Sunday, 24 July 2016

ఆనందం  ఒక అన్వేషణ (part4)
----------------------------------------------

ప్రపంచమంతా ఒకేలా ఉండాలి, అందరూ ఒకేలా ఆలోచించాలి అనేది ఒక ఇల్లాజికల్ ఆలోచన. ఒకేలా ఉండటం జరిగితే ప్రపంచం చాలా అసహ్యంగా ఉండిండేది. ఏ ఇద్దరు మనుషులు ఒకేలా లేనపుడు, అందరి ఆలోచనలూ ఒకేలా ఉండాలనుకోవడం ఖచ్చితంగా అర్థం లేని విషయమే. మనుషులందరూ ఒకేలా ఆలోచిస్తారు అని నమ్మకాన్ని స్థిరీకరించుకోవటం కూడా కనిపిస్తూ ఉంటుంది. అంతే కాక మనిషి ఆలోచన మార్పుకు గురికానిది అనే నమ్మకం కూడా మనం కలిగి వుంటాం. ఇవన్నీ మనం అర్థం చేసుకునే, అవగాహన చేసుకునే అంశానికి సంబంధించిన ఫాల్లసీలు. ఒకేలా ఆలోచించాలి అనుకోవడం, ఒకేలా ఆలోచిస్తారు అనుకోవడం, ఒక ఆలోచననే మార్పులేకుండా కలిగివుంటాడు అనుకోవడం. ఈ మూడు కూడా అవగాహనా లోపాలు, ఫాల్లసీలే. ఫండమెంటలిజం మనలోపల్నే ఈ విధంగా మొదలవుతుంది. మనం ఆ మతాలు ఈ మతాలని ఆడిపోసుకుంటాం కానీ, మన ప్రాథమిక ఆలోచనా రీతిలోనే లోపం ఉందనే విషయాన్ని గుర్తించము. మనిషి ఫండమెంటల్ కాబట్టే మనిషి తయారు చేసుకున్న మతాలు ఫండమెంటల్గానే ఉంటాయి. వేరేగా ఉదాత్తంగా ఉండటానికి వీలే లేదు. మతాలనన్నింటినీ కాదనే నాస్తికుడయినా, ప్రపంచంలో అందరూ నాస్తికులుగా, తనలాగానే ఆలోచించాలి అనుకుంటాడే తప్ప, ఇంకో రకంగా ఆలోచించడానికి వీల్లేదు అంటాడు. దానికతడు చూపించే కారణం, మతాలవల్ల మారణ హోమాలు జరిగాయి కాబట్టి, ఇక అవి ఉండటానికి వీలు లేదంటాడు. తద్వారా అతడు కూడా అందరూ దేవుడులేడు అనే ఆలోచించాలి తప్ప ఇంకో రకంగా ఆలోచించకూడదు అనే అనుకుంటున్నాడు. ఇతడి ఆలోచనలకి, కరడుగట్టిన మతవాదులకీ ఏమీ తేడాలేదనే విషయాన్నతడు గుర్తించడు. మతాల వల్లకానీ, ఇంకదేనివల్లకానీ జరిగే మారణ హోమమంతా, మనిషి ఒకేలా ఆలోచించాలి అనే ఫాల్లసీ వల్లనే వచ్చి ఉన్నాయి.

