Thursday, 9 June 2016

కవిత్వ సందర్భం 20 svsatyanatayana

మార్పే జీవితం.
-------------------

"మార్పు అనే పద్దతి ద్వారా భవిష్యత్తు మనల్ని ఆక్రమిస్తుంది" అంటాడు ఆల్విన్ టోఫ్లర్. గడిచిన నాలుగు శతాబ్దాలలో మానవ జీవితంలో ఎంతయితే మార్పు వచ్చిందో, అంతకన్నా ఎక్కువగానే గత నాలుగు దశాబ్దాల్లో వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఒక నిర్ణీత సమయంలో వచ్చిన మార్పు (మార్పు రేటు) విపరీతమైపోయినపుడు, మానవ మనుగడలో రెండు ప్రధానమైన ప్రశ్నలు తలెత్తుతాయి. ఒకటి, వస్తున్న మార్పుకు అనుగుణంగా మనిషి తన మనస్సును సమాయత్త పరుచుకుంటున్నాడా?. రెండు, వస్తున్న మార్పుకు అనుగుణంగా మనిషి తన జీవితాన్ని మలుచుకుంటున్నాడా?. వస్తున్న రాపిడ్ చేంజ్కి అనుగుణంగా మనిషి తన జీవితాన్ని మలుచుకుంటున్నప్పటికీ మానసికంగా మార్పును ఆహ్వానించలేని పరిస్థితి ఏదైతే ఉంటుందో అది మనిషిలో తీవ్రమైన ఒత్తిడినీ, సంఘర్షణనీ కలుగజేస్తుంది. అంటే మనిషి జీవితానికీ, మనసుకీ మధ్యన ఒక ల్యాగ్ కనిపిస్తుంటుంది. మార్పు తీసుకువచ్చిన పరుగు పందెంలో మనసు జీవితానికన్నా వెనుకబడినట్టు కనిపిస్తుంటుంది. ఈ ల్యాగ్ మనిషి యొక్క అంతరంగిక జీవితంలో మానసిక సంఘర్షణనీ, బాహ్య జీవితంలో రెండు వరుస తరాల మధ్య స్పష్టమైన కాన్ఫ్లిక్ట్ నీ ప్రతిబింబిస్తుంటుంది. ఇటువంటి ఒక పరిస్థితి మనకు కవి ఎస్వీ సత్యనారాయణ కవితలో కనిపిస్తుంది. కవిత్వం ఆ కాలపు పారలెల్ చరిత్రను అందిస్తుంది అనటానికి ఇటువంటి కవితలు నిదర్శనంగా నిలుస్తాయి.

సాధారణంగా మనం, ఓల్డేజ్ హోం లు పెరిగిపోయాయనీ, ఛైల్డ్ కేర్ సెంటర్లు పెరిగిపోయాయనీ మనుషుల్లో మానవత్వం నశించిపోయిందనీ, మానవ సంబంధాలు డబ్బుచుట్టూ తిరుగుతున్నాయనీ, కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నమైపోయిందనీ చాలా సార్లు వాపోతూ ఉంటాం.  ఇవన్నీ గత తరం చూడని , ఈ తరం చూస్తున్న సామాజిక వాస్తవాలు. ఇవన్నీ ఆధునిక సైన్స్ అండ్ టెక్నాలజీ తనతో పాటు సమాజం లోకి తీసుకు వొచ్చిన విషయాలు. నిజంగా వీటి అవసరం ఈనాటి సమాజం లో ఉందా!? నిజంగానే మనుషుల్లో మానవత్వం కొరవడిందా? మనిషి జీవితం డబ్బు చుట్టే తిరుగుతుందా? మనవ సంబంధాలు మరీ బలహీన పడిపోయాయా? ఇటువంటి ఎన్నింటికో ఒక తాత్విక, వాస్తవిక సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాడు కవి. తన జీవితాన్ని వ్యాఖ్యానిస్తూనే సమాజం లో ఈ అర్ధ శతాబ్ద కాలంలో వచ్చిన 'రాపిడ్ ఛేంజ్' అనేది, మనుషుల జీవితాల్లో, వారి మధ్య సంబంధ బాంధవ్యల్లో, వారి ఆలోచనా దృక్పథాల్లో ఎంతటి మార్పును తీసుకొచ్చిందో చెప్పే ప్రయత్నంలో పారలెల్ చరిత్రని కూడా అక్షరబద్ధం చేస్తాడు. రెండు వరుస తరాల మధ్య ఆలోచనల మధ్య వచ్చిన అంతరాల్నీ, తద్వారా మానవ సంబంధాల్లో వచ్చిన సంఘర్షణనీ, మానసిక వొత్తిడినీ ప్రధాన అంశంగా చేసుకుని "పుత్రాగ్రహం" అని కవిత్వం చేస్తాడు. ఈ పుత్రాగ్రహానికి కారణం తరాలు మారేంత వ్యవధిలో వచ్చిన రాపిడ్ ఛేంజ్ మాత్రమే.

