Saturday, 22 April 2017

మతం ఒక అబ్నార్మల్ జెనిటికల్ మ్యుటేయన్

తర్కం ఎక్కడ ఆగపోతుందో అక్కడ మతం మొదలవుతుంది. తర్కాన్ని ఏది నాశనం చేయగలో అదే మతంలా అవతరించగల శక్తిని సంతరించుకుంటుంది. మతాన్ని అవలంబించే వారిలో తర్క జ్ఞానం కించిత్తయినావుంటే ఉరేసుకు చస్తానన్నాడట వెనకటికొకడు. వారి నోటిదూల మంత్రాలకూ, చేతివాటం కనికట్టులకూ చింతకాయలూ, శెనగపప్పులూ రాలేట్టయితే, మానవుడి పరిణామం ఇప్పటికీ జానెడు గుడ్డ అడ్డం పెట్టుకునే దెగ్గరే ఆగి ఉండేది. కానీ ఈ చేతి వాటం కనికట్టు రాయుల్లే మన మతగురువులు. "ప్రాచీన క్రిస్టియన్ సన్యాసి ప్రజల కోసం, వారి విముక్తి కోసం శరీరాన్ని శుష్కింప జేసుకుంటే, ఆధునిక సన్యాసి తన వ్యక్తిగత విముక్తికోసం ప్రజల శరీరాలను శుష్కింపజేస్తాడు అంటాడు" మార్క్స్ మహాశయుడు. ఇటువంటి స్వార్థ సన్యాసులతో, వాజమ్మలతోటే మతం మొదలుతుంది. కానీ ప్రత్యక్షం, ప్రమాణం, అనుమానం పద్దతిలో మొదలై ముందుకు సాగేది తర్కం. ప్రాచ్య పాశ్చాత్య మేధావులంతా తర్కాన్నే ఆశ్రయించారు. మన దగ్గరున్న అంగీకృత్య ఖండనం పాశ్చాత్య డయాలెక్టికల్( dialèctical) కి దగ్గరి సంబంధం కలిగి ఉంటుందనటంలో సందేహం లేదు. ఎందుకటే అప్పటి ప్రపంచ మేధావులు తర్కాన్నే ఆశ్రయించారు తప్ప మతాన్ని కాదు. గ్రీకు 'జీనో' మొదలు పెట్టిన తర్కం సోక్రటీస్ నుండి, ప్లేటో నుండి ముందుకు సాగి హెగెల్ తో జడలు విప్పి, వాద ప్రతివాద, సమన్వయ వాదాది త్రిక తర్కం (గతి తార్కికం)గా అవతరించింది. ప్రపంచానికి భాష్యం చెప్పిన తత్వవేత్తలు మతం గుప్పిటిలో దాదాపు ఇరుక్కు పోలేదు. ప్రాచీన ఋషులెవరూ ఏ మతానికీ బంధీ కాలేదు. కానీ జన సామాన్యం తత్వ శాస్త్రాన్నే కాదు తత్వ వేత్తలనీ వదిలిపెట్టింది. సోక్రటీసుకు విషమిచ్చి చంపేసింది. అరేబియన్ తత్వవేత్త ఇబన్ రుష్ద్ పుస్తకాలనూ తగులబెట్టింది, డార్విన్ పుస్తకాలను తగులబెట్టింది. మనదేశంలో లోకాయత, భౌతికవాద దర్శనాలు నామరూపాలు కోల్పోయాయి. మొదటినుండీ మతం తర్కాన్ని నాశనం చేయడం వలననే వృద్ధి చెందింది. తర్కాన్ని నాశనం చేయకుండా మతం మనలేదు. ఆల్జీబ్రానూ, జామెట్రీని కలిపి కార్టీజియన్ సిస్టం( Cartesian system) సృష్టించిన డెకార్టే (Descartes) వంటి గణితజ్ఞుడైనా తర్కం సహాయంతోటే దేవుడి ఉనికిని నిరూపించగలమనీ అన్నాడే తప్ప నమ్మకాలతో దేవుడి ఉనికిని గుడ్డిగా ఒప్పుకోలేదు. లెక్కలు చూస్తేగానీ తిక్కలు కుదరవని ఊరకే అనలేదు కదా.  "బ్రైటర్ దాన్ థౌజండ్ సన్స్ ( Brighter than thousand suns) పుస్తకంలో చెప్పినట్టు శాస్త్రవేత్తలను రాజ్యాధినేతలు తప్పు మార్గం పట్టిస్తే...తార్కిక జ్ఞానంగల మనుషులను మతాలు తప్పుదారి పట్టిస్తాయన్న విషయం మధ్య యుగాల చరిత్రను చూస్తే అర్థమౌతుంది. తత్వ శాస్త్రం మతం కలిసిపోవడమూ, మత కోణంలో తత్వ శాస్త్రాన్ని వివరీంచటమూ, తత్వాన్ని మత భావనల అభివృద్ధికి గురిచేయడమూ పరమ పాండిత్యంగా ఆవిర్భవించి పాండిత్య వాదానికి( Scholasticism) తెరలేపింది. మౌఢ్యానికి వ్యతిరేకమనిపించిన బౌద్ధం తాంత్రిక కౌగిలింతల్లో తేలియాడింది. యోగ మార్గం కన్నా జ్ఞానమార్గం గొప్పదన్న గీత "యజ్ఞం వలన మోక్షం వస్తుంద"ని చెప్పక తప్పింది కాదు. (అది ఖర్చుతో కూుకున్న పనిగనుక జ్ఞానంతో సరితూ గదని అందులో సవరణ).

