Friday, 10 June 2016

మంత్రలిపి లో మర్మము

మంత్రలిపి లో మర్మము
------------------------------

తత్వవేత్తలు ప్రపంచాన్ని వ్యాఖ్యానించేశారు, ఇక మార్చటమొక్కటే మిగిలిందన్నాడు మార్క్స్. కానీ ఎలా మార్చాలన్నది నిరంతర ప్రశ్నే. మార్చాలని చేసే ప్రతీ ప్రయత్నమూ ఒక వ్యాఖ్యానంలా మిగిలిపోవటానికి కారణం మనం ప్రపంచాన్ని చూసి అవగతం చేసుకునే ఫ్రేం ఆఫ్ రిఫరెన్సు మారకపోవటమే. అయినా అనుభవాల నిధిలోనుంచి ప్రపంచాన్ని అనుభూతి చెందుతూ తన ఫ్రేం ఆఫ్ రిఫరెన్సు నుండి కాస్త బయటకు వచ్చి మనకు ప్రపంచాన్ని గురించి చెప్పే ప్రయత్నం చేయాలనుకుంటాడు కవి కొనకంచి. ఆయన కవి కాబట్టి, అక్షరం తన మీడియం కాబట్టి, తను పరిచయం చేయబోయే ప్రపంచానికి కావలసిన పరికరంగా తనకు తాను ఒక లిపిని ఏర్పరచుకుంటాడు. దాన్నే ఆయన మంత్రలిపి అంటాడు. ఒక లిపి ఒక భాషని తెలుసుకోవటానికి ఉపయోగపడితే మంత్రలిపి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. కవి కన్నుల ద్వార ప్రపంచాన్ని చూపించటానికే ఈ మంత్రలిపి.

కాలాన్ని జయించటానికి పుట్టిన
వెయ్యి చేతుల జననమే
ఒక తంత్ర లిపి..ఒక మంత్ర లిపి

జీవన గమనంలో తారసపడిన వ్యక్తులనీ, విషయాలనీ, వాటి వెనుక పోగైవున్న అనుభవ భాండాగారాన్నీ రంగరించి కుప్పగా ఒక చోట పోసి, ఇంకా చెప్పాలంటే అంతటినీ ఒక జోలెలో వేసి, ఏది చేతికొస్తే అది అందిస్తూ పోతాడు కవి. ఏదో అందమైన కానుక పిల్లలకు ఇద్దామనుకున్న క్రిస్టమస్ తాత తన జోలెలోకి చేతులు పెట్టి, చేతికి ఏది దొరికినా దానిని బహుమతిగా పిల్లలకు అందిస్తూ పోతాడో..అలాగే ఒక ఆర్తినీ, ఒక బాధనీ నింపుకున్న కవి, సమాజపు హిపోక్రసీని అణువణువునా చూడగలిగిన కవి, తన వారికి ఏదో చెప్పాలనీ, తనవారికి సమాజం గురించిన తెలివిడిని కలిగించాలని తాపత్రయ పడే కవి, తన మనసు జోలెలోంచి వచ్చిన ప్రతీ అనుభవాన్నీ, బాధనీ, అంశాన్నీ, మన ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాడు. సమాజాన్ని మేల్కొల్పాలి అనే అంతస్సూత్రం ఆధారంగా ప్రతీ కవితా సాగుతుంది, దానికి కవి యొక్క అపారమైన అనుభవజ్ఞత పునాదులు వేస్తుంది. ఒకే అంశాన్ని వివిధ దృక్కోణాలతో ఒకే చోట ఆవిష్కరించాలంటే విషయం మీద లోతైన అవగాహన ఉండాలి. అంతే కాకా పాఠకుడిని చదివి౦చగలిగే నైపుణ్యత ఉండాలి. ఆ రెండూ కొనకంచిగారికి మెండుగా ఉన్నాయనిపిస్తుంది. మెటేరియాలిస్టిక్ ప్రపంచాన్ని వ్యాఖ్యానించటానికి కొనకించి గారు తీసుకునే పరికరాలు అపారమయినవి. మొదటి పరికరం నగ్నత్వం. తన ముందున్న సమాజాన్ని ఉన్నది ఉన్నట్టుగా నగ్న౦గా ఏ తొడుగులు లేకుండా వ్యాఖ్యానిస్తాడు కవి. ఐతే మెటీరియలిస్టిక్ సమాజాన్ని వ్యాఖ్యానించేటపుడు అంతే మెటీరియలిస్టిక్ గా నిర్దాక్షిణ్యంగా కనబడే కవి ప్రేమ భావనని తెలిపే కవితల్లో తన ఆంతరంగిక లోకాల్ని సునిశితంగా ఆవిష్కరిస్తాడు.

ఈ దేశంలో ప్రజలు ఓటేసిన మర్నాడే
అనాథలై పోతారు
ఈ దేశంలో ప్రజలు ఓటేసిన మర్నాడే
దిక్కులేనో  అయిపోతారు
ఈ దేశంలో ప్రజలు ఓటేసిన మర్నాడే
వీధి కుక్కలై పోతారు
అని కఠినంగా నిష్కర్షగా చెప్పగలిగిన కవి, మరచిపోయాడనుకున్న ప్రేయసి గుర్తుకొచ్చినపుడు మాత్రం...

