్రపంచాన్ని పలకరిస్తూ ఉంటాయి. ఎంత ఫేస్బుక్ లో ఫేసు పెట్టినా, సెల్ఫీ వీరులకు ఆ సమయంలో సెల్ఫీ తీసుకోవాలనే ఆలోచన కలగకపోవడం ముదావహం. కొద్దిరోజుల్లో ఆ ముదనష్టాన్ని కూడా చూడక తప్పదేమో అని బాధ కూడా. సెల్ఫీ దిగేటపుడు ముఖం ముక్కినట్టుగా ఎలాగూ పెడుతుంటారు కదా, సిట్యుయేషన్ లేకున్నా. ఇదొక్క సెల్ఫీ కూడా దిగేస్తే...పెట్టిన ముఖకవళికకూ కింది కదలికకూ పొంతన చేకూర్చిన వారౌతారు. సామాజిక కట్టుబాట్లను టాయిలెట్ల నుండే ఛేదించాలంటాడు తన సర్రియలిస్ట్ చిత్రం "ఫాంటమ్ ఆఫ్ లిబర్టీ"లో దర్శకుడు "లూయిస్ బున్యూల్". ఈ సినిమాలోని టాయిలెట్ సీన్ ని మన దేశస్థులు చూసే వీలు లేదు సెన్సార్ పరిధుల వలన. డైనింగ్ టేబుల్ చుట్టూ పది మంది కూర్చుని మాట్లాడుకుంటూ తింటూన్నట్టుగా పది మంది చుట్టూ కూర్చుని మాట్లాడుకుంటూ మలవిసర్జన చేయటం చూపిస్తాడీ సినిమాలో. అంతే కాకుండా తిండి తినడానికి ఇంటి వెనుక ఉన్న చిన్న గదిలోకి పోయి ఒంటరిగా కూచుని తినటం చూస్తాం ఇదే సినిమాలో. అంటే టాయిలెట్ల విషయంలో మనమేర్పరచుకున్న దృక్పథాలు సామాజిక నిబంధనల వలన ఏర్పడినవే, వాటిని ఛేదించాలంటాడు దర్శకుడు. ఇన్ని రోజుల తర్వాత స్వచ్ఛ భారత్ పుణ్యమా అని మనం మొదటిసారయినా టాయిలెట్ల గురించి ఆలోచించగలుగుతున్నాం, చర్చించగలుగుతున్నాం. టాయిలెట్లనుండే ఆదునిక భారతంలో విప్లవం మొదలవటం శుభపరిణామం.

ఈ మధ్య నగరీకరణల వలన మన ఇండియన్ టాయిలెట్లు కనుమరుగై ప్రతీ చోట వెస్టర్న్ టాయిలెట్లు ప్రత్యక్షమౌతున్నాయి. ఇండియన్ స్టైల్ అలవాటయిన వారికి ఒక పట్టాన ఈ వెస్టర్న్ టాయిలెట్స్ అర్థం కావు. "పని ముగియకముందూ, ముగిసిన తరువాత వెయిట్ చెక్ చేసుకుంటే ఎలాంటి మార్పూ ఉండి చావట్లేదోయ్" అన్నాడు అప్పట్లో ఊరి నుండి వచ్చిన బంధువు. ఒకానొక పెండ్లి విడిదిలో వెస్టర్న్ టాయిలెట్స్ ఉన్న గదులు ఏర్పాటు చేశారని మగ పెండ్లి వారు అలక పానుపేశారట. అప్పటికప్పుడు ఇండియన్ టాయిలెట్స్ ఉన్న హోటల్ లో గదులు ఇప్పించాల్సి వచ్చిందట. ఇట్ హాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా. కానీ పబ్లిక్ టాయిలెట్లలో ఇండియన్ స్టైల్ ని అనుసరించటం వెస్టర్న్ టియిలెట్స్ కి అలవాటుపడిన నగరవాసులకు మహా ఇబ్బందిగా మారింది. ఒక పెద్దాయన పబ్లిక్ టాయిలెట్లను ఏకంగా పెళ్ళితో పోల్చేశాడు. బయటనున్న వారు ఎపుడెపుడు లోపలికెల్దామా అని తొందరపడుతుంటే, లోపలున్న వారు ఎపుడెపుడు బయటికొచ్చేద్దామా అని తొందరపడతారట. మోకాళ్ళను మడచి ఎక్కువసేపు కూర్చోలేక కావచ్చు. అసెంబ్లీలో ఇండియన్ టాయిలెట్లలో ఉండే పాదపు గుర్తులను చూచి దేవుడి పాదాలనుకుని మొక్కి వచ్చారట అప్పటి పల్లెటూరినుండి ఎంపికైన ఎంఎల్ఏలు. అది గుర్తుంచుకునే నేమో ఈ మధ్య జైరాం రమేశ్ టాయిలెట్స్ గుళ్ళ కంటే పవిత్రమైనవన్నాడు. గుళ్ళ కంటే కూడా టాయిలెట్స్ లోనే తక్షణ మోక్షం లభిస్తుందని చమత్కరించాడు. మనలో మనమాట, రాజకీయనాయకులు టాయిలెట్ కుండ మీద కూర్చున్నంత  స్థిరంగా ఇంకెక్కడా కూర్చోలేరని ప్రతీతి.

