Tuesday, 4 June 2024

Chayya Chayya - a song of mystics

 Chayya Chayya - a song of mystics


సంగీతం అందరినీ అలరిస్తుంది. కానీ ఒకే సంగీతం ఒక్కొక్కరికి ఒక్కోలా వినిపిస్తుంది. ఒక పాట ఒకరిలో దుఃఖాన్ని కలుగజేయువచ్చు. ఒకరిలో ఆనందాన్ని..ఒకరిలో గతం తాలూకు జ్ఞాపకాన్ని, మరొకరిలో వర్తమానపు వర్తమానాన్ని. ఇది చెవికి సంబంధించినది. చెవి ఒకొక్కరిలో ఒకలా సునిశిత శక్తిని కలిగి ఉంటుంది. ఒక్కో సందర్భంలో ఆ సునిశిత శక్తి మరింత పెరగవచ్చు కూడా. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నాలో ఒకపాట కలిగించిన అలజడిని చెప్పడం కోసం.  ఆ పాట Dil Se.. సినిమాలోని ఛయ్య ఛయ్య పాట. 


పాటని ఎంజాయ్ చేయాలంటే భాష తెలిసి ఉండనవసరం లేదు.  ఆ పాట లిరిక్స్ ఏ భావోద్వేగాన్ని కలిగిస్తాయో , పాట లిరిక్స్ అర్థం కాకున్నా సంగీతాన్ని జాగ్రత్తగా వింటే అదే భావోద్వేగాన్ని పొందుతాం. ఎందుకంటే పాట ఒక రాగంలో కూర్చబడుతుంది. ఒక్కో రాగానికి కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలుంటాయి. కరుణ రసమా, శృంగార రసమా, రౌద్ర రసమా అనేది ఆ రాగం కూర్పులోనే ఉంటాయి. కాబట్టి పాట లిరిక్స్ అర్థం కాలేదు కాబట్టి పాట అర్థం కాలేదు అని చెప్పడం సంగీతాన్ని సరిగ్గా వినకపోవడం వలననే అని నా అభిప్రాయం.


హిందీ ఉర్దూ సరిగ్గా రాని రోజుల్లో ఈ పాటను విన్నాను. ఆ సంగీతం ఊపేసింది. ఇదేదో హృదయాన్ని తట్టి లేపే పాట అనిపించింది‌. బీబీసీ నిర్వహించిన సర్వేలో 155 దేశాలలో సంగీతం అభిమానులు ఈ పాటను తమకు ఇష్టమైన పాటల్లో మొదటి స్థానంలో ఉంటుందని చెప్పారు. గమనించండి వాళ్ళెవ్వరికీ హిందీ రాదు. కానీ తమ హృదయాల్లో మొదటి స్థానాన్ని ఇచ్చేశారు. ఇప్పటికీ ప్రపంచంలోని టాప్ పది పాటల్లో ఛయ్య ఛయ్య పాట  ఒకటిగా నిలబడింది. అదే సంగీతం మహత్యం. అలాగే నేనుకూడా ఈ పాట అర్థం తెలియకుండానే మొదటి స్థానాన్ని ఇచ్చేశాను నా హృదయంలో. సుఖ్విందర్ సింగ్ గాత్రం ఆ ఖంగుమనే గొంతు నచ్చేశాయి. షారుక్ ఖాన్ అభినయం స్టైల్ మెస్మరైజ్ చేశాయి. అందుకే ఈపాట పాడటం నేర్చేసుకున్నాను. ఈ పాటకి డాన్స్ కూడా చేసి రెండుమూడు చోట్ల ప్రైజ్ కూడా గెలుచుకున్పాను. గమనించండి నాకు ఆ పాట అర్థం తెలియకుండానే ఇదంతా జరిగింది.


ఆ తర్వాత ఒకరోజు అనుకోకుండా తమిళంలో ఈ పాట విన్నాను. ఏదో వేరేగా ఉందనిపించింది. హుషారు కంటే ఏదో బాధ కూడా ఈ పాటలో ఉందేమో అనిపించింది. కానీ పెద్దగా పట్టించుకోలేదు.   అదే సమయంలో తెలుగులో కూడా విన్నాను. పర్వలేదనిపించింది.  కానీ ఒకరోజు ఎందుకో మళ్ళీ ఒకసారి తమిళంలో విన్నాను.వింటూ ఉండగా వింటూ ఉండగా..ఇదొక మాయాజాలం లా అనిపించింది. ఎవరో ఒక సూఫీ ఆధ్యాత్మిక గురువు లాంటివాడు మంత్రాలు చదువుతున్నట్టుగా అనిపించింది. మళ్ళీ జాగ్రత్తగా విన్నాను. ఔను‌ ఇవి మంత్రాలే. పాట కాదు. 


ఒకరిమీద ప్రేమ కలగడం ఊరికే అలా జరగదు. ఒక వ్యక్తిని చూసినపుడు పుట్టే ప్రేమ శారీరకమైనది కాదు. మానసికమైన ది కూడా కాదు. అది లోలోపల ఉన్న ఆధ్యాత్మిక మంత్రకవాటాలను తట్టి లేపుతుంది. ప్రేయసి ఈ విశ్వ ప్రేమకీ దైవ ప్రేమకీ ఒక తలుపు వంటిది. ఆమెను లేదా అతడిని అన్వేషించడం ఆరాధించడం మన కొంతకాలం ఉండిపోయే ఈ భూమి మీద ఒక ఆధ్యాత్మిక అన్వేషణకి దారితీస్తుంది. ప్రేయసి ప్రేమాన్వేషణ దైవాన్వేషణ విడదీయరానివౌతాయి. అర్థంకాని తమిళంలో ఈపాట నన్ను ఇలా చేరింది. ఐతే పాటను వింటూ వందల సార్లు ఆ అనుభూతిని పొందాను. కానీ ఒకరోజు అకస్మాత్తుగా ఈ తమిళ హిందీ పాటల అర్థం తెలుసుకుందామని ప్రయత్నించాను‌. ఆశ్చర్యం. అవి నేననుకున్నట్టే ఉన్నాయి.


గుల్జార్ హిందీలో రాసిన పాట ఒక సూఫీ తాత్వికుడి కవిత నుండి ప్రభావితం చెందింది. దీనికి పంజాబీ జానపదాన్ని మిక్స్ చేసి రాశాడు గుల్జార్. టెక్నాలజీని వాడకంలో రెహ్మాన్ ఎంత ఆధునికుడో మానసికంగా అంత మార్మికుడు. మనసు విద్య తెలిసినవాడు. మిస్టిక్ కాని సంగీతజ్ఞుడు ఏమి మాజిక్ చేయలేడు. కాపీ రైట్స్ వంటి ప్రాపంచిక విషయాలకి ఒక మ్యూజిక్ మిస్టిక్ లొంగిపోయాడంటే అతడిలో మ్యాజిక్ మాయమైపోతుంది. కానీ రెహ్మాన్ అటువంటి వాడు కాదని అతడి ఆధ్యాత్మిక జర్నీ చూస్తే అర్థమవుతుంది. గుల్జార్ ఈ పాటను బుల్లే షాహ్ అనే సూఫీ కవి రాసిన జానపదం ఆధారంగా రాశాడు. నీ ప్రేమ నన్ను పిచ్చివాడిలా థయ్య థయ్యా  అని నృత్యం చేయించిందని రాశాడు బుల్లే షాహ్. ఒరిజినల్ పదం థయ్య థయ్యా. ఐతే తమిళంలో "థయ్యా థయ్యా తక థయ్య థయ్యా" అనే ఉంటుంది. అంటే బుల్లే షాహ్ అనుకున్నట్టు నృత్యానికి సంబంధించిన పదాన్నే తమిళంలో వాడారు. ఐతే గుల్జార్ హిందీలో దీన్ని మార్చాడు. థయ్యాను ఛయ్యా చేశాడు. అంటే నీడ. ప్రేమ నీడలో తలదాచుకున్నవాడి కాలికింద స్వర్గం ఉంటుందని రాశాడు. అదే సూఫీ ప్రేమతత్వం.


తమిళంలో, హిందీలో లిరిక్స్ లో అద్భుతమైన సూఫీ కవిత్వాన్ని ఈ మిస్టిసిజాన్నీ నిలబెట్టుకుంది ఈ పాట. కానీ తెలుగులో ఈ పాటను ఎవరు రాసారో అసలు  ఎందుకు రాశారో కూడా తెలియదు. ఆ రెండు భాషల్లో కవిత్వం విన్నాక సూఫీ తత్వాన్ని మాజిక్ నీ అనుభవించాక తెలుగు పాట కనీసం విని బుద్ధి కూడా కాదు. తమిళంలో థయ్యా థయ్యా తక థయ్య థయ్యా..ని ఐనా తెలుగు లో తీసుకోవలసింది. ఛయ్య అనే తెలుగుపదానికి ఏం అర్థమూ లేదు. పాట సాకీతో ఇలా మొదలౌతుంది.


అటవిబాటలో ఉన్న ఓ నా పిచ్చుకల్లారా

ఓపికతో పాదాలమీద 

ఎదురుచూస్తున్న ఆత్మల్లారా..

థయ్య థయ్యా అని నాట్యం చేద్దాం రండి.(తమిళం)


ఎవరి తల ప్రేమ నీడలో తలదాచుకుందో

వాడి కాళ్ళకింద స్వర్గం ఉంటుంది.

ప్రేమ నీడకు పోదాం పదండి. (హిందీ)


ఎంతటి అలకే కిన్నెరసాని 

మామను చేరే అల్లరివాణి

చల్ ఛయ్య ఛయ్య (తెలుగు)

తెలుగు లో చల్ ఛయ్య ఛయ్య ని అలాగే ఉంచేశారు. దారుణం.


తమిళంలో కవిత్వంతొ పల్లవి మొదలౌతుంది.


హృదయం ఎగిసిపడింది

దాని దరువు రొద నొప్పిగా మారింది.

ఒక పచ్చని చిలుక వచ్చి పోగానే

ఈ గుండెలో భయం మొదలైంది.

నాట్యం చేద్దాం రండి


హిందీలో సాకీ అర్థమే మరలా రిపీట్ ఔతుంది...

ప్రేమ నీడలో నడువు

నీ పాదం స్వర్గం మీద ఉంటుంది 

ప్రేమ నీడలోకి పోదాం పద.


తెలుగులో చూడండి...

చెలి కిలకిలలే చిటికెయ్య 

మది చెదిరి కథాకళి చెయ్య హొయ్య 

చల్ ఛయ్య ఛయ్య. 


ఏందో ఇది కదా! కిలకిలలే చిటికెయ్యడం.

ఆ తర్వాత చూడండి...


ఆమె కంటికి రెండువందలేళ్ళు

ముక్కందానికి మూడువందలు

ఆమె అందమైన కథకు 

ఐదొందలేళ్ళు

అరె,మనం బతకాలి కదా! (తమిళం)


ఆమె సుగంధంతో నిండి ఉంది

ఆమె భాష అందమైన ఉర్దూలా ఉంది

ఆమే నా పగలూ రాత్రీ 

నా ప్రపంచం కూడా..

ఆ సఖినే నా ప్రేయసి.(హిందీ)


ఓ కన్నియపై చూపున్నదయా

ఎదట పడే చొరవుండదయా

మనసాపలేక మాటాడలేక

ఒక ఖయ్యామై తయ్యారయ్యా(తెలుగు)

ఒమర్ ఖయ్యాం ని ఈ పంక్తులలోకి తేవడం ఒక్కటే బాగుంది.


ఆ తర్వాత మొదటి చరణం మొదట తెలుగు లో చూడండి

"ఘుమ్మంటు గుభాళిస్తున్నదయా

ప్రతి చోట తనే అంటున్నదయా

తన వెంటపడే నా మనవి విని

ఏనాటికి కనిపించేనయ్యా

తన వెంటపడే నా మనవి విని

ఏనాటికి కనిపించేనయ్యా

ఘుమ్మంటు గుభాళిస్తున్నదయా

ప్రతి చోట తనే అంటున్నదయా

తన వెంటపడే నా మనవి విని

ఏనాటికి కనిపించేనయ్యా  

తొలగేన మరీ ఈ మాయ తెరా

తన చెలిమి సిరీ నా కలిమి అనీ

తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి

తన చెలిమి చెలిమి నా కలిమి కలిమి". ఈ  తెలుగు పదాలు చూడండి ఊరికే పాటకోసం ఏవో కొన్ని పదాలు నింపి నట్టు ఉన్నాయి కదూ.


ఇవే పంక్తులు తమిళంలో కవిత్వంతో ఎలా మారాయో చూడండి.


"ఒక్క చూపుతో 

నీవు నన్ను కరిగించావు

ఒక్క నవ్వుతో 

నీవు నన్ను తోసేశావు.

నా అహాన్ని కూల్చేశావు.

నీ సైగతో నన్ను 

నీ బానిస చేసుకున్నావు.

ఈ ఆరడుగుల వీరుణ్ణి

పట్టించుకోనైనా పట్టించుకోకుండా

నీ చరణదాసున్ని చేసుకున్నావు.

వర్షం పడేముందు

సన్నని తుంపర మాయమై నట్టు

ఆమె ఈరోజు మాయమైపోయింది.

నేను నిన్ను చూస్తే అగ్గి రాజేసుకుంటుంది

నీవు నన్ను చూస్తే ఒక మొగ్గ విచ్చుకుంటుంది.

నా మొదలే మొదలు

నా తుదనే తుదలు".


ముఖ్యంగా తమిళంలో ఈ భాగంలో సూఫీ మంత్రాలు చదువుతున్నట్టే ఉంటుంది. 


ఉర్దూ కవిత్వం చూడండి

" కొన్నిసార్లు పూవులు గర్వాన్ని ప్రదర్శిస్తాయి

కానీ అవి సువాసన వచ్చినప్పుడే 

మనకు కనిపిస్తాయి.

నేను ఆమెను తావీజు లాగా కట్టుకుంటాను.

అప్పుడామె ఎక్కడోచోట ఉర్దూ శ్లోకంలాగా దొరుకుతుంది.

ఆమే నా సంగీతం

ఆమే నా పవిత్ర శ్లోకం. 

ఇక్కడ షారుక్ ఖాన్ తావీజును వేసుకున్నప్పుడు చూపే భక్తిని నటనలో చూపిస్తాడు. హిందీలో ఒరిజినల్ పాట అని అర్థమౌతుంది. తమిళం పాట ఎందుకూ తగ్గకుండా ఉర్దూలోని సూఫీ తత్వాన్ని  ఓన్ చేసుకుంటే.. తెలుగు ఎటూ కాకుండా అర్థంలేని పాటను నిలబెట్టింది.


మొదటి చరణం ఎండింగ్ తెలుగు తమిళం హిందీలలో వరుసగా చూద్దాం


జాలిపడైనా ఓయ్ అనదే

మర్యాదకైన పరదా విడదే

అపరంజి చిలక శ్రమ పడిన ఫలితమై

నా వైపే వస్తూ ఉన్నదయా


ఓయ్ అనడం, పరదా విడటం అంతకుముందు సీన్ కి సంబంధించినవి. అంటే తెలుగు కవి సీన్ ని దృష్టిలో పెట్టుకొని రాశాడు పాపం. కానీ కవిత్వం కుదరలేదు. 


"నీవు కొండమీద దొరికిన వజ్రానివి

నా గుండెలో వేరుతొడుగున్నదానివి

నీవు ఒక్కరోజా రెండురోజులా?

లేక నా జీవితపు మూలాల్ని

ఎప్పటికీ తాకుతూనే ఉండిపోతావా??"(తమిళ్)


ఆమె మంచు బిందువుల్లా గా నడుస్తుంది.

స్వర్గం ఆమె పాదాలతోపాటు నడుస్తుంది.

ఒక్కోసారి తరుశాఖలమీద

ఒక్కోసారి ఆకులమీద

నేను గాలిలో కూడా ఆమె జాడ 

వెతుకుతున్నాను.( హిందీ)


రెండవ చరణం మొదలై ఎలా ముగుస్తుందో చూడండి

మూడు భాషల్లో


నేను ఆమె అందాన్ని ఆరాధిస్తాను‌

కానీ అది సూర్యకాంతి - నీడలాగా నన్ను మోసం చేస్తోంది.

ఆమె తన  రంగులను మార్చేస్తుంది.

నేను రూపాలను రంగులనూ అమ్ముకునేవాడిని.

ఎవరి తల ప్రేమ నీడలో తలదాచుకుందో 

అతడి పాదం కింద స్వర్గం ఉంటుంది.

ఆమే నా పగలూ రాత్రీ 

నా ప్రపంచం కూడా..

ఆ సఖినే నా ప్రేయసి.(హిందీ). హిందీలో పైనున్న పంక్తులు రిపీట్ ఔతాయి. కానీ తమిళంలో మళ్ళీ కవిత్వం నిండుతుంది ఈ పంక్తుల్లో.


"ఇంద్రధనుస్సు రెండు సార్లు రాదు.

ఒకసారి వస్తే మరోసారి రాదు.

స్టేషను దాటిన రైలు పాట

ఒకసారి దాటేశాక వినబడదు.

ఆ పాట పాడిన గొంతు

ఒకసారి పోయాక 

పాట మళ్ళీ వినబడదు.

నా సగం గుండె నీదే

నా సగం గుండెలో నిండినది నీవే

ఓ నా ప్రేమ జ్యోతీ!

ఓ నా జీవన సారమా!

నీవే నా దేవతవు

నీవు నిజానివా?

లేక నా కలవా?(తమిళం)


మదినూయలలూపే సొగసయ్యా

తొలి తూర్పు కాంతులే చెలి ఛాయా

పరువాల తరంగమే తానయ్యా

మహరాణి రూపు హరివిల్లయ్యా

మహరాణి రూపు హరివిల్లయ్యా  

ఎంతటి అలకే కిన్నెరసాని

మావని చేరే అల్లరి మానీ

ఎంతటి అలకే కిన్నెరసాని

మావని చేరే అల్లరి మానీ

చెప్పరయ్య నా జాణ తోటి

తన కంటపడే దారేదయ్యా


తెలుగులో కిన్నెరసాని,జాణ, అపరంజి చిలక, మహారాణి వంటి విశేషణాలతో నింపినట్టు కనిపిస్తుంది. హిందీలో తమిళంలో కనబడిన కవిత్వం తెలుగులో కనబడదు. హిందీలో సుఖ్విందర్ సింగ్ మ్యాజిక్ చేసినా, మనమీద దయవుంచి తమిళంలో అతడి గొంతును పాటలో చాలా కుదించారు. కానీ తెలుగులో పాట మొత్తం సుఖ్విందర్ సింగ్ తో పాడించడంతో బెడిసికొట్టింది. 


తమిళం పాటలోనే సూఫీ తరహా మంత్రాలలాగా వినిపిస్తుంది. సుఖ్విందర్ సింగ్ హిందీలో బాగా పాడాడు అనిపిస్తుంది. గుల్జార్ ఉర్దూ కవిత్వం అతడి గొంతుకు సరిపోయినట్టే అనిపిస్తుంది. కానీ తమిళంలో ఉండే మ్యాజిక్ హిందీలో లేదు. తమిళం పలికే విధానం ఆ కవిత్వం ఈ పాటకు మిస్టిసిజాన్ని తెచ్చాయి. తెలుగులో చెప్పడానికి ఇంకేం లేదు. సుఖ్వీందర్ సింగ్ ఎంత చెడగొట్టాడో లిరిక్స్ అంతే చెడగొట్టాయి.


విరించి విరివింటి

Thursday, 11 April 2024

The Roots of organic life

 Old text


పర్యావరణ దినోత్సవం సందర్భంగా గిరిజనుల మాటలు విందాం. విని ఒకసారి ఆ దిశగా ఆలోచిద్దాం.

-------------++


మేజర్ మూగీ సమ్నర్ ఆస్ట్రేలియాలోని నేరిండ్ఝెర్రీ తెగకు సంబంధించిన పెద్దమనిషిగా, ఆ సంస్కృతికి డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. మొన్న సత్య శ్రీనివాస్ గారి "మట్టి గూడు" పుస్తక ఆవిష్కరణ సమయంలో, వాడ్రేవు చినవీరభద్రుడు గారు ఈ నేరిండ్ఝేర్రీ తెగ గురించి ఉటంకించారు. ఆ తెగ కథ చాలా ఆసక్తి కరమైనది. వెస్టర్నజేషన్ వలన ఎన్నో జాతులు తెగలు సంస్కృతులు అంతరించి పోతున్న తరుణంలో, ఆస్ట్రేలియా మూలవాసులైన ఈ తెగలు తమను తాము ప్రపంచానికి పరిచయం చేసుకుంటున్నాయి. తద్వారా తమ ఉనికిని, తమ సంస్కృతిని నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మూగీ సమ్నర్ ఈ సంస్కృతిని నిలుపి ఉంచడం దిశగా కృషిచేస్తున్న మేధావి. మట్టి గూడు పుస్తకం చదివిన తరువాత మనం గొప్పవి అనుకుటున్న సంస్కృతులన్నీ గిరిజన సంస్కృతులను ఆటవికమైన సంస్కృతులుగా, అనాగరికమైన సంస్కృతులుగా ముద్ర వేసి మనలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మనం తెలుసుకుంటాం. మనకు పరిచయమున్న సంస్కృతులలోని ఇనార్గానిక్ లైఫ్ కూ మనకు పరిచయంలేని కొండజాతి సంస్కృతులలోని రిచ్ ఆర్గానిక్ లైఫ్ కూ సంబంధం లేదని తెలుసుకున్నపుడు, మనదసలు జీవరహిత సమాజమని గ్రహించగలుగుతాం. (ఆర్గానిక్ లైఫ్ కీ ఇనార్గానిక్ లైఫ్ కీ గల తేడాను సత్య శ్రీనివాస్ తో నేను చేసిన ఇంటర్వ్యూలో మీరు గ్రహించగలరు). కానీ నిజమైన ఆర్గానిక్ లైఫ్ మూలాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూలవాసుల జీవితాల్లో ఉన్నాయని చెప్పే వారు మనకు కరువయ్యారు. ఆ ప్రయత్నంలో సత్య శ్రీనివాస్ గారు ఉన్నారు. మేజర్ మూగీ సమ్నర్ ఇంటర్వ్యూ కూడా మనల్ని ఆ వివరాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఈ మొత్తం ఇంటర్వ్యూ The Roots of Organic life రెండు భాగాలుగా అనువాదం చేస్తున్నాను. 


------------ The Roots of organic life (part 1)-----------

నా పేరు మేజర్ సమ్నర్.

నేను నారింజేరి దేశం సభ్యుడను.

కూరంగ్ అనే ప్రదేశానికి చెందినవాడను. అది దక్షిణ ఆస్ట్రేలియాలో ఆగ్నేయ ప్రాంతంలో ఉంటుంది.

మా జాతి ప్రజలు ఆస్ట్రేలియాలోని అన్ని జాతుల ముందుగా వేలవేల సంవత్సరాలనుండి ఇక్కడ జీవించారు.

మాజాతి ప్రభుత్వ అధికారులతోనూ, చర్చి అధికారులతోనూ పరిపాలించబడతాము.

ఇది ఎక్కడైనా ఒకటే. అమెరికా, కెనడా వంటి ఎన్నో దేశాలలో గానీ ప్రపంచమంతటా ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది. వారు మా కల్చర్ ని, మా భాషనూ, మా పండుగలనూ, సాంప్రదాయాలనూ కొల్లగొట్టారు. 

మాకు ఇంగ్లీషు నేర్పించారు. స్కూలుకు పంపించారు. ఇలా చేస్తే మాకు మంచి జరుగుతుందని చెప్పారు. 

కానీ ఈరోజు అవన్నీ నేర్చుకోవడమే మంచిదని అనుకుంటాను. అలా నేర్చుకోకపోతే మేమీదేశంలో బతకలేని పరిస్థితి. ఈ సమాజంలో బతకి బట్టగట్టాలంటే  ఈ మార్పు తప్పనిసరి.

కానీ మేము ఎక్కడినుండి వచ్చాము?. దేశంలోని ఏ ప్రాంతం నుండి, ఏ సంస్కృతి నుండి వచ్చాము?

మా పుట్టుక కథలేమిటి?. మా నారింజేర్రి గురించి, మా నేల ఆవిర్భావం గురించి కథలేమిటి?.

ఈ రోజు ఈ దేశంలో మా స్వంత భాషను కొంత మాట్లాడుతుంటాం. రాసుకోని ఆ భాషను మేము మాట్లాడగలం. కానీ మా అలసత్వం వలననో, ఇంగ్లీషు భాష నేర్చుకోవడం చాలా సులభం కావడంవలననో, మా భాషను కోల్పోయాం. 

మా నాట్య రీతులు, మా కళలకు సంబంధించిన, మా పుట్టుకకు సంబంధించిన కథలుగా చెప్పే మా నాట్య రూపాలు, జంతువులను అనుకరించే, జంతువుల వేటను అనుకరించే మా నాట్య కదలికలు, వీటి ద్వారా మేమెవరమనేది ప్రపంచానికి చెబుతాం. ఈ దేశంలో మా మూలవాసి తత్వాన్ని ఈ నృత్యాల్లో చెబుతాం. నేను ప్రపంచంలోని ఎన్నో దేశాలు తిరిగాను, లండన్, ఇండియా, దక్షిణ కొరియా, కెనెడా, అమెరికా, న్యూజీలాండ్ వంటి దేశాల్లో నృత్య రీతులనూ, పండుగలనూ చూశాను. కెనెడాలోని వినేపేగ్ చుట్టుపక్కల కొన్ని తెగలను చూశాను. ఎన్నో ఇతర ప్రదేశాలనుండి మూలవాసుల ద్వారా ఆహ్వానాన్ని అందుకున్నాను. మేము అంతా కలిసి మా అడవులకోసం మా పిల్లల కోసం నృత్యం చేశాం. నదికోసం నది ముందర నాట్యం చేశాం. మాప్రజలు, నా కుటుంబం అలాగే మాతో కలిసి వచ్చే జాతుల ప్రజలూ అందరూ నాట్యం చేస్తారు. ఆ విధంగా ప్రపంచం చుట్టేసి వచ్చాను. ఓరెగాన్ లో ఉండే అడవులనుండి వచ్చాను. వారిని చూసి వచ్చాను. వారు తమ ప్రజలను చూసుకునే విధానాన్ని చూశాను. వారి సంస్కృతిని చూశాను. వారి సాంస్కృతిక కేంద్రం ద్వారా వారు చేసే పనులనూ చూశాను. ఈ దేశంలోని మూలవాసులు కూడా అటువంటి పనులు చేయవలసిన అవసరం ఉంది. కానీ అదే విధంగా మేము మా ప్రాంతాన్ని, సంస్కృతినీ పరిరక్షించుకోవాలి. మా భూమికి మేమెలా సంబంధం నెరపుతున్నామో చూసుకోవాలి. 