మతం ప్రతివాదాన్ని(anti thesis) నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది. ఏ మతమైనా తన మార్గమే గొప్పది అంటుంది. తాను చెప్పిన దైవమే అసలైన దైవం అంటుంది. తను చూపించిన మార్గమే దేవుని చేరు ఏకైక మార్గమనీ అంటుంది. తన ప్రవక్తనే చివరి ప్రవక్త అంటుంది. దేవుడు జడ్జ్మెంటు ఇచ్చే రోజు ఒకటుంటుందని నమ్ముతుంది. ఇవన్నీ స్టేట్మెంట్లు అనుకుంటే, వాటికి వ్యతిరేకంగా ఎవరు ప్రతివాదాన్ని వినిపించినా, వెంటనే నాశనం చేయడమే మతం ఉనికికి చరమ మార్గం. పలానా పుస్తకంలో ఈ విధంగా రాశేశాడు దేవుడని చెబుతుంది మతం. అదంతా అపౌరుషేయం అంటుంది. దేవుడెందుకు రాశాడో, దేనితో రాశాడో, అసలేం పని లేక రాశాడో మనకు తెలియదు గానీ, అది అడిగే హక్కూ మనకు ఉండకూడదంటుంది మతం. ఆ విధంగా రాయబడి చెప్పబడీ ఉన్నందున ఆ విధంగానే చెయ్యాలి. వ్యతిరేకంగా చేస్తే దేవుడి పేరు చెప్పి మతానుయాయులే మనుషులను నాశనం చేయపూనుకుంటారు. మతమంటే మొత్తానికి తప్పొప్పుల పట్టిక తప్ప ఇంకేమీ కాకుండా పోతుంది. ఈ పలానాది ఇలా చేయాలి, అలా చేయకూడదు అని సూత్రమాలనొకటి తయారు చేసి పెడుతుంది. ఈ మూల సూత్రాలు కరడుగట్టిన తరువాత, మొదటికి ఎసరు బెట్టినట్టు, ఆ కాలానికి చెందిన విజ్ఞాన శాస్త్రాన్నీ తత్వ శాస్త్రాన్నీ భ్రష్టు పట్టిస్తుంటుంది మతం. ఖగోళ శాస్త్రంలో గ్రీకులు బాబిలోనియన్లు సాధించిన విజయాలకంటే ఉత్కృష్టమైన విజయాలను మూటగట్టుకున్న భారతదేశం,ఆ తరువాతి కాలంలో అందులోకి మత భావనలను చొప్పించి ఆస్ట్రానమీని ఆస్ట్రాలజీగా మార్చి పడేసింది. గ్రీకులు పైథాగొరియన్లు భారతీయులు వృద్ధి చేసిన అంక గణితం(number theory) చివరికి అంకెల జోస్యంగా( numeroĺogy) పరిణమించింది. భౌతిక శాస్త్రాలకు భాషగా ఉండవలసిన గణితం చివరికి కాకి లెక్కలకూ పిచ్చి గణనలకూ ఆలవాలమై పతనం చెందింది. గణితానికి మిస్టిసిజంను జతచేసే జాడ్యం క్రీ.పూ ఆరవ శతాబ్దానికి చెందిన పైథాగొరియన్ల నుండి మొదలైందని సరిపుచ్చుకున్నా, పాశ్చాత్య దేశాల్లో మధ్య యుగాల్లోనే(medieval period)  పరిణతి చెందింది. చివరికి దాని ప్రభావం వలన విజ్ఞాన శాస్త్రం వృద్ధి చెందిన ఈ కాలంలో కూడా అదే పాత చింతకాయ పచ్చడిలాంటి మతపిచ్చి మాటలను వినడం, భూమి బల్లపరుపుగా ఉందని నమ్మడమే అవుతుంది.