భారత సమాజం అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలాగే స్వతహాగా సామూహిక భావజాలాన్ని కలిగి వున్న సమాజం. ఒకరి మీద ఒకరు ఆధారపడటం, సహకరించుకోవటం అన్నది వారి స్వభావం. పశ్చిమ దేశాలు సామాజిక భావజాలాన్ని కాక వ్యక్తిగత భావజాలాన్ని కలిగి ఉంటాయి. పశ్చిమ దేశాల వారితో పోల్చుకుంటే భారతీయులు ఎక్కువగా తమ వారి మీద ఆధారపడతారనేది నిర్వివాదాంశం. భారతీయులకు సాధారణంగా వ్యక్తిగతం అనేది ఉండదు. అన్నిటినీ కుటుంబ సభ్యులతో కలిసి పంచుకోవటం అనేది వారి సైకాలజీలో ఒక భాగం. అందుకే వ్యక్తిగత విషయాలమీద దృష్టిని కేంద్రీకరించే పాశ్చాత్య సైకో అనాలిసిస్ విధానం భారత దేశంలో పనిచేయదు అంటారు సైకో అనలిస్టు వర్మ (1982). కానీ గత కొన్ని దశాబ్దాలుగా ముఖ్య౦గా 1991 ఆర్ధిక సంస్కరణల తరువాత భారత సమాజంలో వచ్చిన మార్పులు, కుటుంబ నిర్మాణాన్ని సమూలంగా మార్చి వేశాయి. భారతీయ సమాజం కూడా పశ్చిమ సమాజాల వలే వ్యక్తిగత భావజాలాన్ని సంతరించుకు౦టోంది. కుటుంబ వ్యవస్థ స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోయాయి. ఉమ్మడి కుటుంబాల నుండి న్యూక్లియార్ కుటుంబాలుగా మారాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS) 1991 జనాభా లెక్కలలో మొట్టమొదటి సారి బయటపడిన విషయం ఏమంటే, కుటుంబాల పెరుగుదల రేటు జనాభా పెరుగుదల రేటు కంటే ఎక్కువగా ఉండటం.  ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిత్తి జరిగి న్యూక్లియార్ ఫ్యామిలీస్ గా విడిపోవటాన్ని ఇది సూచిస్తుంది. ఈ రేటు తరువాతి జనాభా లెక్కలలో (2001, 2010) ఇంకా విపరీతంగా పెరిగిపోయిందంటారు గణకారులు.  కవి అటువంటి న్యూక్లియర్ ఫామిలీ లో ఒకడిగా కనిపిస్తాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వార modernize అయిన భారత సమాజం లో వొచ్చిన నూతన ఉద్యోగాలు, నూతన జీవన పద్దతులు- దీన్నే ఒక ఇతివృత్తంగా తీసుకుని  ఒక కుటుంబం లోని ఒక వ్యక్తిగా తన తరానికి తన ముందున్న తరానికి మధ్యనున్న కాన్ఫ్లిక్ట్ ని కవి స్పష్టంగా చూపిస్తాడు. కలెక్టివ్ దృక్పథం నుంచి, ఇండివిడ్యువల్ దృక్పథానికి మారిపోయిన తరం, తనముందున్న కలెక్టివ్ దృక్పథానికి చెందిన తరాన్ని ప్రశ్నించే కవిత ఇది. తల్లి దండ్రులకు fathers day , mothers day లకు గ్రీటింగ్ కార్డ్స్ పంపటమూ- ఈ మెయిల్ చెయ్యడామూ - కొరియర్ లో పంపడమూ ఓక తరానికి విడ్డూరంగా తోస్తే, అంతకు మించి వేరే గత్య౦తరం లేకపోవటం ఇంకో తరానిది. అంతే కాక స్వీయ మానసిక సంఘర్షణ ని తన ముందు తరానికి తెలియజెప్పడం ద్వారా జనరేషనల్ కాన్ఫ్లిక్ట్ ని తగ్గించి దాని స్థానంలో అర్థం చేసుకోవటాన్ని అవగాహన చేసుకోవటాన్ని ప్రవేశ పెడతాడు.