మూలవాసుల దినోత్సవమని మనమొక రోజును గుర్తించాం. ఆ రోజు మేము దక్షిణ ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలలో ఉండే పలు పాఠశాలలకు వెళ్లి, ఆ చిన్న పిల్లలతో ఒక రోజైనా గడుపుతుంటాం. కానీ అటువంటి ప్రోగ్రాంలు పెద్దవారితో చేస్తే కూడా బాగుంటుందనుకుంటున్నాం. మేము పెద్దలను కూడా ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మూలవాసులమైన మేము ఈ దేశాన్నీ, ఈ నేలనూ ఎలా ప్రేమిస్తామో గౌరవిస్తామో ఒకరినొకరం ఎలా గౌరవించుకుంటామో మేము చెప్పవలసిన అవసరం ఉంది. మేము జంతువులను వేటాడే విషయంలో కూడా జంతువును చంపిన తరువాత మాకు ఒక సాంప్రదాయ నృత్యం ఉంటుంది. ఒక పాట ఉంటుంది. అందులో ఆ జంతువు ఆత్మను గౌరవించడం ఉంటుంది. అది మాకోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. కానీ ఈ పద్దతి ప్రపంచంలోని ప్రజలు మరచిపోయారు. వారంతా తమ గురించి తామే ఆలోచించడం లో మునిగిపోయారు. ఇతరుల గురించి, తమ నేల గురించి ఆలోచించడం మరిచారు. మేము నృత్యం చేసేటపుడు మా పితరులను కూడా మాతో వచ్చి కలిసి ఆడమని వేడుకుంటాం. మీరెందుకలా చేస్తారని మీరడగవచ్చు. కానీ మేము అలాగే ఉన్నాం, అలాగే ఉంటాం. మా పితరులను మా జీవితాల్లోకి ఆహ్వానించుకుంటాం. అంతే కాకుండా మేము నృత్యం చేసేముందు కూడా మా పితరుల పర్మిషన్ తీసుకుంటాం. మా గురించి, మా నృత్యరీతుల గురించి ఇతరులకు తెలియజెప్పాలనుకున్నపుడు కూడా మా పితరుల అనుమతి అవసరం. మేము వారిని రమ్మని ఆహ్వానిస్తాం. అటువంటి సందర్భాల్లో మాతో కలిసి ఉండమంటాం. నేను చెప్పగలిగిందల్లా మా ప్రజల గురించి. మా సృష్టి కథల గురించి. ఇతరుల కథల గురించి చెప్పడానికి మాకేం హక్కు ఉందని? మాకే హక్కూ లేదు.


నేను నారింజేర్రి తెగకు చెందినవారిమైనప్పటికీ మా చుట్టు పక్కల ఉండే తెగల పండుగలకు అపుడపుడూ వెల్తుంటాం. అక్కడ నేను వారి పండగలలో పాల్గొనడానికి అనుమతి తీసుకుంటా. వారి పండగలను కలిపి జరుపుకోవడం వలన వారు ఆ సాంప్రదాయాలను మరిచిపోరు. ఆ విధంగా నేను వారిని ప్రోత్సహిస్తూ ఉంటాను. ఎందుకంటే వేల యేండ్లుగా జరుగుతున్న వేడుకలను మరలా వెలుగులోకి తీసుకురావడమన్నది ఒక రోజులో ఒక వ్యక్తితో జరిగే విషయం కాదు. మేము ఒకరి వేడుకలను ఒకరం గౌరవించుకుంటాం. వారి పద్దతులనుండి, వేడుకలనుండి ఎంతో నేర్చుకుంటాం. ఆ విధంగా సమాజంలో ఆ పురాతన పద్దతులను తీసుకువచ్చి, సమాజాన్ని పరిపుష్టం చేయవలసిన అవసరం కూడా ఉందనుకుంటాను. ఎందుకంటే మన ప్రపంచం ఇపుడు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచమంతా డబ్బుచుట్టు తిరుగుతోంది. ప్రజలందరూ స్వార్థం వైపే మొగ్గుచూపుతున్నారు. అంతా నేను,నేను, నాది అనుకుంటున్నారు. నాకేం కావాలి అనే ఆలోచిస్తున్నారు కానీ, ప్రపంచానికేం కావాలన్నది కాదు. చుట్టూ ఉండే మనుషులకేం కావాలన్నది కాదు. నేను నేను అనుకోవడంలో తప్పేమీ లేదు కానీ, పంచుకోవడమన్నదే లేకపోతే ఎట్లా?. నీ స్నేహితులతో బంధువులతో పంచుకోవాలి, ప్రజలతో పంచుకోవాలి, ఈ దేశ ప్రజలతో పంచుకోవాలి. ఇతర దేశాలతో పంచుకోవాలి. ఈ దేశం చాలా పెద్దది. ఇతర దేశాలనుంచి ఈ దేశానికి వచ్చేటపుడు, ముందుగా మాతో మాట్లాడాలి. మేము వారిగురించి ఏమనుకుంటామో వారు ముందుగా అర్థం చేసుకోవాలి. వారు ఇక్కడికి రావడాన్ని మేమెలా అనుకుంటామో వాల్లు తెలుసుకోవాలి. నేను ఒక గిరిజనుడితో మాట్లాడినపుడు, అతడు ఒక మాట అన్నాడు. ఈ దేశంలో మూలవాసులు, మూలవాసులు కాని వారూ ఉన్నారు. అటువంటపుడు ఈ ప్రభుత్వాలు గట్టిగా ఎందుకు ప్రశ్నించవు?. మా సరిహద్దులను దాటుకుని వచ్చే వారిని ఎందుకు ప్రశ్నించవు?. ఆధునికులు మొబైల్ ఫోన్లతో సాటిలైట్లతో మా నేల మీదకు వస్తున్నపుడు, వారు ఎందుకని మా పర్మిషన్ తీసుకుని రారు?. అన్నాడు. నేను ఆ విషయమై ఆలోచించాను. ప్రభుత్వాలు ఆ పని చేయాలనుకుంటాను. ఎవరంటే వారు ఇక్కడకు వచ్చి మేమేం దుస్తులు ధరించాలి, ఏ పనులు చేయాలి,ఏం చదవాలి ఏం చదవకూడదు అని చెప్పడం ఎందుకు?. 


మీరు ఇక్కడ కట్టబడిన పార్క్ ను చూశారా?. ఈ ప్రదేశాన్ని ఇంగ్లండులాగా కనిపించేలా చేశారు. వాల్లు ఇక్కడికి వచ్చి ఈ నేల మీద ముల్లకంచెలు పెట్టారు. నీవు నేల సారాన్ని పెంచే వ్యవసాయం కోసం కాకుండా నేలను ఎందుకు తవ్వేసినా నీవు మనిషివి కానట్టే. నీవు సంస్కృతి లేని వాడివే. నీకు ఏ మతమూ లేనట్టే. నీవు ఏ విషయాన్నీ నమ్మని గండశిలలాటివాడివనే అర్థం. కానీ వారు మమ్మల్ని ఏ పర్మిషనూ అడగలేదు. వారికి అడగడానికి ఏమీ లేదు కూడా..వారు మా సంస్కృతి గురించి మమ్మల్ని అడగలేదు. మా మూలాల గురించి, వేలవేలగా మా నాలుకమీద తిరుగాడే మా మూల కథల గురించీ వారు తెలుసుకోవాలనుకోలేదు. నేను స్కూలుకి వెల్లినపుడు పిల్లలను అడుగుతుంటాను. మన మూలవాసుల కథలు తెలుసునా అని. పిల్లలను మీరు బైబిల్ ని నమ్ముతారా అని అడుగుతుంటాను. పిల్లలు ఔను అంటుంటారు. బైబిల్ కేవలం రెండు వేల సంవత్సరాల క్రితంది మాత్రమే. మా మూలాలు తెలిపే మా కథలు వేలవేల సంవత్సరాలవి. మా కథలెంత పురాతనమైనవో ప్రజలకు తెలియదు. మూలవాసుల చరిత్ర చాలా పురాతనమైనదని వాల్లే చెబుతూ ఉంటారు. కానీ వచ్చి మమ్మల్ని మార్చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మా నీరు స్వచ్ఛమైనది. మా నేల స్వచ్ఛమైనది. ఇక్కడి జంతువులూ సవచ్ఛమైనవి. మేం కంగారు వంటి జంతువులను, చేపలనూ బెర్రీ ఫలాలనూ వాటి అనుమతి తీసుకుని తిన్నాం. చాలా సంపన్నవంతంగా ఫలవంతంగా ఈ దేశంలో బతికాం. ఎపుడైతే ఇతర జాతులవారు ఇక్కడికి వచ్చారో, మా జీవన రీతులు మాయమవడం మొదలైంది. కొత్తగా వచ్చిన జజ్బులతో దేశం మొత్తం అతలాకుతలమయింది. కలరా, మీసిల్స్, స్మాల్ పాక్స్ ఈ దేశంలోకి వచ్చి సర్వనాశనం చేశాయి. కొన్ని మూలవాసి తెగలు ఇప్పటికీ ఇటువంటి జబ్లులంటే ఏమిటో కూడా ఎరిగి ఉండవు. తెల్లవారు వచ్చాకే ఇదంతా జరిగింది. తెలియని కొత్త జబ్బునబారిన పడి మా ప్రజలు మరణించారు. 

సహజీవనమనే అంశాన్ని తీసుకున్నపుడు మేము ప్రపంచానికి సహజీవనమంటే ఏమిటో కలిసి ఉండటమంటే ఏమిటో నేర్పించదలచుకున్నాం. ఈ దేశంలో,ఎంతో మందికి వారి మూలాలు తెలియదు. వారు ఏ తెగ నుండి వచ్చారో, వారి కుటుంబ మూలాలు ఏమిటో తెలియదు. అంతా కలగాపులగం గా ఉంటుంది పరిస్థితి. వేరు వేరు జాతుల వారు ఉండే ఈ దేశంలో వేరు వేరు జాతుల నడుమ వివాహాలు జరుగుతున్నాయి. ఇది చాలా మంచి పరిణామం ఎందుకంటే ప్రజల్లో ఉండే ఇతర జాతుల పట్ల ఉండే వివక్షలు తొలగుతాయి. కానీ, అది జరగాలంటే ముందు ఈ దేశంలో ఉన్న, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూలవాసులతో మాట్లాడటం జరగాలి. అలాగే మనమంతా ఏ మూలాలనుంచి వచ్చామో తెలుసుకోవాలి. అపుడే మనం ఔను మనమంతా ఒక్కటని చెప్పగలం. తమ పర బేధాలు లేకుండా చెప్పగలం. ఇది జరగకపోతే మన వినాశనం తప్పదు. రెండు నెలల కిందట, చంద్రుడిలో ఉండే గనులకోసం వెతుకులాట మొదలైందని విన్నాను. అదే జరిగితే ఏమౌతుంది. ఈ దేశంలోని పురుషులు ఇంకో గ్రహం మీదకు గని తవ్వకాలకోసం వెల్లడం చాలా దారుణమైన విషయం. మన దేశంలో జరిగే గని తవ్వకాలన్నీ నిజంగా మనకు అవసరమైనవేనా?. లేక కేవలం స్వార్థం తో లోభంతో పుట్టిన అవసరాలా?. 


మనం మీడియా గురించి మాట్లాడుతూ ఉంటాం. విషయాలు బయటకు రావడానికి మీడియా ఎంతో అవసరమని వింటాం. కానీ మీడియా అనేది మూలవాసులకు సంబంధించినంత వరకూ నష్టకారకమే. టీవీల్లో, పత్రికల్లో ఎక్కడా మూలవాసుల ముఖాలు కనిపించవు. మీకు ఇక్కడి సిటీలు కనిపిస్తాయే కానీ ఇక్కడి మూలవాసులు మీడియాలో కనిపించరు. మా జీవితాల్ని ప్రపంచానికి చూపరు. మేము వేటలో పొందిన జంతు ఆహారాన్ని మొత్తం కమ్యూనిటీతో పంచుకుంటాం. కానీ ఆధునికులు తమ ఇంటిచుట్టూ కంచె నిర్మించుకుంటారు. ఇంకెవర్నీ లోపలికి రానీయరు. ఇంకో ఇరవై ముప్పై యేండ్ల తరువాత మనుషులు ఒకరికొకరు తెలియకుండా ఐపోతారు. ఇప్పటికే ఈ దేశంలో ఇంటి పక్కవాడి పేరు కూడా తెలియని వారు ఎందరో ఉన్నారు. నేను నాకు తెలియని వారితో మాట్లాడతాను. మాట్లాడితేనే కదా వారు నాకు తెలిసినవారు ఔతారు. మాట్లాడితేనే నేనెవరో ఎక్కడినుంచి వచ్చానో అవతలి వారికి అర్థమవుతుంది. వారి విషయాలు కూడా నాకు తెలుస్తాయి. పురాతన సమాజాల్లో లేని పోకడలు ఇపుడు కనిపిస్తున్నాయి. ఎదుటి వ్యక్తిని పలకరించేంత సమయం తీరిక ఎవరికీ లేవిపుడు. కానీ మొదట మనం పలుకరించడం మొదలు పెట్టాలి. అవతలివాడు పలుకకపోయినా పరవాలేదు. మొదట మనం పలుకరించడం మొదలు పెట్టాలి. ఏమో తరువాత ఎపుడైనా వాల్లూ స్పందించడం మొదలు పెడతారేమో. ఒక చిన్న విలువైన విషయాన్ని ప్రజల మనసులోకి ఇరికించటానికి ఎన్నో యేండ్లు పట్టవచ్చు. మన చుట్టూ పరిమితులు విధించుకుని మాట్లాడటం ఎంతవరకు సమంజసం. మనం ఓపెన్ అప్ కావాలి. మన గురించి, మన దేశం గురించి తెలుసుకోవడం చదువుకోవడం మంచిదే కావచ్చు. కానీ మనం తెలుసుకోవలసింది, చదువుకోవలసింది ఇతరులతో ఎలా మాట్లాడాలి ఎలా గౌరవించుకోవాలి అనే విషయం కూడా.


Part 2 ------------------------------------------------ 


నారింఝేర్రీ ప్రజలు వారి వారి సరిహద్దులు దాటి బయటకి పోతున్నారు. ఇతర మూలవాసుల కథలు వినడానికి పోతున్నారు. వాటిని విని మరల మాకు తెలియజేస్తున్నారు. ఇది మనకోసం మన స్వార్థం కోసం చేసుకోవడం కాదు. మనం ఇతరులను వినడం నేర్చుకోవాలి. వారి విద్యను మనం మన దేశానికి తీసుకురావాలి. మనం అందుకే బయటకు వెల్లాలి. ప్రజలను కలవాలి. ఇతర ప్రజల జీవితాలలో మనం ఒక భాగం కావాలి. మీడియాను ఉపయోగించడం ద్వారా మనం దానిని సాధించవచ్చు. అపుడే ప్రజలు ఒకరిని ఒకరు వినడం మొదలు పెడతారు. మనమంతా గ్లోబల్ వార్మింగ్ గూర్చి మాట్లాడుకోవాలి. మనం కార్లనూ టీవీలను ఉపయోగిస్తున్నాం. మనం కాల్లీడుచుకు కూర్చుని ఏదో ఒక జాతి మీద ఈ నిందను మోపలేం. మీవలననే ఇది జరిగిందని అనలేం. మనమంతా ఇందులో భాగస్వాములమే. ఈ దేశంలోకి ఎన్నో జాతులు వలస వచ్చాయి. వారు వారి వారి కల్చర్ ని ఇక్కడకు తీసుకు వచ్చారు. దానితో పాటు కొంత నెగేటివిటీని కూడా తీసుకువచ్చారు. మేము ధూపం ఇచ్చే వేడుకను చేసుకుంటాం. కాథలిక్కులలాగే. మా పూర్వీకులను ఈ నెగేటివిటీని తొలగించమని ప్రార్థిస్తూ ఈ ధూప వేడుకలు చేసుకుంటాం. ఇపుడు ఈ దేశంలో ప్రతీ ఒక్కరూ ఈ ధూప వేడుక లో పూర్వీకులను ప్రార్థిస్తే, ఇంకా మనం మంచిగా బతుకుతామేమో. మూలవాసులు వారిలో వారు పెండ్లిల్లు చేసుకున్నంతకాలం ఎటువంటి ఇబ్బందులూ లేవు. ఇపుడు పరిస్థితి లేదు. మనం అందరం ప్రజలం కలిసి ఉండాలి. జంతువులతో పక్షులతో వేరు వేరు జాతులతో కలిసి ఉండాలి. మన మధ్యన ఉన్న విబేధాలు కలిసి నాట్యం చేయడం ద్వారా మాట్లాడటం ద్వారా పెండ్లిల్లు చేసుకోవడం ద్వారా సమసిపోతాయి.


ఈ దేశం లోకి వచ్చిన ఇతర జాతుల వారు మాతో ఏమీ మాట్లాడలేదు. మాతో ఏమీ మాట్లాడకుండానే మేము ఎలా జీవించాలో శాసించడం మొదలు పెట్టారు. నాకు గుర్తు వుంది. మా నాయనమ్మ మా ఏరియాలో కొత్తగా స్థాంపించిన రేషన్ షాపు నుండి సరకులు తెచ్చుకునేది. తరువాత ఆ షాపు వేరే చోటకు తరలించబడింది. ఐనాగానీ ప్రజలు ఆ రేషన్ కోసం అంతంత దూరం వెల్లి సరుకులు తెచ్చుకునేవారు. అంటే ప్రజలు ఈ రేషన్ ఆహారానికి అలవాటు పడిపోయారు. వేటాడటం మరచి పోయారు. ఇపుడు ఫలితంగా డయాబెటిస్ గుండె జబ్బులు ఇంకా రకరకాల జబ్బులు. ఇవన్నీ మేము తినే ఆహారాన్ని మరవడం వల్ల వచ్చినవే. మేము ఎంత తిరిగినా ఈ దేశంలోనే తిరిగాం. వేరే దేశాలకు పోయి మేము అక్కడ మా పద్దతులను నేర్పించాలనుకోలేదు. మేము అందరి పద్దతులనూ గౌరవిస్తాం. ఈ రోజు ఆ గౌరవం లేదు. ఎందుకంటే మనం వెస్టర్న్ పద్దతులలో చదువుకున్నాం. వారి పద్దతిలో వారు మా పిల్లలను చదువుకోమన్నారు. మా పిల్లలు వారిని వారు కొత్తగా వేరేగా అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు. నేనొక పుస్తకం చదివాను. ఒక ముసలామె రాసింది. ఆమెను ఒక మహారాణి అని అంటుంటారు. మా సంస్కృతిలో రాణులు రాజులూ ఉండరు. అదంతా పాశ్చాత్య సంస్కృతి. ఆమె ఒక పుస్తకంలో రాసింది. ఆమె చిన్న పిల్లగా ఉన్నపుడు మిషనరీ స్టేషన్ దగ్గర నివసించేదిట. ఒక చర్చి ఉండేదట. అందులో ఒక పెద్ద పుస్తకం ఉండేదట. ఆ పుస్తకంలో ఇద్దరు వ్యక్తులు ఉండేవారట. వారు పెద్ద తోటలో నివసించే వారని అందులో రాసారట. ఆ తోటలో వారు నివసించేటపుడు అక్కడికి ఒక పెద్ద పాము వచ్చిందట. ఆ పాము వచ్చాక ప్రజలు ఒకరిని ఒకరు చంపుకోవడం మొదలు పెట్టారంట. ఆ పాము వచ్చాక వారు తమను తాము చూసి సిగ్గుపడటం మొదలు పెట్టారంట. వారు వారి శరీరాలు చూసుకుని సిగ్గుపడుతూ బట్టలతో కప్పేసుకున్నారంట. ఆమె ఏం చెప్పేదంటే..తెల్ల వారు అటువంటి పాములని చెప్పేది. తెల్లవారు వచ్చాకనే మేము మమ్మల్ని చూసుకుని సిగ్గుపడటం మొదలు పెట్టాము. మా శరీరాలను చూసుకుని సిగ్గు పడ్డాం. ఒకరినొకరం చంపుకున్నాం. మేము అల్కాహాల్ తాగడం మొదలు పెట్టాము. మాకు అంతకుముందు తెలియనివెన్నో చేయడం మొదలు పెట్టాము. తెల్లవారు మొదట మా దేశానికి వచ్చినపుడు, వారిని మేము మా పితరులుగా భావించాము. వారే ఈ రూపంలో తిరిగి వచ్చారని అనుకున్నాము. కానీ త్వరలోనే మేము గుర్తించామేమంటే మా దేశం రేప్ కి గురైందని. మా ప్రజలు రేప్ చేయబడ్డారని. వారు మా పితరులు కాదని మేమపుడు గుర్తించాం. ఈరోజు మాకు జరిగిన నష్టానికి ఇంకెవరినో బ్లేమ్ చేయవలసిన అవసరం లేదు. మా నష్టానికి మేమే కారకులం అనుకోవాలి. మేము ఇపుడు ఆల్కాహాల్ తాగుతాం. సిగరెట్ తాగుతాం. మేం చాలా ఎక్కువగా తింటాం, ఇవన్నీ చేస్తూ ఇంకెవరినో వేలెత్తి చూపడం చేయలేం. నేను మందుకీ, పొగకూ దూరమై ముప్పై యేండ్లయింది. అందరినీ అలాగే ఉండమని చెబుతుంటాను. ఎందుకంటే అది మన సంస్కృతి కాదు కాబట్టి.


ఇవన్నీ మనం ఆలోచిస్తూ క్రోడీకరిస్తే ఏమర్థమవుతుందంటే...మూల వాసులూ, మూలవాసులు కాని వారు కలిసి పోవాల్సిన అవసరం ఉంది అని. ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రపంచం ముగియకుండా ఉండాలంటే ఆ పని చేసి తీరాలి. ఈ దేశం అనావృష్టిలో మగ్గుతోంది. వాతావరణం కలుషితమయింది. ఇపుడు పండిస్తున్న పంటలు ఎక్కువ నీటిని ఆశిస్తాయి. దానివలన జంతువులకు గొర్రెలకు తాగడానికి నీరు లేవు. కొంత నీరు మాత్రమే ఈ దేశంలో మిగిలి ఉంది. అన్నింటికీ మించి నీటిని జాగ్రత్తపరిచే వారు కరువయ్యారు. నదులలో నీటిని నింపడం గురించి మాట్లాడుతూ ఉంటారు. నదుల నుంచి నీటిని బియ్యం పడించడానికి పత్తి పండించడానికి మల్లిస్తుంటారు. వారికి పర్మిషన్ ఎవరిచ్చారు?. ఆస్ట్రేలియావంటి డ్రై ల్యాండ్ లో వరి పత్తి పండించడానికి ఎవరు వారికి పర్మిషన్ ఇచ్చారు?. ఆస్ట్రేలియా ప్రపంచంలో అన్నిదేశాలకంటే డ్రై దేశం. దానిలో దక్షిణ ఆస్ట్రేలియా మరీ ఎక్కువ. వరి పత్తి పండించడం. డ్యాములు కట్టడం. ఒక్కో డ్యామ్ సిడ్నీ హార్బర్ అంత పెద్దగా ఉంటుంది. చాలా నీటిని నిలువ ఉంచుకుంటారు. వరి పత్తి పొలాలకు మల్లించుకుంటారు. చాలా నీరు వృధాగా పారుతూ ఉంటుంది. ఈ దేశ మూల వాసులు వారి తోటలను పెంచుకోలేని పరిస్థితి. తాగడానికి సరిగా నీల్లు దొరకని పరిస్థితి. ఒకరోజు సరి సంఖ్యలో ఒకరోజు బేసి సంఖ్య వాహనాలలో తిరగాలి. ప్రజల జీవితాలు ఇలా మారటం చూస్తే సిగ్గేస్తూ ఉంటుంది. ఇందంతా ఏమిటనుకున్నారు?. ఇదంతా లోభత్వం. ఇదంతా స్వార్థం. నేను నా సంపాదన అనే స్వార్థం. మనం అనేది కాదు. అంతా నేను అనుకునేదే. ఈ దేశంలోనే కాదు. ప్రపంచమంతా ఇలాగే ఉంది. ఇంగ్లండ్ లో లాగా ఇంగ్లీషు మాట్లాడటం వచ్చేసింది. ఇంగ్లండు పార్లమెంటు వారికి ఈ దేశంలో ఇతర దేశాలలో సెటప్ ఉండాలి. ఇంగ్లీషు మాట్లాడేవారు కావాలి.


