Wednesday, 1 June 2016

కవిత్వ సందర్భం 19


అసలైన ఉగ్రవాద స్వరూప౦ ఏది?
...........................................
కొన్ని దేశాలకు యుద్ధం పేదరికాన్ని తీసుకువస్తుంది. కొన్ని దేశాలకు యుద్ధం సంపదను తీసుకొస్తుంది. కాబట్టి ఈ దేశాలు నిరంతరం యుద్ధాన్ని నడిపిస్తూనే ఉండాలి అనుకుంటాయి. యుద్ధంతోటి కడుపులు నింపుకునే దేశాల జాబితాలో అమెరికా ముందుంటుంది ఎప్పుడూ. స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI)  నివేదిక ప్రకారం, దాదాపు పదకొండువేల మిలియన్ డాలర్ల విలువగల ఆయుధాలను అమెరికా ప్రతీ సంవత్సరమూ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. దాదాపు ఈ విలువలో సగం అంటే ఐదున్నర వేల మిలియన్ డాలర్ల విలువగల ఆయుధాలను రష్యా ఎగుమతి చేస్తోంది. ఈ ఆయుధాలు ఎగుమతి కావాలంటే యుద్ధం అనేదొకటి ఉండాలి కదా. ఒకవేళ యుద్ధం ఉండకపోతే యుద్ధం సృష్టించబడుతుంది. యుద్ధాన్ని ఎలా సృష్టించాలి, ఏ రెండు దేశాల మధ్య సృష్టించాలి అనేది అమెరికాకు వెన్నెతో పెట్టిన విద్య. ఇతరత్రా అన్ని ఆర్థిక వ్యాపారాలకి ఔట్ సోర్సింగ్ మీద ఆధారపడి యుద్ధ యంత్రాల్ని మాత్రం తానే తయారు చేస్తూ ఎగుమతులు చేసుకోవటంలోనే అమెరికా తంత్రం అర్థం అవుతుంది. దాదాపు ఎనిమిది లక్షల మందికి ఈ అమెరికన్ ఆయుధ కర్మాగారాల్లో ఉపాధి లభిస్తోంది. యుద్ధం అనేది అమెరికాకు బంగారు గుడ్లు పెట్టే బాతువంటిది. దానిని ఎందుకు చంపాలి అనుకుంటుంది?.

కాబట్టి అమెరికా ఎపుడూ ప్రపంచాన్ని గమనిస్తూ ఉంటుంది. ఎక్కడ ఏ మూల ఏ విషయం జరిగినా తన వేలు పెట్టాలని చూస్తూ ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ప్రపంచానికి ఆయిల్ పెట్రోలియం ని అందించే మిడిల్ ఈస్ట్ దేశాలు అమెరికాకు కనిపించాయి. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత కాలంలో మిడిల్ ఈస్ట్ తో కేవలం స్నేహ పూర్వక సంబంధాలనే కలిగున్న అమెరికా, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన ప్రాంతంగా గుర్తించింది. రెండవ ప్రపంచ యుద్ధం అమెరికా దృక్పథాన్ని ఫారిన్ పాలసీని పూర్తిగా మార్చేసింది. అప్పటినుంచే మిడిల్ ఈస్ట్ లో అమెరికా జోక్యం పెరగటమూ, మిడిల్ ఈస్ట్ తో అమెరికా మితిమీరిన రొమాన్స్ వాటి రెంటి మధ్య ఘర్షణకి దారి తీసి సో కాల్డ్ "తీవ్రవాదం"(terrorism) అనబడుతున్న దానికి దారితీయటమూ జరిగింది. తీవ్రవాద దాడులన్నీ అమెరికాను టార్గెట్ చేసుకుని జరుగటానికి కారణం లేకపోలేదు. డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్సు స్టడీ ప్రకారం, ప్రపంచ వ్యవహారాల్లో అమెరికా తలదూర్చటం జరిగినప్పుడల్లా అమెరికాకు వ్యతిరేకంగా టెర్రరిస్ట్ అటాక్స్ జరిగాయని తెలుస్తోంది. అలాంటి ఒక దాడే సెప్టెంబరు పదకొండున (1991/9/11p) న్యూయార్క్ ట్విన్ టవర్స్ మీద జరిగిన దాడి. న్యూయార్క్ టైంస్ పత్రికకు సెప్టెంబరు పదకొండు దాడుల తరువాత తీవ్రవాదుల నుండి ఒక ఉత్తరం వచ్చింది.
"We declare our responsibility for the explosion on the mentioned building. This action was done in response for the American political economical and military support to Israel, the state of terrorism, and to the rest of the dictator countries in the region" ఈ ఉత్తరం టెర్రరిస్ట్లు అని అనబడుతున్నవారు దాడులకు తెగబడటానికి మిడిల్ ఈస్ట్లో అమెరికా అనవసర జోక్యాన్ని కారణంగా చూపుతోంది.