టాయిలెట్ ఎక్కడున్నా ఫ్లష్ ఎంత ముఖ్యమో వెంటిలేటర్ కూడా అంతే ముఖ్యం. అలా అని చెప్పి విమానాల టాయిలెట్లలో వెంటిలేటర్లను ఆశించకూడదు మరి. ప్రైవసీ తక్కువున్న ప్రదేశాల్లో నీళ్ళ కంటే నీళ్ళ శబ్దం చాలా అవసరం. ఆ మధ్య అత్యవసరంగా పొట్టపట్టుకుని ఇంటికొచ్చిన మిత్రుడు లోపలంతా బక్కెట్టు జరిపిన శబ్దమే అని కవరింగ్ ఇవ్వ ప్రయత్నించాడు. నవ్వకుండా నమ్ముతున్నట్టు నటించడం కష్టమైంది మరి. తెనాలి రామకృష్ణుడు బంగారు వరి గింజలు నాటితే బంగారం వరి పంట వస్తుందని చెప్పాడట. కానీ నాటేవారు ఇప్పటిదాకా కిందినుండి గాలి వదలని వారై ఉంటేనే సాధ్యమౌతుందని మెలిక పెట్టాడట. కృష్ణదేవరాయరంతటి వాడు ఆ ఆఫర్ ని తిరస్కరించాడట. ఎంతవారలకైనా తప్పని గాలి కదా. అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అన్నట్టు, ఎంతటివాడైనా టాయిలెట్ కి పోక తప్పదు. నేను అవతార పురుషుడిని నేను పోను అంటే కుదరదు. విజ్ఞానం పెరిగి టాయిలెట్లు ఈ మధ్య మన దేశంలో దర్శనమిస్తున్నాయిగానీ మనవారంతా ప్రకృతి సౌందర్యారాధకులే ఒకప్పుడు. ఎటొచ్చీ ఆడవారికి టాయిలెట్లు రావడమనేది గొప్ప సామాజిక పరిణామం మనదేశంలో. ఇంతకాలం ఆడవారికి కూడా టాయిలెట్ల అవసరం ఉంటుందని మగవారు గుర్తించకపోవటం దారుణమైన విషయమే. వరల్డ్ మెన్స్ డే (world men's day) నీ వరల్డ్ టాయిలెట్స్ డే (world toilets day) నీ ఒకే రోజు (నవంబర్ 19) జరుపుకోవడంలో అసలు మతలబు బహుశా టాయిలెట్ల అవసరాన్ని మగవారికి చెప్పడం కోసమేనేమో.  ఇప్పటికీ గ్రామాలు నిప్పులతో ఉదయిస్తూండటం స్వచ్ఛభారత్ పనితీరును తెలుపుతూ  ఉంటుంది. నిప్పులు లేని భారత దేశం కోసం పనిచేయాల్సిన అవసరాన్ని లోక కల్యాణం దృష్ట్యా మనం, అంటే భారతీయులం గుర్తించాల్సి వుంది.

టాయిలెట్ కుండల ఆకారాలు ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటాయి. వారి వారి శారీరక అవసరాలను బట్టి ఈ ఆకారాలుంటాయనుకోవడం అర్ధ సత్యమే ఔతుంది. ఈ ఆకారాలకూ ఆ దేశ రాజకీయ దృక్కోణానికీ సంబంధం ఉందంటాడు జిజెక్. సెకండ్ వేవ్ ఫెమినిజంలో కీలక పాత్ర పోషించిన "ఫియర్ ఆఫ్ ఫ్లైయింగ్" నవలలో రచయిత్రి "ఎరికా జంగ్" జర్మన్ టాయిలెట్ల గురించి ఉటంకిస్తుంది. థర్డ్ రీచ్ లోని భయానక దృశ్యాలకూ టాయిలెట్ల ఆకారాలకూ లింక్ పెడుతుందావిడ. "ఇటువంటి టాయిలెట్లను రూపకల్పన చేసిన ప్రజలు ఎంతకైనా తెగిస్తారని" నాజీ జర్మన్లను గురించి చెబుతుంది. అంతగా జర్మన్ టాయిలెట్ల గురించి భయపడవలసిన అవసరం ఏముందని అడగవచ్చు. వుంది. భయపడవలసిన అవసరమే ఉంది. ఎందుకంటే జర్మన్ టాయిలెట్లలో మలం వెనుకకి పోకుండా ప్యాన్ మీద ముందుకు వస్తుంది. ప్యాన్ ముందు భాగంలో ఒక షెల్ఫ్ ఉంటుంది. అందులో పడిన మలాన్ని పరీక్షించండనీ, అందులో ఏమైనా నులి పురుగులూ, రక్తపు మరకలూ ఉన్నచో డాక్టరుని సంప్రదించాలనీ జర్మన్లు ఆ విధంగా మరుగుదొడ్లను ఏర్పాటు చేసుకుంటారు. ప్యాన్ లోఉన్న మలం ఫ్లష్ చేస్తేగానీ కదలదట. ఇది జర్మనులు పురాతన కాలం నుంచీ అనుసరిస్తూ వస్తున్న ఆరోగ్య సూత్రమట.  వీరి ఆరోగ్య కాంక్ష ఏమోగానీ వినడానికే జుగుప్స కలిగించేలా ఉంటుందీ పరిస్థితి. అందుకేనేమో ఈ అమెరికన్ రచయిత్రికి థర్డ్ రీచ్ నాటి మారణ హోమానికి జర్మనుల ఈ ఆకాంక్షాపరత్వమే కారణమనిపించి ఉంటుంది. జర్మన్ల టాయిలెట్స్ పరిస్తితి ఇలా ఉంటే ఇందుకు పూర్తి భిన్నంగా, ఫ్రెంచి టాయిలెట్లు వెనుక దూరంగా రంధ్రాన్ని కలిగి ఉంటాయట. ప్యాన్ మీద నుండి మలం వెనువెంటనే దూరంగా కనిపించకుండా జారిపోతుందట. ఫ్లష్ చేయనవసరం లేకుండానే ఇటువంటి వేగవంతమైన పనిని అవి చేస్తాయట. ఇక అమెరికన్ టాయిలెట్ల తీరు ఇంకో రకం. వీటిలో నీరు ఎప్పటికీ పైకి కనిపిస్తూ ఉండటం వలన, ఫ్లష్ చేయనంతవరకూ నీరూ, మలమూ ప్యాన్ మీద తేలుతూ ఉంటాయట.