ప్రపంచానికి ఇపుడు మూలవాసులతో మాట్లాడే సమయం ఆసన్నమయిందనుకుంటాను. మా సంస్కృతిని కథలను వినాలి. ఈ నేల ఎందుకు సృష్టించబడిందో...ఈ నదులు కొండలూ పర్వతాలూ ఎందుకు సృష్టించబడ్డాయో తెలుసుకోవాలి. కొన్ని జంతువులు మనకు నాచీ నబడతాయి. నాచీ అంటే మా భాషలో మిత్రుడు. అటువంటి జంతువులను చంపడానికి వీలు లేదు. మనుషులు నివసించే చోట ఆ జంతువులు సుఖంగా ఉండాలి. ఇదంతా మన ప్రకృతిని కనిపెట్టుకుని ఉండటం. దాని బాగోగులు చూసుకోవడం. మనం ఈ ప్రపంచంలో కొన్నింటి బాగోగులు చూసుకోవాలి. అపుడే అవి జీవించగలుగుతాయి. అందులో కొన్ని జంతువులు ఉంటాయి. నీరు ఉంటుంది. వాటి బాగోగులు మనం చూసుకోవాలి. ఎందుకంటే మన దేశంలోని ప్రతీ భాగం మనలోని ఒక భాగం వంటిది. ఈ ప్రపంచంలోని ప్రతీ భాగం మనలో ఒక భాగం వంటిది. మనం ప్రపంచంలో ఒక భాగం. ప్రపంచంలోని మూలవాసుల నమ్మకం ఇది. ఈ భూమి మన తల్లి వంటిది. మనం దీని నుండి వచ్చాం. మరలా దీనిలోకే వెల్లిపోతాం. మనల్ని పూడ్చిపెట్టినా కాల్చివేసినా మరలా మనం మన తల్లిలోపలికే పోతాం. మా కథలు వీటి గురించి ఉంటాయి. మన దేశంలోని భాగాలను రక్షించుకోవడం. జంతువులను రక్షించుకోవడం. జంతువులు తినే ఆహారాన్ని రక్షించుకోవడం. జంతువుల ఆహారాన్ని నాశనం చేస్తే ఆ జంతువును నాశనం చేసినట్టే. ఒక జంతువును నాశనం చేస్తే నీవు దాని తినే ఇంకో జంతువునీ నాశనం చేసినట్లే. ఇది డోమినో ఎఫెక్ట్ లాంటిదే. ఒక దానిని జరిపితే అన్నీ కింద పడిపోతాయి కదా..అలాంటిదే. అందుకే మనుషులు ఆలోచించాలి. వారు చేసే పనులు దేనిని నాశనం చేస్తున్నాయో ఆలోచించాలి. యూరోపియన్లు తీసుకు వచ్చిన జంతువులు ఇక్కడ వాటిని నాశనం చేశాయి. చేపలను తినే యూరోపియన్ కఫ్ లు ఇక్కడికి ఎందుకు తేబడ్డాయి?. అవి మర్రీ నదిలోని చేపలన్నింటినీ నాశనం చేశాయి. కెయిన్ టోడ్ ని ఈ దేశం నలు మూలల్లోకి ప్రవేశ పెట్టారు. ఎందుకని?. ఇపుడు మనం ఏం చేయాలంటే కూర్చుని మాట్లాడుకోవాలి. ఆలోచించాలి. ఎవరికి వారు అన్నీ తెలుసనుకోవడం వలన లాభం లేదు. అపుడే మనం ఒకరినుంచి ఒకరం నేర్చుకోగలం. నేను మా మూలవాసులకే కాకుండా ఇతర పిల్లలకు కూడా ఈ నేల గురించిన విషయాలు నేర్పుతుంటాను. మనం ఈ భూమి మీద ఎక్కువ కాలం జీవించం. మన చుట్టూ ఉండే చిన్న ప్రదేశంలో మనం మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. ఇలా మనం ఇపుడు చేస్తే తప్ప అస్తవ్యస్తమై ఉన్న ఈ ప్రపంచం ఎపుడో గానీ తాను ఉన్నది ఉన్నట్టుగా మారడం మొదలవుతుంది. పాడైపోయిన నేలలు, నాశనం చేయబడుతున్న నదులు, సముద్రాలూ, సముద్ర జీవులూ, పక్షులూ, ఇవన్నీ రక్షింపబడతాయి. ఇవన్నిటికీ ఈ ప్రపంచంలో స్థానం ఉంది. యూరోపియన్లు మా ప్రదేశానికి వచ్చి మమ్మల్ని పనికి పెట్టుకున్నారు. ఇక్కడి నేలనూ వాతావరణాన్ని ఇంగ్లండులో ఎలా ఉంటుందో అలా తయారు చేసుకున్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారో ఆ దేశం లాగా కనిపించేలా ఈ దేశాన్ని మార్చుకున్నారు. వాల్లు వారి దేశంలాగా కనిపించడాన్ని ఇష్టపడితే వారి దేశంలోనే బతకవచ్చును కదా. ఇక్కడకు రావడం ఎందుకు?. కానీ ఇపుడేం చేయలేం. మనం ఒకరికొకరం తెలుసుకోవాలి. ఒకరినుండి ఒకరం నేర్చుకోవాలి. వేరు వేరు మతాలూ, సంస్కృతులూ ఉన్నవారు ఇపుడిక్కడున్నారు. మనం అందరం కలిసి జీవించాలి. ఎవరికైనా సమస్య వస్తే ఒకరికొకరు మాట్లాడుకోవాలి. వారు మాతో మాట్లాడాలి. మేము ఎలాంటి అడ్డుగోడలూ పెట్టబోం. మాకు అడ్డుగోడలు అవసరం లేదు. మూల వాసులు శతాబ్దాల తరబడి ఎవరినీ దోచుకోలేదు. ఎవరినీ నాశనం చేయలేదు. కాలరాయలేదు. మేము అందరినీ కావాలనుకున్నాము. మాకు అందరూ కావాలి. మాకు మా నైబర్స్ కావాలి. 

నేను ప్రజలు నా మాట వింటారని నమ్ముతాను. నా మాటలతో శృతికలుపుతారని నమ్ముతాను. ప్రపంచంలోని మూలవాసుల వాణిని వినాల్సిన అవసరం ఉందని ప్రజలు గుర్తిస్తారని నమ్ముతాను. ఒకరినొకరం తెలుసుకుంటూ నేర్చుకుంటామని నమ్ముతాను. నన్ను మాట్లాడించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.  


End of interview


Translated into telugu by

 విరించి విరివింటి

Thursday, 21 March 2024

పిల్లలపై పాండెమిక్ ప్రభావం....essay

  తెలంగాణ పత్రికలో అచ్చయిన నా వ్యాసం


*పిల్లలపై పాండెమిక్ ప్రభావం..*


❤ ఆనంద్‌ పన్నెండేళ్ళ పిల్లవాడు. ఎపుడూ అల్లరి చేస్తూ హుషారుగా ఉండేవాడు గత కొద్ది రోజులుగా మౌనంగా ఉండటం మొదలెట్టాడు. వాడికి లోపల ఏదో తెలియని బాధ. స్కూలు లేదు. ఆడుకోవడానికి ఫ్రెండ్స్‌ లేరు. టీవీల్లో కరోనా వార్తలు తప్ప మరో అంశమూ లేదు. కరోనా కాలంలో ఇంటి నుంచే పని చేసుకునే అతడి తండ్రి ఇరవై నాలుగ్గంటలూ వార్తలు వింటూనే ఉంటాడు. టీవీల్లో ''మృత్యు ఘంటికలు'', ''మరణ మృదంగం'' వంటి పదాలకు అర్థాలు చాలా భయంకరమైనవని వాడికి ఇపుడిపుడే తెలుస్తోంది. కొందరు తెల్లటి ముసుగుల్లాంటి దుస్తులలో తిరుగుతూ కనిపించే దృశ్యాలూ, బ్లర్‌ చేయబడిన శరీరాల్ని స్ట్రెచర్‌ మీద తీసుకెళ్తున్న దృశ్యాలూ, వారి చుట్టూ బోరున విలపిస్తున్న మరికొందరూ... వాటినన్నింటినీ చూస్తూ ''జీవితం భయంకరంగా తయారైంద''ని అమ్మతో అంటున్న నాన్న. భయమేస్తుందంటూ అందరికీ ఫోన్లు చేస్తూ ఇరవై నాలుగ్గంటలూ క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఆందోళనలో అమ్మ. ఇంతలో బంధువులలో ఎవరో కరోనా బారిన పడి మరణించారనే వార్త తెలియగానే బోరున విలపిస్తున్న వాడి తల్లిదండ్రులు. తలుపులూ కిటికీలూ వేసుకుని భయం భయంగా బతికేస్తున్న తమ కుటుంబం. వాడికి ఇవేవీ అర్థం కావడం లేదు గానీ జీవితం మాత్రం ఏదో భయంకరమైన స్థితిలో ఉందని అర్థమౌతుంది. వాడికి రాత్రిపూట నిద్ర పట్టడంలేదు. భయంకరమైన కలలు వస్తున్నాయి. రోజురోజుకీ వాడిలో భయం మరింత పెరిగింది. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. స్కూలూ ఆటలూ పాటలూ స్నేహితులూ ముచ్చట్లూ చాక్లెట్లూ అన్నీ దూరమైనాయి. వాడు అసలు ఇంట్లో ఉన్నాడనే స్పృహ లేదు ఎవరికీ. వాడి చిన్న హృదయం మీద కరోనా పాండెమిక్‌ సృష్టించిన భయోత్పాతం ఎంత పెద్దదో ఎవరూ ఊహించలేరు. తెలియకుండానే వాడు మౌనంగా రోదిస్తున్నాడు. ప్రతిరోజూ... ప్రతీ క్షణం... ఇంటి ముందు స్నేహితులతో ఆడుకునే స్థలాల్లో ఖాళీలను కిటికీల్లోంచి చూస్తూ ఖాళీగా నిలబడి పోతున్నాడు. ఇది ఒక్క ఆనంద్‌ కథ మాత్రమే కాదు, ప్రస్తుతం ప్రతీ ఇంటిలో ఉన్న చిన్న పిల్లల కథ. 


❤ కరోనా పాండమిక్‌లో ఉన్న ఏకైక మంచి అంశం ఏంటంటే అది పిల్లలలో పెద్దగా ప్రభావం చూపకపోవడమని చాలా మంది సంబర పడిపోతుంటారు. కానీ కరోనా పాండమిక్‌ అందరికంటే ఎక్కువగా పిల్లల మీదే ప్రభావం చూపుతోందని దాదాపు ఎవరూ గుర్తించడమే లేదు. ఐతే పిల్లల శరీరం మీద కాదు, మనసు మీద. మరణాలనీ, ఏడుపులనీ,భయానక విశేషణాలతో ఎక్స్క్లూజివ్‌ విజువల్స్‌ తో బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌తో సహా మసాలా దట్టించి మరణ వార్తలను అమ్ముకుంటున్న వార్తా వ్యాపారాన్ని తెలిసో తెలీకుండో చూస్తూ మానసికంగా క్రుంగిపోతున్నారు పిల్లలు. ముఖ్యంగా లాక్డౌన్‌, ఆ తరువాత పరిణామాలు చాలా ఇళ్ళల్లో గృహహింస పెరగటానికి దోహదం చేస్తే ఆ తల్లిదండ్రుల గొడవల మధ్యన చిక్కుకుని నలిగి పోతున్నారు చిన్నారులు. ప్రపంచమంటే జీవితమంటే పూర్తిగా అవగాహనకు రాకముందే సమీప భవిష్యత్తు పట్లే పూర్తి అపనమ్మకాన్నీ అనిశ్చితినీ మూటగట్టుకుని బిత్తర చూపులు చూస్తున్నారు పిల్లలు. నిజానికి ఈ పాండమిక్‌లో అసలైన విక్టిమ్స్‌ పిల్లలే. ఎందుకంటే ఈ భయానక వాతావరణం వాళ్ళలో కోలుకోలేని మానసిక ఒత్తిడిని కలిగించబోతోందేమోననే స్పృహ చైల్డ్‌ సైకాలజిస్ట్‌ లలో వ్యక్తమౌతోంది. ఇంట్లో తాతయ్య నానమ్మలు అనారోగ్యం పాలైతే, ఇంతకాలం వారితో కథలు చెప్పించుకుని ఆడుకునే పిల్లలు మరింత కృంగిపోతున్నారు. ఇక ఆ పెద్దవాళ్ళే కరోనాతో మరణిస్తే, కనీసం వాళ్ళ చివరి చూపుకూడా నోచుకోని పిల్లలు ఎంతటి క్షోభను అనుభవిస్తారో అర్థం చేసుకోవచ్చు. తల్లో లేక తండ్రో home quarentine లో రెండు మూడు నాలుగు వారాలు పిల్లలకు దూరంగా ఉండటం కూడా వారిని కృంగదీస్తుంది. 


❤ కరోనా కాలంలో లోకం గురించి కొంత ఆలోచించగలిగే వయసుగల ఆనంద్‌ లాంటి పిల్లలలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటే, మూడు నుంచి ఆరేళ్ళలోపు పిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ఈ వయసు పిల్లలు తమ భావాలను చెప్పలేరు. కాబట్టి తమ ప్రవర్తనలో దాన్ని ఏదో రూపంలో చూపుతుంటారు. బాగా హఠం చేస్తుంటారు. ఇర్రిటబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సరిగా నిద్రపోరు. పిల్లల ఈ ప్రవర్తనకు కారణం అర్థం చేసుకోక వారిలో అల్లరి ఎక్కువైందని, మొండితనం ఎక్కువైందనీ వారిని మరింత హింసకు గురి చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. బాలల మీద హింస అలా తెలియకుండానే పెరిగిపోతోంది. ''ఇంట్లో పిల్లల అల్లరి భరించలేకపోతున్నాం, ఈ స్కూళ్ళు ఎపుడు తెరుస్తారో ఏమో'' అంటూ వారిని మరింత బెదిరించే వాళ్ళే ఎక్కువ. నిజంగా స్కూళ్ళు తెరవనందుకు పేరెంట్స్‌కి కలిగే మానసిక ఒత్తిడికంటే కంటే పిల్లలలో కలిగే మానసిక ఒత్తిడే ఎక్కువ. చాలామంది పిల్లలకు గృహ హింసను తప్పించుకోవడానికి స్కూలు ఒక మంచి ప్రదేశం. కానీ ఈ రోజు తప్పనిసరై గృహహింసకు లోనౌతున్నారు.


❤ కరోనా పాండెమిక్‌ సమయంలో టీవీల ముందు వార్తలతో గడపడం కంటే పిలల్లతో గడపడం చాలా అవసరం. వారి సైకలాజికల్‌ స్ట్రెస్‌ను మొదటి దశలోనే గుర్తించి తగ్గించగలగడం అవసరం. ఎవరైనా చిన్నపిల్లలు కరోనా గురించి ప్రశ్నలు వేయడం మొదలెట్టా రంటేనే వారిలో దానికి సంబంధించిన స్ట్రెస్‌ మొదలైందని అర్థం చేసుకోవాలి. వారిని ఇక ఆ వాతావరణం నుంచి దూరం చేయగలగాలి. నిద్రలేమినీ, ఆకలి తగ్గడాన్నీ, కోపమూ, మొండితనం పెరగడాన్నీ అంతటినీ ''అల్లరి'' కింద జమకట్టకూడదు. ఆన్లైన్‌ క్లాసులు నిజంగా వారిని కరోనా సంబంధిత సమాచారం నుంచి దూరంగా ఉంచగలిగి వారిని వాళ్ళ రొటీన్‌ జీవన శైలిలోకి తీసుకుపోగలుగుతున్నాయా లేక అప్పటికే భయం గుప్పిట్లోకి పోయిన పిల్లవాణ్ణి మరింత భయపెడుతున్నాయా అన్నది తల్లిదండ్రులే గమనించుకోవాలి. విపరీతమైన స్ట్రెస్‌లో ఉన్న పిల్లలు ఆన్లైన్‌ క్లాసులలో సరిగా శ్రద్ధ చూపలేరు. చదవలేరు. అందుకని వాళ్ళని మరింత నిందిస్తూ చదువులో వెనకబడిపోతారేమోననే ఆందోళనతో చదవాల్సిందేనని మరింత బలపెడుతూ ఉంటారు. ఇత్యాదివి ప్రమాదకరం. వాళ్ళ ఆకలి నిద్ర వంటి వాటిమీద పూర్తి ధ్యాస ఉంచాలి. ఆటలు లేకపోతే పిల్లలకు శారీరక శ్రమ ఉండదు. మానసికోల్లాసమూ ఉండదు. పిల్లలకు ఆటల వాతావరణాన్ని తల్లిదండ్రులే ఇంట్లో కలిగించగలగాలి. టీవీ వార్తలూ, ఆన్లైన్‌ క్లాసులూ వారిని ఆనంద పరుస్తున్నాయా లేక బెంబేలెత్తిస్తున్నాయా? అనేది తెలుసుకోవడానికి తల్లిదండ్రులకు తప్ప మరెవరికీ సాధ్యం కాదు. తల్లి లేక తండ్రిలో ఏ ఒక్కరు home isolationలో ఉన్నా మరొకరు ఆ పిల్లలకు మరింత ధైర్యాన్ని ఇవ్వగలగాలి. సింగిల్‌ పేరెంట్‌ పిల్లలుంటే ఆ పేరెంట్‌ క్వారంటైన్‌లో ఉంటే ఆ సమయంలో ఆ పిల్లలకు ధైర్యం చెప్పవలసిన బాధ్యత ఆ పేరెంట్‌ మీదే ఉంటుంది. అటువంటి పేరెంట్‌ ఉంటే ఆమె లేదా అతడి బంధువులు వారికి మోరల్‌ సపోర్ట్‌ ఇవ్వగలగాలి.


❤ కరోనా పాండెమిక్‌ ఈ రోజు కాకుంటే రేపు తగ్గిపోవచ్చు. కానీ ప్రస్తుతం ఈ ప్రపంచం పట్ల పిల్లలలో అది కలిగించిన దృక్పథం మాత్రం వాళ్ళ జీవితాంతం వేటాడబోతోందనిపిస్తోంది. ముఖ్యంగా తమ పక్కన ఓ లోకం తెలియని పసి బాలుడూ, ఇపుడిపుడే లోకాన్ని ఆసక్తిగా తిలకించాలని ఉబలాటపడే పసిబాలుడూ ఉన్నాడనే స్పృహ కూడా లేకుండా ఇళ్ళల్లో నిరంతరం కరోనా వార్తలతో చావు కబుర్లతో నింపేయడం నిజంగా వాళ్ళలో జీవనేచ్ఛను చంపేయడమే. మాస్కులు ఉపయోగించే విషయంలో ఫిజికల్‌ డిస్టాన్సింగ్‌ని పాటించే విషయంలో నిర్లక్ష్య వైఖరి ఉండేవాళ్ళు తమ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నామని చెప్పుకోవడం హాస్యాస్పదమౌతుంది. భవిష్యత్తు పట్ల సుందరమైన కలలు కనడం, భవ్య జీవితాన్ని మహాద్భుతంగా ఊహించడం బాలల హక్కు. చోటా భీం, స్పైడర్‌ మ్యాన్‌, హారీపోటర్లతో కూడిన అద్భుత రసానుభూతి వారి ఆటల్లో మాటల్లో పొంగి పొరలాల్సిన వయసులో భీభత్స భయానక కరుణ రసాలు నిండిపోతున్నాయి. మన ముందు తరాల వారు కూడా మనకంటే పెద్ద విపత్తులనే తమ జీవితాల్లో ఎదుర్కొన్నారు. ఐనా గానీ మనకేనాడూ భయానక భవిష్యత్తును కలగనమని వాళ్ళు చెప్పి పోలేదు. వాళ్ళెంత క్షోభను అనుభవించినా మనకు మాత్రం ఓ సుందరమైన కలలు గనగల జీవితాన్నే ప్రసాదించారు. మనం మాత్రం బాధ్యతా రాహిత్యంతో పిల్లల కలల్ని చిదిమేస్తున్నాం. వారి బాల్యాన్ని వారికి కాకుండా చేస్తున్నాం. సమాచార విప్లవమంటూ వారి జీవితాలను నిరంతరం మృత్యు వార్తలతో, అది కూడా మరిన్ని భాషా విశేషణాలతో, భీతిగొలిపే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో సహా నింపేస్తున్నాం.


❤ పిల్లలు తడిచిన సిమెంట్‌ లాంటివారు. ఎవరు ఏ గుర్తు పొరపాటుగా వేసినా తరువాతి కాలంలో అది శాశ్వత ముద్రగా మిగిలిపోతుంది. మెదడులో ఎమోషనల్‌ సెంటర్‌ అమిగ్దలాకు రేషనల్‌ సెంటర్‌ ఫ్రాంటల్‌ కార్టెక్సుకూ మధ్య సంబంధం మన పెద్దలలో అభివృద్ధి చెందినంతగా పిల్లలలో అభివృద్ధి చెంది ఉండదు. వారి ఎమోషన్‌ కి అందుకే ఏ రేషనాలిటీ ఉండదు. వారి కంటే ముందు తరం వారిమిగా వారి ఎమోషనల్‌ సపోర్టర్లుగా రేషనల్‌ డవలపర్స్‌గా మనం మారలేకపోతే రాబోయే తరానికి కరోనాకంటే మన తరమే పెద్ద శాపంలా పరిణమిస్తుంది. కరోనాను దానిచుట్టూ అల్లుకున్న భయాన్నీ తొలగించి ముందు తరాలవారికి మంచి జీవితాన్ని అందించడం మన తరం బాధ్యత. ఇది గుర్తించక తప్పదు. "ఒక సమాజం పిల్లలను చూసుకునే విధానంలోనే దాని ఆత్మ బహిర్గతమౌతుందని" నెల్సన్‌ మండేలా అంటారు. మనం మన సమాజాత్మను కాపాడుకోక తప్పదు.


❤ చాలామంది కరోనా పాండమిక్‌ వంటివి చూసి ప్రపంచం అంతమైపోతోందని మాట్లాడు తుండటం చూస్తుంటాం. కానీ కరోనా వైరస్‌ పిల్లల జోలికి పోకపోవడంతో ఈ ప్రకృతి మానవాళి మీద ఇంకా ప్రేమను కోల్పోలేదని అర్థమౌతుంది.


- డా|| విరించి విరివింటి,

ఎంబిబిఎస్‌, 

క్లినికల్‌ కార్డియాక్‌ ఫిజీషియన్‌

drvirinchi@gmail.com


Nava Telangana - Sopathi, 9-8-2020

Saturday, 16 March 2024

Perelman's logic. Essay

 "ఒక గొప్ప పనిని చేయాలంటే మనసు స్వచ్ఛంగా ఉండాలి. అపుడు నీవు మాథమేటిక్స్ గురించి ఆలోచించినది మాత్రమే అసలైన ఆలోచన. మిగిలినదంతా మనిషి బలహీనత. ఒక ప్రైజ్ ని ఒప్పుకున్నావంటే నీ బలహీనతను నీవు వ్యక్తపరుచుకోవడమే".


                 ఇది Perelman's logic.


ఒక చిన్న పని చేసి తాము మాత్రమే చేస్తున్నట్టు తమ కాంట్రిబ్యూషన్ చాలా గొప్పదైనట్టు ఒకటికి పదిసార్లు చెప్పుకుంటూ తమను తాము సెల్ఫ్ ప్రమోట్ చేసుకునేవాళ్ళను తరచు చూస్తూనే ఉంటాం. ప్రపంచంలో వీళ్ళంతా ఒకవైపు ఉంటారు. గుర్తింపు కోసం పాకులాట , identity crisis, అవార్డులకోసం దేబిరింపులతో, వార్తలలోని వ్యక్తులుగా ప్రముఖులుగా ఉండాలని తాపత్రయ పడేవాళ్ళు ఈ ప్రపంచంలో ఒకవైపు ఉంటే, మరోవైపు వీటికన్నింటికీ దూరంగా మౌనంగా తమ పనేదో తాము చేసుకుంటూ పోవడమే కాక అన్ని పటోటాపాలకు దూరంగా ప్రశాంతంగా తమదైన జీవితాలనునిండుగా జీవించేవారూ ఉంటారు. అటువంటి అరుదైన వ్యక్తి రష్యన్ మాథెమెటీషియన్ గ్రిగోరి పెర్ల్మన్. 


గణితశాస్త్రంలోని జియోమెట్రిలో మహామహులైన గణితశాస్త్రజ్ఞులంతా జుట్టు పీక్కుంటున్న అంశం  poincare conjecture అనే సమస్యను ఇతడు పరిష్కరించాడు. 2002 -2003 కాలంలో అతడు ఆన్లైన్ లో రాసిన పేపర్లు గణితశాస్త్రంలో వణుకు పుట్టించాయి. గణిత శాస్త్రవేత్తలను అబ్బురపరచాయి. వారంతా గణిత శాస్త్రం లో ఇదొక విప్లవాత్మకమైన అంశంగా పేర్కొన్నారు. అతడి ఆన్లైన్ పేపర్లు ఏమిటీ కుర్రాడు ?. ఎలా సాధ్యం ఇతనికి!?. అని ముక్కున వేలేసుకునేలా చేశాయి.  ఇంటర్నెట్ ని  కేవలం మంచికి మాత్రమే, జ్జాన విస్తృతికి మాత్రమే  ఉపయోగించే ఇటువంటి వారు ఇపుడెందరున్నారు?. 


అతడేమీ తన పరిశోధనలను గణితశాస్త్ర జర్నల్స్ లో కూడా పబ్లిష్ చేయలేదు. కానీ ఈ సమస్యపై పని చేస్తున్నప్రపంచ వ్యప్త గణితశాస్రజ్ఞులు మాత్రం ఈ ఆన్లైన్ పేపర్లను చూసి అబ్బురపడ్డారు.  ఈ అంశంపై అతడు కనబరిచిన నేర్పుకు గుర్తుగా గణితంలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే Fields Medal ని ఇతడికిద్దామనుకున్నారు. అతడు తిరస్కరించాడు. గణితశాస్త్రంలో Millemium prize problem అన తగ్గ ఈ Poincare conjucture సమస్యను పరిష్కరిస్తే మిలియన్ డాలర్లు ఇస్తామని ప్రకటించిన Clay Mathematics Institute కూడా ఇతడి గణితశాస్త్ర శక్తిని గుర్తించి మిలియన్ డాలర్లు బహూకరిస్తామని ముందుకు వస్తే దానినీ తిరస్కరించాడు. అతడు సాధించిన ఘనతను చూసి అమెరికా యూనివర్సిటీ లు గెస్ట్ లెక్చర్ ఇవ్వమంటే వెళ్ళాడు. ఆ టూర్ లో ఒక అమెరికన్ జర్నలిస్టు ఏ ప్రశ్న అడిగాడో తెలుసా?. మీ గోళ్ళు అంత పెద్దగా ఉన్నాయెందుకు ఆని?. ఎవరిని ఏ ప్రశ్నలడగాలో తెలియని పత్రికా జర్నలిస్టులు, సెన్షేషనలిజం ని మాత్రమే కోరుకునే ప్రజలు. వీరినుండి ఇంకేమి ఆశించేది లేదని అతడు రష్యాకు వెళ్ళిపోయాడు.