ఇవి జరగగానే, అమెరికా 2003 లో ఇరాక్ మీద యుద్ధం ప్రకటించింది. కారణాలుగా సద్ధాం హుస్సేన్ WMD (Weapons of Mass Destruction) కలిగి ఉన్నాడనీ, సున్నీ ముస్లిం అయిన సద్ధాం, అల్ ఖయిదాతో సంబంధాలు కలిగి, సెప్టెంబరు పదకొండు దాడులలో పరోక్షంగా పాల్గొన్నాడనీ చూపించింది. (నవీన కాలంలో అరబిక్ నేషనలిజం కాలం వరకు శాంతియుతంగా జీవించిన షియా సున్నీ ముస్లిం తెగలు, విడిపోయి కొట్టుకోవటం ప్రారంభించాయి. ఒలివర్ రాయ్, డైరెక్టర్ ఆఫ్ ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్, ప్రకారం ఇరాన్ లోని ఇస్లామిక్ రివొల్యూషన్ , ఇరాక్ యుద్ధం ఈ రెండూ కూడా షియా సున్నీల మధ్య అధికార మార్పిడి జరగటానికి కారణమట.) ఇరాక్ యుద్ధానికి అమెరికా చూపిన కారణాలేవీ తరువాత నిరూపించబడలేదు. బయటకి ఎన్ని మాటలు చెప్పినా, అమెరికా ఇరాక్ ను ఆక్రమించటంలోని ఆంతర్యం మాత్రం ఇరాక్ వద్దనున్న పెట్రోలు నిల్వలే. ఇరాక్ నుంచి ఇజ్రాయిల్ లోని హైఫా ఆయిల్ రిఫైనరీ వరకు గల పైపులైన్ని పునరుద్ధరించాలని అమెరికా కోరుకుంది. అందుకు ప్రతిగా ఇజ్రాయిల్ అమెరికా కు ఇరాక్ యుద్ధంలో సహాయపడాలన్నది రహస్య ఒప్పందం. హైఫాలోని ఆయిల్ రిఫైనరీల వరకు పైపులైన్లు పునరుద్ధరిస్తే, ప్రపంచ ఆయిల్ మార్కెట్టు మీద అమెరికా ఆధితప్యం చెలాయించవచ్చు. ఈ లెక్కన ఇరాక్ యుద్ధం మిడిల్ ఈస్ట్ లోని పెట్రోలియం సంపదల మీద ఎన్నో సంవత్సరాల అమెరికన్ వ్యూహాత్మక చర్యలకు ప్రతిఫలంగా జరిగింది. సెప్టెంబరు పదకొండు దాడులు ఆ వ్యూహాన్ని అమలు పరచటానికి ఒక ఊతమిస్తే, ఉగ్రవాదం మీద పోరు నినాదమూ కేవలం ప్రపంచాన్ని పక్కదారి పట్టించి, అస్థిర పరచటానికి ఉపయోగపడింది.
కానీ ప్రపంచానికి ఈ కారణాలు చూపించదు అమెరికా. షియా సున్నీ పోట్లాటల్నీ, తన జోక్యానికి వ్యతిరేకంగా మీద దాడి చేసిన ఒసామా బిన్ లాడెన్ నీ, ఇరాక్ లో భయంకర జీవ ఆయుధాలు కలిగి ఉన్నాడన్న నెపంతో సద్ధాం హుస్సేన్ నూ బూచిగా చూపిస్తుంది అమెరికా. ఇటువంటి ఒక సందర్భాన్ని తీసుకుని అమెరికా నిజస్వరూపాన్ని మనముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారు కవి జయధీర్ తిరుమల రావు. ఈ కవిత రాసే సమయానికి (2005) ఇరాక్ యుద్ధం జరుగుతూ నే వుంది. ఇంకా సద్ధాం హుసేన్ అమెరికన్ బలగాలకు దొరకలేదప్పటికి.