ఈ మూడు దేశాలకు సంబంధించిన టాయిలెట్ల రూపానికీ ఆ దేశాల వైఖరులకూ సంబధం ఉందంటాడు జిజెక్. నిజానికి ఈ మూడు దేశాల భౌగోళిక అస్తిత్వ వైఖరులను మొదటగా అర్థం చేసుకున్న వాడు హెగెల్. జర్మనుల ప్రతిఫలనాత్మక పరిపక్వత(reflective thoroughness, )ఫ్రెంచి వారి విప్లవాత్మక తొందరపాటు( revolutionary hastiness), అమెరికన్ల ఆధునిక ప్రయోజనాత్మక ప్రాగ్మాటిజం( modern utilitarian pragmatism) వలన అవి తమ అస్తిత్వ వైఖరులను వేరు వేరుగా కలిగి ఉన్నాయంటాడు హెగెల్. జిజెక్ ఇంకో అడుగు ముందుకేసి ఆయా దేశాల వైఖరులకు టాయిలెట్ల నిర్మాణాలకూ సంబంధం చూపిస్తాడు. జర్మనులు తమదగ్గరున్న అసహ్యకరమైన విషయం పట్ల సందిగ్ధతతో కూడిన ఆలోచనలను కలిగి ఉంటారట. ఫ్రెంచి వారు అసహ్యకరమైన విషయాన్ని వీలైనంత తొందరగా వదిలించుకోవాలని అనుకుంటారట. అమెరికన్లు ఆ విషయాన్ని ఒక సాధారణ విషయంగా పరిగణించి సరైన పద్దతిలో ప్రయోజనకరంగా దానిని తొలగించుకుంటారట. ఇటువంటి వైఖరే సామాజికంగా జర్మనీలో మెటా ఫిజిక్స్, కవిత్వమూ ఉదయించడానికీ, ఫ్రెంచ్ లో ఫ్రెంచి తరహా రాజకీయాలకూ, యూరోపులో ఇంగ్లీషు ఎకానమీ రావడానికి కారణమంటాడు. రాజకీయంగా కూడా జర్మనుల సాంప్రదాయ వాదం ( conservatism), ఫ్రెంచి వారి విప్లవాత్మక ఉగ్రవాదం (revolutionary terrorism) , అమెరికనుల ఆధునిక ఉదారవాదాల( modern  liberalism) ను వారి టాయిలెట్ల నమూనాలతోనే అర్థం చేసుకోవచ్చంటాడు. ఈ లెక్కన మనదేశంలో నిన్న మొన్నటి వరకూ టాయిలెట్లు లేవు కాబట్టి మన ప్రబంధ కవుల సందర్భానుచిత ప్రకృతి వర్ణనలకు కారణం లేకపోలేదనుకోవాలి.

కీ హోల్ లాగా ఉండే మన ఇండియన్ టాయిలెట్ల ఆధారంగా ప్రస్తుత మనదేశ అస్తిత్వ వైఖరిని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. పైగా గ్లోబలైజేషన్ పుణ్యమా అని మనమూ వెస్టర్న్ టాయిలెట్లను ఉపయోగించటం మొదలెట్టేశాం. మన బానిస వైఖరి వలననే ఇదంతా కావచ్చు. మన సాంప్రదాయం అని చెప్పి బహిరంగ విసర్జనను సమర్థిస్తూ జల్లికట్టులాంటి ఉద్యమాలూ పొడచూపొచ్చు. కడుపు పట్టుకుని లోపలికి పోయి, చేతులూపుకుంటూ బయటకి వచ్చి..."రిఫ్లెక్ట్స్ మై స్టైల్" అని సోనమ్ కపూర్ చెప్పినట్టు మనం కూడా అవసరం తీరిన తరువాత బోడి మల్లన్న అంటూంటాం. మనదేశంలో ప్రజాస్వామ్యం ఓటరు ఓటేసేంత వరకే..ఓటేశాక రాజకీయనాయకులు ఐదేల్లు చేతులూపుకుంటూ గడిపేయడమే చేస్తుంటారు. మన పబ్లిక్ టాయిలెట్ల ప్యాన్ లు తెల్లగా తళ తళ మెరిసినపుడు మన దేశానికి నిజంగా స్వచ్ఛ భారత్ ఒచ్చినట్టు. టాయిలెట్ రూంలలో అసలు వాసనతో పాటు, సిగరెట్, పాన్ మసాలా వాసనలు అదనం. తలుపుల మీద పెన్నుతో గీసిన బూతు బొమ్మలు ఉచితం. ఆ విధంగా చూచినపుడు ప్రపంచంలో మన టాయిలెట్లు చివరినుండి అత్యత్తమ స్థానాన్ని సాధిస్తాయేమో. "ప్రపంచంలోనే నంబర్ వన్ స్థాయి" అని కలలుగానే హైటెక్ ముఖ్యమంత్రిగారు సీసీ కెమెరాలతో టాయిలెట్ల పనితీరును పునరుద్ధరిస్తానని అనుకోవడం బహుశా గతం తాలూకు "వాసనలే" కావచ్చు.  ప్రపంచంలోకే అత్యుత్తమ టాయిలెట్లు జపాన్ సొంతమట. జపాన్ తరహాలో బుల్లెట్ ప్రూఫ్ ట్రైనులు మనకొద్దులేగానీ, ఏలిన వారు జపాన్ తరహాలో టాయిలెట్లు అభివృద్ధయ్యేలా చూస్తారని కోరుకుందాం. ప్రజలు చైతన్యవంతులై తమ నిత్యావసరాల విషయంలో పోరాడకపోతే కుర్చీలెక్కే ఏలినవారు తమ కుర్చీల కింద రంధ్రాలు చేసుకుని మరీ కూర్చుంటారనేది సత్యం. అయిదు నిమిషాల కంపు స్థానే అయిదేండ్ల కంపును భరించకతప్పని పరిస్థితి రాకుండా చూసుకుందాం.