అతడు introvert అని అందరూ అనుకున్నారు. కానీ కొంతమంది పేరుకోసం పాకులాడే చీనీ గణితజ్ఞులను చూసి అతడు విసుగుచెందాడు. ఒక తనకు తానుగా ఉండాలనుకునే వ్యక్తి. ఈ ప్రైజ్ లకూ, వీటి ఝంఝాటాలకూ దూరంగా ఉండాలనుకునే వ్యక్తి. పేరునీ డబ్బునీ తృణప్రాయంగా వదిలేసిన వ్యక్తి. చాలా సాధారణమైన జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడే వ్యక్తి. "నేను గణితాన్ని గణితంకోసం మాత్రమే చేస్తాను. అంతేతప్ప ఏదో గుర్తింపుకోసమో లేక డబ్బుకోసమో కాదు " అనేస్తాడు. శాస్త్రం విషయంలో కాంపిటీషన్ , వ్యక్తిగత గుర్తింపుకోసం పాకులాట వంటి కల్చర్ కి తాను దూరంగా ఉండేందుకు ఇష్టపడుతాడు. గణిత శాస్త్రమే కానీ మరే శాస్త్రమే కానీ ఒకరితో ఒకరు సహకరించుకోవడం వల్లనే తప్ప ఒకరు నిర్మించిన పునాదు‌లపై మరొకరు నిర్మించబడం జరుగుతుందే తప్ప ఒక వ్యక్తే అంతా చేసేసాడనుకునే వ్యక్తి పూజలకు, intellectul dishonesty లకు అతడు దూరంగా జరిగాడు. 


ఇపుడతడు రష్యాలో తన తల్లితో ఒక అపార్ట్మెంట్ లో సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అతడు ప్రపంచానికి కూడా పెద్దగా కనబడడు. ఒకరిద్దరు జర్నలిస్టులకు అతడిచ్చిన ఇంటర్వూలు తప్ప అతడి గురించి మనకు పెద్దగా తెలిసే అవకాశం కూడా లేదు. ప్రపంచంలో చిన్న పనిచేసి తమ ప్రాపకంవలననే అనుకునే పేలపిండి కృష్ణార్పణమనుకునే లోతులేని మనుషులు ఒకవైపుంటే అంతా తామే చేసి కూడా తాము నిమిత్తమాత్రులమని సాధారణంగా జీవించే మహనీయులూ ఉన్నారు. నిజమైన గురువులంటే వీరే. నిశ్శబ్దంగా తమపని  తాము చేసుకుంటూ పోతుండేవారే.! 


Happy π day💐💐🎂

March 14th 2023.


విరించి విరివింటి

నిద్ర విషయంలో నిద్రలేవండి. Essay

 నిద్ర విషయంలో నిద్రలేవండి


కాలమనేదే డబ్బుగా,పనియే దైవంగా మారిన ప్రపంచంలో ప్రతీక్షణం అందిపుచ్చుకోవాలనీ పనిచేయకపోవడం మహాపాపమనీ భావింపబడుతున్న తరుణంలో ఏ పనినీ చేయనీయని, ఏ ఉత్పాదకతా కలుగనీయని మమూడొంతుల జీవితంలో ఒకవంతుపైగా ఆక్రమించే ఒక పనికిరాని చర్యగా నిద్రను పరిగణించే దశలో మనం నిద్రగురించి మాట్లాడుకుంటున్నాం.

అసాధారణంగా వేగవంతమైన జీవితంలో పెద్ద పెద్ద జీవితలక్ష్యాలు అందుకోవాలని మనిషి పరుగులిడే ఈ కాలంలో నిద్ర అంత ముఖ్యమన విషయంగా కనబడకపోవడం సర్వసాధారణం ఐపోయిందన్నది వాస్తవం. పగలు రాత్రి అని ఒక రోజును రెండు భాగాలుగా అనుభవించిన జీవజాతులతో పాటు పరిణామం చెందుతూ వచ్చిన మానవుడు అకస్మాత్తుగా రాత్రి ఆనేదే లేని థామస్ అల్వా ఎడిసన్ అనంతర (post Edison era) యుగంలోకి అడుగుపెట్టి నిద్ర యొక్క అవసరం ఏంటని ఈరోజు ప్రశ్నించుకుంటున్నాడు. అభివృద్ధి అనబడే పరుగుపందెంలో దూసుకుపోతున్న సమాజాలకు నిద్ర ఒక పనికిరాని అనవసరమైన అడ్డుగోడగా, జీవితోన్నత శిఖరారోహణకు ప్రధానమైన శత్రువుగా కనిపించడం మొదలైంది.  కాసేపు కళ్ళు మూసుకుని పడుకోవడం సోమరితనంగా పరిగణించబడుతోంది. 

అందుకే మానవుడిని అలసట అనేది ఎరుగని యంత్రంగా, అతడి ఆత్మస్థైర్యంతో, కాఫీవంటి నిర్నిద్ర పానీయాలతో నిద్రని శాశ్వతంగా దూరంపెట్టగలడనే కొత్త భావాలు ఉబికివస్తున్నాయి. ఈ వింత పోకడలను వాటినుండి మానవ సమాజం ఎదుర్కోబోయే పెను ప్రమాదాలను గమనించిన సైంటిఫిక్ సమాజం "నిద్రవిషయంలో నిద్రలేవండి" అనే అలారం మోగించాల్సిన సమయం వచ్చింది. ప్రపంచంలో ఈరోజు నిద్రలేమి అన్నది కేవలం జబ్బు మాత్రమే కాదు. ఒక నూతన సామాజిక అలవాటు. ఈ రెంటినీ వేరు చేసి చూడటం అవసరం. అభివృద్ధి చెందిన దేశాలలో ముప్పైశాతం మంది నిద్రలేమితో బాధపడంతున్నారని WHO లెక్కలు చెబుతున్నా మొత్తానికి చూసుకుంటే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నిద్రలేమితో బాధపడేవాడు తనకు నిద్రకావాలని కోరుకుంటాడు. కానీ నిద్ర అనవసరం అనుకునే ధోరణి పెరిగిన సందర్భంలో మొత్తానికి నిద్రలేనివారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. ఒకవైపు మారుతున్న సామాజిక పరిస్థితుల కారణంగా పెరుగుతున్న శారీరక మానసిక సమస్య వలన నిద్రలేమి insomnia కలుగుతుండగా మరోవైపు గ్లోబలైజేషన్ లో భాగంగా తమ పనులు పూర్తి చేసుకోవడం కోసం రాత్రంతా డ్యూటీలు చేస్తూ నిద్రను బలవంతంగా అణుచుకుంటూ సొంతగా నిద్రలేమిని కోరుకుని తెచ్చుకుంటున్న తరమే ఏర్పడింది. ఐతే కారణం ఏదైనా నిద్రలేమి అనేక దీర్ఘకాలిక జబ్బులకు కారణమౌతోందని నూతన పరిశోధనలు చెబుతున్నాయి.


జీవులసలు ఎందుకు నిద్రపోవాలి. భూమి మీద జీవం మొదలైనప్పటినుండి పగలు రాత్రి ఉన్నట్లే నిద్ర మెలకువలు ఉన్నాయి. క్షీరదాల్లో సరీసృపాల్లో పక్షులలో ఉభయచరాల్లో నిద్ర స్పష్టంగా కనిపిస్తుంది.  చేపల్లో కనురెప్పలు లేకున్నా అవి నిద్రలాంటి విశ్రాంతిని తీసుకుంటాయని తెలుస్తోంది. డాల్ఫిన్లు మెదడులోని ఒక భాగాన్ని నిద్రపుచ్చి మరో భాగంతో అలెర్ట్ గా ఉండగలిగిన వింతైన జీవులు. పురాతన కాలం నుండి మనిషి నిద్రపై వివిధ వర్ణనలు ఆలోచనలు పరిశీలనలూ చేస్తూనే ఉన్నాడు.  గ్రీకులు hypnos దేవతను కొలిచారు. ఈజిప్షియన్లు నిద్రలో మనిషి పరలోకానకి వెళ్తాడని భావించి నిద్రలో మరణానికి జారుకోకుండా ప్రార్థనలు చేసేవారు. మెసపటోమియన్లు నిద్రను ఇహ పరలోకాలకు వారధిగా తలిచి దేవుళ్ళు కలల ద్వారా మాట్లాడతారని నమ్మారు. నిద్ర మెలకువలను 

యిన్ -యాంగ్ లుగా భావించి ఇవి రెండూ తటస్థంగా ఉండాలని చైనీయులు అనుకున్నారు. భారతదేశంలో   పూర్తి స్పృహతో నిద్రపోవడాన్ని యోగనిద్రగా అభివర్ణించారు. ఆయుర్వేదంలో ఆహా‌ర విహారాదులతోపాటు నిద్రకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ఐతే ఇరవైయవ శతాబ్దంలో నిదురను మొదటిసారి శాస్త్రీయంగా అవగాహన చేసుకునే ప్రయత్నాలు జరిగాయి. నిద్ర-మెలకువ చక్రం (sleep awake cycle) యొక్క పనితీరు అర్థమవడం మొదలైంది. తర్వాత టెక్నాలజీ పెరిగేకొద్దీ మెదడు ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్, పాలీసోమ్నోగ్రఫీ వంటివి అందుబాటులోకి రావడంతో నిదురను మరింత శాస్త్రీయంగా లోతుగా అధ్యయనం చేయడం సాధ్యపడింది. నిదుర గురించి అర్థమయ్యే కొద్దీ మానవజీవితంలో నిద్ర అనేది మనమనుకున్న దానికంటే ఎక్కువ ప్రాధాన్యత కలదని అర్థమవడం మొదలైంది. నిద్రలేమి మధుమేహం, రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం, కాన్సర్ వంటి భయంకరమైన దీర్ఘకాలిక రోగాలకు కారణమని అర్థమైంది. కొన్ని మానసిక జబ్బులకు లక్షణంగా మాత్రమే కాకుండా కొన్ని మానసిక జబ్బులకు కారణం కూడా నిద్రలేమి అనేది పరిణమించింది. జన్యువులలోనుండి నిదురకు సమాధానాలు దొరుకుతాయా అనే పరిశోధనా మొదలైంది. డిఎన్ఏను కనుక్కున్న వారిలో ఒకరైన క్రిక్ నిదురలోని రహస్యాలను డిఎన్ఏలో కనుక్కోవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. అరుదైన జన్యు వ్యాధిగా progressive insomnia అనే జబ్బు ఒకటుందని అర్థమైంది. ఈ జబ్బు మధ్యవయసు వారిలో కనబడుతుంది. ఈ జబ్బు ఉన్న పేషంట్లకు నిద్ర రావడం పూర్తిగా ఆగిపోతుంది. పూర్తినిద్రలేమితో వీళ్ళు శల్యమై  ఒకటి రెండు సంవత్సరాలలో మరణిస్తారు. అంటే నిద్రలేమి మరణానికి కూడా కారణమౌతుంది. అందుకే ఇంత ప్రాముఖ్యత కలిగిన నిద్రను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం అయింది. 1950 లో REM stage sleep అనేది ఒకటుంటుందని తెలుసుకున్నాక నిదురను మరింత అర్థం చేసుకోవడం మొదలైంది.


మానవ వైజ్ఞానిక వికాసంలో నిదురది కూడా కీలకమైన పాత్ర. నిద్ర అనేదే లేకపోతే మనిషి మెదడు ఇంతగా వికసించేది కాదు. అసీమిత తారాగగనాలను సముద్రలోతులనూ సృష్టి రహస్యాలనూ అసలు ఛేదించేదే కాదు. కోట్ల సంవత్సరాలుగా పరిణామంలో నిదురను నిలుపుకుంటూ వచ్చాడే తప్ప నిదుర అనే ప్రక్రియ అంతరించిపోలేదంటే నిదుర మనకు తెలియని ఏదో అత్యంత అవసరమైన పని చేస్తోందని అర్థం. నిదురలో మనషి మెదడు అభివృద్ధి చెందుతుంది. మన నిదురలో NREM దశ(75-80min) REM(10-15min) దశ లని రెండు దశలుగా ఉంటాయి. ఈ రెండు కలిస్తేనే తొంభై నిమిషాల నిడివి గల ఒక సైకిల్ పూ‌ర్తవుతుంది. వీటికనుగుణంగా మెదడు తరంగాలను కొలవవచ్చు. మనం మెలకువతో ఉన్నపుడు బీటా తరంగాలు ఉంటాయి. నిదురకు ఉపక్రమించి కాసేపు రిలాక్స్ కాగానే ఆల్ఫా తరంగాలు మొదలవుతాయి. అపుడు మగతనిద్ర అనబడే stage 1 నిద్ర మొదలౌతుంది. ఈ దశలో తీటా తరంగాలుంటాయి. ఇది ఒక ఐదు నిమిషాలుంటుంది. ఆ తర్వాత stage 2 లో sleep spindles లేదా k complexes అనబడే తరంగాలుంటాయి. ఇది చాలా ముఖ్యమైన దశ. ఇది పదినిమిషాలుంటుంది. ఆ తర్వాత ఐదునిమిషాల కంటే తక్కువగాstage 3 దశలో డెల్టా తరంగాలుంటాయి.అప్పుడు  stage 4 తీటాతరంగాలతో గాఢనిద్రలోకి మనిషి జారుకుంటాడు. ఇది దాదాపు 45 నిమిషాలుంటుంది. ఆ తర్వాత మళ్ళీ రివర్స్లో 10 నిముషాలు స్టేజి3 దశకు చేరుకుంటాడు. అపుడు ఆల్ఫా బీటా తీటా తరంగాలతో కలగలిసిన REM stage ఉంటుంది. Rapid eye movement దశ. ఈ దశలో మనం గమనిస్తే మనిషితన కను గుడ్లను కదుపుతూ ఉంటాడు. ఈ దశలోనే మనిషి కలలనూ కంటాడు. ఇలా ఒక NREM , REM దశలు కలిస్తే ఒక సైకిల్. ఒక రాత్రిలో 5 నుండి 6 సైకిల్స్ జరుగుతుంటాయి.


ఐతే  మనిషి శరీరంలో NREM దశ ఒకపని చేస్తే REM మరో పని చేస్తుంది. NREM  దశలో శరీరం తన శక్తిని భద్రపరుచుకుంటుంది. మెదడులోని వివిధ న్యూరానుల మధ్య చలనాలు ఆగి ప్రశాంతత లభిస్తుంది. అంటే కండరాలు మెదడు అన్నీ.విశ్రాంతిని పొందుతాయి.  REM దశలో మెదడు కొంత యాక్టివ్ గా ఉంటుంది కానీ  శరీర కండరాలు ఇంతకుముందు దశలాగే నిస్సత్తువగా ఉంటాయి. ఐతే వృద్ధాప్యంలో లేదా పార్కిన్సన్  వంటి జబ్బులలో REM దశలో మెదడుతో పాటు కండరాలు కూడా యాక్టివ్ గా ఉండటంతో వీరు నిదురలోనే నడవడంవంటివి చేస్తుంటారు. అంటే వీరు తమ కలను తమకు తెలియకుండానే యాక్ట్ చేస్తారు.  REM దశలో వచ్చే కలలు అణచివేసి ఉంచిన కోరికలను తీర్చేవిగా ఉంటాయని సైకోఅనలిస్టులు చెబితే ఈ దశ కంటి కండరాల ఆక్సిజెనేషన్ కి పనికి వస్తుందని అనటమిస్టులు చెబుతారు. పిల్లల నిద్రలో REM దశ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, పిల్లలమెదడు వికసించేది ఈ దశలోనే. పిల్లల మొత్తం నిద్రలో ఎనభైశాతం REM దశనే ఆక్రమిస్తుందంటే వారి మెదడు ఎదుగుదలలో దీని ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు. ఐతే పెద్దలలో ఇది చాలా తక్కువ సమయం ఆక్రమిస్తుంది. పెద్దలలో ఈ దశ మెదడు రిపేర్ కి పనికివస్తుంది. ఐతే ముఖ్యంగా మనం గమనించవలసిన అంశం ఒకటుందిక్కడ. రాత్రి పడుకుని పొద్దున అయ్యేకొద్దీ ఒక నిదుర సైకిల్ లో REM దశ సమయం పెరుగుతూ పోతుంది. అందుకే మనకు ఉదయం పూట పడే కలలు గుర్తుండిపోతాయి.  ఉదయం పూట త్వరగా లేచే అలవాటు లేని వ్యక్తిని ఉదయమే లేపామనుకోండి అతడు చాలా మటుకు REM నిద్రను కోల్పోతాడు. అదే పిల్లలైతే వారి మెదడును శక్తివంతం చేసే ఈ  REM దశను మరింతగా కోల్పోతాడు.


మనుషులలో నిద్రవిషయంలో రెండు రకాల వ్యక్తులుంటారు. మామూలు ఇంగ్లీషు భాషలో Early larks and late owls అని. Early bird , late bird అని కూడా అంటారు. రాత్రి ఎనిమిది తొమ్మిదికల్లా నిద్రపోయేవారినా early lark అనీ రాత్రంతా మేలుకుని ఏ మూడు నాలుగు గంటలకో నిదుర పోయే వాళ్ళను late owl అనీ అంటారు. ఐతే ఇవి వ్యక్తుల అలవాట్లకు సంబంధించినవి మాత్రమే కాక ఇవి జెనెటికల్లీ కూడా నిర్మితమై ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఒక వ్యక్తి లేటుగా పడుకోవడానికి అతడి అలవాట్లు కారణమా లేక అది జెనిటికల్ గా నిర్మితమైన అంశమా అని చెప్పడం కష్టం. కానీ సాధారణంగా యుక్తవయసులో late owl గా ఉన్నవారు కూడా వయసు పెరిగేకొద్దీ early lark గా మారడం కూడా గమనించవచ్చు. ఐతే సమాజం లేటుగా పడుకోవడాన్ని తప్పుగా చూస్తుంది. సమాజం మొత్తం తొందరగా నిద్రలేచి పనుల్లోకి పోయేవిధంగానే నిర్మించబడ్డది. ఒక స్టడీ ప్రకారం జనాభాలో 40 శాతం early larks 30శాతం late owls మిగిలిన 30% ఈ రెంటికీ మధ్యలో ఉంటారు. ఐతే దీర్ఘకాలిక జబ్బులు late owls లో కలగటానికి కారణం వారికి సరైన నిద్రను సమాజం కలిగించకపోవడమే. ఏ మూడు నాలుగ్గంటలకు పడుకున్న late owl ఐనా మళ్ళీ ఉదయమే లేచి స్కూలుకో కాలేజీకి ఆఫీసుకో పోవలసిందే. ఉదయమే లేవకపోతే  అతడిని బద్ధకస్తుడిగా మనం గుర్తిస్తుంటాం. పైగా తొందరగా పడుకోవచ్చు కదా అని వొత్తిడి చేస్తుంటాం. అతడికి జెనెటికల్ మేకప్ ప్రకారం నిద్రరాదు అని అంటే డాక్టర్ దగ్గరనుండి నిద్ర ట్యాబ్లెట్లు అలవాటు ఛచేస్తాం. పసి పిల్లలలో రోజుకి 16 గంటల నిద్ర అవసరం. స్కూలు వయసు పిల్లలకు పదిగంటల నిద్ర అవసరం. పెద్దవారికి ఎనిమిది గంటలు ముసలివారికి ఏడు గంటల నిద్ర అవసరం. ఐతే ఒక స్కూలు పిల్లగాడు late owl అనుకుందాం. ఏ రాత్రి పన్నెండు గంటలకో ఒంటిగంటకో పడుకుంటే ఉదయం ఆరుగంటలకు లేచి అతడు స్కూలుకి రెడీ కావలసి ఉంటుంది. అంటే అతడు తనకు అవసరమైన నిద్రను కోల్పోతున్నాడు. అంతమాత్రమే కాదు ఇందాకా చెప్పినట్టు ఉదయం పూట REM SLEEP STAGE ఎక్కువ గా ఉంటుంది. అది మెదడు పనితీరును అభివృద్ధి పరుస్తుంది అనుకుంటే ఉదయం పూట లేచిన late owl విద్యార్థి తనకు చాలా ముఖ్యమైన REM STage నిద్రను కోల్పోతాడం. దీనితో అతడిలో నిస్సత్తువ పెరగడం చదువులో వెనుకబడటం జరుగుతుంది. మన సమాజంలో నిదురకు సంబంధించిన అవగాహన పెరగలేదు కాబట్టి మన జీవితాన్ని బ్రహ్మ ముహూర్తంలోనే లేవడం వంటి ఆదర్శ భావనలతో మరింత కఠినతరంగా చేసుకుని నిదురను విస్మరిస్తుంటాం. శాస్త్రీయ దృక్పథం పెరిగేకొద్దీ అందుకు తగ్గ మార్పులను మనం చేసుకోవలసి ఉంటుంది.


దీర్ఘకాలిక జబ్బులకే కాకుండా రోడ్ యాక్సిడెంట్లకూ నిద్రలేమి ప్రధాన కారణం. ఆల్కాహాల్ కంటే నిద్రలేమివలన జరిగే యాక్సిడెంట్లే ఎక్కువగా ఉంటాయంటే అతిశయోక్తి కాదు. చెర్నోబైల్ వంటి సంఘటనలు జరగడానికి కూడా అక్కడ పనిచేసేవారి నిద్రలేమి కూడా ఒక కారణమనే వాదన ఒకటుంది. ఫ్లైట్ యాక్సిడెంట్లకూ పైలెట్ల నిద్రలేమినే కారణమమనీ వారు సుదూర ప్రాంతాలకు తిరుగుతూ ఉండటంతో బయలాజికల్ గడియారం పనిచేయక వారి పనితీరులో లాజికల్ థింకింగ్ తగ్గి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందనీ పరిశోధనలు చెబుతున్నాయి. పైలట్లనే కాదు సాధారణ మనుషులు సైతం నిద్రలేమి వలన సరైన నిర్ణయాలు తీసుకొలేరు. పరీక్షలలో సరిగ్గా నెగ్గలేరు. ముఖ్యంగా విద్యార్థులకూ,  కఠినమైన పనులు చేసేవారికీ, ట్రక్కు డ్రైవర్లు, పైలెట్లు  వంటివారికి నిదురకు సంబంధించిన ఖచ్చితమైన షెడ్యుల్ ఉండవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా రాంకుల వెంట పరిగెట్టే యువత నిదురను అలక్ష్యం చేస్తూ చదవడం వలన మెదడు పనితీరును బండబారుస్తున్నారనే విషయం తెలుసుకోవాలి. సరైన నిదురలేకుండా చదివే extra time చదువు వలన లాభం లేకపోగా నష్టమే ఎక్కువ అని గుర్తెరగాలి. నిదుర రాకుడదని కాఫీ టీల మీద అధారపడుతూ చదివే చదువు శ్రేయస్కరం ఏవిధంగాను కాదు.


ఐతే నిద్రలేమితో పాటు ఈ మధ్య పెరుగుతున్న మరో సమస్య OSA (OBSTRUCTIVE SLEEP APNEA). డ్రైవర్లలో డెభ్భైశాతం మందికి ఈ సమస్య ఉందని దానిలో పది శాతం మందికి తీవ్రంగా ఉందని ఒక సర్వే చెబుతోంది. గొంతు కండరాలలోపల కొవ్వు పెరగడంవలన నిదురలో వీరి నాలుక నోటి కుహరంలో వెనుకకి పడిపోవడం గురకవస్తుంది. దాని వలన గాలి నోటిలోనే ఆగిపోయిసరైన ఆక్సిజన్ శరీరానికి అందదు. అప్పుడు శరీరంలో కార్బన్ డై ఆక్సైడ్ శాతం పెరిగి దాని ప్రభావంతో మెదడు సడెన్ గా యాక్టివ్ కావడంతో ఆ వ్యక్తి నిదురనుండి లేస్తాడు. దీనిని apnea cycle అంటారు. ఐతే ఈ లేవడం తనకు గుర్తు ఉండదు. ఇలా గంటలో 40 నుండి 100 apnea cycles జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి టాన్సిల్స్, లింఫ్ గ్రంధుల వాపు, చిన్న గాలి గొట్టాల వలన కూడా ఇలా జరగవచ్చు. ఐతే దీనిని పూర్తిగా అలక్ష్యం చేస్తారు. OSA బీపికి, గుండెజబ్బులకు, సడెన్ కార్డియాక్ డెత్ లకూ కారణం ఔతుంది. దీనిని సకాలంలో గుర్తించి CPAP వంటి మిషిన్ల సహాయంతో చికిత్స తీసుకోవాలి. లేకపోతే ఉదయం పూట ఎపుడంటే అపుడు పనులు చేస్తూ కూడా నిద్రపోవడం దీని ప్రధాన లక్షణం. డెభ్భైశాతం డ్రైవర్లలో ఈ లక్షణం గుర్తించారంటే మనం దీనిని ఎంతగా అలక్ష్యం చేస్తున్నామో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లకు ఏది ప్రధానమైన కారణమో అర్థం చేసుకోవచ్చు. ఐతే.  ఈ సమస్యలేవీ గుర్తించకుండా నిదుర రాకుండా ఉండేందుకు అలర్ట్ గా ఉండేందుకు కాఫీ టీ వంటి పదార్థాలని తీసుకుంటూ ఉంటారు. సుదూర ప్రాంతాలకు నడిపే డ్రైవర్లు నిదుర వచ్చినపుడల్లా వాహనం పక్కకు తీసుకుని కాఫీ తాగుతూ ఉంటారు. కాఫీ ఎఫెక్ట్ పోగానే బలవంతంగా ఆపుకున్న నిద్ర ఆపుకోలేని దశకు చేరి వాహనం నడుపుతుండగానే నిద్రపోతుంటారు. పరిణామం మనకు తెలిసినదే.


