Thursday, 9 June 2016

విమర్శను విమర్శించుడేంది?

విమర్శను విమర్శించుడేంది?
---------------------------------------

విమర్శ రెండు తీర్లుంటది. ఒకటేమో మన తప్పుల్ని చూపిచ్చి మనకు తెలివిలేదని గేలి చేసినట్టుండెడిది. ఇంకోటేమో మన తప్పుల్ని చూపిచ్చి మనల్ని సరిచూసుకోమని చెప్పెడిది. ఈ మొదటి రకం విమర్శ మనమంటే గిట్టనోల్లు చేసెడిది. రెండో రకం విమర్శ మనోల్లు, మనమంటే ప్రేమున్నోల్లు చేసెడిది. మనయ్యలు మనల్ని తిట్టేడ్ది కూడా మనం మంచిగుండాలనే తిడ్తరు గదా. మనం మంచిగనే ఉంటం. ఇంకా జరింత మంచిగుండాలనే అయ్యలు తిడ్తుంటరు. గసుంటిదే ఈ రెండో రకం విమర్శ. ఇపుడు కోదండరాం సారు గిసుంటి విమర్శనే చేయవట్టిండు. మనం వోట్లేసి గెల్చుకున్న సర్కారు ఇంకా మంచిగ పనిచేయాలని కొన్ని సూచనలిచ్చిండు. దానికి అధికార పక్షం వాల్లు గాయ్ గాయ్ చేత్తుండ్రు.

సాధారణంగా ఒక రాజ్యంల రెండు పక్షాలుంటై. అధికార పక్షం, ప్రతి పక్షం. ఏదైనా పాలనకి సంబంధించన రివ్యూ చేయాల్సి వస్తే, అధికార పక్షం వోల్లు వాండ్లకి అనుకూలంగా చేసుకుంటే, ప్రతి పక్షం వాండ్లు వాండ్లకి అనుకూలంగా చేసుకుంటరు. ఉగాదికి అయ్యోల్లు అధికార పక్షం దగ్గర ఒక తీరుగా, ప్రతిపక్షం దగ్గర ఒకతీరుగా పంచాంగం చదివినట్టే ఉంటదీ యవ్వారం. ఇంగ, చదువుకున్న మేధావులు గూడ్క ఏదో పక్షం వైపు వొంగి తలలాడించుడు చూస్తుంటాం. పొరపాటున ఎవడన్నా అధికార పక్షం లోపాల్ని ఎత్తి చూపిస్తే, వాడిని నిర్ద్వంద్వంగా ప్రతిపక్షపుటోడని ముద్ర వేయటం చూస్తుంటాం. ఇపుడు మన తెలంగాణల గూడ్క గిసుంటి పోకడలు కన్పిస్తున్నయి. కోదండరాం సారు తప్పనిసరిగా టీఆరెస్స్ కే వోటేసి వుంటడు. అంతమాత్రాన ఆయన పొద్దుమూకల టీఆరెస్ ని పొగడాలని రూలైతే ఉండది కదా. తప్పులు ఎత్తి సూపటందుకు ఆయనెవరు? అని అంటుండ్రు కొంతమంది. ఆయన కూడా మనలక్క ఓటేసినాయనే కదా. ఓటేసి ఈ టీఆరెస్స్ ను గెలిపించినాయనే కదా. ఆయనకు అడిగే అధికారం లేదంటే ఓటరుకు ఓటేసినంక అడిగే అధికారం లేదన్నట్టే. "ప్రశ్నిస్తా" అని పార్టీలు పెట్టి పత్తాలేకుండా పోయానోల్లు మన రాష్ట్రం లో లేరు సరికదా, అలా అనకుండనే ప్రశ్నించే మనుషులు ఉన్నందుకు మనం సంతోషపడాలె. అటు అధికార పక్షం వాండ్లు అంత పొడూ చేసినం, ఇంత పొడూ చేసినం అని గొప్పలు చెప్పుకుంటే, ప్రతిపక్షం వాండ్లు అక్కడేంది అట్లుంది, ఇక్కడేంది ఇట్లయితాందని నసుగుతుంటరు. కానీ అసలుకేం జరుగుతాందని బేరీజు వోల్లు చేయాలే? ఎట్లా సామాన్య జనానికి తెలవాలె?. గసుంటప్పుడే మన కోదండరాం సారసుంటోల్లు, హరగోపాల్ సారసంటోల్లు ముందుకు రావాలె. వొచ్చి ప్రజానీకానికి అసలుకేం జరుగుతుందో చెప్పాలె. ఏ పక్షపాతమూ లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేటోల్లు, ప్రజల పక్షం వహించెటోల్లు మనకైతే కావాలె కదా.