6/4/17
Virinchi virivinti
విరించి ll  పీకేసిన కళ్ళు ll
...............................
తెరిచివుంచిన కనురెప్పల్లోంచి
నిన్ను చూస్తూనే ఉన్నాడు కదూ అతడు..
నీవు గమనించి ఉండవు తల్లీ..!
కనుగుడ్లే లేవు కదమ్మా..!!
కలలను దాచుకున్న కళ్ళు
కన్నీటిని ఆపుకున్న కళ్ళమ్మా అవి.
నిను చూశాడని పీకేశారు కదమ్మా...!
ఈ చీకటిని భరించగలవా తల్లీ..!!

పక్కటెముకలు విరిచేయబడి
మర్మావయవాలు చీల్చేయబడి
వివస్త్రుడై నిర్లజ్జగా కదలలేని
పాషాణ శవంలా కనిపిస్తున్నాడు కదూ...!
అతడు శవం కాదమ్మా
బతికున్న వారి అసలు రూపాన్ని చూపిస్తున్న శిల్పే అతడు.

ఒకప్పుడు బుడి బుడి అడుగులు వేసిన బుడతడే అతడు
అమ్మకు ముద్దుముద్దు మాటలు చెప్పిన చిన్నారే అతడు
వేల ఆశలను, భవ్య జీవితాన్నీ భుజానికెత్తిన యువకుడతడు
మధురోహల స్వప్నాలతో నీముందు వాలిన సుందరుడతడు
ఏం మిగిలిందమ్మా ఈరోజు ..?

మరచి పోక తప్పదు కదా తల్లీ...!
ప్రేమను చిదిమేసినా, నీ జీవితం జీవించక తప్పదు
నీకథ నీవారిమధ్యే మళ్ళీ మొదలుకాక తప్పదు
ఈ దేశం ఆవల, మరేదేశంలోనో..
ఈ వెంటాడే గుర్తులను నీవు వదిలేయక తప్పదు
కానీ పీకేసిన కళ్ళ వెనుక వేలాడిన కలలిపుడు
ఈ కలంతో నిన్నడుగుతున్నాయి ఓ చివరి కోరిక
అమ్మా...!ఈ దేశంలో తల్లులు కులాలను కంటారు
ఆ దేశంలోనైనా నీవు పిల్లలను కంటావు కదూ....??

31/3/17
ప్రాథమిక విద్య ఏ భాషలో ఉండాలి?.

ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్కారీ పాఠశాలల్లో తెలుగు మాధ్యమ బోధన తీసివేసి పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే చదువు కొనసాగాలని ఒక ప్రతిపాదన ముందుకు తీసుకువచ్చింది. జీ.వో.332 తీసుకు వచ్చి అన్ని మునిసిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియంను రద్దు చేసి ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టారు. దానికి విద్యాశాఖా మంత్రిగారు ఇచ్చిన వివరణ " ఎంసెట్ ఎంట్రెన్స్ లో సబ్జెక్ట్ అప్లికేషన్స్ ఉంటాయి. అవి ఇంటర్మీడియేట్ బుక్స్ లో ఉండవు. ఆ అప్లికేషన్స్ చదవాలంటే రకరకాల బుక్స్ చదవాలి. అవన్నీ ఇంగ్లీషులో ఉంటాయి కాబట్టి పిల్లలకు ఒకటో తరగతినుండి పదవతరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో బోధన జరగాలి" అని. అంత పెద్ద నిర్ణయానికి ఈ చిన్న సమర్థన అది కూడా ఏ మాత్రం పొసగని సమర్థన ఎందుకో అర్థం కాలేదు. పైగా రాష్ట్రంలోని మేధావి వర్గంలో ఈ నిర్ణయంపై పెద్దగా వ్యతిరేకత వచ్చినట్టు కూడా కనబడలేదు. ఒకటి రెండు రోజులు ఉపాధ్యాయ సంఘాల నిరసనలు తప్ప, మరే కోణం నుంచీ అభ్యంతరాలూ రాలేదనిపించింది. దీనిపై మేధావి వర్గాల చర్చలు గానీ, పునస్సమీక్షలుగానీ అటు మీడియాలో ఇటు ప్రజలల్లో కనిపించలేదు. చర్చలు ఎలాగూ అసెంబ్లీలో జరగవు, ఈ విషయం మీద మాట్లాడాలని ప్రతిపక్షాలు నోరు తెరిచినట్టు కూడా అనిపించలేదు. చర్చలు జరగకపోవటం ప్రజాస్వామ్యంలో ఏక పక్ష నిర్ణయాన్ని ఆమోదించటం ప్రజల రాజకీయ సామాజిక చైతన్య రాహిత్యాన్ని సూచిస్తూ ఉంటుంది.