మనిషి ఎక్కువ సమయం పని చేసే కొద్దీ మెదడులో ఇంక చాలు అని చెప్పేందుకు అడినోసిన్ అనే పదార్థం నిండుతూ ఉంటుంది. అంటే  సాయంత్రం దాటి రాత్రి సమీపించే కొద్దీ మెదడులో ఎడినోసిన్ ఎక్కువగా చేరుతుంది. కానీ సాయంత్రం తాగే కాఫీ టీలలోని కెఫిన్ పదార్థం అడినోసిన్ రిసెప్టర్ లను నింపేసి నిదురను తాత్కాలికంగా నిలుపుదల చేస్తుంది. కానీ కెఫిన్ half life ఏడు గంటలు. సాయంత్రం ఒక కప్పు కాఫీ తాగితే దాని ప్రభావం పూర్తిగా తొలగిపోవడానికి అర్ధరాత్రి దాటి ఉదయానికి కూడా సమీపించవచ్చు. వృద్ధులలో కెఫిన్ పూర్తిగా తొలగడానికి మరింత సమయం పడుతుంది. ఐతే విపరీతంగా కెఫిన్ పదార్థాలకు (కొన్ని చల్లని పదార్థాలలో కూడా)ప్రజలు అలవాటు పడ్డారు. దీనితో సరైన నిద్ర లేక రాత్రులలో ఇబ్బంది పడుతూ పొద్దున లేవలేక లేచినా సరిగా ఏకాగ్రత నిలపలేక సతమతమౌతూ ఉంటారు. ఇవే మెల్లిగా దీర్ఘకాలిక జబ్బులకు దారి తీస్తాయి. ఉదయం పూట మీరు బలవంతంగా నిద్ర ఆపుకోవలసి వస్తున్నదా? నిదురపోకుండా ఉండేందుకు యాక్టివ్ గా ఉంటుందని కాఫీ తాగుతున్నారా లేదా సాయంత్రం వరకు మరోసారి లేదా పదే పదే కాఫీ లేదా టీ తాగకపోతే మీకు మగతగా నిస్సత్తువగా అనిపిస్తుందా..? ఐతే మీరు తప్పక అర్థం చేసుకోవలసిన అంశం మీకు సరైన నిద్ర లేదని. చాలా ఆఫీసులలో పని క్షేత్రాలలో యేళ్ళ తరబడి ఇదే రొటీన్ ని అలవాటు చేసుకున్నవారుతాము తక్కువగా నిదుర పోతున్నామని గుర్తించరు. Sleep debt(నిద్ర బాకీ) అని ఒక భావన ఉంది. ఒక వ్యక్తి తనకు కావలసిన నిద్ర పోకపోతే ఆ మిస్సైన నిద్ర మెదడులో sleep debt( గా స్టోరై ఉంటుంది. అవసరం వచ్చినపుడు ఆ వ్యక్తి ఆ మిగిలిన నిద్రను తీర్చుకుంటూ ఉంటాడు. సాధారణంగా మనిషిలో ఎనిమిది నుండి పదిగంటల sleep debt ఉంటుంది. ఐతే ఎపుడైతే ఇది యాభై గంటలను దాటుతుందో అది తీవ్రదశకు చేరుకున్నట్టు. వీళ్ళకు రక్తపోటు గుండెపోటు సడెన్ డెత్ పక్షవాతం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఆదివారాలో లేక పండగ సెలవు దినాలకో వీలైనంత నిద్రపోవడం వలన చాలామటుకు sleep debt తగ్గించుకోవచ్చు. కానీ అందుకు భిన్నంగా కాఫీ టీలతో మన శరీరాలను ఆరోజే ఎక్కువగా నింపుతుంటాం.


 కాఫీ ఫుడ్ సప్లిమెంట్ కాదు. ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వాడబడుతున్న సైకో యాక్టివ్ సబ్స్టెన్స్ కాఫీ. పెట్రోలియం తర్వాత అతి ఎక్కువగా వాణిజ్యమౌతున్న పదార్థం కాఫీ. మనం కృత్రిమ సైకో యాక్టివ్ సమాజాన్ని సృష్టించుకున్నాం. అందుకే నిద్రలేమి ఒక పాండెమిక్ గా మారింది. ఐతే నిద్రలేమికి విరుగుడుగా నిద్రమాత్రలను వాడటం సరైన పద్ధతి కాదు. చాలామంది డాక్టర్లుకూడా నిద్ర శుభ్రతను( sleep hygiene) పేషంట్లకు వివరించడంలో సఫలీకృతం కాలేకపోతున్నారు. పేషంట్ సాటిస్ఫాక్షన్ కోసమని నిదుర మాత్రలు రాయడం తప్పని పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. పేషంట్లతో పాటు డాక్టర్లు కూడా నిద్ర శుభ్రతను అర్థం చేసుకుని పేషంట్ కి తగ్గట్టు కష్టమైజ్ చేయగలగాలి. Late owls ని గుర్తించి వారు మరీ త్వరగా నిదుర లేవడం వలన వారిని బద్ధకస్తులని వారిపై బలవంతంగా ఆదర్శాలను రుద్దడంవలన లాభం ఉండదనీ గుర్తించాలి. విద్యార్థులలో నిదుర ప్రాముఖ్యత గురించి కార్పోరేట్ స్కూళ్ళల్లో కాలేజీల్లో సెమినార్లు నిర్వహించి అవగాహన పెంచాలి. నిద్రకు సంబంధించి నిర్థారణ కాని జబ్బులు వందకు పైగా ఉన్నాయి. సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ జరగాలంటే ముందు నిద్రపైన అవగాహన పెరగాలి. నిద్ర సులువుగా కొట్టివేయవలసిన అంశం కాదనీ నిర్లక్ష్యం వహించవలసిన అంశం అసలే కాదనీ గుర్తెరగాలి. నిద్రకు ఆల్టర్నేటివ్ ఏదీ లేదు. అన్నానికి బదులు ఆకులు, అలములు, పళ్ళు తిని బతకవచ్చు. కానీ నిద్రకు బదులుగా మరేది లేదు. నిద్రపోవాల్సిందే. World sleep Society అందుకే నిదురపై అవగాహనను పెంచడంకోసం ప్రతిసంవత్సరం మార్చి 15 ను sleep day గా గుర్తించి అవగాహన కోసం ప్రయత్నిస్తోంది. 2024 సంవత్సరానికి గాను అందరికీ సమానమైన నిద్ర అవసరాన్ని గుర్తు తెస్తుంది. కొందరు "మాకు  చాలా తక్కువ సమయం నిద్ర సరిపోతుంది" అని గొప్పలు పోవడం చూస్తుంటాం. అది ఏమాత్రం గొప్ప కాదనీ అది తెలియని ఒక నిద్రసంబంధ జబ్బని గుర్తించి సరైన చికిత్స తీసుకోవాలి. అందుకే ఈ oxymoron "మేలుకోండి.. సరైన నిద్ర అవసరమని గుర్తించండి".



విరించి విరివింటి

17/3/24

Published in nava telangana

Friday, 15 March 2024

Genetic reality. Essay

 Genetic reality


ఆర్కపెలాగో అంటే ద్వీపాల సముదాయం. మన భూమి మీద వివిధ ప్రాంతాలలో ఈ ద్వీపాల సముదాయాలు ఉన్నాయి.  ఒక రకంగా ఇతర భూభాగాలైన పెద్ద ఖండాలనుండి వేరుచేయబడి ఉండటంతో మొక్కల జంతువుల మనుషుల గురించి చదవడానికి ఇవి ప్రకృతి సహజమైన బయోలాజికల్ ల్యాబ్స్ లాగా ఉపయోగపడతాయి. అందుకే ఆంథ్రోపాలజిస్టులూ, నేచురలిస్టులూ, బయాలజిస్టులు, జువాలజిస్టులు, బోటనిస్టులూ, పరిణామ వాదులు, పర్యావరణవేత్తలూ, డాక్టర్లూ ఈ ప్రాంతాలలో పరోశోధనలు చేయడానికి ఉత్సుకత చూపుతుంటారు. ఇలాంటి ద్వీప సముదాయాలలో పరిశోధనలు చేయాలన్న ఉత్సాహం ఇప్పటిది కాదు. పురాతన కాలం నుండి ఉన్నా 15 నుండి 17 వ శతాబ్దంలో కొలంబస్ , జేమ్స్ కుక్ వంటి వారి సాహసయాత్రలనుండి దీవులను గుర్తించడం వాటికి మ్యాపులు తయారుచేయడం మొదలైంది. ఆ తర్వాత వలసవాద దేశాలనుండి పరిశోధకులు పద్దెనిమిది, పంతోమ్మిదవ శతాబ్దం నుండి ఈ ప్రాంతాలకు వెళ్ళి పరిశోధనలు చేయడం మొదలైంది.    ఈ రెండు శతాబ్దాలు చాలా విచిత్రమైన ప్రపంచ పరిస్థితుల్లో ఉన్న శతాబ్దాలు. ఒకవైపు ఏజ్ ఆఫ్ ఎన్లైటెన్మెంట్ నుండి హేతుబద్ధ ఆలోచనలు శాస్త్రీయ దృక్పథమూ,  టెక్నాలజీ రూపంలో మైక్రోస్కోపు వంటి సైంటిఫిక్ యంత్రాలు స్పెసిమన్లను భద్రపరిచే టెక్నాలజీ రావడమూ జరుగుతుండగా మరోవైపు వలసవాదంతో ఆయాదేశాలు కొత్త ప్రదేశాలకు  పాకుతూ అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయవలసిన అవసరాలు ఏర్పడటమూ జరిగింది. బ్రిటిష్ ఫ్రెంచ్ డచ్చి ప్రభుత్వాలే స్వయానా సాహసయాత్రలను స్పాన్సర్ చేసి పరిశోధనలద్వారా వచ్చిన డాటా ఆధారంగా తన సామ్రాజ్యాలను విస్తరిస్తూ పోయిన తరుణమది. అలా ఆర్కపెలాగోలు వలసలకు అనుగుణమైనవిగా, వ్యవసాయానికి సహజవనరులకూ ఆలవాలమైనవిగా, కొల్లగొట్టడానికి అనువైనవిగా వలసవాదులకు తోచాయి. అందుకై వచ్చిన పరిశోధకుల పరిశోధనలు అక్కడ చూసిన కొత్తరకమైన మొక్కలు జంతువులు మానవులూ, ఇవన్నీ కొత్త లోకాలను వారికి పరిచయం చేశాయి. ఈ విచిత్రమైన పరిస్థితుల్లోంచే జీవపరిణామం అంటే ఏంటో అర్థమవడం మొదలైంది. ఎందరో నేచురలిస్టులు జీవ పరిణామాన్ని అర్థం చేసుకుని వివరించగలిగినా సరైన ఎవిడెన్సులు లేక చాలామటుకు ఊహాగానాలుగా మిగిలిపోగా తిరుగులేని ఎవిడేన్సు లతో జీవపరిణామాన్ని తీసుకువచ్చిన వారు చార్లెస్ డార్విన్, ఆల్ఫ్రెడ్ వాలెస్ లు. ఐతే డార్విన్ గలపాగోస్ ఆర్కపెలాగోలో(1831-1836) పరిశోధన చేస్తే దానికి కొంతకాలం తర్వాత వాలెస్ మలయ్ ఆర్కపెలాగోలో (1854 -1862) పరిశోధనలు చేశాడు. 


"ఓ కొలంబస్...! చంపే సైన్యమూ, అణు ఆయుధం, ఆకలిపస్తులూ, డర్టీ పాలిటిక్స్, పొల్యూషన్లేవీ కనబడలేని దీవి కావాలి ఇస్తావా?" అని జీన్స్ సినిమాలో పాట. నిజానికి నేచురలిస్ట్ లు ఇలాంటి కారణాలవలననే ఆర్కిపెలాగోలను తమ పరిశోధనకు ఎంచుకుంటారు. వీటిల్లోని జంతు వృక్ష జాతుల  వైవిధ్యం అవి అనువర్తనం (adaptation) చెందిన విధానమూ, వ్యాపించిన విధానమూ అంతరించిన(extinction) క్రమమూ ఎలాంటి ఇతర జీవుల ప్రభావం లేకుండా స్వచ్ఛంగా జరుగుతుందనే ఊహతో ఈ ద్వీపసముదాయాలు వీళ్ళని ఆకర్షించాయి. ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి పరిశోధనలు చేయాలంటే మొదట ఆ గట్స్ కావాలి. Eccentric గా తేడాసింగ్ లాగా కూడా ఉండాలి. డార్విన్, వాలెస్ లు అలాంటివారేనని చెప్పక తప్పదు. తమకంటూ ఎలాంటి సంస్థతో విశ్వ విద్యాలయాలతో సంబంధాలు లేకున్నా తమ సొంత నిర్ణయాలతో విక్రమార్క పట్టుదలతో వీళ్ళు సాహసయాత్రలు పరిశోధనలూ చేశారనే చెప్పాలి. డార్విన్ బీగిల్ లో తిరుగుతూ( నా ఇంతకు ముందు వ్యాసం చూడండి) తన స్పెసిమన్లను తయారుచేసుకుంటే వాలెస్ మలయా ఆర్కిపలాగోలోనే దాదాపు ఎనిమిది సంవత్సరాలు తిష్టవేసి కూర్చుని తన పరిశోధనలు చేశాడు. ఐతే మలాయ్ అర్కిపెలాగోలో ఎన్ని ద్వీపాలున్నాయనుకున్నారు?. చిన్నవీ పెద్దవి కలిపి ఇరవైయైదు వేల ద్వీపాలున్నాయి. ఇందులో మానవ నివాస యోగ్యమైనవి కొన్నే. ఐతే ఈ ద్వీప సముదాయాలలో అతడొక ముఖ్యమైన విషయాన్ని కనుగొన్నాడు. అదే ఈ వ్యాసంలోని ప్రముఖమైన అంశం. అదేంటంటే ఈ ప్రాంతంలోని ద్వీపాలను తూర్పు పడమర ద్వీపాలుగా విభజించుకుంటే పశ్చిమ ద్వీపాలలోని వృక్ష జంతుజాలం ఒకరకంగా ఉంటే తూర్పు ద్వీపాలలో మరోరకంగా ఉన్నాయి. ఇంకా స్పెసిఫిక్ గ చెప్పాలంటే పశ్చిమాన ఉన్న జావా,బాలీ, లంబోక్ దీవులలో ఉండే వృక్ష జంతువుల జాతులు తూర్పున ఉన్న బోర్నియో, సులవేసి దీవులకంటే భిన్నమైనవి. అంటే ఈ దీవులన్నీ పక్కపక్కనే ఉన్నా వీటి మధ్య దూరం అతి తక్కువగా ఉన్నా అక్కడ పెరుగుతున్న జంతు వృక్ష  జాతులు పూర్తిగా విభాన్నమైనవి. బాలిలో ఉండే జంతువు ఏదీ బోర్నియో లో లేదు. అలాగే బోర్నియో లో ఉండే జంతువు లేదా వృక్షరకమేదీ బాలిలో లేదు. ఇది విచిత్రం. ఇది గమనించిన వాలెస్ 1859 లో (ఈ సంవత్స‌రమే డార్విన్ Origin of species పుస్తకం వచ్చంది)తూర్పు పడమర దీవుల మధ్య ఒక ఊహాత్మక గీత గీశాడు. దానినే "వాలెస్ లైన్" అంటారు. సముద్రంలో గీసిన ఈ ఊహాత్మక గీతను దాటుతూ ప్రకృతి పూర్తిగా  అటు ఇటూ వేరుగా ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోవడం ఆంథ్రోపాలజిస్టుల వంతయింది. ఐతే ఈ ద్వీపాలు సముద్రంలో ఒకదానికొకటి దూరంగా విడివడినట్టు ఉంటాయి కాబట్టి ఏ ద్వీపానికాద్వీపం విభిన్న మైన వృక్ష జంతుజాలాలను కలిగి ఉంటుందని ఊహించాడు. ఈ ఊహలో నిజం లేకపోలేదు. కానీ ఇక్కడి పక్కపక్కని దీవులలో విభిన్నమైన జీవం ఉండటానికి అసలైన కారణంగా "కాంటినెంటల్ డ్రిఫ్ట్" ని  కనుగొన్నారు 20వ శతాబ్దంలో. ఇండోనేషియాలోని పడమర దీవులు యురేషియా ప్లేట్ లోని సుందా షెల్ లో  ఉంటే తూర్పు దీవులు ఆస్ట్రేలియా ప్లేటులోని సాహుల్ షెల్ కి సంబంధించినవి. కాంటినెంటల్ డ్రిఫ్ట్ జరిగిన సమయంలో సుందా, సాహుల్ షెల్ లు పక్క పక్కకు వచ్చి చేరడంతో ఇండోనేషియా పశ్చిమ దీవులలో ఆసియాకి సంబంధించిన వృక్ష జంతు జాతులుండగా, తూర్పు దీవులలో  ఆస్ట్రేలియా కి సంబంధించిన వృక్ష జంతుజాలాలు కనబడతాయి. 


వాలెస్ పరిశోధనలను 1863 లో పుస్తకంగ తెచ్చే సమయానికి మలాయ్ ద్వీపసముదాయాలను సందర్శించే ఆంథ్రోపాలజిస్టులు ఇతర నేచురలిస్టుల తాకిడి ఎక్కువైంది. ఐతే కొలోనియల్ సమయంలో రేసియల్ థియరీలు కూడా ఊపందుకున్నాయి. వాలెస్ తన అబ్జర్వేషన్ లతో పాటు అదనంగా చెప్పిన ఒక చిన్న అంశాన్ని పట్టుకుని ఆంథ్రోపాలజిస్టులు కోడిగుడ్డు మీద ఈకలు పీకడం మొదలెట్టారు. పొరపాటునో గ్రహపాటునో  వాలెస్ ఏం చెప్పాడంటే జంతు వృక్ష జాలలే కాకుండా తూర్పు పడమర దీవుల్లో మనుషుల మధ్య కూడా బేధాలున్నాయి, పడమర వైపు ఉండేవారి చర్మం తెల్లగానూ వెంట్రుకలు పలుచగనూ ఉంటే తూర్పు దీవులలో ఉండేవారి చర్మం నల్లగానూ వెంట్రుకలు మందంగా వొంకులు తిరిగి ఉందని చెప్పాడు. ఇదే తర్వాతి పరిశోధకులకు పనికిమాలిన పనిని కలిగించింది.  తమ రేసియల్ థియరీలతో ద్వీపసముదాయాలను చూడటానికి వచ్చిన కలోనియల్ ఆంథ్రోపాలజిస్టులు ఈ విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపుతూ మరింత వివరించడం మొదలు పెట్టారు. వృక్ష జంతుజాలాల మధ్య విబేధాన్ని పక్కనబెట్టి ఇక్కడి మనుషుల మీద పడ్డారు. వాళ్ళ రాతల్లో తూర్పు దీవులలో నివసించే మనుషులమీద ఏహ్యభావం చిన్నచూపు కనబడ్డాయి.వారు జబ్బులతో ఉన్నారనీ, శుభ్రత అనేది లేకుండా చూడటానికి అసహ్యంగా ఉన్నారనీ, పైగా నమ్మదగిన వ్యక్తులుగా కనిపించడం లేదనీ రాయడం మొదలెట్టారు. వాలెస్ లైన్ ని వాళ్ళు "వాలెస్ ఆంథ్రోపాలజికల్ లైన్" గా మార్చారు. మనుషులను వారి బాహ్య ఆకారాల ఆధారంగా వారి సంస్కృతుల ఆధారంగా భాషల ఆధారంగా వేరు వేరుగా విభజించవచ్చని కొలోనియల్ ఆంథ్రోపాలజిస్టులు అనుకున్నారు. ఇదే రేషియలైజేషన్. వాలెస్ ఊహించిన వాలెస్ లైన్ కాలక్రమంలో వాలెస్ ఆంథ్రోపాలజికల్ లైన్ గా మారటం కలోనియల్ కాలంలోని రేసియల్ మైండ్ సెట్ ని ప్రతిబింబిస్తుంది.


అంతమాత్రమే కాదు సైన్సు అభివృద్ధి చెందుతున్న తరుణంలో మానవుడి నీచత్వం సైన్స్ ని కూడా  ఎలా భ్రష్టు పట్టించగలదో మనకు అర్థమౌతుంది. మానవుడు కులాలుగా మతాలుగా జాతులుగా విడిపోయి అందుకోసం యుద్ధాలు చేసుకోవడం చంపుకోవడం మానవుని భ్రష్టత్వానికి ఋజువులు. పరిశోధకుడు రచయిత ఐన ఆర్థర్ కోస్టలర్  ఏమంటాడంటే - మనిషి మెదడులో ఎక్కడో ఒక స్క్రూ లూజుగా ఉంది, మానవ పరిణామం లో ఎక్కడో ఏదో అంతుచిక్కని తప్పు జరిగిపోయిందని. మానవుడి మస్తిష్కం ఇతర అవయవాల మాదిరిగా కాకుండా చాలా వేగంగా పరిణామం చెందిందనీ అదే బహుశా అతడి స్క్రూ లూజ్ కావడానికి కారణం కావొచ్చనీ అంటాడు. మనం సైన్సు మనలోని మూఢత్వాన్నీ పక్షపాతాల్నీ( prejudices) తొలగించేయాలని కోరుకుంటాం. కానీ సైన్స్ ని ఆధారంగా చేసుకుని అచ్చం సైన్స్ లాగే కనబడే సూడోసైన్స్ ఈ మూఢత్వాలను మరింత పెంచుతూ ఉంటుంది. అలా వచ్చిండేదే "వాలెస్ ఆంథ్రోపాలజికల్ లైన్". కలోనైజేషన్ అమలుపరిచిన రేసియలైజేషన్ "జాతివాదం" పూర్తిగా సూడో సైంటిఫిక్. ఆ కాలంలో యూరోప్ లో ఆంథ్రోపాలజిస్టులు వైద్యంలో కూడా శిక్షణ పొందేవారు. వీళ్ళు మనుషులనూ, సమాజాన్నీ వారి శరీర ఆకృతలుగానే, ఎక్కువ తక్కువలుగా చూసేవారు. ఇదే భావజాలాన్ని వాళ్ళు మలయా ఆర్కపలాగోకి తీసికెళ్ళారు.. ఐతే ఈ వలసవాదులు South East asia లో నాటిన ఆనాటి రేసిస్టు విత్తనం తరువాత చాలా ఘోరమైన మలుపులు తీసుకుంది. ఆ ప్రాంత రాజకీయాలను ప్రభావితం చేసింది. పైకి కనిపించే శరీర లక్షణాల ఆధారంగా "వీళ్ళు నాజాతివాళ్ళు మిగిలిన వాళ్ళు పరాయిజాతివాళ్ళు" అని అక్కడి ప్రజలు నమ్మడం మొదలెట్టారు. విభజించు పాలించు అనేది వలసవాద ఎజెండా అని మనకు తెలిసిన విషయమే. ఐతే ఇండోనేషియా డచ్ వారి ఆధీనంలో ఉండేది. 


వెస్ట్ న్యూగీనియా* సమస్య తలెత్తినపుడు ఈ ప్రాతంలో మానవహననాలు జరగడానికి కారణం ఈ ఊహాత్మక 'ఆంథ్రోపాలజికల్ వాలెస్ లైన్' అందించిన భావజాలమే. వెస్ట్ న్యూగీనియా లో పపువా మలనేసియా జాతులవారు శతాబ్దాలుగా కలిసి నివసిస్తున్నారు. కానీ వారి మధ్య చిచ్చు రగిలింది. పపువా వారి చర్మం రంగును వెంట్రుకల మందంని బట్టి వారు తక్కువ జాతివారిగా వివక్షకు గురవడం మొదలైంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత  ఈ ప్రాంతాన్ని ఇండోనేషియా లో కలపాలని జాతీయవాద స్వాతంత్ర్య ఉద్యమాలు జరిగాయి. 1949 లో డచ్ వారినుంచి వెస్ట్ న్యూగీనియాకి విముక్తి లభించి ఇండోనేషియా లో కలిసిపోయారు. కానీ ఇండోనేషియా లోనే ఉండి నిరంతరం వివక్షకు గురయ్యే వెస్ట్ పపువా ప్రజలుమాత్రం ఇండోనేషియా నుండి స్వాతంత్య్రాన్ని కోరుకున్నారు. ఒకవైపు ఇండోనేషియా నేషనలిస్టులు తమదంతా ఒకే చారిత్రక, సాంస్కృతిక నేపథ్యమని వాదిస్తే పపువా నేషనలిస్టులు "వాలెస్ లైన్" ఆధారంగా తాము వేరే జాతికి చెందినవారిమని వాదించారు. కోల్డ్ వార్ లో భాగంగా అమెరికాతో పాటు ఇతర యూరోప్ దేశాలు ఇండోనేషియా వైపు, రష్యా వెస్ట్ పపువా వైపు మొగ్గుచూపాయి. ఐతే ఇప్పటికీ ఈ సమస్య రావణకాష్టమే. ఇప్పటికీ ఇండోనేషియా నుండి స్వాతంత్య్రంకావాలని ఆ ప్రాంతంలో ఘర్షణలు కొనసాగుతున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘనలూ అక్రమ చట్టవ్యతిరేకమైన అరెస్టులు భావ ప్రకటన స్వేచ్ఛను హరించే చర్యలు కొనసాగుతున్నాయి.