సైన్స్ అండ్ టెక్నాలజీ యుగంలో మనిషి సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలోని కంప్యూటర్ అనే యంత్రం యొక్క విడిభాగం మాత్రమే.విదేశీ డాలర్లు సంపాదించి పెట్టే ఒక డబ్బు యంత్ర౦ మాత్రమే. ఇండియాలో ఇండియన్ లా కనిపించే ఒక కాల్ సెంటర్ వెస్టర్నర్. ఇటువంటి ఒక మానవుడిని సృష్టించడానికి స్కూళ్లూ కాలేజీలు ఉంటాయి, ఇటువంటి మానవుడిని తమ పిల్లల్లో చూసుకోడానికే తల్లిదండ్రులు అహర్నిషలూ కష్టపడతుంటారు. అటువంటి మానవుడు ఒకడు తయారయినాక, జీవితంతో పాటు పరిగెత్తలేని మనసుకల తల్లిదండ్రులు పిల్లల నుంచి ప్రేమ రాహిత్యాన్ని అనుభవిస్తే, ఆ గ్యాప్ ని నింపటం కోసం పిల్లలు గ్రీటింగ్ కార్డ్స్ లలో ప్రేమను ఒలకబోసే మెసేజ్లకోసం నెట్ సర్ఫింగ్ చేస్తుంటారు. తల్లిదండ్రులకు ఫ్లవర్ బొక్కే లు కొరియర్ చేస్తుంటారు. Mothers day, Fathers day, Parents day కోసం ఒక్కో రోజు కేటాయించ బడుతుంది. వేల కోట్లలో ఆ రోజుల్లో బిజినెస్ జరుగుతూ  ఉంటుంది. బాల్యం డాలర్ల యంత్రం లో నలిగి పోతుంది. చైల్డ్ కేర్ సెంటర్ లో ఆధునిక౦ కాబడుతుంది. కానీ జీవితం మాత్రం మనసుకు అందకుండా నిరంతరం పరిగెడుతూ నే ఉంటుంది. వారాంతాల్లో రిసార్ట్ సెంటర్ లు కిట కిట లాడుతుంటాయి. జీవితంలోకి పరాయితనం ముంచుకొస్తుంది. భవిష్యత్తు అనుక్షణం మనిషి జీవితం మీద దురాక్రమణ చేస్తుంటుంది. "మార్పు అనేది జీవితపు అత్యావశ్యక విషయం కాదు,  మార్పే జీవితం". అని ఆల్విన్ టోఫ్లెర్  మరల మరల గుర్తుకు తెస్తుంటాడు.