ఒక వైపున తెలుగు మీడియం అనవసరం, ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాభ్యాసం జరగాలి అనే వాదన బలంగా, అర్థవంతంగా కూడా ఉంది. డబ్బున్న వారు వారి పిల్లలను ఇంగ్లీషు మీడియం లలో చదివించడం వలన హయ్యర్ ఎడ్యుకేషన్ లో సులువుగా రాణించగలుగుతున్నారనీ, అదే బీదవారి పిల్లలు తెలుగు మీడియం చదివి, హయ్యర్ ఎడ్యుకేషన్ లో చతికిల పడుతున్నారనీ, ఇంగ్లీషును డిమాండ్ చేసే ప్రైవేటు సంస్థలలో ప్రవేశం పొందలేకపోతున్నారనీ అందువలన గవర్నమెంటు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన జరగటం స్వాగతించ వలసిన అంశమనీ వారంటారు. మనదేశంలో ధనిక పేద అంతరాలకు కులాల వెనుకబాటుతనాలూ జోడై ఉంటాయి కనుక, కొన్ని కులాల వారికీ ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ అందని ద్రాక్షే అయిందన్నది వాస్తవం. సామాజిక అంతరాలను అడ్రస్ చేసే ఇటువంటి వాదన పూర్తి సమర్థనీయమైనది. పైగా మాతృభాష పరిరక్షించాలని అందుకు విద్యా బోధన మాతృభాషలోనే సాగాలని స్లోగన్లు ఇచ్చేవారు, వారి పిల్లలను మాత్రం ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తూండటంతో మాతృభాష పరిరక్షణ కేవలం పేద విద్యార్థులేదేనా అనే సంశయమూ మొదలవుతుంది. అటువంటి వారి హిపోక్రసీనీ దాని వెనుక ఒక మెజారిటీ సెక్షన్ వారిని చదువుల పోటీకి దూరంగా ఉంచే కుట్రనీ ఈ వాదన గుర్తిస్తుంది. అందువలన సర్కారీ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన సమాజంలో సమానత్వాన్ని పెంచుతుందనే ఉద్దేశంతో ఈ మార్పును ఈ వాదన స్వాగతిస్తుంది.

అయితే దీనికి వ్యతిరేకంగా, ఏ మాధ్యమంలో చదవాలన్నది గవర్నమెంటు శాసించటమేమిటని ఇంకో వాదన. విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ తమకు తోచిన మాధ్యమంలో చదువుకునే వెసులుబాటు ఉండాలి తప్ప మొత్తం ఒకటే మాధ్యమం ఉండాలనేది సరైనది కాదు. ఇది బలం లేని వాదనలా అనిపించినా మూలాలకు పోయినపుడు ఎన్నో అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రాథమిక విద్య ఎందులో జరగాలి అనే అంశం మీద రీసెర్చ్ కూడా జరిగింది. రీసెర్చ్ లో తేలిన అంశాలు క్రమానుగుణంగా ఎలా మార్పు చెందాయో కూడా గమనించవలసి ఉంది.

సాధారణంగా చిన్న పిల్లలకు విద్య ఇంటి వద్దే మొదలవుతుంది. పాఠశాల అనేది ఆ విధంగా మొదలైన విద్యను ముందుకు తీసుకెళ్ళే ప్రక్రియలాగా ఉండాలి. విద్య నెరపడం వారి ఆటలో భాగం కావాలే తప్ప చిన్నారుల లేత మనసుల మీద అది భరింపరాని భారం కాకూడదు. ప్రపంచంలో ఈ రోజు రెండు బిలియన్ల  (రెండువందల కోట్లు) చిన్నారులున్నారు (పదిహేనేల్ల లోపు). వీరు మొత్తం ప్రపంచ జనాభాలో ఇరవై ఏడు శాతం. వీరిలో అట్టడుగు వర్గాలకు చెంది, కనీసం చదువు అందుబాటులో కూడా లేని పిల్లలు దాదాపు ఎనిమిది కోట్లు. అంటే వీరు ఎటువంటి విద్యా సంస్థలల్లో ఇప్పటి వరకు ప్రవేశం పొందని వారు. ఇక స్కూలు లో ప్రవేశం పొంది చదువు పూర్తి చేయని వారి శాతం( డ్రాపవుట్స్) ప్రపంచ వ్యాప్త డేటా తెలీదుగానీ, ప్రపంచంలో సౌత్ ఏషియా ముప్పై మూడు శాతం డ్రాపవుట్స్ తో ప్రథమ స్థానంలో ఉంది. ఇందులో పాకిస్థాన్ అత్యధికంగా ముప్పై ఎనిమిది శాతం కాగా, కేవలం బాలికల డ్రాపవుట్ శాతం ఆ దేశంలో అత్యధికంగా నలభై ఒక్క శాతంగా వుంది. మన దేశంలో పరిస్థితి కూడా ఈ డ్రాపవుట్ ఇంచుమించు ముప్పై శాతం మీదే ఉంది. ముఖ్యంగా డ్రాపవుట్స్ రెండవ తరగతి లోపలే ఎక్కవగా ఉంటున్నాయంటే ఆలోచించవలసిన అవసరం ఉంది. యునెస్కో అంచనా ప్రకారం ప్రాథమిక విద్య మాతృభాషలో జరగకపోవటమే దీనికి కారణం. అందుకే 1953 నుంచి యునెస్కో పిల్లలను మాతృ భాషలో చదవించటమే ఉత్తమమని నొక్కి వక్కాణించింది. మాతృభాషలో విద్య నెరపటం వలన విద్యాలయాల్లో చేరే అవకాశమూ, చదువులో విజయావకాశమూ పెరుగుతాయి అని యునెస్కో రీసెర్చి చెబుతోంది. ఎందుకంటే చిన్నారులకు మాతృభాషలో విద్య నేర్పడం కేవలం వారి సాంస్కృతిక మూలాంశాన్ని అందించడమే కాక, ఎదగబోయే మనిషిగా విద్య ఒక ఆనందకరమైన అంశంగా తయారవుతుంది. చిన్నలేలేత వయసులో అర్థం కాని తెలియని భాష, దానిని అందుకోలేని అశక్తతా వారిలో తెలియని డిప్రెషన్ ని స్ట్రెస్ నీ కలిగిస్తాయి. అంతే కాకుండా ఇంటికి వచ్చాక తల్లిదండ్రులు కూడా ఆ చిన్నారుల చదువులో పాత్ర వహించే అవకాశము పెరగటంతో "ఇల్లు- స్కూలు -విద్యార్థి ట్రయాంగిల్" సమర్థవంతంగా పనిచేయడం మొదలవుతుంది. అటువంటి తల్లిదండ్రులు స్కూలులోని గురువులతో సరిగా మాట్లాడగలుగుతున్నారని కూడా ఈ స్టడీ చెబుతోంది. యునెస్కో ఉద్దేశాలలో పాఠశాలకు దూరంగా ఉన్న విద్యార్థులను ఎన్రోల్ చేయించటమే కాదు, వారి చదువును కొనసాగించడం కూడా.