విచిత్రం కదా!?. వాలేస్ చేసిన ఒక సైంటిఫిక్ పరిశోధన ఒక  సముద్రం గుండా సాగే ఊహాత్మక  సైంటిఫిక్ లైన్ ఆ తర్వాత కలొనియలిస్టుల చేతిలో పడి ఏ విధంగా మనుషులను జాతులుగా విడగొట్టిందో, అది చినికి చినికి గాలివానై  జాతి విద్వేషాలకు దారి తీసి ఈనాటికీ మండుతూ ఉందో...ఇదంతా విచిత్రంగా ఉంది కదూ!. అంటే ఇక్కడ మనం చూడవలసిన అంశం ఏమంటే -  సైన్సు ఏం చెబుతుంది, మనుషుల సాంస్కృతిక - రాజకీయ ప్రాధాన్యాలు ఏమి చెబుతీన్నాయనేది. జెనిటికల్ స్టడీస్ ప్రకారం ఆంథ్రోపాలజికల్ వాలెస్ లైన్ కి ఇవతల అవతల ఉన్న ప్రజలలో ఎలాంటి జన్యుపరమైన బేధాలూ లేవనీ,South east asia లోని ప్రజలందరూ ఒకే పూర్వీకుల జన్యువులు కలిగి ఉన్నారనీ, పలుమార్లు ఈ దీవులకు వివిధ ప్రాంతాలనుంచి వలసలు జరిగి పవివాహాలు జరిగి జెనిటికల్ మిక్సింగ్ జరిగిందనీ సైన్సు చెబుతోంది.   అందుకే ఈ ప్రాంత జనాభాలో జెనెటికల్ వేరియేషన్ అధికంగా ఉందనీ తెలుపుతుంది. ఒక ప్రాంతం కావొచ్చు లేదా ఒక దేశం కావొచ్చు ప్రస్తుతానికి దేశమనుకుందాం. జెనెటికల్ వేరియషన్ అనేది రెండు వేరు వేరు దేశాలకు చెందిన ప్రజలకంటే ఒక దేశంలోపల నివసించే జనాభాలో కనుక  ఎక్కువగా ఉంటే...ఆ దేశానికి ఇతర దేశాలనుండి వలసలు విపరీతంగా జరిగినట్టు అలాగే ఆ ఇతరదేశాలతో వివాహసంబంధాలు నెరపినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. విచిత్రం ఏంటంటే ప్రపంచంలో దాదాపు ప్రతీ దేశం లేదా ప్రాంతంలో ఇదె సినారియో ఉంది. అటు అమెరికాను తీసుకున్న యూరోపును తీసుకున్నా ఇటు తూర్పుదేశాలైన చైనా భారత్ లను తీసుకున్నా ఆయా జనాభాలలో జనెటికల్ వేరియేషన్ అధికంగా ఉన్నట్లు ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. అంటే సరిహద్దులు లేని, దేశాలనేవేవీ లేని ఒకానొక కాలంలోనే మనుషులు ఒక ప్రాంతంనుండి మరో ప్రాంతానికి వలసలు చేస్తూనే ఉన్నారనీ ప్రపంచంలో ఒకటీ అరా అలా ఎక్కడో మూలకు విసిరేసినట్టు ఉండే అమేజాన్ అడవులో అండమాన్ నికోబార్, సోలోమన్ పసిఫిక్ దీవుల వంటి ప్రాంతాల వాళ్ళు తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలవారిలో జెనెటికల్ వేరియేషన్ అధికంగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. అంటే ఇపుడు మనం అనుకుంటున్న గ్లోబలైజేషన్ ఎపుడో జరిగింది.  దానవీర శూరకర్ణలో కొండవీటి వెంకటకవి రాసినట్టు జెనెటికల్ ఋజువులు ప్రత్యక్షంగా కనబడుతున్న ఈ ఆధునిక కాలంలో జాతి జాతి అనడం ఇపుడు వ్యర్థవాదం. 


శరీరాకృతిలోనూ జన్యుపరంగానూ మనుషులు వైవిధ్యాన్ని చూపుతున్నప్పటికీ వారి మధ్యన అడ్డుగోడలు లేవని అవి మసకబారిపోయాయని జన్యు శాస్త్రం తెలుపుతోంది. జీవశాస్త్ర పరంగా నిర్ధారించగల ఒక స్పష్టమైన జాతి అనేదేదీ లేదని ఆధునిక జన్యుశాస్త్ర మానవశాస్త్ర పరిశోధనలు రూఢీ చేస్తున్నాయి. పూర్వీకుల ఆధారంగా భాషా సంస్కృతి ఆధారంగా శరీర ఆకృతి ఆధారంగా మనం జాతులుగా విడగొట్టడమన్నది సంక్లిష్టమైన మానవ వైవిధ్యాన్ని అతి పలుచనచేయడమే. ఇవి స్టీరియోటైపులనూ విద్వేషాలనూ రెచ్చగొట్టే సూడో సైన్సులే తప్ప నిజమైన సైన్స్ కాదు. మానవులమందరం ఒక్కటే అని చెప్పగలిగి అందరినీ బంధువులని చేయగల శక్తి దేనికైనా ఉందా అంటే అది కేవలం సైన్స్ కి మాత్రమే ఉంది. ఐతే కలోనియల్ ఆంథ్రోపాలజిస్టులవలే అది జాతివిద్వేషాలను రెచ్చగొట్టే సూడో సైన్సు చేతిలో పడకుండా చూడవలసిందే. అంతేకాక తమ తాత్కాలిక పదవులకోసం రాజకీయ నాయకులు, వేల యేళ్ళ తరబడి జన్యువుల రూపంలో సాగిన మానవ సమూహాల ఏకాత్మకా శక్తిని కాదని జాతులు వేరు వేరని నమ్మబలుకుతుంటారు. కానీ అందరమూ ఒక తల్లి బిడ్డలమే అని తెలుసుకోగలగడమే జెనెటిక్ రియాలిటీ.


విరించి విరివింటి 

11/3/2024


*న్యూగీనియా అనేది South East Asia లో అతిపెద్ద ద్వీపం. దీనిని న్యూగీనియా హైలాండ్ అంటారు. గ్రీన్ ల్యాండ్ మొదటిదైతే న్యూగీనియా రెండవ అతిపెద్ద ద్వీపం. ఐతే దీనిలో పశ్చిమ భాగాన్ని వెస్ట్ న్యూగీనియా అనీ తూర్పుభాగాన్ని పపువా న్యూగీనియా అని అంటారు. వెస్ట్ న్యూగీనియా ఇండోనేషియా లో ఒకభాగమైతే పపువా న్యూగీనియా 1975 లో ఆస్ట్రేలియా నుండి విడివడి స్వతంత్ర దేశంగా మారింది.

Tuesday, 5 March 2024

1984, Big Boss and Beagle. Essay

 1984, Big Boss and Beagle


ఆ మధ్య ఒక స్కూలు అడ్వర్టైజ్మెంట్ ఒకటి చూశాను. తరగతి గదులను సీసీ కెమెరాలతో మానిటర్ చేస్తామని. గొప్పగానే చెప్పుకున్నారు. పది సంవత్సరాల క్రితం బెంగుళూరు స్కూల్ లో జరిగిన ఒక రేప్ కి రియాక్షన్ గా వెంటనే తరగతి గదుల్లో సీసీకెమెరాలను అమర్చాలనే భావన మొదలైంది. ప్రభుత్వాలూ ప్రజలు స్కూలు యాజమాన్యాలూ అప్పట్లో ఈ విషయమై కాస్త కంగారుగా హడావుడి చేశారు. ఆ సీసీకెమెరాలను తల్లిదండ్రుల సెల్ఫోన్ లకు కూడా అనుసంధానం చేస్తారంట. దానితో తల్లిదండ్రులు తమ సెల్ఫోన్ లోనే తమ పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకోవచ్చంట. పిల్లల ప్రవర్తనను ప్రవర్తనలోని లోపాలను ఎక్కడికక్కడ గమనించి సరి చేసుకోవచ్చంట. పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు. ఎవరితో కూర్చున్నారు, చదువుతున్నారా, సరిగా వింటున్నారా లేదా వంటివన్నీ ఇంట్లోనో ఆఫీసులోనో కూర్చుని తల్లిదండ్రులు మానిటర్ చేసుకోవచ్చు. టీచర్లుకూడా పిల్లల ప్రవర్తనను గమనిస్తూ మార్పులు చేర్పులు చేసుకోవచ్చంట. ఇవన్నీ వీటికి గల లాభాలు గా చెబుతున్నారు. గతంలో ఎందరెందరో గొప్ప శాస్త్రవేత్తలు రచయితలు కవులు ఉదయించిన మన ప్రపంచంలో ఎపుడూ ఇంతగా పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టనవసరం రాలేదే. ఇపుడే ఎందుకు ఈ నిఘాల అవసరం వచ్చిందో మనకు అర్థం కాదు. ఈ సౌకర్యాలను ఉపయోగాంచుకుంటున్న తల్లిదండ్రులు దీనిపై గొప్పగానే చెప్పే అవకాశం ఉంది. ఇలా సీసి కెమెరాల నిఘా పెరిగాక తమ పిల్లల చదువులు బాగయ్యాయని చెప్పవచ్చు. అది నిజం కూడా కావొచ్చు. ఐతే దీనిలో పిల్లల ప్రైవసీకి సంబంధించిన దృక్కోణం మరుగున పడకూడదు. అథారిటేరియన్ పేరెంటింగ్ చేసే తల్లిదండ్రులు తమ పిల్లలపై మరింత కఠినమైన క్రమశిక్షణను రుద్దే అవకాశం లేకపోలేదు. ఈ సీసి ఫూటేజ్ బ్లాక్ మెయిల్ చేయడానికీ ఇతరులను కంట్రోల్ చేయడానికీ కుల మత జాతులుగా పిల్లలలో విభజనలు తేవడానికీ కూడా దోహదపడవచ్చు. ముఖ్యంగా పిల్లలకూ తల్లిదండ్రులకూ మధ్య ఉండవలసిన "నమ్మకం" అనేది పలుచనబారిపోతుంది. విద్యార్థి చెప్పిన ప్రతీ దానికీ ఆధారంగా సీసీ ఫూటేజ్ బేరీజు చేయబడుతుంది. అబద్ధం చెప్పడంలోని ఆనందం మిత్రులమధ్యన ఉండే చిన్నపాటి అలకలు ప్రేమలూ మధురస్మృతులు అన్నీ కనుమరుగై కేవలం "చదువు మాత్రమే"అనే ధోరణితో బాల్యం పాఠశాల జీవితం అనేవేవీ లేని ఒక తరం తయారు కావచ్చు. తప్పులనుండి నేర్చుకోవడం పోయి తప్పులే చేయకూడదు తప్పుచేయడమే పాపమనే ధోరణీ పెరగవచ్చు. పిల్లలు తమపై పెద్దవారు టీచర్ల తల్లిదండ్రుల రూపంలో నిరంతరం నిఘా పెడుతున్నారు అని చెప్పడం వలన వారు తమ సహజ గుణాన్ని కోల్పోయి కెమెరాకు అనుగుణమైన ప్రవర్తనను మాత్రమే అలవాటు చేసుకున్న కృత్రిమ జీవులుగా మారిపోవచ్చు. ముఖ్యంగా గుర్తించుకోవలసినది పిల్లలను చిన్నప్పటినుండే నిఘాకు అలవాటు చేయడం. రాబోయే నిఘాభరిత సమాజానికి సమాయత్తం చేయడం. తమ జీవితంలోని ప్రతి దశనూ నిఘాకిందికి తేబోతోన్న నియంతృత్వ రాజ్యాల జీవితాన్ని కండీషనింగ్ చేయడం.  తరగతిగదిని తరగతిగదిలాకాకుండా  బిగ్ బాస్ హౌజ్ గా మార్చేయడం. "Bigboss is watching you".


ఎవరీ బిగ్ బాస్?. మన తెలుగు లో బిగ్ బాస్ అని పేరు పెట్టారుగానీ అమెరికాలో దీని ఒరిజినల్ పేరు "బిగ్ బ్రదర్". 1984 నవలలో జార్జ్ ఓర్వెల్ ఒక డిస్టోపియన్ అంటే పూర్తి నియంతృత్వ దేశ స్వరూప స్వభావాలని మనకు చూపిస్తాడు. "Airstrip1" అనే ఆ దేశాన్ని పాలించే నాయకుడి పేరే "బిగ్ బ్రదర్". నాయకుడి పేరు మాత్రమే కాదు, ఇదొక కల్ట్ లీడర్ కి సింబల్. గోడల మీద ఆ లీడర్ బొమ్మ ఉంటుంది. కింద "Big brother is watching you" అని రాసి ఉంటుంది. పౌరుల జీవితాలను అనుక్షణం  నాయకుడు తన గుప్పిట్లో ఉంచుకోవడమే ఆ సింబల్. Dystopian దేశంలో నియంతృత్వం ఉంటుంది. ప్రజలందరిపై సంపూర్ణమైన నిఘా ఉంటుంది. మెజారిటీ ప్రజలు అణచివేతకి గురౌతుంటారు. నిచ్చెన మెట్ల సమాజంలో ఉన్నత అధమ తరగతుల జనాలమధ్యన పటిష్టమైన ఇనుప కచ్చడాలుంటాయి. సహజ వనరుల ధ్వంసం జరుగుతూ  అధికారం సంపద అంతా కొద్దిమంది చేతుల్లో ఉంటుంది.  ఐతే బిగ్ బ్రదర్ రియాలిటీ షోవాళ్ళు యాదృచ్చికంగా ఈపేరు పెట్టలేదు. ఒర్వెల్ నవల ఆధారంగానే ఈ షోకి బిగ్ బ్రదర్ అని పెట్ఠారు. ఇందులో భాగస్వామైన వ్యక్తి నిరంతరం కెమెరాలతో నిఘా పెట్టబడతాడు. అతడి ప్రవర్తన కంట్రోల్ చేయబడుతుంది. బిగ్ బ్రదర్ హౌజ్ ఒక డిస్టోపియన్ సొసైటీ. 1984 వలెనే ఇక్కడ ఎవరికీ కనిపించకుండా అందర్నీ తన కనుసన్నల్లో నిఘాపెట్టుకునే బిగస బ్రదర్ నియంతృత్వం ఉంటుంది. అతడే ఈ షోకి బాస్. అతడు చెప్పినట్లు వినాల్సిందే.  మీడియా కల్చర్ వోయిరిజం సెన్సేషనలిజం వంటివాటిని కూడబలుక్కునే "viewership totalitarianism" అది. ఆడే సభ్యులమధ్య పవర్ డైనమిక్స్ ఉంటాయి. Trp ల కోసం స్టేజ్డ్ డ్రామాని పండించడం సత్యాన్ని మానిపులేట్ చేయడం ఉంటుంది. వందల కెమెరాల తో పూ‌ర్తినిఘా పెట్టబడిన వాతావరణంలో వ్యక్తి తన స్వేచ్ఛను కోల్పోయేలా చేసే ఘట్టమది. ఈ డిస్టోపియన్ సమాజంలో అర్థం పర్థంలేని టాస్కులు ఈయబడతాయి. వాటిలో గెలవడం ఓడడమనే అంశం నిజ జీవితానికి ఏమీ సంబంధం లేనిది. ఏది నటననో ఏది నిజమో ఏది సత్యమో ఏది కాదో అనేదానితో నిమిత్తం లేకుండా entertainment కోసం అల్లబడిన గేమ్. దానికోసమై డిస్టోపియన్ సమాజ స్వరూపాన్ని చూపించిన ఓర్వెల్ గొప్పటి నవల మూలంకావడం అన్నది కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ యుగంలో కాదేదీ పిచ్చితనానికి అనర్హం అనేలా ఉంటుంది. ఐతే ఈ రియాలిటీ షో  కొంత కాలం మాత్రమే. నెల రోజులో నలభై రోజులో...అంతే. 


కానీ ఒక వ్యక్తి జీవితంలో ఐదేళ్ళు కొందరు వ్యక్తులతో మాత్రమే జీవించాల్సి వస్తే?. అది కూడా ఒక నౌక మీద?. మేధావిత్వమంతా పెద్దటి నుదురుతో తీక్షణమైన చూపులతో చురుగ్గా కనిపించే ఒక ఇరవై రెండేళ్ళ కుర్రవాడు, అపుడపుడే మొగ్గతొడుగుతున్న ప్రియురాలి (ఎమ్మా) ప్రేమను ఆ కలలను మనసులో మౌనంగా పదిలపరుచుకుంటూ, జ్ఞానాన్వేషణ కోసం సముద్రంలో బయలు దేరిన ఒక నౌకలో ఎక్కి కూర్చున్నాడంటే అతడు ఎలాంటి వాడై ఉండాలి?. ఇంగ్లాండ్ నుండి బయలుదేరి అట్లాంటిక్ సముద్రం దాటి సౌత్ అమెరికా ఖండ పశ్చిమ తీర దేశాల నుండి కొనసాగుతూ పసిఫిక్ సముద్రంలోని ద్వీపాలను చుట్టుముట్టి మళ్ళీ సౌత్ అమెరికా మీదుగా 64,000 కిమీ పూర్తి చేసి తిరిగి ఇంగ్లాండ్ చేరుకున్న ఒక నౌక. దాని పేరే "HMS Beagle". ఆ నవయువకుడే "చార్లెస్ డార్విన్". ఈ కాలపు మేధావులనబడేవారితో పోలిస్తే గతకాలపు మేధావులు చాలా నిజాయితీగా ధృడమైన సంకల్పంతో తీక్షణమైన మేధ కలిగి ఉన్నారా అనిపిస్తుంది. బిగ్ బ్రదర్ హౌజ్ లో పిచ్చి టాస్క్ లు చేసేవారికి వీరాభిమానులైపోయే మేధస్సు ఈ గతకాలపు మహనీయులు తీసుకున్న టాస్క్ లను ఎప్పటికి అర్థం చేసుకోగలుగుతుంది?. అసలు ఈ కాలపు 22 యేళ్ళ కుర్రవాడినుండి ఇది కనీసం ఆశించగలమా?. ఇంటిని బంధుమిత్రులనూ దేశాన్నీ వదిలి ఎక్కడో సుదూర ప్రాంతాలకు ఐదేళ్ళపాటు కేవలం జ్ఞానంకోసం నౌకాయానం చేసేందుకు సిద్ధపడే ఒక నవయువకుడి సాహసాన్ని మనం కొలవగలమా?. బ్రిటిష్ తన సముద్ర తీరాల్ని పెంచుకునే ఉద్దేశ్యంతో సౌత్ ఆఫ్రికా తీరాన్ని అక్కడి సముద్రపు స్థితిగతులను చదివేందుకు "HMS beagle" అనే నౌకను సిద్ధం చేసింది. కొంతమంది సివిల్ పాసెంజర్లతో నౌకా సిబ్బందితో సైంటిఫిక్ వ్యక్తులతో దాదాపు 65 మందితో సాగిన విచిత్రమైన, ప్రపంచగతిని సమూలంగా మార్చిన ప్రయాణమిది. 


ఐతే వెళుతున్న తీరప్రాంతాలలోని మొక్కలను జంతుజాలాల్ని పరిశీలించేందుకు ఒక నేచురలిస్ట్ కావాలని అనుకున్నారు. ఐతే వాళ్ళకి ఒక నేచురలిస్ట్ దొరికాడు. అతడు డార్విన్ కాదు. అతడి పేరు Robert McCormick. Official naturalist ఇతనే.

మరి డార్విన్ నౌకలోకి ఎలా వచ్చాడు. అది తెలుసుకోవాలంటే మనం మరో హీరో గురించి తెలుసుకోవాలి. అతడే నౌక కాప్టెన్ 26 యేళ్ళ "Robert Fitzroy". నౌకాయానం కాల్కులస్ హైడ్రోస్టాటిక్స్, ఆస్ట్రోనమీలో పట్టభద్రుడైన ఫిట్జ్ తన  పధ్నాలుగు యేళ్ళ వయసులోనే సౌత్ ఆఫ్రికా తీరం మీద  రెండేళ్ళపాటు నౌకమీద సాహసయాత్ర చేసిన ముక్కోపిగా ఫిట్జ్ మనకు తెలియాలి. ఈ ఐదేళ్ళ నౌకా ప్రయాణానికి అతడే సరైన లీడరని అతడిని నియమించారు. డార్విన్ మేనమామ రికమండేషన్ మీద డార్విన్ ఆ నౌకలోకి ఎంటర్ అయ్యాడు. ఐతే అందరూ అనుకున్నట్టు నేచురలిస్ట్ గా కాదు. పిట్జోయ్ కి మాటలు మాట్లాడిపెట్టే conversationalist గా. ఐదేళ్లు నౌకాయానం చేయాలంటే తనతో మాట్లాడేందుకు తనలా ఉన్నతతరగతికి చెందిని కేంబ్రిండ్జ్ యూనివర్సిటీ లో ఉన్నతమైన విద్యగరిపిన ఒక సహాయకుడు కావాలనుకున్నాడు ఫిట్జాయ్. అలా కావాలంటే ఊరుకోరు కనుక నేచురలిస్ట్ కావాలని తెలిసినవారి మధ్య అడ్వర్టైజ్మెంట్ లాంటిది ఇప్పించి డార్విన్ ని రప్పించుకున్నాడు. నౌకాయానం ఐదేళ్ళు చేయడమనేది పెద్ద టాస్క్. అంతకు ముందు బీగిల్ నౌక కెప్టెన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అంతేకాక ఫిట్జాయ్ మేనమామ గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకున్న చరిత్ర ఉండటంతో అంతటి మహత్తర నౌకాయానంలో తనకు సుసైడల్ ఆలోచనలు రాకుండా తనతో మాట్లాడేందుకు ఒక వ్యక్తి కావాలి. 26 యేళ్ళ యువకుడు 22 యేళ్ళ మరో చురుకైన యువకుడిని తనతో పాటు ఉండాలని కోరుకున్నాడు. ఫిట్జోయ్ ఏమీ మామూలు వ్యక్తి కాదు. అతడు అప్పటికే తన దగ్గర వివిధ జంతువుల మొక్కల సాంపుల్స్ కలెక్షన్ చేసి పెట్టుకున్నాడు. అతడు ఫించ్ పక్షుల మీద చేసుకున్న కలెక్షన్ డార్విన్ కలెక్షన్ కంటే గొప్పది. గలపోగాస్ ద్వీపంలో ఫిజ్జాయ్ కలెక్షనే డార్విన్ కి చాలా ఉపయోగపడింది. ఫిట్జాయ్ ఆహారం తీసుకునేటపుడు మాత్రమే డార్విన్ తో మాట్లాడేవాడు. వాళ్ళిద్దరూ వేరు వేరు భావజాలాలు కలిగిన మేధావులు. ఫిట్జోయ్ కి ముక్కుమీద కోపం. ఆయనకు "హాట్ కాఫీ"  అని పేరు. పైగా ఓడ కెప్టెన్. అథారిటెరియన్ ఫిగర్. అతడికింద సహాయకుడు మాత్రమే డార్విన్. అతడు క్రిస్టియన్ మతానుయాయుడు. డార్విన్ లో పరిశోధన లోతులు పెరిగేకొద్దీ "ఈ ప్రపంచం అనేది దైవ సృష్టి" అనే భావన అతనిలో పలుచనబడటం మొదలైంది. కానీ దానికి భిన్నమైన భావాలు గల కెప్టెన్ తో ఐదేళ్ళు సహవాసం. ఇది కదా టాస్క్ అంటే. ఫిట్జాయ్ ఒకసారి డార్విన్ మీద అరిచేసి హంగామా చేశాడు. తర్వాత డార్విన్ ని క్షమాపణలు వేడుకున్నాడనుకోండి. ఐతే  ఫిట్జాయ్ చెప్పే మాటలు వింటూ వింటూ తాను క్రైస్తవ సన్యాసినైపోతానేమోనని తన సోదరికి సరదాగా లేఖ రాసుకుంటాడు డార్విన్. ఐతే ఐదేళ్ళలో కనీసం ఒక్కసారి కూడా డార్విన్ తన ప్రశాంతతను కోల్పోలేదంటారు. ఇది మానవ చరిత్రలో చాలా అరుదైన విషయం. చాలా అరుదైన వ్యక్తి డార్విన్.  ఏ బిగ్ బాసు లేదా బిగ్ బ్రదర్ నిఘా అతని మీద లేదు. అతడి నిఘా అంతా అతడి పలిశోధన మీదే. ఎంత స్వీయ శక్తినో, స్వీయ సత్యసంధతనో చూడండి. ఇపుడు విద్యార్థులకు సీసీ కెమెరాలు కావాలంటున్నామంటే మన విద్యా వ్యవస్థలో లోపం ఎక్కడుందని ఆలోచిస్తున్నామా?. తరగతిగదుల్లో పిల్లలు రేపులకు గురౌతున్నారంటే మనం ఎటువంటి సమాజాన్ని నిర్మించుకుంటున్నామో తలపోస్తున్నామో. సంఘటనలు జరగగానే కంటితుడుపు knee jerk reactions తప్ప సమస్య మూలాలపై చర్చించి పరిష్కారాల దిశగా కదులుతున్నామా? ఐతే జీవిత చరమాంకంలో ఫిట్జాయ్ ఒకసారి బైబిల్ తలమీద పెట్టుకుని బైబిలే గొప్పదని దేవునిదే సృష్టి అని అరుస్తూ డార్విన్ ని తూలనాడతాడు. ఐతే చివరకి తన మేనమామలాగే గొంతుకోసుకుని చనిపోయాడు ఫిట్జాయ్. దానికి భిన్నంగా ఏ మతమూ అందించని  తన స్వీయ నిబద్ధతతో డార్విన్ చరిత్ర గతినే మార్చేశాడు. 


