Tuesday, 31 January 2017

Radheya Kavithwa sandarbham

ముందు తరాల రిఫరెన్సు కోసం నేటి కవిత
...................................................

గతం ఒక స్వప్నంలా గోచరిస్తుంది. మనసులో రికార్డు అయిన గతం తాలూకు ప్రతీ చిన్న అనుభవమూ మనిషిని ఏదో ఒక సమయంలో నులిపెట్టి బాధిస్తుంది. గతం తాలూకు అనుభవం ఎప్పటికీ కనులముందు నిలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అది అవాస్తవం. ప్రస్తుతమే గతం తాలూకు అనుభూతిని పట్టుకుంటుంది. కానీ ప్రస్తుతం గతంలా మారే వేగం దాని డైనమిక్స్ ఆధారంగా మనిషి మనసు ఫ్యూచర్ షాక్ కు గురవుతుందా లేదా చెప్పవచ్చు. వేగంగా మారుతున్న పరిస్థితులు, మనుషులు ఊహా శక్తి వేగం కంటే మించిపోయినపుడు, అనుభవించే మానసిక నిష్ఫలతనే ఫ్యూచర్ షాక్ అని చెప్పవచ్చు.

 గ్రామాలలో సంస్కృతి ఒక రకంగా ఉంటే, పట్టణాల సంస్కృతి ఇంకో రకంగా ఉంటుంది. పూర్తిగా పల్లెల్లోనే జీవించే వారుగానీ, పూర్తిగా పట్టణాల్లోనే నివసించేవారుగానీ ఎటువంటి సాంస్కృతిక అఘాతానికి గురి అయ్యే అవకాశం ఉండదు. కానీ పల్లెనుండి పట్నానికి వలస వచ్చినవారు లేదా పట్నం నుండి పల్లెకు తరలిన వారు ఒక తాత్కాలికమైన సాంస్కృతిక అఘాతానికి గురౌతారు. ఇదిలా వుంటే ఒకప్పుడు పల్లెగా ఉన్న తన వూరిని చాలా కాలం తరువాత చూద్దామని వెల్లిన కవి రాధేయ తన పల్లె పల్లెలాగా లేకపోవడం చూసి ఒక అఘాతానికి గురౌతాడు. అదే ఒక కవితగా మనముందుంచుతాడు. ఒక ఆత్మాశ్రయ నష్ట భావన, ఆత్మనుండి దూరంగా జరిగిన భావన, ఒంటరితనమును అనుభవిస్తాడు. ఒక నోస్టాల్జియాలో కాసేపు సేదదీరుతాడు. ఈ లక్షణాలనన్నింటినీ ఫ్యూచర్ షాక్ అనవచ్చు. రాధేయ కవిత చదివేటపుడు మనమూ దాని బాధితులమని గుర్తించగలుగుతాం. అంత సున్నితంగా కవితలో మనసును వ్యక్తపరుస్తాడు.

నేనెక్కడికి వచ్చాను? నేనెక్కడున్నాను? అనటం ద్వారా టైం అండ్ స్పేస్ తో పూర్తిగా విడిపోయిన ఒక మనస్తత్వ స్థితిని చూపిస్తాడు. ఊరు పరాయిదైపోవడం, ఊరికి తాను పరదేశీయుణ్సైపోవడం, వాస్తవిక స్థితిలో ఇమడలేకపోవడం, ఏలియనేషన్ ని అణుభవించటమూ కనిపిస్తుంది. ఇటువంటి మనసు ఒక నిష్ఫలతను తనలోపల దర్శిస్తుంది. అందుకే అంటాడు కవి ఆత్మను కోల్పోయిన సౌందర్య వాదినని. ఇండస్ట్రియలైజేషన్, మోడర్నైజేషన్, గ్లోబలైజేషన్ ఒకదానితరువాత ఒకటి తరంగాలుగా ప్రవహిస్తూ, మనిషి ఆశించినట్టు కాకుండా ఇంకో విధంగా పల్లె స్వరూపం మారిపోతుంటే, మార్పుకు తగ్గ మానసిక సంసిద్ధతను మనిషి పొందలేనపుడు పొందే ఫ్యూచర్ షాక్ స్వరూపాన్ని కవితలా మలచటం బహుశా దాచుకోతగ్గ అద్భుతమైన సంపద కావచ్చు. సంవత్సరం నాటికి భారత దేశంలో దాదాపు యాభైఐదు శాతం ప్రజలు నగరాల్లో నివసిస్తారని లెక్కలు గట్టారు. వేగంగా నగరీకరణలు చెందుతున్న ఈ దశలో,ఈ మార్పుకు తగ్గ సంసిద్ధతను ఏర్పరచుకోని ఇప్పటి మానవుల మనోస్థితులు ఏమిటో బహుశా ముందు తరాలవారికి ఉపయోగపడుతుందేమో...

సౌందర్య రాహిత్యంలో...
                   రాధేయ

అమాయకత్వానికి
అచ్చమైన ఆకృతిలా
ఇక్కడో పల్లె పట్టు వుండాలి
ఇప్పుడు కనిపించదేమిటి?

ఈ కొండల కోనల గుండెల్లోంచీ
వడివడిగా దూకే జలపాతముండాలి
అది మా బాలమూకకు
స్నాన ఘట్టమై తపన తీర్చేది
ఇప్పుడది అదృశ్యమైపోయిందా?

ఇక్కడే ఈ చీలిన కాలిబాటలో
ఓ మాతృమూర్తి నిలబడి
తన నుదురుకు చేయి అడ్డం పెట్టుకుని
పనికోసం పట్నం వలస బోయిన
కన్న పేగు కోసం ఎదురు చూసేది
నే నా బాట మీద నడిచినప్పుడల్లా
దుమ్మురేగిన ఆమె పాద ముద్రలు
వెన్నెల చేతి కర్రల్లా
నా వెన్నంటే నడిచేవి

నేను పట్నం బస్సుదిగి
ఆ మిట్ట పల్లాల మీద నడుస్తుంటే
గొల్ల గురవయ్య కూతురు ఎదురొచ్చి
నాచేతుల్లో బరువంతా తానే మోసేది

ఆ పిల్ల రెండు భుజాల మీద
చిరిగిపోయిన ఆ చోళీ
చిగురేసిన మా స్నేహాన్ని
ఎగతాళి చేసేది
ఓ బుజ్జి మేకపిల్ల
ఆ పిల్ల పరుగుతో పోటీ పడేది
ఇప్పుడా గుడిసేదీ?
ఆ గొల్ల గురవయ్యేడీ?
ఆ మేకపిల్లా, ఆ కన్నె పిల్లా
కన్పించదేమిటి?

సాయం సంధ్య బూడిద రంగులోంచి
పొగడపూల పొదల్లోంచి
నాటి స్వాప్నిక దర్శనం
నేడు గగనమై పోయిందా?
నేనెక్కడికి వచ్చాను?
నేనెక్కడున్నాను?

ఒంటెద్దు బండిలోంచి
నగరం నాగరికతలోకి దొర్లిపోయాక
నా ఊరే నాకు పరాయిదైపోయిందా?
నేను నాఊరికే పరదేశినయ్యానా?
ఇప్పటికీ
నా శ్వాస నా పల్లెది
నా ప్రాణం మాత్రం పట్నంది
నిజం చెప్పనా...
నేనిప్పుడు
ఆత్మను కోల్పోయిన
సౌందర్య వాదిని !!

1-2-17
(కవిత్వ సందర్భం 31)

No comments:

Post a Comment