ఇక ఇంగ్లీషులో చదివితే కాంపిటీటివ్ ఎక్జామ్స్ లో సీటు వచ్చేస్తుంది అనుకునే వారు గమనించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మాతృభాషలో కాకుండా డామినెంటు భాషలో విద్యను అందించాలని ఉవ్విల్లూరుతున్నారు. వారి సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మధ్య జరిగిన యునెస్కో కాన్ఫరెన్సు గత ముప్పై యేండ్లుగా చేసిన రీసెర్చిని బయటపెట్టింది. భాష నేర్చుకోవడానికి ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్న సూత్రాలను అందించింది. అవేంటో ఇపుడు చూద్దాం.

       *  "సాధారణంగా ఒక విద్యార్థికి మాతృ  భాషలో పట్టు సాధించడానికి పన్నెండేళ్ళు పడుతుంది. పన్నెండేళ్ళ లోపు ఒకవేళ ఆ పిల్లలు మాతృభాష కాక వేరే భాష చదవాలనుకుంటే, మాతృభాషలో విద్యను మాత్రం ఆపేయకూడదు. కొత్తగా నేర్చుకుంటున్న భాష కేవలం అదనపు భాషగా ఉండాలే తప్ప మాతృభాషలోనే చదువు సాగాలి". ఉదాహరణకు తెలుగు మీడియంలో చదివే పిల్లవాడు ఇంగ్లీషును అదనపు బాషగా నేర్చుకుంటాడు. సామాన్య, సాంఘీక, గణిత శాస్త్రాలను తెలుగులోనే నేర్చుకుంటాడు. ఇన్ని సంవత్సరాలు తెలుగులో చదవటం వలన ఆ భాషమీద పట్టు ఏర్పడుతుంది.

       *"శాస్త్ర విషయాలను మాతృ భాషలో కాక వేరే భాషలో కూలంకషంగా అవగాహన చేసుకోవడానికి ఆ కొత్త భాషను పిల్లలు దాదాపు ఏడు సంవత్సరాలు చదివ వలసి ఉంటుంది". ఇంతకు ముందు ఉదాహరణే తీసుకుంటే తెలుగు మాధ్యమంలోనే గణితాది శాస్త్రాలకు సంబంధించిన పరిజ్ఞానం పెంచుకోవడం వలన పిల్ల వాడి మీద అదనపు భారం పడదు. ఇపుడు అతడు కొత్తగా ఇంగ్లీషు మాధ్యమంలోకి మారడం వలన, పైన చెప్పిన రీసెర్చి ప్రకారం ఇంగ్లీషు భాషలోని పదాలనూ, అర్థాలనూ, పలికే విధానాన్నీ అవగాహన చేసుకోవడం అదనపు భారం కావడం, ఏడు సంవత్సరాలు కేవలం భాషను అవగతం చేసుకోవడంలోనే గడిచిపోవడం వలన గణితాది శాస్త్రాల మీది అవగాహన పైపైనే ఉండిపోతుంది తప్ప, లోతైన సంపూర్ణావగాహన ఉండదు.