ఈ ప్రయాణంలో డార్విన్ స్వయంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  అరవై ఐదు వేలకు పైగా స్పెసిమన్లు తయారు చేసుకున్నాడు. సముద్ర తీరం వెంట తాను తిరిగిన వివిధ ప్రాంతాల మొక్కల, జంతులుల, శిలల, శిలాజాల స్పెసిమన్లు తయారు చేసుకున్నాడు. ఐదేళ్ళ విజ్ఞన సాహసయాత్ర అది. ఇదే అతడి సైంటిఫిక్ టెంపర్. ఇదే అతడి సునిశితమైన చురుకైన పరిశీలన. ఏమైపోయింది ఈనాడు మనకి?అంత ఓపిక !అంత పట్టుదల !అంతటి సాహసం! కొత్తవైపు, అసీమిత తారాగగనాల వైపు దూసుకుపోవాల్సిన నవయువత ఎటుపోయింది?  ఈశక్తులన్నీ ఎక్కడికి దిగజారిపోయాయి?. పట్టుమని ఐదు నిమిషాలు వేయి అక్షరాలు చదవలేని స్థితిలో ఉన్న యువత ఫాల్స్ హీరోలవైపు ఫాల్స్ గోల్స్ వైపు సాగిపోతోందెందుకు?.  కులాల రొచ్చులో మతాల పీకులాటల్లో లేకి  సినిమాల మోజులో , కాలాహరణం చేసే ఎంటర్టైన్మెంట్ భ్రమల్లో  పిచ్చివాళ్ళుగా ఫండమెంటలిస్టులుగా హీరో వర్షిప్ లతో ఎటు కునారిల్లు పోయారు మన యువత?  మనది కూడా డిస్టోపియన్ సమాజం కాదా?. లేదా దీనికి మరోపేరేదైనా పెట్టాలా?. ఏ సీసీకెమెరా నిఘా మనకు మరో డార్విన్ ని అందించగలదు?. ఏ పనికిమాలిన ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షో టాస్క్ లు మనకు ప్రపంచంలో  నిజమైన టాస్కులేంటో చూపగలవు?.  ఎవరు వీరికి బిగ్ బ్రదర్?. Who is the Big brother that is watching and controlling us?


విరించి విరివింటి 


5/3/24

Sunday, 3 March 2024

Parasites, man and God. Essay

 Parasites, man and God.


దశావతారం సినిమాలో " దేవుడు లేడని ఎవరన్నారు? ఉంటే బాగుండేది" అంటాడు కమలహాసన్ ఒకచోట. నిజంగా దేవుడే ఉంటే ఇన్ని ఘోరాలను కలిగించేవాడే కాదు కదా అన్నది అతడి

ఉద్దేశ్యం. దాదాపు ఇదే అభిప్రాయాన్ని డార్విన్ కూడా వెలిబుచ్చుతాడు. Ichneumonidae అనే ఒక కందిరీగ జీవితాన్ని పరిశీలిస్తూ కరుణామయుడని చెప్పబడుతున్న దేవుడు కనుక ఉంటే ఈ కందిరీగను సృష్టించి ఉండేవాడు కాదు అంటాడు. స్టీఫెన్ గౌల్డ్ అనే మరో డార్వీనియన్ " నిజంగా దేవుడనే వాడు మంచివాడే ఐతే అతడి సృష్టి కేవలం మంచిని మాత్రమే ప్రతిబింబిస్తుంటే, మనమెందుకు బాధలతో కష్టాలతో విపరీతమైన అర్థంపర్థంలేని క్రూరత్వంతో నిండిపోయామంటాడు. ఈ కందిరీగ జీవితాన్ని పరిశీలిస్తే evil / చెడు/ క్రూరత్వం అనేది మనిషికి మాత్రమే చెందినదనీ ప్రకృతి దానిని లెక్కచేయదనీ అంటాడు. నిజమే కదా ప్రకృతిలోని ఏ జంతువూ తమకు చెడు జరిగిందని, జరిగుతుందని అందుకు ప్రతిగా మతాలను పుస్తకాలనూ దేవుళ్ళనూ సృష్టించుకున్న దాఖలాలు లేవు. చెడును అవి లెక్క చేయవు. సైతాన్, దయ్యం వంటివేవీ వాటిని తాకలేవు. శ్మశానాల్లో మనిషి తిరగలేడేమో గానీ మిగిలిన ఏ జంతువుకూ దయ్యం కాన్సెప్ట్ లేదు. భాషా శాస్త్రం ప్రకారం దేవుడు ప్రకృతి ఐతే దయ్యం వికృతి. కానీ మన చుట్టూ పరుచుకుని ఉన్న ప్రకృతికి దేవుడూ దయ్యం రెండూ లేవు.


Ichneumonidae అనే కందిరీగ గొంగళిపురుగులను బతికున్న శవాలుగా మార్చుకున్నా, గొంగళిపురుగు దానిని పట్టించుకోకుండా దేవునికి మొరపెట్టుకోకుండా బతికేస్తుంది. అది ఎంత క్రూరంగా గొంగళిపురుగుని తన జాంబీగా మార్చుకుంటుందో చూశాక డార్విన్ ఏమంటాడంటే ఇంత క్రూరత్వంతో ఐతే భగవంతుడు సృష్టి చేయలేడని. అంటే ఏమర్థమౌతుంది? ప్రకృతిలో క్రూరత్వం /evil కూడా ఒక భాగం.  ఐతే జార్జ్ కార్లిన్ కూడా ఒకవేళ భగవంతుడు అనేవాడు ఉండింటే వాడు పురుషుడే ఐవుంటాడు. ఇంత ఘోరమైన సృష్టిని ఏ స్త్రీ కూడా చేయలేదంటాడు. ఒకవేళ జార్జ్ కార్లిన్ ఈ కందిరీగ గురించి తెలంసుకుని ఉండింటే క్రూరత్వం ఒక మగకు మాత్రమే కాదనే విషయం తెలుసుకునేవాడు. ఐతే మానవునికి సంబంధించినంత వరకూ క్రూరత్వమంతా పురుషుడిదే. పైగా దేవుడు తన రూపంలోనే మనిషిని సృష్టించాడని నమ్ముతాడు మనిషి. మనుషులు రాసుకున్న మత సాహిత్యం లో దేవుడు అంటే కేవలం పురుషుడే. స్త్రీలు కూడా పూర్తిగా లొంగిపోయారు ఈ భావనకు. మళ్ళీ మన టాపిక్ కి వస్తే, ఈకందిరీగ పరిణామ క్రమంలో తన తోకను stinger గా మలుచుకుంది. దీని ద్వారా అది గుడ్లను పెడుతుంది. అంటే ఇది ఆడకందిరీగ. ప్రకృతి క్రూరత్వానికి ఆడమగ తేడా లేదన్నది అందుకే. ఈ ఆడ కందిరీగ ఒక గొంగళిపురుగును వెతుక్కుని దాని మీదకు ఎక్కి తన stinger నుండి ఒక ఎంజైమ్ ను విడుదల చేస్తుంది. ఇదొక విషం. గొంగళిపురుగు వెంటనే స్తంభించి పక్షవాతం వచ్చినట్లు చచ్చుబడిపోతుంది. ఈ ఎంజైమ్ గొంగళిపురుగు మెటబాలిజంను చివరికి ప్రవర్తనను కూడా మార్చివేసే శక్తిని కలిగి ఉంటుంది.  ఈ ఎంజైమ్ తో గొంగళిపురుగు చర్మాన్ని కరిగించి చర్మంలోనుండి లోపలికి తోకను పెట్టి అక్కడ గుడ్లను పెడుతుంది. అంటే ఇక గొంగళిపురుగు శరీరం కందిరీగ గుడ్లను పొదిగి ఇచ్చే మీడియంగా మారుతుంది. కోకిల తన గుడ్లను కాకి గూటిలో పొదుగుకోవడం దీని ముందు చాలా చిన్న విషయం. 


ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ ఆడకందిరీగ తన శరీరంలోపల polydna అనే వైరస్ కి ఆశ్రయం ఇస్తుంది. ఈ వైరస్ జన్యు మెటీరియల్ ని పరిణామ క్రమంలో   తనకు అనుగుణంగా  మార్చుకుంది. తనకు అనుగుణంగా అంటే తను గుడ్లుపెట్టబోయే గొంగళిపురుగు తన గుడ్లకు సహకరించేందుకు అనుగుణంగా. అందుకే కందిరీగ తన గుడ్లతో పాటు ఈ వైరస్ లనూ stinger తో గొంగళిపురుగు లోపలికి పంపుతుంది. ఈ virus గొంగళిపురుగు ఇమ్యూన్ సిస్టంని అటాక్ చేసి దానిని బలహీన పరుస్తుంది. ఏదైనా ఒక ఫారిన్ బాడి శరీరంలోకి రాగానే దానిని మట్టుబెట్టేందుకు ఇమ్యూన్ సిస్టం సమాయత్తమౌతుందని మనకు తెలిసన అంశమే. ఇపుడు కందిరీగ గుడ్లు కూడా ఫారిన్ బాడిలు కాబట్టి గొంగళిపురుగు ఇమ్యూన్ సిస్టం వెంటనే యాక్టివ్ అయి ఆ గుడ్లను చంపేయలి. కానీ ఆ సిస్టంని అలా గుడ్లపై అటాక్ చేయనీయకుండా ఈ వైరస్ కాపాడుతుంది. ఈ వైరస్ గొంగళిపురుగు ఇమ్యూన్ సిస్టంని అతలాకుతలం చేసి పొదుగుతున్న కందిరీగ గుడ్లకు హాని కలిగించలేనంత బలహీనంగా ఆ సిస్టంను మర్చేస్తాయి. దానితో కందిరీగ గుడ్లు గొంగళిపురుగు లో హాయిగా ఎదిగి లార్వాలుగా మారతాయి. గొంగళిపురుగు శరీరధర్మాన్నంతా ఈ ఎదుగుతున్న లార్వా వైరస్లు తమ గుప్పిట్లో పెట్టుకుంటాయి. ఈ విధంగా ఒక గొంగళిపురుగు మీద వంద దాకా గుడ్లను పొదుగుకుంటాయి. గొంగళిపురుగు తన జీవితాన్నలా లార్వాలను మోస్తూనే కదిలిపోతూ ఉంటుంది.  లార్వాలు మెల్లిగా గొంగళిపురుగు లోపలి భాగాలన్నింటిని తినేస్తుంటాయి. తర్వాత దశలోనుండి చిన్నపురుగులు బయటకి వచ్చేసరికి రోజూ కొద్ది కొద్దిగా చస్తూ జీవచ్ఛవంలా బతికిన గొంగళిపురుగు పూర్తిగా చనిపోతుంది. 


ఈ  కందిరీగ కథ ద్వారా మనకు ప్రకృతిలో evil ఉంది అని తెలుస్తుంది. అదెంత ఉన్నా ప్రకృతి దానిని పట్టించుకోకుండా గొంగళిపురుగులా సాగిపోతూనే  ఉంటుందనీ తెలుస్తుంది. అందుకే దేవుడు సైతాన్ బాధ ప్రకృతికి లేదు. అది కేవలం మనుషులకే. ఐతే ఈ కందిరీగకి ఇంత  evilness తనలో ఉందని తెలియదు. ఐతే డార్విన్ దానిలోని ఈవిల్ నెస్ ని చూసి దేవుడే కనుక ఉంటే ఇంతటి దారుణంగా సృష్టి చేయడని అన్నాడు.    కానీ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. ఈ కందిరీగ లోని క్రూరత్వాన్ని కూడా మనిషి తనకు అనుగుణంగా మలచుకోగలడు. అదే ఆధునిక విజ్ఞానం. ఎంతో క్రూరంగా ఉన్న ఈ కందిరీగలు దాదాపు పన్నెండు కోట్లమంది మనుషుల ప్రాణాలను కాపాడాయంటే నమ్మశక్యం కాదుగానీ అదే నిజం. 


1970లో బ్రెజిల్ లో కర్రపెండలం పంటలకు తెల్లనల్లుల చీడపీడ మొదలైంది. బ్రెజిల్ లోని ప్రధాన పంటలలో కర్రపెండలం కూడా ఒకటి. అనావృష్టి ని కూడా తట్టుకుని పెరిగే మొక్కలివి. కానీ ఈ తెల్లనల్లుల దాడితో 20కోట్లమందికి జీవనాధారమైన కర్రపెండలం సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితి ని గమనించిన  రుడాల్ఫ్ హెరెన్ అనే స్విట్జర్లాండ్ కీటక శాస్త్ర నిపుణుడు కందిరీగలు తెల్లనల్లులపై కూడా పరాన్నజీవిగా బతకగలదని కందిరీగ గుడ్లను కందిరీగలను విమానాల సహాయంతో ఈ పొలాలమీద చల్లించాడు. అక్కడినుండి వచ్చిన కందిరీగలు పైన చెప్పినట్లు తెల్లనల్లుల మీద ఆవాసం ఏర్పరచుకుని అనతికాలంలోనే తెల్లనల్లులను సర్వ నాశనం చేయగలిగాయి. దీనివలన ఆ ప్రాంతంలో దాదాపు ఇరవై లక్షలమందిని ఆకలి చావునుండి తప్పించినట్టైంది. అంటే ఇవి బయో ఎరువులుగా పని చేశాయి. వీటిని ఇపుడు చైనాలోనూ అమెరికా లోను వ్యవసాయ రంగంలో వాడటం మొదలైంది. పురాతన పుస్తకాలను ఫర్నీచర్ నీ ధ్వంసం చేసే చెదలను చిమ్మెటాలనూ కూడా నాశనం చేసేందుకు కూడా వీటిని  వాడటం మొదలెట్టారు. దేవుడే సృష్టికర్త ఐవుండింటే పరాన్న జీవుల్లోని క్రూరత్వాన్ని కూడా మనిషివలె తనకు అనుకూలంగా మార్చుకోగలిగేవాడా. కాబట్టి దేవుడు అమాయకుడు. మనిషే దేవుడిని తన స్వార్థంకోసం మనిషి రూపంలో సృష్టించుకున్నాడు.


విరించి విరివింటి

Anti knowledge Essay

 Anti - Knowledge..(part 1)  ఇప్పటినుండి నా వాల్ మీద రాయబడే అంశాలపై విజ్ఞులు మంచి అర్థవంతమైన చర్చ చేసుకుంటే బాగుంటుందని సూచన. అంటే సమాజంగా మనం అందరం కలిసి ఆలోచించవలసిన కొన్ని విషయాలు ఇవి.  ఇంటర్నెట్ సోషల్ మీడియా యుగంలో మన ముందున్న ప్రధానమైన ఛాలెంజ్ "జ్ఞాన వ్యతిరేకత" (Anti Knowledge). ఏది నిరూపణ కాబడ్డ జ్ఞానమో దానిని వ్యతిరేకించేందుకు సమాయత్తమైతున్న ఒక స్థితి. ఈ స్థితి చరిత్రకు కొత్త కానేకాదు. ప్రతీ యుగంలో ప్రతీకాలంలో శాస్త్రీయ దృక్పథం ఒకరకంగా ఉంటే anti knowledge మరో రకంగా ఉండటం. ఇటువంటి వ్యక్తులు చరిత్రకు కొత్తకాదు. ఈ మన బ్రెయిన్ స్ట్రాం ఆ వ్యక్తులకు వ్యతిరేకంగా కూడా కాదు. కేవలం ఈ వ్యవహారం ఎలా సాగుతూ ఉంటుందో అని మనకు మనం చర్చించుకోవడానికి మాత్రమే.   "భూమి గుండ్రంగా ఉంది" అనేది నిరూపించబడిన జ్ఞానమైతే "లేదు మా మత పుస్తకంలో భూమి బల్లపరుపుగానే ఉంది కాబట్టి భూమి బల్లపరుపుగా ఉంది " అనడం anti -knowledge. మొదట మానవుడు భూమి బల్లపరుపుగానే ఉంది అనుకుని ఉండవచ్చు. కానీ రాను రాను అవగాహన పెరిగేకొద్దీ ఇది గుండ్రంగా ఉంటుందని అర్థమై ఉంటుంది. సైంటిఫిక్ అవగాహన నిరూపణ భూమి గుండ్రంగా ఉంటుందని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఐనా మేం నమ్మం భూమి బల్లపరుపుగానే ఉంది అనేలాంటి ఓ బ్యాచ్ చరిత్రలో ఎప్పటినుండో ఉంది. ఉంటుంది.   ఐతే ఇపుడు ఈ anti knowledge గురించి మరింత ఎక్కువగా చర్చించవలసిన అవసరం వచ్చింది. అందుకు కారణం సమాచార విప్లవం. Anti knowledge నిరూపితమైన సకల సైంటిఫిక్ అంశాలను తప్పని చెప్పే ఒక ప్రయత్నం చేయడంవలన దానిని ఎదుర్కోవడం ఒక పెద్ద ఛాలెంజ్ గా మారిందన్నది వాస్తవం. ముఖ్యంగా మీడియా, సోషల్ మీడియా వచ్చిన తర్వాత Fact కంటే Fiction కి విలువ పెరిగింది. గత కొన్నిరోజులుగా నేను సోషల్ మీడియాలో గమనిస్తున్న అంశం ఏంటంటే మేధావి వర్గమని అనుకునే వారు కూడా fact నీ fiction నీ వేరు చేసి చూడలేనటువంటి ఒక అత్యైక ప్రమాదకర పరిస్థితి. ఇది సమాజానికి చాలా చెడును కలిగిస్తుంది. అందుకే ఒక చర్చగా మనం దీనిని ఎత్తుకుని ముందుకు సాగాలన్నది నాకున్న అభిప్రాయం.  Anti knowledge జ్ఞానానికి పూర్తిగా విభిన్నమైనది. మనిషికి జ్ఞానం ఒక్క పూటలోనో ఒక్క సంవత్సరంలోనో లేక ఒక్క పుస్తకం చదివేస్తేనో రాదు. సైంటిఫిక్ నిరూపణలు అలా ఒక మ్యాజిక్ లాగా జరిగిపోవు. సైంటిఫిక్ నిరూపణ కొన్ని ఏళ్ళ పరిశ్రమ. నిప్పు కనుక్కోవడం లేదా రాతి ఆయుధాలు చేసుకోగలగడం ఒక్కరోజులో ఠపీమని జరగలేదు. కొన్ని యుగాల చరిత్ర కొన్ని వేల ఏళ్ళ ఆలోచనలు ఒక్కోదాన్ని మనకు అందిస్తూ పోయాయి. అంటే ఏ జ్ఞానమైనా మనిషికి లేదా సమాజానికి ఠపీమని వచ్చేయదు. వచ్చిన జ్ఞానం ఎస్టాబ్లిష్ కావడానికి, ఆబ్జెక్టివ్ గా నిరూపణ కావడానికి ఇంకెంతో వ్యయప్రయాసలకు గురైతే తప్ప సాధ్యం కాదు.  కానీ గమనించి చూస్తే anti - knowledge దీనికి పూర్తిగా భిన్నంగా జరుగుతూ ఉంటుంది. ఎవరో ఒక ఆగంతకుడు అకస్మాత్తుగా బయల్దేరి పైన చెప్పిన సైన్సంతా తప్పు. వాళ్ళంతా అబద్దాలు చెప్పేశారు. నేను మాత్రం నిజాలు చెప్పేస్తున్నాను. నేను మాత్రమే చెబుతున్నాను. అని ఎలాంటి వాదప్రతివాదాలు అవసరం లేకుండా సశాస్త్రీయ నిరూపణలు లేకుండా చెప్పడం చూస్తుంటాం. "సైంటిఫిక్ మెథడ్ " అంటే ఏంటో తెలియని కొందరు తమవద్ద నిరూపణలు ఉన్నాయని వ్యక్తిగత అభిప్రాయాలను తిరుగులేని నిరూపణలుగా చెబుతుంటారు. వీటిని ఫిక్షన్ గా మలచగలరు. అద్భుతమైన రసోప్రేతకమైన కథలా రక్తికట్టించగలరు. కానీ అదేదీ fact ఆధారిత నిరూపణ కిందకు రాదు. చెప్పొచ్చేదఘమంటే ఇటువంటి వారు చరిత్రలో కోకొల్లలుగా ఉన్నారు.   ఎందకింతమంది ఉన్నారు అంటే సమాధానం సింపుల్. 1. కథ లేదా ఫిక్షన్ మనుషులను అబ్బురపరచినట్టు  "నిజం" "జ్ఞానం" అబ్బురపరచదు. కాబట్టి జనసామాన్యంలో మేధావులలో కథలు చెప్పేవారికి ఉన్నంత అప్పీలింగ్ జ్ఞానం చెప్పేవాడికి ఉండదు. 2. సాధారణ మనుషులు దాదాపుగా ఎవరూ సైంటిఫిక్ మెథడ్ ని ఒక పద్ధతి ప్రకారం నేర్చుకున్నవారు కారు. కాబట్టి జ్ఞానం , నిజం అందరి దారీ కాదు. కొందరి దారి మాత్రమే.   ఇన్ని మాటల బదులు ఉదాహరణలతో సాగుదాం. ఈ మధ్య కొందరు వచ్చారు. థైరాయిడ్ మందులు వాడకూడదనీ చాలా అపాయమనీ,అయోడైజ్డ్ ఉప్పు వాడకూడదనీ ఇది మరీ డేంజర్ అనీ..అయోడైజ్డ్ ఉప్పు వాడటం అంటే కార్పోరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చడం అనీ( ఇదో డిఫెండర్ వాదన. దీనిని ముందు ముందు చూద్దాం).  ఒక అద్భుతమైన  రసోద్రేక కథను చెప్పడం మొదలెట్టారు. వాటిని వివరించమనీ నా వాల్ మీద కూడా కొందరు మిత్రులు అడిగారు. ఐతే ఇది కూడా Anti knowledge కి సంబంధించిన విషయం. దీనిని కూడా కథలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ కథ భూమి పుట్టినప్పటి నుండి మొదలౌతుంది.ఏ విధంగా ఈ అయోడిన్ అనే విషయం ఎంతటి సైన్సును పరివిధాలుగా తనలో కలుపుకుని ఎస్టాబ్లిష్ అయిందో చూడండి. ఈ విధమైన అవగాహన మనిషికి రావడానికి ఎన్ని సంవత్సరాల కృషి ఉందో గమనించండి.    భూమి ఏర్పడిన క్రమంలో కొన్ని భూభాగాల్లో అయోడిన్ తక్కువగగానూ కొన్ని భాగాల్లో ఎక్కువగాను ఉంది. మన ప్రపంచంలో భూమి పరిణామ క్రమంలో శిలలు ఏర్పడతాయి. Rocks. ఇవి సెడిమెంట్ rocks ,metamorphic rocks అని రెండురకాలు. మన భారతదేశంలో metamorphic rocks ఉన్నాయి. అంటే ఇవి తీవ్రమైన వేడికి ఒత్తిడికి లోను కావడం వలన ఏర్పడిన శిలలు. ఇటువంటి శిలలలో అయోడిన తక్కువగా ఉంటుంది. మరి అంత వేడి వత్తిడి ఎక్కడివి అని అడగవచ్చు. Continental drift దగ్గరికి వెళ్ళాలి. గోండ్వానా అని చిన్న చిన్న ముక్కలుగా ఉన్న ఒక ఖండం ఒకదానికి ఒకటి కలవడంతో పాంజియా అనే పెద్ద ఖండం ఏర్పడింది. ఆ పాంజియా హిందూ మహాసముద్రం లో ఈదుతూ వచ్చి యూరేషియా ప్లేట్ కి ఢీకొనడంతో భారతదేశం ఏర్పడింది. అందుకే మన దేశ శిలలు వేడినుండి ఒత్తిడినుండి పుట్టాయి. అందుకే మన శిలలలో అయోడిన్ తక్కువ. అలాగే మన మట్టిలో కూడా.  ఐతే, ప్రపంచంలో ఇలా శిలలలో మట్టిలో అయోడిన్ తక్కువగా ఉండే దేశాలను గుర్తించారు. ఇండియా, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, నైజీరియా, ఇండోనేషియా, చైనా , నేపాల్, ఇథియోపియా, మొజాంబిక్, సూడాన్ దేశాలలో మట్టిలో అయోడిన్ తక్కువ. ఈ ప్రదేశాలలో ఎందుకు తక్కువో చెప్పాలంటే పైన చెప్పిన జియోగ్రాఫికల్ కారణాలే కాకుండా వాతావరణ కారణాలూ ఉండవచ్చు. అతి వర్షపాతం నేలలో ఉండే అయోడిన్ని ఊడ్చిపాడేస్తుంది. అలాగే అనావృష్టి వలన నేలలో ఉప్పు శాతం పెరిగి మొక్కలు అయోడన్ ని శోశించలేవు. మన ఉత్తర భారతదేశంలోనూ ఉత్తర తూర్పు రాష్ట్రాలలోనూ క్షార నేలలు ఉన్నాయి. ఎపుడైతే నేలలో అధిక క్షార లక్షణాలు ఉంటాయో ఎక్కువ లవణాలు ఏర్పడి మళ్ళీ అయోడిన్ భరిత లవణాలు మొక్కలు గ్రహించలేనంతగా పెరుగుతాయి. అలాగే నగరీకరణలో భాగంగా అడవులను కూల్చడం వలన నేల కోసుకునిపోవడం వలన నేలలో అయోడాన్ తగ్గడం జరుగుతుంది. ఇదంతా చూడండి. దీని వెనుక ఎంత జ్ఞాన ఆధారం ఉందో. ఎంతో పరిశోధనలు ఎన్నో శాఖలనుండి చేయగా తేలినది ఏమి?. ప్రపంచంలోని కొన్ని దేశాల నేలలలో అయోడిన్ తక్కువగా ఉందని. అయోడిన్ మనిషికి ఎలా ఉపయోగం. అయోడిన్ థైరాయిడ్ గ్రంధి పనితీరును సక్రమంగా చేసే ఒక మినరల్. థైరాయిడ్ గ్రంధి మనిషి మెదడును నరాలనూ ఎదుగుదల నూ నియంత్రించే ఒక ముఖ్యమైన గ్రంధి.   అయోడిన్ నేలలో లేకపోతే ఏమౌతుంది..మనం తినే మొక్కలలో అయోడిన్ ఉండదు. తద్వారా మనిషిలో కూడా తగ్గుతుంది.. ప్రెగ్నెన్సీ లో సరైన అయోడిన్ లేకపోతే పుట్టే బిడ్డలో మెదడు ఎదుగుదల ఆగిపోతుంది. నరాల ఎదుగుదల ఆగిపోతుంది. ఫలితంగా సరైన బిడ్డలు పుట్టకపోవడం లేదా అంగవైకల్యం తో పుట్టడం లేదా అబార్షన్ జరగడం. పుట్టిన పిల్లలు చెవిటివారిగా మూగవారిగా  శారీరక ఎదుగుదల లేక మెంటల్లీ రిటార్డెడ్  గా పుట్టడం జరిగుతుంది. నేలలో అయోడిన్ అనే చిన్న మూలకం మనిషి పుట్టుకను ఎలా ప్రభావితం చేస్తుందో చూడండి. ఇదంతా ఎస్టాబ్లిష్ అయిన సైన్సు. ఎన్నో విధాలుగా పరిపరి విధాలుగా జియాలజీనుండి, అగ్రికల్చర్  నుండి, పర్యావరణ శాస్త్రం నుండి, వైద్య శాస్త్ర విభాగంనుండి అందిన ఇంతటి సమాచారం ఆధారంగా మనకు ఈ విషయం ఎస్టాబ్లిష్ అయింది. యేళ్ళ తరబడి కృషితో ఈ విషయం ఒక కొలిక్కి వచ్చింది. అందుకే 1960s లో ఇండియన్ గవర్నమెంట్ UNICEF సహాయంతో భారతదేశంలో పుట్టే పిల్లలు శారీరక మానసిక బలహీనులుగా పుట్టకూడదని ఒక సంకల్పంతో ఒక కమిటీ వేసి National Goitre Control Program అని 1962 లో మొదలుపెట్టింది. 1983 లో దానిని విస్తరించి National Iodine Deficiency Disorders Control Program (NIDDCP)అని ఉప్పుని అయోడైజ్డ్ చేయడం వలన విస్తృత ప్రయోజనాలున్నాయని రికమండేషన్ చేసి దీనిని ఒక నేషనల్ ప్రోగ్రాంగా చేపట్టింది. విస్తృతమైన అధ్యయనాలు పైలట్ స్టడీస్ దీనిని నిరూపించాయి. 1992 లో prevention of food adultration act తో ఇది కంపల్సరీ చేసింది. దీనితో దేశమంతటా అయోడైజ్డ్ ఉప్పు దొరకడం మొదలైంది. అయోడిన్ తక్కువ తో రాగల సకల జబ్బులనూ ఈ చిన్న పని చాలా సమర్థవంతంగా ఆపగలిగింది.ఇటువంటి ప్రోగ్రాంలు పైన చెప్పినటువంటి దేశాలలో కూడా అటునిటుగా ఉన్నాయి. అడవుల నరికివేత పెరిగా.భూసారం తగ్గుతున్న దేశాలు కూడా ఈ పద్ధతులను పాటించి తమ దేశ పిల్లలు cretinism బారిన పడకుండా ఉండేందుకు సన్నాహాలు చేసుకుంటూనే ఉంటారు.  చూడండి . ఒక జ్ఞానం నిరూపితమై ఎస్టాబ్లిష్ కాబడి ప్రజలలోకి వచ్చేందుకు ఎంతసమయం ఎంత అధ్యయనం జరిగిందో!. కానీ అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చేసి తన సొంత  అభిప్రాయాలను తెలుపుతూ అసలు అయోడైజ్డ్ ఉప్పు వాడటం డేంజర్ అని మొదలుపెట్టాడనుకోండి. ఇతడు జ్ఞాన వ్యతిరేకి. ఇతడిని నమ్మి జ్ఞానవ్యతిరేకతను విస్తృతం చేసేవారు ఏ మాత్రం ఆలోచించలేని సైంటిఫిక్ అవగాహన లేనివారిగా మనం పరిగణించవలసి ఉంటుంది.  విరించి విరివింటి