ఇపుడు దీన్నేమందాం
జాతుల పాలి పగా
కాదు కాదు పెట్రో లూటీ సెగా!

టైగ్రిస్ నది వంతెన మీద జరుగుతున్న షియా మతానికి సంబంధించిన మత ఉత్సవంలో సూసైడ్ బాంబర్స్ ఉన్నారని పుకారు లేవటంలో కూడా అమెరికా హస్తం ఉందంటాడు కవి. ట్యాంకులనిండిన యుద్ధ విమానాలని అమెరికా పోగు చేసుకునే ఉత్సాహంలో ఇరు దేశాల్లో జరిగిన మారణ హోమాన్ని ప్రశ్నిస్తాడు కవి. కత్రినా తూ ఫాన్ సమయంలో సహాయ చర్యలకు కూడా రాలేని సైన్యం, ఇరాక్లోని పెట్రోలియం పైపులైన్లకు పహారా కాస్తున్నారని ఎద్దావా చేస్తాడీ కవితలో. ఇటువంటి కవితలు చేయటంలో కవి సమగ్ర విషయావగాహన స్పష్టమవుతుంది. అమెరికన్ మీడియా చూపించే డొల్ల యుద్ధ సమాచారాన్ని పక్కకి తోసి, లోకానికి సత్యాన్ని తెలియజేసే పనిలో కృతకృత్యుడవుతాడీ కవి.

ఇసుక గడియారం
-------------------------
              డా. జయధీర్ తిరుమల రావు
              9/10/2005

అహంభావ భాస్వరంతో
మాంసం శకలాలు కాల్తున్న కాష్టంలా దేశాలు

విచక్షణ చక్షువుల్ని పొడిచి
ఆ దేశాలనిండా మరుభూములు మొలిపించాడు వీడు

ఈ రణ పిపాసి ఆత్మ
రెండు దేశాల్లో ఒకే వ్యూహం
ఒకటి గాల్లో
ఓటి శ్వేతమందిరం జారుడు లాన్ లో

వినాశం కావాలి
అణ్వాయుధాల్లేని పెట్రో దేశం
తులతూ గాలి
అణువణువు అణ్వస్త్ర సంపదగల నేల

టైగ్రిస్ వంతెనపై నరబలి పథకం
లేని మానవబాంబు పుకారు
పుట్టించిన వాళ్ళ కుట్రేమిటో అందరికీ తెలియాలి

షియా సున్నీ సోదరులున్న చోట
వారి మధ్య
విద్వేష పూరిత ఖరీదైన నివేదికొకటి ఖరారు
ప్రతి అమెరికా వాడు
గుడ్డిగా చెల్లించిన సుంకాలే కదా దానికాధారం
ఒకరిద్దరి హతం కోసం
వేలాది ఉగ్రవాదుల తయారీకి ఆజ్యం
కోట్లాది పౌరుల బహిరంగ మౌనాంగీకారం
అనివార్య విశ్లేషణీయం