    *"మాతృభాష మీద పట్టు సాధించిన వారు, చాలా సులువుగా రెండవ భాషను నేర్చుకోగలుగుతున్నారని ప్రపంచ వ్యాప్త స్టడీలు చెబుతున్నాయి. ట్రాన్స్లేషన్, ట్రాన్సిషన్ అనే విషయాలను ఈ సందర్భంగా గుర్తించాలి". చిన్నప్పటి నుండి తెలియని భాషలో చదువే విద్యార్థి ప్రతీ పదాన్నీ, ప్రతీ విషయాన్నీ తన భాషలోకి అనువాదం( ట్రాన్స్లేషన్) చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సమర్థవంతంగా చేసుకోలేని విద్యార్థుల విషయావగాహన నామ మాత్రంగానే ఉంటుంది. కానీ అలాకాక మాతృభాషలో చదువుకోవడం వలన విషయావగాహన విస్తృతంగా పెంచుకోగలిగిన విద్యార్థి ఇంకో భాషలోకి అదే విషయాన్ని చాలా సులువుగా (ట్రాన్సిషన్) మార్చుకోగలుగుతాడు. ట్రాన్సిషన్ ట్రాన్స్లేషన్ అనే ఈ రెండు విషయాలనూ అవగతం చేసుకోకపోవడం వలన ఎప్పుడో పెద్దగయ్యాక ఇంగ్లీషు మీడియంలోకి మారటం కష్టమేమో అనే అనవసర భయం సృష్టించబడింది. మొన్న విద్యాశాఖా మంత్రిగారి మాటలు దాదాపు ఈ భయాన్ని పిల్లలలో తల్లిదండ్రులలో కలిగించేదిగా వున్నాయి.

    *"కేవలం ఒక భాషలోనే విద్య గరిపేవారికన్నా..మాతృ భాషలో విద్య నేర్చుకుంటూ ఇతర భాషలను అదనంగా నేర్చుకునే పిల్లల మెదడు చురుకుగా పనిచేస్తుందని గ్రహించడం జరిగింది".

ప్రపంచ వ్యాప్తంగా జర్మనీ జపాన్ ఫ్రాన్స్ బ్రిటన్ వంటి దేశాలనుంచే ఎక్కువగా మేధావులు శాస్త్రజ్ఞులు ఉదయించారు. వారి మాతృభాషలోనే వారి శాస్త్రావగాహన ఉండటమందుకు కారణం. పిల్లలను భవిష్యత్తు ఉద్యోగాల కోసం తయారు చేయడమా లేక వారిని శాస్త్రాది విషయావగాహన గల పరిపూర్ణ మానవులుగా చూడగలగటమా అన్నది మనం ఆలోచించాలి. ఏరకంగా చూసినా మాతృభాషలో విద్య దాని గొప్పదనమూ నిరూపితం అవుతూనే ఉన్నాయన్నది వాస్తవం.

28/3/17
Virinchi  virivinti
విరించి ll   అతడూ నేను ll
-----------------------------------------------
అతడు నాతో పెద్దగా మాట్లాడిందీ లేదు
మాట్లాడటానికని ఉత్సుకత చూపిందీ లేదు
కానీ నన్నెందుకనో ద్వేషిస్తూంటాడతడు
మనం అనుకోకుండా జరిగినదెప్పటికీ మనకు ఆశ్చర్యకరమే

బహుశా అతడు శుక్ల పక్షపు చంద్రుడేమో...
వెన్నెల చేతిలోంచి జారవిడిచిన అమావాస్యను నేను

ఎండలో ఎంతగా ఆడుకుంటాడో అతడు
నేనేమో  నీడలో కూర్చుని అలసిపోయివుంటాను
నీడలో తననూ సేదదీరమని ఎంతగా సైగ చేస్తుంటానో
తనతో ఆడుకోమని అతడెపుడూ పిలిచిందీ లేదు
నేను అడిగిందీ లేదు

బహుశా నేనతడిని తప్పుగా చదివుంటానేమో
నిశ్శబ్దంగా నింపాదిగా చదవడం నాకలవాటు కాబట్టి

ఒంటరి రాత్రుల్లో అతడు నాచేతిలో పుస్తకమౌతూంటాడు
నేనతడి కవితలో ఒక పదమైనా అయ్యానేమోనని వెతుకుతుంటాను

ద్వేషమనే పదం దొర్లకుండా కవిత్వం రాస్తాడతడు
క్షమించడం తెలియని బరువైన మనసులకెన్ని జాగ్రత్తలవసరమో..

పదాలకు గుణాలద్దుతూ  గుంభనంగా రాస్తాడతడు
పితూ రీలు మోసే కలాలకెన్ని తలుపులవసరమో..

అతడు నన్నో, నా రంగునో, నా పేరునో చూసి
చూశావా నీవెంత దూరమో నాకు అంటూంటాడు
మేమిద్దరమూ ఎంత దగ్గరో చెప్పడానికి
ఆకాశాన్ని చూపిస్తుంటానతడికి.

12/4/17

Saturday, 8 April 2017

మరుగున ( మడుగున) పడుతున్న కొన్ని తెలుగు సామెతలు.