ఈ మధ్య ఇంకో వాదన మొదలైంది. ఆ వాదన మత ప్రారంభకులను మహానుభావులుగా ఊహించే వాదన. ఆ మత ప్రారంభకులు ఏదైతే రాశారో, ఏదైతే చెప్పారో అది అన్నింటికంటే సర్వోత్తమం, సర్వోత్కృష్టం అంటారు వీరు. మత ప్రారంభకులు ప్రాణం పోయినా పొరపాటున కూడా తప్పు రాయరు, తప్పు చెప్పరు అనే ఒక ఫాల్లసీ వీరిని నడిపిస్తూ ఉంటుంది. తర్కంతో సాగే విజ్ఞాన శాస్త్రం దీనికి పూర్తి భిన్నంగా వాదిస్తుంది. పూర్వులు చెప్పిన దానిని సవరించుకుంటూ, అభివృద్ధి చెందుతూ సత్యం వైపుకు సాగేది విజ్ఞాన శాస్త్రమైతే, పూర్వులు చెప్పిందే పరమ సత్యమని , ఇక అనుమానానికీ, తర్కానికి ఏ మాత్రం చోటివ్వకుండా మతం సాగుతుంటుంది. ఈ వాదన ప్రకారం మతానికి సంబంధించిన ఆ పలానా పుస్తకంలో చెప్పినదంతా అత్యద్భుతమే...పరమ సత్యమే కానీ ఆ మతాన్ని అనుసరించే వారు దానిని సరిగా అవగాహన చేసుకోలేకపోవటం వలనో, లేదా తప్పుగా అర్థం చేసుకోవటం వలననో మాత్రమే ఇన్ని మత సంబంధ మారణ హోమాలు జరిగాయనో వాదిస్తుంది. మతానుయాయుల్లో లోపాలుంటాయి గానీ, మతంలో, మత సూత్రాల్లో లోపాలే ఉండవంటుంది విచిత్రంగా. మతానుయాయుల్లో లోపాలు ఉన్నపుడు ఆ మతాన్ని ప్రారంభించిన అర్భకులలో లోపాలు ఎందుకుండకూడదు అని మనం వీరిని అడగకూడదు. అడిగితే ఠారుమని నిటారుగా పైకిలేస్తారు. వీరి వాదన ప్రకారం మత ప్రారంభకులు దివ్య పురుషులన్నమాట. సగం అడ్డ గోచీలు కట్టుకుని, ప్రసార సాధనలు కూడా సరిగా చేయలేని పరమ అనాగరికమైన కాలం నాటి ఈ అమాయక మానవులు పరమ దివ్య పురుషులుగా ఎలా అయుంటారో వీరు తప్ప బహుశా ఏ విజ్ఞాన శాస్త్రమూ చెప్పలేదనుకుంటా. అంతే కాకుండా మత సూత్రాలు గొప్ప నీతివంతమైన ఆలోచనలకు పునాదులని కూడా వీరు వాదిస్తారు. ఇంకా ఎక్కువ మత కిక్కుగనక తలకెక్కింటే, అసలు తమ మతమే గొప్ప సైన్సు అనీ వాగుతారు. మతంలో చెప్పిన దానికీ నేటి సైన్స్ కీ బీరకాయ సంబంధాల్ని లాగి లాగి కకూన్లలాగా చుట్టచుట్టుకుంటారు. ఆ పురాతన కాలపు నీతి ఇప్పటి ఈ కాలపు నీతికి, సైన్సుకూ ఎట్లా అతుకుతుందో వారికే తెలియాలి. కప్ప బురద నుండి పుడుతుందని నమ్మిన అజ్ఞానాంధకార ప్రజలుండిన సమాజంలోని కిరాతక నీతి ఈ సమాజానికి సరిపోతుందని నమ్మే వారు ఏ బురదలో దొర్లుతుంటారో చెప్పడమూ కష్టమే. వాటిని ఈ కాలానికనుగుణంగా మార్చాలని అనుకోకపోవడానికి ఈ మత ప్రారంభ అర్భకుల మీది ఎనలేని అతి ప్రేమనే.