ఇక మత ఛాంధస వాదుల కరడుగట్టిన డోగ్మాలను పలుచన చేయడానికి ఎవరైనా అన్ని మతాలు ఒక్కటే, దేవుడు ఒక్కడే కాబట్టి అని అంటే, మత ఛాంధస వాదులు పుస్తకాల గ్లోసరీలు చదువుతూ నిరూపించగలరు, ఎలా వేరే మతం, తన మతం ఒక్కటి కావో, ఏ విధంగా తన మతం వేరే మతానికంటే గొప్పదో. వీరంతా ఒక విషయం యొక్క రూపాన్నీ సారాన్నీ వేరుగా చూడలేకపోవటం వలన వచ్చిన చిక్కులో చిక్కుకుపోయారని చెప్పక తప్పదు. కనిపించిందంతా బంగారం కాదు అంటాడు షేక్స్పియర్. రూపానికీ, సారానికీ మధ్య మోసపూరితమైన తేడా ఉంటుంది. సరి ఐన దృష్టిలేకపోతే ఈ రెండూ ఒకేలాగా కనిపిస్తాయి, వినిపిస్తాయి, అనిపిస్తాయి. స్వభావోక్తికీ, ధన్వోక్తికీ ఉన్నటువంటి తేడా కన్నా క్లిష్టమైన తేడానే ఇది. సాయనాచార్యుడైనా వేదంలోని ధన్వోక్తిని, స్వభావోక్తిలా గ్రహించి, వేదానికి తప్పుడు భాష్యం చెప్పేశాడు అంటాడు శ్రీ అరవిందులు. అయితే రూపానికీ,  సారానికీ ఉన్న తేడా, రూపంలో దాగి వుంటుంది కానీ, సారంలో కాదు. అంటే రూపము సారములా భ్రమింప జేయవచ్చు కానీ, సారము ఎప్పటికీ సారముగానే ఉంటుంది తప్ప రూపములా భ్రమింపజేయలేదు. ఇపుడు మతాల్ని వివరించే క్రమంలో రూపాన్నే మనం సారమనుకుంటున్నాం. అందువల్ల సారం మనకు కనిపించకుండానే ఉండిపోతుంటుంది. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. ఒక సైనుకులను ఉద్దేశించి, సైనికాధికారి ప్రసంగిచేటపుడు, శత్రు దేశంతో జరిగిన యుద్ధంలోని ఒక ఘట్టాన్ని వివరిస్తున్నాడు

             "ఆ రోజేమయ్యిందంటే, శత్రువులు ఆ వీర సైనికుని కాళ్ళు చేతులూ కోసి పడేశారు. కేవలం మొండెం, తల మాత్రమే మిగిలివుంది. అయినా ఆ సైనికుడు లెక్కచేయక, ఒక బాంబుని నోటిలో పెట్టుకుని శత్రువుల మీదకు ఉరికాడు. శత్రువులను ఉద్దేశించి మాట్లాడుతూ ఓరీ ధూర్తుల్లారా, మీరు నా కాళ్ళు తీసేశారు, చేతులు తీసేశారు, అయినా నేను నా దేశంకోసం ప్రాణాలర్పించటానికి సిద్ధ పడ్డాను. ఈ ప్రాణాన్ని నా దేశం కోసం తృణ ప్రాయంగా భావిస్తున్నాను. నాకు భార్యా పిల్లల మీద మమకారం ఏమీ లేదు, మీకు కనుక ఉంటే నా దేశ సైనికుల దాఠికి తట్టుకోగల శక్తి లేకుంటే ఇపుడే పారిపోండి, అంటూ తన నోట్లో ఉన్న బాంబును కొరికి శత్రులుల మధ్యనే పేలిపోయి ప్రాణ త్యాగం చేశాడు".