 చదువుకున్నోల్లు బాధ్యత తీసుకుని ఇట్లా ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడుడు, పక్షపాత రహితంగా, పార్టీవ్రత్యాలకు దూరంగా ఉండుడు చాలా శుభపరిణామం. బహుశా దేశంల గిసుంటి చైతన్యం ఎక్కడా ఉండదనుకుంటా. మేధావి తనం ఎవరో ఒకరి పంతన చేరకుండా స్వతంత్ర్యంగా వుండుడు బహుశా మన తెలంగాణలనే ఉందనుకుంటా. ఏది ఏమయినా, పాలకపక్షానికీ, ప్రతి పక్షానికీ అతీతంగా ఒక ప్రజా పక్షం ఉంటదని, దానికి ప్రశ్నించే హక్కు ఉంటదని కోదండరాం సారు నిరూపించిండు. ఇగ సారు మాట్లాడుడు షురూ జేయంగనే అధికార పక్షం వోల్లు లొల్లి జేయుడు బీ షురూ జేసిండ్రు. ఒకాయనేమో కాంగ్రేసోల్ల ఏజెంటంటడు. నిజానికి ఈ మాట వింటే కాంగ్రేసోల్లకు గూడ్క సంతోషమైతుంటది కావొచ్చు. బై ఎలక్షన్లల చావు దెబ్బ తిన్న కాంగ్రేసుకు కోదండరాం సారసుంటోడు ఏజెంటంటే ఆ పార్టీ ఎగిరి గంతేస్తది కావొచ్చు. ఇట్లా సారును కాంగ్రేసుకు ఏజెంటు చేసి నిజంగనే కాంగ్రేసు బలాన్ని పెంచుతున్నరు అధికార పక్షపుటోల్లు. ఇన్ని రోజులు అసెంబ్లీల కావొచ్చు, లేదా బయట కావొచ్చు, "మీరు కంస్ట్రక్టివ్ క్రిటిసిజం చేయుర్రి బాధ్యతాయుతమైన విమర్శ చేయుర్రి మేము స్వీకరిస్తాం" అని పదే పదే చెప్పిన అధికార పక్షం వాండ్లు, ఇపుడు నిజంగానే కోదండరాం సారు బాధ్యతాయుత విమర్శను పట్టుకొస్తే ఎందుకాగం ఆగం ఐతుండ్రో అర్థం ఐతలేదు. దీన్ని కూడా గుడ్డి విమర్శ అని కొట్టిపారేయుడు ఎదురు దాడి చేయుడు ఏమి సంస్కారమో మరి?.

ఇపుడు కోదండరాం సారు ఏదైతే చేసిండో అది ఆహ్వానించతగ్గ విషయం. చదువుకున్న మేధావులు ప్రొఫెసర్లు ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించుడు, మాట్లాడుడు చూస్తుంటే, బంగారు తెలంగాణా ఖాయమన్నట్లు తోస్తుంది. గిసుంటోల్ల పార్టిసిపేషన్ తెలంగాణాకి అవసరం. తెలంగాణా మేధావులు గుడ్డి దద్దమ్మలు కాదని సారు మరోసారి నిరూపించిండు. అటు పాలక పక్షానికో, ప్రతి పక్షానికో తమ తెలివిలు ధారబోసి కాలం గడిపే మేధావులలాగా తెలంగాణా మేధావి వర్గం లేదని, పాలకుడెవరయినా ఈ వర్గం ప్రజల పక్షం ఉన్నదని నిరూపించిండు. కోదండరాం సారు మరో మూడేండ్లకు మల్లా రివ్యూ చేస్తా అన్నడు. మూడేండ్లకు అంటే ఎలక్షన్ల టైం ల లొల్లి లొల్లి ఐతది గానీ, మరో రెండేండ్లకు మల్లా రివ్యూ చేయాలని కోరుకోవాలె. దూద్ కా దూద్ పానీకా పానీ బయటకు తీయాలె. జై తెలంగాణ.

No comments:

Post a Comment