Wednesday, 29 June 2016

విరించి || తెరచి ఉంచిన పుస్తకం ll
.................................
మూసిపెట్టి వుంచిన
పురాతన తలుపుల సందుల్లోంచి
వేద వాక్కొకటి
శాస్త్రోక్తంగా గాలిగొట్టుకుపోతుంటుంది

తెరచివుంచిన పుస్తకమొకటి
పాడుబడిన మసీదు గోడలమీద
దీపంలా నవ్వుతూ  కూర్చుంటుంది

గిరిగీసిన వృత్తాల్లోంచి
గీతలు గీసుకున్న శాస్త్రాల్లోంచి
దేవుడు తన్నుకుని రాలేక
మునిగిపోయిన సముద్ర నగరాల్లోనో
కూల్చేసిన శిథిలాల కిందో
చతికిలబడి చచ్చుబడి వుంటాడు

మనిషి భాష తెలిసిన మనిషి
పచ్చిక బయళ్ళలో..
పూజకు పనికిరాని
పూవుల వాసన చూస్తుంటాడు

అదిగో...
ఓ మనిషిని కూలుస్తామంటున్నారు
తలుపులు లేని దేవాలయాన్ని మూస్తామంటున్నారు.
మనిషిని కొలిచే మతం కూడదంటున్నారు
మనిషిలో దేవుడిని నిలువనీయమంటున్నారు
అష్టా చక్రా నవ ద్వారా దేవానాం పురాయోధ్యా
కిలోలు సెంటిమీటర్ల లెక్కన
దేవుడు దేహిస్తాడని ప్రమాణాలు చూపిస్తున్నారు
మనిషిలో దేవుడుండలేడని వాదిస్తున్నారు
ఈశ్వరః సర్వ భూతానాం

మనిషే దైవుడైతే
మానవుడసలే తట్టుకోలేడు
దేవుడే మనిషిగ వస్తే
మానవుడే వెంటపడి చంపేస్తాడు
దేవుడు వ్యాపారం కాలేకపోతే
ఈ దేశంలో బతికి బట్టకట్టలేడు.

అందుకే దేవుడొద్దు మనకిపుడు
గూడు పుఠాణి మతాలొద్దు మనకిప్పుడు
మనిషిని గుర్తించే మనిషి కావాలి
తలుపులు మూయని దేవాలయాలు కావాలి
వాడి పేరు సాయి అయ్యుండాలి
మతం మానవత్వం అయ్యుండాలి

13/5/16

No comments:

Post a Comment