పుత్రాగ్రహం
     డా ఎస్వీ. సత్యనారాయణ

మీరేకదా మమ్మల్ని మరబొమ్మలుగా తీర్చిదిద్దారు
డాలర్లు రాల్చే కల్ప వృక్షాలుగా కలగన్నారు
మాన్యులైన తల్లిదండ్రులారా!
మమ్మల్ని హాయిగా ఆడుకోనిచ్చారా? పాడుకోనిచ్చారా?
స్వేచ్ఛగా తిరగనిచ్చారా? పెరగనిచ్చారా?
అసలు బాల్యమంటే ఏమిటో తెలుసా మాకు?
మేం పుట్టక ముందే
మా పేర్లు పబ్లిక్ స్కూల్లో నమోదైపోయాక
డబ్బా పాల మాతృత్వాన్నీ, చైల్డ్ కేర్ సెంటర్ల సంరక్షణనూ పొందిన మేం
నేరుగా రెసిడెన్షియల్ స్కూల్లకు వెళ్ళామేగానీ
మీ గుండెలపై పడుకుని సేదదీరామా?
మీ కమ్మని కబుర్లు వింటూ కలలుగన్నామా?
అనురాగం, ఆత్మీయత, మమత, మనసు వంటి పదాలు
మీ నిఘంటువుల్లో మాకు నేర్పించారా?

చిన్నప్పట్నించీ ఎప్పటికప్పుడు ఏవేవో లక్ష్యాల్ని నిర్దేశిస్తూ
పాఠ్య ప్రణాలికల్ని మా మెదళ్ళ పై రుద్దుతూ
గానుగెద్దులు తిప్పారే తప్ప
మా ఇష్టానిష్టాలనూ, అభిరుచులనూ పట్టించుకున్నారా?
అసలు మమ్మల్ని మనుషులుగా పరిగణించారా?
మీరే కదా మమ్మల్ని ఈ ఊబిలోకి నెట్టేశారు
బయట పడలేక..పడినా ఇమడలేక
నీటిలో కొట్టుకుంటున్న చేవ చచ్చిన చేపలం మేం

మాకూ స్వేచ్ఛగా ఎగరాలనే ఉంటుంది పక్షుల్లా
హాయిగా విరబూయాలనే ఉంటుంది పారిజాతాల్లా
అందంగా దూకాలనే ఉంటుంది జలపాతాల్లా
అయినా ఎలా సాధ్యమవుతుందో చెప్పండి?

ప్రియమైన జన్మదాతలారా!
బహుల జాతి కంపెనీలకు,బానిసలమైన మేం
రోజుకు పన్నెండు గంటలపాటు పనిచేసి
ఒక్కసారి రోడ్డు మీద పడగానే
అడ్డొచ్చిన వాడినల్లా బండబూతులు తిట్టాలనిపిస్తుంటుంది
అంతలోనే మేం నేర్చుకున్న వ్యక్తిత్వ వికాసం పాఠాలు గుర్తొస్తాయి

పళ్ళ బిగువున కోపాన్ని దాచుకుని
పెదాలపై చిరునవ్వులు ప్రసరిస్తాం
చిరాకు పరాకులను అణచుకుని
బాడీ లాంగ్వేజీలో వినయ విధేయతలు ప్రదర్శించడం
ఎంత కష్టమో ఊహించండి?!

మిమ్మల్ని మేం ప్రేమించట్లేదనీ...పట్టించుకోవట్లేదనీ
మా సుఖాన్ని మేం చూసుకుంటున్నామనీ
నిందలు వేయకండి
అసలు మేం సుఖపడిపోతున్నామని ఎలా భావిస్తున్నారు?.
మాకున్న ప్రాజెక్టులూ... అసైన్మెంట్లూ..
డెడ్ లైన్లతోనే చస్తుంటే
మీతో హాయిగా గడపడం ఎలా సాధ్యమో చెప్పండి
దొరికే వారానికొక్కరోజు
నిర్వేదం, నిట్టూర్పులూ, మూలుగుల మధ్య నలిగిపోవాలో
రిసార్ట్ సెంటర్లో రీచార్జీ కావాలో
నిజాయితీగా సమాధానం చెప్పండి

మీకేం మీరు వృద్ధాప్యంలోనూ
తోడూ నీడగా ఉంటున్నారు
మేం యవ్వనంలోనే ద్వీపాలుగా బతుకుతున్నాం
అయినా...మొన్ననే కదా మదర్స్ డే గ్రీటింగ్ కార్డ్ పంపాం
నిన్ననే కదా ఫాదర్స్ డే ఫ్లవర్ బుకే కొరియర్ చేశాం
మళ్లీ ఇపుడు పేరెంట్స్ డే అంటున్నారేమిటి???

కవిత్వ సందర్భం 20
8/6/16

No comments:

Post a Comment