Thursday, 7 July 2016

2090 సంవత్సరం, పదో తరగతి తెలుగు వాచకంలో..ఒక పాఠం లోని కొంత భాగం.
---------------------------------------------

అవి తెలుగు వారికి నలుపు రోజులు. రాష్ట్రం రెండు ముక్కలుగా చేయబడి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ గా విడివడిన రోజులు. ఆం.ప్ర. ముఖ్యమంత్రి డాబుగారు తనన ప్రత్యర్థి భగ్నన్ మీద ఒక శాతం అధిక వోటుతో గెలవకపోయివుంటే ప్రపంచ పటంలో అమరావతి నగరాన్ని మనమెప్పుడూ చూసేవారిమి కాదు. హైదరాబాదుని ప్రపంచ పటంలో గుర్తించి తెలుగువారు ప్రపంచంలో బతికే ఉన్నారని చాటిన డాబుగారు అమరావతిని కూడా ప్రపంచపటంలో పెట్టడానికి బాధ్యతలను నెత్తికెత్తుకుని పరిపాలన సాగించారు. రైతులు ఎంతో మంది ముందుకు వచ్చి, తమ భూములను అమరావతి నగరం కోసం త్యాగం చేశారు. డాబుగారికి రైతులను చూస్తే ఆనందం వేసేది. వాళ్లని చూడగానే నవ్వేవాడాయన. ఆ నవ్వు ఎంతో మందికి స్పూర్తినిచ్చేది. అమెరికా అధ్యక్ష గృహంలో డాబుగారి నవ్వు పటం వేలాడేదంటే, ఆ నవ్వులో ఉండే మహత్తు అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఆయన ఎంతో ఆచి తూ చి నవ్వేవాడు. ప్రతిపక్షాలెంత  ఇబ్బందుల్ని సృష్టించినా 'చెక్కులు' చెదరకుండా వ్యవహారం నడిపుతూ  ముందుకు పోయేవాడు. హైదరాబాదును సైబరాబాదును చూస్తేనే డాబుగారికి తృప్తి కలిగేది. ఆ తృప్తిని ఎక్కడైనా నిర్భయంగా వ్యక్తం చేయగలిగేవాడు. అటువంటి హైదరాబాదును సైబరాబాదునూ వదులుకోవడంతో సర్వస్వాన్ని వదిలేసుకున్నవాడయ్యాడు. అయినా ధైర్యంగా నిద్రలేని రాత్రులను గడుపుతూ అమరావతికోసం శ్రమించాడు. సింగపూరు జపాన్ వంటి దేశాలకు భూముల్ని తక్కువ ధరకే అమ్మి అమరావతిలో ఆకార హార్మ్యాలు కట్టాడు. ఈ రోజు మనమిన్ని భవనాల్ని అమరావతిలో చూడగలుగుతున్నామంటే అప్పటి డాబుగారి ఉదారవాద హృదయమే కారణం. రోడ్డుకిరుపక్కలా చెట్లను గుడులనూ కూల్చి కంప్యూటర్ సంస్థలను నెలకొల్పాడు. ఒకప్పటి సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా గడించిన అపారమైన అనుభవం ఎటువంటి స్కాములనైనా ఎదుర్కునే శక్తినిచ్చింది. అటు కేజీఆర్ ఇటు భగ్నన్ కుమ్మక్కయ్యి ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాంపరింగ్ కి పాల్పడినా "వాటయాం సేయింగ్" అంటూ తన వాణిని ప్రపంచానికి చాటి చెప్పాడు. కాల్ మనీ అంటూ ప్రతిపక్షాలు ఆయన్ని అణగదొక్కే ప్రయత్నం చేసినా తాజమ్మ అనబడే ఐరన్ లెగ్ నాయకురాలి మీద ఉక్కు పాదం మోపి చాకచక్యంగా అసెంబ్లీ నుండి బహిష్కరణ చేయించగలిగాడు. తెలంగాణా వారికి నిద్ర లేపడం దగ్గరినుంచి అన్నం తినిపించే దాకా, విద్యార్థులు స్కూలుకూ కాలేజీలకు పోయేదాక శ్రమించిన డాబు, ఆం.ప్ర లో కూడా అన్నీ తానే ఐ ముందుకు సాగాడు. అన్నింటిలో తానే ఉన్నాననీ- అన్నింటిలో తననే చూసుకునే అరుదైన అద్వైత వాది ఆయన.

ఆరోజుల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడిన కంప్యూటర్ మేధావి నిత్య ఆదెల్ల కైనా, ప్రపంచ మేధావిగా వేనోళ్ళా కొనియాడబడ్డ షోకేష్ కైనా డాబు గారే స్పూర్తి. చైనా జపాన్ దేశాల అధ్యక్షులే కాకుండా అమెరికా అధ్యక్షులు కూడా డాబుగారి స్పూర్తితో పనిచేసేవారు. ఎటువంటి సమస్య వచ్చినా డాబుగారినే సలహా అడిగే వారు.  ఉన్న నూటా తొంభై ఐదు దేశాల్నించే కాక లేని ఐదు దేశాల అధికారులు కూడా అమరావతిలో పెట్టుబడులు పెడతామని పరిగెత్తుకొచ్చేవారు. వారందరికీ ఆ రోజుల్లో విమానాల అవసరం ఉండేది కాదు. డాబు గారు ఫోన్ చేస్తే చాలు ఎక్కడున్నా ఉన్నపళంగా పరిగెత్తుకొచ్చే పరిస్థితికొచ్చారంటే డాబుగారి పనితీరు వారిలో నింపిన స్పూర్తే కారణం తప్ప మరొకటి కాదు.

(కొంత భాగం మాత్రమే ఇది.
కేవలం సరదాకి మాత్రమే. )

No comments:

Post a Comment