1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
5. అనువు గాని చోట అధికులమనరాదు
6. అభ్యాసం కూసు విద్య
7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం
9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు
12. ఇంట గెలిచి రచ్చ గెలువు
13. ఇల్లు పీకి పందిరేసినట్టు
14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు
15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు
16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు
17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు
18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ
19. కోటి విద్యలూ కూటి కొరకే
20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు
21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం
22. పిట్ట కొంచెం కూత ఘనం
23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు
24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక
25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు
26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె
27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు
28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు
29. ఆది లొనే హంస పాదు
30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము
31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు
32. ఆకాశానికి హద్దే లేదు
33. ఆలస్యం అమృతం విషం
34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ
35. ఆరోగ్యమే మహాభాగ్యము
36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట
37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి
39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు
40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు
41. ఏ ఎండకు ఆ గొడుగు
42. అగ్నికి వాయువు తోడైనట్లు
43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు
44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట
45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు
46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు
48. అప్పు చేసి పప్పు కూడు
49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా
50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు
51. బతికుంటే బలుసాకు తినవచ్చు
52. భక్తి లేని పూజ పత్రి చేటు
53. బూడిదలో పోసిన పన్నీరు
54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,
గిల్లితే యేడుస్తాడు
55. చాప కింద నీరులా
56. చచ్చినవాని కండ్లు చారెడు
57. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు
58. విద్య లేని వాడు వింత పశువు
59. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ
60. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు
61. చక్కనమ్మ చిక్కినా అందమే
62. చెడపకురా చెడేవు
63. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు
64. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ
65. చింత చచ్చినా పులుపు చావ లేదు
66. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,
ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట
67. చిలికి చిలికి గాలివాన అయినట్లు
68. డబ్బుకు లోకం దాసోహం
69. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
70. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
71. దాసుని తప్పు దండంతో సరి
72. దెయ్యాలు వేదాలు పలికినట్లు
73. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు
74. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి
75. దొంగకు తేలు కుట్టినట్లు
76. దూరపు కొండలు నునుపు
77. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు
78. దురాశ దుఃఖమునకు చెటు
79. ఈతకు మించిన లోతే లేదు
80. ఎవరికి వారే యమునా తీరే
81. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు
82. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట
83. గాజుల బేరం భోజనానికి సరి
84. గంతకు తగ్గ బొంత
85. గతి లేనమ్మకు గంజే పానకం
86 గోరు చుట్టు మీద రోకలి పోటు
87. గొంతెమ్మ కోరికలు
88. గుడ్డి కన్నా మెల్ల మేలు
89. గుడ్డి యెద్దు చేలో పడినట్లు
90. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
91. గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా
92. గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు
93. గుడ్ల మీద కోడిపెట్ట వలే
94. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట
95. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు
96. గురువుకు పంగనామాలు పెట్టినట్లు
97. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు
98. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు
99. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు
100. ఇంటికన్న గుడి పదిలం
101. ఇసుక తక్కెడ పేడ తక్కెడ
102. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట
103. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు
104. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు
105. కాకి ముక్కుకు దొండ పండు
106. కాకి పిల్ల కాకికి ముద్దు
107. కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది
108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా
109. కాసుంటే మార్గముంటుంది
110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు
111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును
112. కలి మి లేములు కావడి కుండలు
113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు
114. కంచే చేను మేసినట్లు
115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !
116. కందకు కత్తి పీట లోకువ
117. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం
118. కీడెంచి మేలెంచమన్నారు
119. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు
120. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు
121. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు
122. కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా
123. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట
124. కూటికి పేదైతే కులానికి పేదా
125. కొరివితో తల గోక్కున్నట్లే
126. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు
127. కొత్తొక వింత పాతొక రోత
128. కోటిి విద్యలు కూటి కొరకే
129. కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట
130. కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు
131. కృషితో నాస్తి దుర్భిక్షం
132. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము
133. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు
134. కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు
135. ఉన్న లోభి కంటే లేని దాత నయం
136. లోగుట్టు పెరుమాళ్ళకెరుక
137. మెరిసేదంతా బంగారం కాదు
138. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో
139. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
140. మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు
141. మనిషి మర్మము.. మాను చేవ...
బయటకు తెలియవు
142. మనిషి పేద అయితే మాటకు పేదా
143. మనిషికి మాటే అలంకారం
144. మనిషికొక మాట పశువుకొక దెబ్బ
145. మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు
146. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా
147. మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా
148. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట
149. మొక్కై వంగనిది మానై వంగునా
150. మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు
151. మొసేవానికి తెలుసు కావడి బరువు
152. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి
153. ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు
154. ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి
155. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు
156. నడమంత్రపు సిరి నరాల మీద పుండు
157. నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది
158. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా
159. నవ్వు నాలుగు విధాలా చేటు
160. నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు
161. నిదానమే ప్రధానము
162. నిజం నిప్పు లాంటిది
163. నిమ్మకు నీరెత్తినట్లు
164. నిండు కుండ తొణకదు
165. నిప్పు ముట్టనిదే చేయి కాలదు
166. నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు
166. నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి
167. ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు
168. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు
169. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు
170. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు
171. ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు
172. ఊరు మొహం గోడలు చెపుతాయి
173. పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు
174. పాము కాళ్ళు పామునకెరుక
175. పానకంలో పుడక
176. పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట
177. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు
178. పండిత పుత్రః పరమశుంఠః
179. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
180. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు
181. పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట
182. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది
183. పెళ్ళంటే నూరేళ్ళ పంట
184. పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు
185. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట
186. పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది
187. పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు
188. పిచ్చోడి చేతిలో రాయిలా
189. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా
190. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం
191. పిండి కొద్దీ రొట్టె
192. పిట్ట కొంచెము కూత ఘనము
193. పోరు నష్టము పొందు లాభము
194. పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు
195. పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట
196. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
197. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు
198. రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము
199. రామాయణంలో పిడకల వేట
200. రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు
201. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు
202. రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు
203. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
204. రౌతు కొద్దీ గుర్రము
205. ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు
206. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు
207. సంతొషమే సగం బలం
208. సిగ్గు విడిస్తే శ్రీరంగమే
209. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు
210. శుభం పలకరా వెంకన్నా అంటే పెళ్ళి కూతురు ముండ ఎక్కడ అన్నాడంట!