ఈ మాటల్లో అభిదార్థాన్ని తీసుకున్నట్టైతే, మనకు అంతా తప్పుగానే అనిపిస్తుంది. చేతులూ కాళ్ళూ లేని వ్యక్తి శతృవుల మీదకు ఉరకటం ఏమిటి?, నోట్లో బాంబు పెట్టుకుని ఎలా మాట్లాడాడు?, ఆయన మాట్లాడుతుంటే శతృవులు కాల్చి పారేయక చూస్తూ ఎందుకు,కూచున్నారు? భయంకర యుద్ధంలో ఆహోరులో అంతసేపు మాట్లాడటానికి తీరికెక్కడిది?, ఆయన మాట్లాడినంత మాత్రాన శతృవులకు వినిపించి ఉంటుందనటానికి ఆదారాలేంటి?, నోటితో బాంబును ఎలా కొరికి పేల్చాడు, ఇత్యాదులన్నీ. కానీ వ్యంజనార్థం అది కాదు. ఇది కట్టుకథే, కానీ సైనికాధికారి సైనికుల్లో నింపాలనుకున్న స్పూర్తిని మనం గ్రహించగలిగితే అదే సారం. మనం ఒకానొక సందర్భంలో, ఒక విషయంలోకి పూర్తిగా ఇన్వోల్వ్ అయినపుడు, రూపం కంటే సారాన్నే గ్రహిస్తాము. కానీ పూర్తిగా ఇన్వోల్వ్ కానపుడు రూపం మాత్రమే గ్రహిస్తాము. పాత సినిమాల్లో హీరో కార్ నడుపుతూ ఉంటాడు. బ్యాక్ గ్రౌండ్ లో కనబడే చెట్లూ, కార్ స్టీరింగ్ ని పట్టుకుని తిప్పే విదానమూ, కార్ ఊగుతున్న విధానమూ గమనిస్తే ఆ షాట్ స్టూడియోలో తీశారనే విషయం అర్థం అవుతుంది. ఎంతో ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంటుంది. కానీ మనం ఆ కథలో ఇన్వాల్వ్ అయినపుడు, హీరో నిజంగానే కార్ ను నడిపిస్తూ విలన్ ను ఛేజ్ చేస్తున్నాడని అనుకుంటాం. ఇన్వాల్వ్ కానపుడు రూపం మాత్రమే కనిపించింది, ఇన్వాల్వ్ అయినపుడు సారం కనిపించింది. ఈ రెండింటి మధ్య తేడా రూపంలోనే దాగి ఉంటుంది. ఇపుడు మనం హీరో విలన్ ని ఛేజ్ చేయటం, స్టూడియోలో కాకుండా బయట షూట్ చేసామంటే, రూపం మాత్రమే మారినట్టు, కానీ సారం అదే.

కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు యుద్ధం చేయనని బిగుసుకుపోయినపుడు, శ్రీ కృష్ణుడు భగవద్గీత చెబుతాడు. నడి యుద్ధంలో ఈ సుదీర్ఘ మీటింగులేంటని మనం అనుకుంటాం. అది రూప గ్రహింపు మాత్రమే. సారం అది కాదు. అర్జునుడు బాధ పడుతున్న వ్యక్తికి ప్రతినిధిగా నిలబడ్డాడు. జీసస్ శిలువ మీద బాధ పడుతున్న వ్యక్తికి ప్రతినిధిగా నిలబడి ఉన్నాడు. ఏదైనా ఒక నాటకం మనం చూస్తున్నపుడు, నాటకంలో ఒక విషాద పాత్ర, ఒక కామెడీ పాత్ర ఉంటే ప్రేక్షకుడు విషాద పాత్రతో తాదాత్మ్యం చెందుతాడు తప్ప, కామెడీ పాత్రతో కాదు. కామెడీ పాత్రధారుడు, కామెడీ పాత్రధారుడడిగానే మిగిలిపోతాడు కానీ విషాద పాత్రధారుడు ప్రేక్షకుని ఆంతర్యంలో చోటు సంపాదించుకుంటాడు. అర్జునుడి విషాదము అందరి విషాదమయ్యింది. జీసస్ చిందించిన రక్తము అందరి రక్తమయ్యింది. అర్జునుడు నేనిక యుద్ధం చేయలేనని బాధపడతాడు. జీసస్ భగవంతుడా నన్నెందుకు విడిచిపెట్టావని దుఃఖితుడౌతాడు.  కృష్ణుడు జ్ఞాన బోధ చేసి అర్జునుడు నిమిత్త మాత్రుడే చేసేదంతా తానేనని తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. తానూ దేవుడు వేరు వేరు కాదని జీసస్ మరణం మీదినుంచి లేచి వస్తాడు. మరణం అజ్ఞానం, దైవం జ్ఞానం. మతాలూ కథలూ వేరుగా అనిపిస్తాయి, సారం ఒకేలాగా ఉంటుంది. మతవాదులకు సారంతో పని లేదు, రూపాన్ని సారంలా భ్రమపడటంతో రుపంలోనే కూరుకుని పోతుంటారు. మనిషిని ఉన్నతి వైపు నడపటమే సారమైతే, ఆ సారం ఏ రూపంలో అయినా ఉండి ఉండవచ్చు. తమకు తెలిసిన రూపమే అసలైన సారము అనుకోవడంలోనే ఇబ్బంది.

No comments:

Post a Comment