Tuesday, 27 February 2024

Satire

 యుద్ధానికి ప్రజాస్వామ్యానికీ సంబంధం లేదు. ప్రజలందరి ఆమోదంతోటి యుద్ధమెవరూ చేయరు. కొంతమంది తలతింగరి పెద్దలు కలిసి ఒక రూంలో కూర్చుని పలానా నగరం మీద అణుబాంబు యేసేద్దాం అని అనుకుని యేసేస్తారు. 


ఒకదేశంపై యుద్ధం చేయాలంటే ఐక్యరాజ్య సమితి పర్మిషన్ లు గట్రా ఏమీ ఉండవు. అంతా ఐపోయాక పప్పు బెల్లాలు పంచడానికి వచ్చేదే ఐక్యరాజ్య సమితి. ఒకదేశంపై మరోదేశ అధినేత యుద్ధం మొదలెట్టగానే ప్రతి తలకుమాసిన దేశ అధినేత ఫోన్ చేసి మాట్లాడతారు. "ఆ ఏంటయ్యా...! యుద్ధం ఆపవచ్చుకదా...యుద్ధం పాపం కదా..ప్రజలు కదా.. చచ్చిపోతారు కదా..!" వంటి సినిమా క్లాసులు పీకడం లాంటివేమీ ఉండవక్కడ. "నేను నాశనం చేయబోయే దేశం యొక్క దేశ పునర్నిర్మాణ పనుల కాంట్రాక్టు మీకే ఇస్తాను!!" అని ఆ అధినేతే భరోసా ఇస్తాడు. 

యుద్ధం ఆగిపోవాలని కోరుకునేకంటే ఎంత ఎక్కువ డామేజైతే మనకంత కాంట్రాక్టు వస్తుందని వీళ్ళంతా ఉవ్విళ్ళూరుతుంటారు. 


అమెరికా ఇరాక్ విషయమై ఇలాగే ప్రపంచదేశాలను ఒప్పించిందంట. ఇండియా కూడా సైసై అంది. శాంతి అహింస సుహృద్భావము సహకారము వంటివి యుద్ధం విషయంలో కుదరవు. Everything is right  incase of war. యుక్రెయిన్ రష్యా యుద్ధమైనా, పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధమైనా ఓకే భయ్. ఇందులో మాకేంది మీకేంది.


ఎలక్షన్లైనా అంతే. ఈ మధ్య  ప్రజాస్వామికంగా హుందాగా జరగవలసిన ఎలక్షన్లను యుద్ధాలతో పోలుస్తున్నారు. పెద్ద కంపెనీలకు మీడియా సంస్థలకు మంచి కాంట్రాక్టులు ఎవరు ఆఫర్ చేస్తారో వాళ్ళదే విజయం. నాయకుడు చేయవలసినది ఒకటే. తన స్పీచుల్లో ఎంత దమ్ముందా లేదా నిజాయితీ ఉందా లేదా అనేది విషయంకాదు. అదంతా కామన్ మ్యాన్లకోసం వేసే బిస్కెట్లు. అసలైన విషయం పెద్ద పెద్ద వాళ్ళను  కాంట్రాక్టుల విషయమై ఎంతవరకు నమ్మించగలిగామన్నదే విషయం. ఐనా యుద్ధంలో వలే కాకుండా ఎలక్షన్లలో మాత్రం ప్రజలే చివరికి దేవుళ్ళు. దేవుడు రెండు కళ్ళిచ్చి ఒక నోరిచ్చారని రెండు చెవులిచ్చారనీ కాకుండా రెండు చెవుల మజ్జన కొంత డొప్ప ఇచ్చి అందులో కాస్త గుజ్జు కూడా ఇచ్చాడని మనం గుర్తుపెట్టుకోవాలి.

Satire

 స్విగ్గీకి ప్రతి సెకండ్ కీ రెండుకు పైగా బిర్యానీ ఆర్డర్లు వస్తున్నాయంట.


దేశంలో బిర్యానీలను పీక్కుతింటున్నారంట. 

ఐతే ఫ్రీ డెలివరీ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క కష్టమర్ ఈ ఫ్రీ డెలివరీ ద్వారా ఎంత లాభం పొందారో చెబుతోంది స్విగ్గీ. బెంగుళూరు వాసులు వంద కోట్లను మిగిల్చుకుంటే ఢిల్లీలో ఒక్కతనే 2.5 లక్షలని ఈ ఫ్రీ డెలివరీ వలన డబ్బు ఆదా చేసుకున్నాడని హొయలు పోతోంది స్విగ్గీ. 

బెంగుళూరులో ఒకతను దీపావళికి ఒకేసారి రూ. 75000 పై చిలుకు  పీజాలు ఆర్డర్ పెట్టాడంట.


ఇకపోతే స్విగ్గీ వచ్చినప్పటి నుండి మూడునాలుగేళ్ళుగా  వంటింటికి అడుగుపెట్టని కుటుంబాలు తెలుగు రాష్ట్రాలలో పెరిగిపోతున్నాయి. ఫ్యూచర్ లో వంటిల్లులు లేని ఇళ్ళు కట్టుకునే అవకాశమూ లేకపోలేదు. వంటిల్లెందుకు చీపుగా, స్విగ్గీ మనకు అండగా ఉండగా అనే రోజులూ వస్తాయి. టిఫిన్ లంచ్ డిన్నర్ టోటల్ గా స్విగ్గీతో కానించేస్తున్నారు. ఈ ట్రెండ్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా ఉందని వినికిడి. 


ఈ ట్రెండ్ పై నా కామెంట్స్ ఏమీ లేవు.

Just an observation 

కాకపోతే ఈ హోటల్స్ లో ఏ నూనెలు వాడతారో ఎంత క్వాలిటీ మెంటెయిన్ చేస్తారో....అన్నీ ఆ కరోనా వాక్సిన్ కే తెలియాలి.

Satire

 ఎంతో అన్యోన్యంగా పెరిగిన అన్నాదమ్ములే ఆస్తి పంపకాలొస్తే ఎవరివాటా ఎంత అని కొట్టుకుంటుంటారు. నీకున్న బెస్ట్ శత్రువెవరయ్యా అంటే ఎవరితో ఐతే నీవు నీ ఆస్తిని పంచుకోవాల్సి వస్తుందో వాడే నీకు అత్యుత్తమ శత్రువౌతాడు. 

ఇద్దరిలో మొత్తం వాటామీద ఎవరికి ఎక్కువ పెత్తనం ఉంటుందో వాడు మరింత పట్టుదలతో ఉంటాడు. ఎందుకంటే ఆస్తి పంచుకోవడమంటే కొంత ఆస్తి వదులుకోవడమే కాదు తన పెత్తనంని కూడా కోల్పోవడం. ఆస్తి , పెత్తనం రెండూ కలిసే ఉంటాయి. 


మహాభారతమంతా అన్నదమ్ముల మధ్య రాజ్యమనే ఆస్తి తగాదా వంటిదే.

పెద్ద రారాజైన దుర్యోధనుడు పాండవులకు మిగిలిన కొద్ది పాటి అధికారాన్ని కూడా కుయుక్తులతో లాక్కొని  అడవికి పంపిస్తాడు. అతడి బాధంతా అతడి పెత్తనం పోతుందనే. రోడ్డుమీద బిక్షగాడి వేషంలో వెళ్ళి కూర్చుంటే అక్కడున్న అసలైన బిక్షగాడొచ్చి వెళ్ళిపోమని బెదిరిస్తాడు. వినకుంటే తన్నినా తంతాడు. అడుక్కోవడంలో అది వాడబ్బజాగీరని వాడనుకుంటాడు. వాడిదే పెత్తనం. సముద్రం అందరిదైనా పెద్ద చేప పెత్తనం ఎక్కువ గనుక చినచేపను తినేయడం న్యాయమే అనుకుంటుంది. 


ఎలక్షన్ లలో సీట్లు పంచుకునే పార్టీల పరిస్థితి ఇదే. వాటా ఇచ్చేపార్టీకి పుచ్చుకునే పార్టీ అంటే లోకువ. ఇలాంటి పరిస్థితి లో తేడాలొస్తే వీళ్ళకు బయటనుండి వేరే శత్రువు అవసరం లేదు. పెద్ద చేప పెత్తనం ఒప్పుకున్నంత వరకే చిన్నచేప మనుగడ.

Satire

 ఎన్నికల పండుగ సందర్భంగా..


జండాలు మోసేవారికి

ఎండల్లో గంటల తరబడి నిలబడేవారికి

సైకాళ్ళ మీద బైకుల మీద ర్యాలీలంటూ తిరిగేవారికి

బైకుమీద కారు ముందు జెండాలు పెట్టుకునేవారికి

డ్రైవర్లకు

టైర్లకు గాలి కొట్టేటోళ్ళకి

ఓటర్లను మభ్యపెడుచూ లీడర్లను ఎలివేట్ చేసేవాళ్ళకి

తమ నాయకుడిని ఏమైనా అంటే బూతులు అందుకునేవారికి

కర్రలు కత్తులు అందుకుని రోడ్లమీద కొట్టుకునేవారికి

ప్రాణాలైనా తీస్తాం ప్రాణాలైనా ఇస్తాం అనేవారికి

సోషల్ మీడియాలో ఎగస్పార్టివాళ్ళను లకారాలతో తిట్టేవారికి

నాయకుడి స్పీచ్ అర్థంకాకున్నా జై కొట్టేవారికి

నాయకుడు ఏమి చెప్పినా చప్పట్లు కొట్టేవారికి

తలలూపేవారికీ

ఏ పార్టీలోకి జంప్ చేసినా నాయకుడిని అంటిపెట్టుకునే ఉండేవారికి

ఎన్నికల్లో తమ నాయకుడి కోసం దొంగవోట్లు వేసేవారికి

తమనాయకుడికే వేయమని పోలింగ్ బూత్ దగ్గర చెప్పే వారికి

నాయకుడు చెప్పాడని రహస్యంగా డబ్బులు పంచేవారికి 

మందు పోసేవారికి 

నాయకుడు గెలిస్తే ఊగిపోతూ అరిచేవారికి

బాణాసంచా కాల్చి వీరంగం చేసేవారికి

ఓడిపోతే ఏడుస్తూ ముక్కు చీదేవారికి...


ఇత్యాది సకల ప్రజానీకానికీ

హృదయపూర్వక

ఎన్నికల పండుగ శుభాకాంక్షలు.

Sunday, 18 February 2024

Internal Bossism - Essay

 Internal Bossism - A threat 


అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెసు లో ఎక్కువ అని అంటుంటారు. కాంగ్రెసు కంటే భారతదేశంలో ఎక్కువ. లేకపోతే మనమనుకునే భిన్నత్వం, వైవిధ్యం వంటివి అసాధ్యం.  భారతదేశంలో ప్రజలమధ్య వైరుధ్యాలు వైషమ్యాలు లేవని కాదు. అవి ఎంతగా ఉన్నా అంతకంటే ఎక్కువో తక్కువో వైవిధ్యాలు కూడా ఉన్నాయి. వైవిధ్యాలు ఉన్నా కలిసి జీవించడమూ ఉంది. 


భారతీయులలో ఎంత వైరుధ్యాలు ఉన్నా వైవిధ్యాలు విభిన్నతలూ ఉన్నా భారతీయత అనే అంశం మనమందరం 'భారతీయులం' అనే అంశం పట్టి ఉంచవచ్చు. అలాగే మనకు కాంగ్రెసు పార్టీ లో ఇటువంటిదే కనిపిస్తుంది. విభిన్న దృక్పథాలు ఆలోచనలు వైరుధ్యాలు వైవిధ్యాలూ కలిగిన నాయకులు ఒకచోట పనిచేయడం 'పార్టీ' అనే అంశం వారిని పట్టి ఉంచుతున్నట్టు మనం చూడగలం. గాంధీజీ నెహ్రూ జీ అంబేద్కర్ గారు పటేల్ గారు నేతాజీ, తిలక్ వంటి వారు ఒక్కొక్కరు ఒక్కో విభిన్న దృక్పథాలనుండీ నేపథ్యాలనుండి వచ్చినా ఎంతగా వారిలో వారు విబేధించుకున్నా వారంతా ఒకే పార్టీకి చెందిన వారు. కలిసే పని చేశారు. ఈ దేశం తత్వమే ఈ భిన్నత్వంలో ఏకత్వంలా మారిందనిపిస్తుంది. ఐతే చరిత్రలో ఎపుడెపుడైతే ఈ తత్వానికి గండి పడిందో అపుడంతా దేశం పతనం వైపు పయనించిందని మనం మన చరిత్రలోనే కనుగొనగలం. ఇది దేశానికే కాదు దేశ తత్వాన్ని పుణికిపుచ్చుకున్న కాంగ్రెసు పార్టీకీ కూడా వర్తిస్తుంది. థీసీస్ యాంటీ థీసీస్ సింథెసిస్ గా ఏ వ్యవస్థ ఐనా ఉండకపోతే మన దేశంలో అది పతనం చెందక తప్పదు అని చరిత్ర చూస్తే అర్థమౌతుంది.


స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన పాలన కానీ ఎలక్షన్లుకానీ పార్లమెంటు వంటి చట్ట సభల్లో జరిగే వాదోపవాదాలు కానీ అన్నీ ఇదే తత్వాన్ని ప్రతిఫలింపజేస్తాయి. కాంగ్రెసు పార్టీకూడా అందుకే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని పేరు తెచ్చుకుంది. ఐతే ఈ పార్టీలో ఈ తత్వానికి పెద్ద ఎత్తున గండి పడిన సమయాలు చెప్పుకోతగ్గవి రెండు. ఒకటి ఎమర్జెన్సీ ఐతే రెండవది పీవీ నరసింహారావు గారి తర్వాత రోజులు. ఎమర్జెన్సీ సమయంలో ఏం జరిగిందో మనకు తెలుసు. ఇది కేవలం ఆ పార్టీ మాత్రమే అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కోల్పోవడం కాదు. దేశం మొత్తం ఏకవ్యక్తి పాలనలోకి పోవడం. ఈ దేశంలో రాజరికాలను చూసింది కనుక ఈ దేశానికి రాజరీకమే కరెక్టని మనం అనుకోవచ్చుగానీ రాజరికంపై మన దేశపౌరులు పెద్దగా తిరుగుబాటు చేయకపోవచ్చుగానీ దానిని ఈసడించుకున్నారని మనకర్థమౌతుంది. ఎంత రాజుగారిని పొగిడినా రాజు మీదికెక్కి కూర్చుంటానంటే ఒప్పుకోని ప్రజలే మనకున్నారు. అందుకే ఇతర దేశాలమాదిరి బానిసత్వాన్ని మన పూర్వీకులు పూర్తిగా institutionalize చేయలేకపోయారు.  పీవీ నరసింహారావు గారి పాలన తర్వాత కాంగ్రెసు పార్టీలో 'అధీష్టానం' అనేదొకటి బలంగా ఏర్పడి తన సహజమైన విభిన్నతనూ ఇంటర్నల్ డెమోక్రసీని కోల్పోయింది. అది తనతో తాను యుద్ధంలో ఇరుక్కుంది. ఇది అందరూ అనుకుంటున్నటువంటి కుటుంబ పాలన కాదు. అంతకు మించిన తాత్విక పునాదినే కోల్పోవడం ఇది. అప్పటినుండే పార్టీ పతనం కూడా ప్రారంభమైంది. 


మౌన ముద్రకి కేరాఫ్ అడ్రస్ ఐన పీవీ నరసింహారావు ఈ 'పార్టీ' అనే ఏకత్వ భావనను నిలిపేందుకే మౌనంగా ఉన్నారని మనం అనుకోక తప్పదు. తన అభిప్రాయాలూ దృక్పథాలూ ఎలా ఉన్నా ఒక కామన్ కాజ్ కోసం పని చేయాలంటే కొంత మౌనం ఉండక తప్పదు. ఇదే భారతీయ తత్వం. ఇది మంచిదా చెడ్డదా అని అడిగితే మంచిదీ చెడ్డదీ. రెండూనూ.  అందుకే 'పార్టీ' అనే అంశం దానికి కట్టుబడి ఉండటం అనే అంశం కాంగ్రెసు పార్టీ తాత్విక పునాది. పీవీ దానిని పాటించారు. కానీ పీవీ పాలన తర్వాత పీవీని పట్టించుకోవడం పార్టీ మానేసింది. అటునుంచి 'అధిష్టానం' అనబడే ఇంటర్నల్ నియంతృత్వం వైపుకి కదిలింది. ఇంటర్నల్ బాసిజం పార్టీలకే కాదు ఈ దేశంలో సంస్థలకైనా చివరికి మన ఇళ్ళకు కూడా ప్రమాదకరమైనది. తండ్రియే ఇంటికి బాసు, ఆయన చెప్పినట్టు విని తీరాల్సిందే అనేటువంటి ధోరణి కలిగిన కుటుంబాలు పతనం చెందుతాయి అనేది నా థియరీ. కావాలంటే ఏ ఇంటినైనా పరికించి చూడండి. 


పీవీ నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడంలో బీజేపీ రాజకీయ ఎత్తుగడ ఔనా కాదా అంటే ఖచ్చితంగా ఎత్తుగడనే. వర్తక బీజేపీ పార్టీకి ఇది ఓట్ల వ్యాపారం. ఐతే ఆ అవకాశం ఇచ్చింది మాత్రం కాంగ్రెసు పార్టీనే కదా. తన అధిష్టాన స్థాయిని నిలుపుకునే క్రమంలో ఎవరినైతే కాంగ్రెస్ పార్టీ వదులుకుందో అతడిని పావుగా ప్రస్తుతం బీజేపీ వాడుకుంటోంది. ఒక మేధావిగా పార్టీ సూత్రధారిగా నెహ్రవియన్ గా సంస్కరణవాదిగా ఎదిగిన పీవీ గురించి కాంగ్రెస్ పార్టీ ఎపుడూ మాట్లాడలేదు. ఇపుడూ పెద్దగా మాట్లాడట్లేదు. ప్రచారం కల్పించడం లేదు. మంత్రిగా విద్యాసంస్కరణలు, జైలు సంస్కరణలు, ముఖ్యమంత్రిగా భూసంస్కరణలూ, చివరికి ప్రధానిగా ఆర్థిక సంస్కరణలూ తెచ్చిన తనదైన ముద్రవేసిన పీవీని పార్టీ విస్మరించింది. పదవినుండి దిగాక ఉత్తర ప్రదేశ్ బీహార్ ని బాగు చేయలేకపోయాననే ఆయన అసంతృప్తి లో అక్కడ నేటికీ ఉన్న భూస్వామ్య వ్యవస్థ విషయమే మాట్లాడారు. ఈ భూసంస్కరణలు తెలుగు రాష్ట్రం లో జరగకుండా చూసిన భూస్వాములే ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెట్టారన్నది జగమెరిగిన సత్యం. కాంగ్రెసు ముఖ్యంగా ఇందిరమ్మ భూస్వాముల పోషక పార్టీ అనే విమర్శలు లేకపోలేదు.  పాలన విషయంలో ఆయనతో విబేధాలున్నంత మాత్రాన ఆయనను విస్మరించడం అంటే తన తాత్విక పునాదిని కోల్పోవడమే. గాంధీజీ తో ఎంతో విబేధించిన అంబేద్కర్ గారిని కాంగ్రెసు పార్టీకానీ నెహ్రూజీ కానీ పక్కన పెట్టేసిన సందర్భం లేదు. కానీ పీవీ ఘనతను విస్మరించడం కాంగ్రెస్ పార్టీ బలహీన పడటం రెండూ వేరు వేరు అంశాలు కాదు. శతృవు బలహీనత మీదే కదా కొట్టవలసినది. ప్రస్తుతం బీజేపీ అదే చేసింది.

కాంగ్రెస్ పార్టీ కాదనుకున్న పీవీని బీజేపీ తనవాడిగా మలుచుకుంది. 


బాబ్రిమసీదు కూల్చివేత అంశంలో పీవీ మౌనం, కళ్యాణ్ సింగు పీవీతో నిలుపుకోలేని హామీ ఇత్యాదివన్నీ పీవీని బిజెపి కి అనుకూలమైన వ్యక్తి గా అనుకునేటట్లు నేపథ్యాన్ని ఏర్పరిచాయి. బీజేపీకి కావలసింది కూడా అదే. నెహ్రూవియన్ ఐన పీవీ సంస్కరణవాది ఐన పీవీని తమ తరపు వాడని ప్రజలను నమ్మించడమే బీజేపీ ఎత్తుగడ. ఐతే పీవీకి భారతరత్న వచ్చిన ఈ సందర్భంలో  చాలామంది మేధావులు ఈ ఉచ్చులో పడి ఆయనను బీజేపీ ఏజెంట్ అనేదాకా వెళ్ళారు. నా దృష్టిలో ఇది నెహ్రూవియన్ థాట్ గొప్పదనాన్ని అవమానించడమే. ఇప్పుడు పీవీ ఘనతను కాంగ్రేసే కాదు ఆలోచించగలిగిన మేధావులూ తుడిచిపెట్టేందుకు బీజేపీ పన్నిన ఉచ్చులో పడేందుకు సిద్ధంగా ఉవ్విళ్ళూరుతున్నారు.దీనికంతటికీ  పీవీ గంభీరమైన మౌనం మాత్రమే కాదు కారణం. పీవీ విషయంలో కాంగ్రెస్ పాటించిన గంభీరమైన మౌనమే అసలు కారణం. పీవి గారి పార్థివ దేహాన్ని పార్టీ ఆఫీసులోకి సైంతం రానివ్వనంత కండకావర ఫలితం. ఐతే ఒక్క పీవీ విషయమే కాదు. విభిన్నమైన దృక్కోణం కలిగి ఉన్నారని తనతో కలిసి ఒక కామన్ కాజ్ కోసం పనిచేస్తున్న వారినందరినీ విస్మరించిన ప్రతి సందర్భంకూడా ఇలాంటి పతనాన్నే మనం గమనిస్తాం. అనుభవిస్తాం కూడా. 


విరించి విరివింటి 

18-2-24