అడ్రస్ లేని ఉత్తరంలా
నన్నెవరు రాసారో తెలియదు
నేను చేరాల్సిన
యజమాని ఎవరో తెలీదు అని సున్నితంగా మారిపోతాడు. ఇది అవసరాన్ని బట్టి భాషను భావాన్ని కవి ఎంచుకోవటం లోని జాగ్రత్తని చూపిస్తుంది.

పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయిన వివేక్ ని ఉద్దేశిస్తూ...
తూ ర్పు మారలేదు పడమర మారలేదు
ప్రభుత్వాలుకూడా మారలేదు
జెండా మాత్రమే మారిందని
మా అందరికీ చెప్పటానికి
జనం మీద ప్రేమతో
ఫోటోగా మారావు కదరా.. అని అడుగుతూ..యవ్వనంలో ప్రేమభావనల్నీ, ఐమాక్స్ థియేటర్లనీ కాదని విప్లవ భావాలు చేతపట్టుకున్న వారికి ఈ దేశంలో   విప్లవ భావాలు కలిగి ఉన్నంత మాత్రాన ఒరిగేదేమీలేదు, అబద్దాలు నిండిన ఈ దేశంలో అబద్ధం లా బతకడమే హాయని నిష్కర్షగా బతుకులోని డొల్లతనాన్ని తెలిపే ప్రయత్నం చేస్తాడు.

కవి ఈ కవిత్వం రాయటంలోని ఆంతర్యాన్ని చాలా చోట్ల వ్యక్త పరుస్తాడు. కవి స్వతహాగా విప్లవకారుడు. మౌనంగా ఉండాలాని అనుకొడు. నిష్కర్షగా మాట్లాడటం ప్రశ్నించటం అలవాడిన కవి దేన్నో చూసి భయపడే అవసరం ఏముంటుంది? అసలు ఏమి మాట్లాడకుండా కూర్చోవటమే..చుట్టూ జరిగే అన్యాయాలకు సగం అంగీకారం తెలిపినట్టేనని అంటాడు కవి ( ఈ అర్ధాంగీకారమే కదూ..) టీవీ ల్లో పత్రికల్లో ఒచేంత అబద్దాలని చూసి కూడా అదేమని అడగమెందుకని వ్యంగ్య౦గా ప్రశ్నిస్తాడీ కవితలో. అన్నం పండించే రైతును అతడి చుట్టూ రాబందుల్లాగా తయారయిన రాజకీయ స్వార్థాల్ని చూసి...రైతును ప్రాణమున్న శవమని సమాధిమీద వాక్యమనీ అభివర్ణిస్తాడు. అలాగే రాజకీయ నాయకుడి వివిధ రూపాల్ని పొగడరా ని తల్లి భూమి భారతి అనే కవితలో వివరిస్తాడు. ఇలా తీసుకున్న అంశం ఏదయినా విస్తారంగా వివరించగల సత్తా కొనకంచిగారి ప్రత్యేకత.

ఈ పుస్తకం లో 54 కవితలున్నాయి. ఇవన్నీ మనకు ప్రపంచాన్ని ఒక కెలిడియోస్కోపు లో చూపినట్టు చూపిస్తాయి. ఒక్కో కవిత ఒక్కో విశాలమైన అనుభవానికి దారి చూపిస్తుంది. కవిత శీర్షికను మరచిపోతే కవిత మనకు అంతు చిక్కదు. అందుకే శీర్షికను మనసులో పట్టుకుని కవితను చదివితే తప్ప కవి అంతరంగం అంత సులువుగా మనకు పట్టుబడదు. అదే టెక్నిక్. కవిత కు శీర్షిక పెట్టడం లో కవి శ్రద్ధ మనకు దీన్ని బట్టి అర్థం ఔతుంది. కాని కొన్ని చోట్ల కవిత నిడివి పెరగటం వలన పాఠకుడు చెప్పబడుతున్న అంశం నుండి పక్కకు జరిగే ప్రమాదం ఉంటుంది. కవి చేయి వొదిలి ఎటో పడిపోయినట్టు అనిపిస్తుంటుంది. అందుకే శీర్షిక అనేది కవి మనకు అందించిన ఒక చేయిలా అనిపిస్తుంటుంది. మొత్తానికి ఒక నూతన ప్రపంచాన్ని స్వప్నించే వ్యక్తి ఈ ప్రపంచాన్ని ముందుగా బద్దలు కొట్టాల్సి ఉంటుంది. మంత్రలిపి నూతన ప్రపంచాన్ని కోరుకునే వారికి , ఈ ఉన్న అబద్ధపు ప్రపంచాన్ని బద్దలు కొట్టడానికి ఒక ఆయుధం లా ఉపయోగపడుతుంది. మనసు విప్లవీకరింపబడటానికి సహాయ పడుతుంది. ఇటువంటి ఎన్నో కవిత సంపుటీలు కొనకంచిగారు తేవాలని కోరుకుంటున్నాను.

10/6/16

No comments:

Post a Comment