రసాయనం నిండిన
పాగా చుట్టిన తలల కిందిభాగం
శూన్యంలో పేలితే బాగుండు
రెండు చేతులు చాచిన దువాలో
కూలిన శిఖరాల్లో నుసైన మనిషి
ఆనవాలు కనిపిస్తే బాగుండు

ఆదివారం ఉదయాన
మెడలో వేలాడే శిలువల సాక్షిగా
నలుగురు కలిసి చదివే సువార్త అధ్యాయాల్లో
రెండు దేశాల ఆర్త నాదాలు వినపడితే బాగుండు

ఇపుడు దీన్నేమందాం
జాతుల పాలి పగా
కాదు కాదు పెట్రో లూటీ సెగా!

ట్యాంకులు నిండాలనే కదా వాడి కుతంత్రాలు
ట్యాంకులు నిండిన విమానాలే వాడి ఆయుధాలు
మనుషుల్ని లైన్లుగా నిలబెట్టండి
దేశాలు నేలమట్టమైతే ఏమిటి
పైపులైనులు మాత్రం భద్రం
ఇరు దేశాల అస్థి పంజరాల్ని
సున్నం ముద్దలు చేసి
పైపులకి కడ్తూ పోండి సేఫ్ వాల్

కత్రినా తుఫాను సహాయంలో
అమెరికా సైనికులు లేకున్నా ఫరవాలేదు
పైపులూ, పెట్రో బేరల్స్ చుట్ఠూరి
కాపలా కాయాలంతే
మిలటరీ పహారా మాత్రం జాగ్రత్త

అరెరే! నలుగురి నిర్మూలన పేరుతో
మతాల రీతులూ
మానవ జాతులూ లోతుగా పీకలదాకా
కూరుకుతోతున్నాయి
మరో విధ్వంసంలోకి
గడియారం రెండువైపులా పారే ఇసుకలా

ఇటువంటి కవిత చదివితే అమెరికా ఎంత మోసపూరిత దేశమో అర్థమవుతుంది. ప్రజాస్వామ్యం లేదు పునరుద్ధరిస్తామంటూ , నియంతృత్వం ఉంది కూలదోస్తామంటూ, ఉగ్రవాదాన్ని రూపుమాపటానికి ఉగ్రవాదం మీద పోరు అంటూ ఎపుడూ అమెరికా ఎందుకు యుద్ధోన్ముకురాలై ఉంటుందో తెలుస్తుంది. ఆకాశ మార్గం నుంచి ఎత్తుకొచ్చే బాంబుల ద్వారా లక్షల ప్రాణాల్ని సెకండ్లలో అంతమొందించటాన్ని మనం ఉగ్రవాదమనీ, బుష్ ని ఉగ్రవాది అని ఇంకా మనం గుర్తించక పోవటం ఏంటోనని ఆశ్చర్యం వేస్తుంది. అంతేకాక ఈ రోజు ప్రపంచాన్ని పట్టి పీడిస్తుందనుకుంటున్న ఉగ్రవాద మూలాలు అమెరికా ఫారిన పాలసీ, వార్ ఎకానమీలో ఉన్నాయని తెలుస్తుంది. 2004 లో విలియం బ్లూమ్ రాసిన 'మోసపూరిత రాజ్యం' (Rogue state)  అనే పుస్తకంలో ఒసామా బిన్ లాడెన్ అన్నట్టుగా చెప్పబడుతున్న మాటల్ని ఇక్కడ ఉంచుతున్నాను. ఎందుకంటే ఈ ఉగ్రవాది మాటల్లో ఉగ్రవాదానికొక సమాధానం దొరకొచ్చు.
"If I were president, I could stop terrorist attack against united States in few days, permanently.
I would first apologize- very publicly and sinicerely to all the widows and orphans, the improvished and tortured, and the many millions of the victims of American Imperialism.
Then I would announce to every corner of the world that America's global military intervention has come to an end".

1/6/16
(కవిత్వ సందర్భం 19)

No comments:

Post a Comment