Tuesday, 7 July 2015

విరించి    ll  ఎవరు కవి  ll
........................................
నీ బాధ నానుండి ప్రవహించాలని
ఈ అక్షర గునపాలతో
నాలో నేనే ఒక వాగు తవ్వుకుంటాను.

మనుషుల జాడే కానరాని
నీ ఎడారిలో
నీ సముద్రంలో
నీ మైదానంలో
నేనూ ఒక సాటి మనిషిలా నిలబడతాను.

ఎంత పొంగినా కట్టలు తెంపలేని నదిలా
జాగ్రత్త పడుతూ  నీవు
ఎంత తవ్వినా నీరు పడని
బోరు బావిలా నేను
ఒకే సమరాంగనలో
రెండు పేలని తూ టాలమవుతాం.

ఏం..అనామక స్వప్నంలా వచ్చి పోయే
కవితా పంక్తుల్లోకైనా ఒక అక్షరమై ఒస్తే
నీ గంటేంపోతుంది?.

ఇన్ని వేల మాటలు నీ కోసం రాసీ రాసీ
చివరికి నీ అనుపానులు కూడా వాటిల్లో
నేను కనుగోలేనపుడు
నన్ను నాకు చూపించే ఈ కవితాద్దాలను
నెత్తికేసి కొట్టుకోనా..?

నీ ప్రాంగణంలో నిలబడినంతనే
పుంఖాను పుంఖాలుగా
కవిత్వం వచ్చేస్తుందనే నా వెర్రి భ్రమలో
నేను తలమునకలైనపుడు
విశ్వానికుండే బాధనంతా
భుజానికెత్తుకుని
శిలువేసిన యేసు ప్రభువులా
నువు నడుస్తుంటావు చూడు..
అపుడనుకుంటాను
కాళ్ళీడుస్తూ నీవు రాసే కవిత్వం ముందు
ఖాళీ కాగితాల మీది ఈ కవిత్వం ఎంతటిదని.

ఓ కష్ట జీవీ...
నీవే అసలు సిసలు కవివి.

5/7/15

No comments:

Post a Comment