కాలం మారే కొలదీ మానవుని ఆలోచన పరిపక్వం కావలసిన అవసరం ఉంటుంది పరిణామ రీత్యా. కానీ దానిని పరిపక్వం కానీయకుండా పురాతన నమూనాలోనే ఉంచేయగలది మతం మాత్రమే. ఆదర్శ సమాజాలూ, స్వేచ్ఛా సమాజాలు ఉద్భవించాలంటే మతమన్నదే మొదటి అడ్డంకి. మానవ సమాజ పరిణామానికి అది గుదిబండ. మతం ఉండగా మానవుడు కొత్తగా ఆలోచించే అవకాశం ఎక్కడిది?. ఏది కొత్తగా ఆలోచించవలెనన్నా అదే మత భావనలను ఆలంబన చేసుకుని వీరు సాధించే పరిణామం ఏమిటి?. భారత దేశంలోని పురాతన కాలపు ఋషులూ, గ్రీకు లాటిన్ లలోని తత్వ వేత్తలే ఈనాటి ఆధునికులకంటే నయం. ఋగ్వేద ఋషులు పునర్జన్మలకోసం, మరణానంతర దివ్య జీవనం కోసం కక్కుర్తి పడలేదు సరికదా, ఇటువంటి భావజాలంతో భవిష్యతరాలకు ఇబ్బందులు సృష్టించలేదు, పైగా భౌతిక సుఖలాలసతను దివ్య జీవనమనుకున్నారు. తమకు తెలియని ప్రపంచాన్ని పలు విధాలుగా తెలుసుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేసారు. ఇప్పటి ఆధునికులు ఈ పూర్వీకులు కనుక్కున్న ఆ మాత్రం విషయాల్ని దివ్య పుస్తకాలుగా చదువుకుని తలలు బొప్పికట్టించుకుంటున్నారు. పొరపాటునో, గ్రహపాటునో ఆ పురాతన అర్భకులు తాము కనుక్కున్న విషయాలను ఏదో రూపంలో దాచి ఉంచి పెట్టడమే ఆ తరువాత కాలంలో మత దరిద్రం మనకు చుట్టుకోవడానికి కారణం. వారు దాచి పెట్టి ఉంచడమేమోగానీ ఆధునికులకు మా తాతల మూతులు నేతులు నాకాయని చెప్పుకుంటూ తమ మత గొప్పదనమంతా పూర్వీకుల గొప్పదనమే అనే పటాటోప రోగాలతో సంచరిస్తూంటారు. ఆ విధంగా మతం మనిషికి ఆతడి భావజాలానికీ సంఘర్షణలేని ఒక రెడీమేడ్ వాతావరణాన్ని సృష్టిస్తుంది. అంతా రెడీమేడ్ వష్తువులు వచ్చేసాయని మనం ఇపుడు వాపోతుంటాం గానీ, మతమంటేనే రెడీ మేడ్ ఆలోచనలుగల భావజాలం. అందుకే అది తర్కాన్ని చిదిమేస్తుంది. అసత్యం నుంచి సత్యానికీ, చీకటి నుండి వెలుగుకూ, మృత్యువునుండి అమరత్వానికీ పరిణామం చెందాలనే అద్భుత పరిణామాత్మక స్లోగన్ ని ఇచ్చిన బృహదారణ్యకోపనిషత్తు మతం కోరలలో చిక్కి చివరికి దేవుడి పూజా గదిలో కుంకుమా పసుపుల మధ్యన పూజలు అందుకుంటుంది.

ఈ దేశంలోగానీ మరేదేశంలోగానీ యుగయుగాలుగా మత భావనలకూ రాజ్యాధికారాలకూ, రాజకీయాలకూ విడదీయరాని సంబంధ బాంధవ్యాలు ఉండటం కనిపిస్తుంది. మానవుని ఆలోచనల పరిణామానికి మతం దానిని అంటి పెట్టుకుని ఉన్న రాజకీయాలూ రెండూ ప్రతిబంధకాలే. ప్రతీ వస్తువునూ  వ్యాపారం చేయగలిగిన కాపిటలిజం కాలంలో మతం కొత్త వ్యాపారంగా ప్రజల ముందుకొచ్చింది. దైవ చింతనం, మననం, ధ్యానం ఇపుడు లాభదాయక వ్యాపారాలు. దోపిడీ వర్గాలకు అందివచ్చిన నూతన మార్గాలు. కాలానుగుణంగా మతం తన దోపిడీ రూపాన్ని మార్చుకుంటూ మనిషిని తన సహజ పరిణామానికి దూరంగా ఉంచుతూనే ఉంది. మతం మానవుని పరిణామ దశను ముందుకు సాగనీయకుండా చేసే అబ్నార్మల్ జెనెటికల్ మ్యుటేషన్(  abnorma genetical mutation). దీనికి విరుగుడు తార్కిక చింతననే. తాము తార్కికులమనీ, ఆధునీకులమనీ, అభ్యుదయ వాదం మీద కూచున్న స్వేచ్ఛా పక్షులమనీ చెప్పే మహానుభావులు, మత భావనలను వదిలి పెట్టకుండా ఎలా తార్కికులయ్యారో చెప్పవలసి ఉంటుంది. వారి తార్కిక శక్తి ఏ పురాతన మత భావనలను నిలపటానికి ఉపయోగించుకుంటున్నారో ఆత్మ విమర్శ చేసుకోవలసి ఉంటుంది.

22/4/17
 Virinchi Virivinti

1 comment:

  1. Casinos Near Casinos and Casinos in New York State
    Find the best 용인 출장마사지 casino 충주 출장샵 locations in New York State with 인천광역 출장안마 MapYRO. Fast and free access to the best casinos in New York 광명 출장안마 State. 양주 출장안마

    ReplyDelete