Thursday, 9 June 2016

Opinions

*తెలంగాణా సర్కారు ఏది చేసినా తప్పు పట్టకూడదు అనే ధోరణి తెలంగాణా సంస్కృతికి వ్యతిరేకం.
ఉన్నది ఉన్నట్టు కుల్లం కుల్ల చెప్పుడు మన రక్తంలోనే ఉంటది.
ఇపుడు కోదండరాం సర్ గదే చేసిండు.
రెండేండ్ల పాలన మీద రివ్యూ చేసిండు, ఇంకేం చేయాల్నో, ఎట్లా చేయాల్నో దిశా నిర్దేశం చేసిండు.
ఒక రాజ్యంలోని మేధావులు మాట్లాడకపోతే, అధికార దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది.
మేధావులు ముందుకొచ్చి మంచి చెడులను బేరీజు చేసుకుని ముందుకు సాగటం, ప్రభుత్వ లోపాల్ని ఎత్తి చూపటం ఆహ్వానించ తగ్గ పరిణామం.
కొన్ని రాష్ట్రాల్లో అధికారులు ఏక పక్షంగా వ్యవహరిస్తూ ఏకఛత్రాధిపత్యంలా పరిపాలన సాగించటం చూస్తున్నాం.
అటువంటి పరిస్థితులకి కారణం, అక్కడ మేధావులు నిద్రపోవటమే.
తెలంగాణలో ఆ పరిస్థితి ఉండదు. ఇక్కడి సంస్కృతి అటువంటి మజ్జు నిద్రను గుడ్డి నిద్రను నేర్పదు.
బంగారు తెలంగాణాని సాధించుకొనుడంటే పాలకులు ఏది చేసినా జబ్బలు తడుముకొనుడు కాదు కదా..
ఎన్నుకున్న ప్రభుత్వం మంచి చేస్తే పొగుడుడూ ఉంటది, తప్పులు చేస్తే తెగుడుడూ ఉంటది.
అనుకున్న రీతిలో తెలంగాణా ప్రభుత్వం పని చేస్తలేదా అంటే చేస్తనే ఉన్నది. కానీ ఇంకా ఫలితాలు అందరికీ అందవలసి ఉన్నది.
ఆ దిశవైపు ఒక మేధావి అడుగులేయమని చెబితే, అధికారంలో ఉన్న మంత్రులు అగ్గి మీద గుగ్గిలం అవ్వుడు విచారకరం.
గిసుంటి కల్చర్ మనది కానే కాదు. విమర్శను హుందాగా స్వీకరించి మనల్ని మనం సరిచేసుకుని బంగారు తెలంగాణా వైపు అడుగులు వేయాలె.
మేధావులని వారి మాటలని అణచివేస్తామనుడు మన సంస్కృతి కానే కాదు
---------------------------------------------------

*రాజకీయాల్లో చెడ్డ తనానికి ఒక రిఫరెన్సు పాయింట్ మనకు దొరికినట్టే వుంది.
ఒక నాయకుడిని ఫలానా రాజకీయనాయకుడి కంటే మంచి వాడనో చెడ్డ వాడనో అని నిర్ణయించటానికి అనువుగా
చెడ్డతనానికి, మోసానికి మారు పేరుగా కొందరు నాయకులు తయారుకావటం మన అదృష్టంగానే భావించాలి.
ఇక ముందు ముందు రాజకీయ నాయకులని ఎంచుకునేటపుడు ఈ రిఫరెన్సు పాయింట్ లను ఆధారం చేసుకోవచ్చు. తద్వారా గజదొంగల స్థానంలో మామూలు దొంగలని, వీధి రౌడీల స్థానంలో చిల్లర రౌడీలనీ ఎన్నుకునే అవకాశం మనకు కలుగబోతోంది. గుడ్డిలో మెల్ల నయం కదా.
ఎటొచ్చీ, మంచి తనానికి రిఫరెన్సు పాయింటు దొరకకపోవటమే మన దురదృష్టం. వెతికినా దొరకదని తెలిసి వృధా ప్రయాసలెందుకు?. ఇప్పటికి ఇట్లానే కానిద్దాం.

-----------------------------------------------------
*తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు చంద్రులు
ఒకడు పక్కా లోకల్
ఇంకొకడు ఓన్లీ ఇంటర్నేషనల్
-------------------------------
*ఒకప్పుడు ఒక దేశాన్ని కబలించాలంటే దండయాత్ర చేయాల్సి వచ్చేది.
ఆ తరువాత దండయాత్రకు బదులు వ్యాపారం పేరుతో మొదలు పెట్టి వలసవాదంతో కొల్లగొట్టడం జరిగింది.
ఇప్పుడు ప్రపంచం అభివృద్ధి చెందిన దేశాలు, చెందుతున్న దేశాలు అని విడిపోయాక,
అభివృద్ధి చెందుతున్న దేశాల్ని కొల్లగొట్టటానికి ప్రపంచీకరణ అనే అస్త్రం ఉపయోగపడుతుంది. స్మూత్ కిల్లర్ అన్నమాట.
అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రపంచీకరణను చేపట్టడమంటే "రండి మమ్మల్ని కొల్లగొట్టండ"ని ఆహ్వానించటమే.
---------–-----------------------------------
* కొంత మంది రిలీజియస్లీ రిలీజియస్
మరికొంత మంది రిలీజియస్లీ అన్రిలీజియస్
ఈ రెండు రకాల వారికీ గొడవ. దేవుడున్నాడని ఒకరు, లేరని మరొకరు.
నిజానికి ప్రపంచంలో చాలా మంది అన్రిలీజియస్లీ రిలీజియస్.
ఎపుడో అవసరం వస్తేనో, పండగొస్తేనో తప్ప దేవుడు గుర్తుకురాని వారే.
ఈ అధిక సంఖ్యాకులైన వారిని అటు పూర్తి రిలీజియస్లీ రిలీజియస్ గానో..ఇటు పూర్తి రిలీజియస్లీ అన్రిలీజియస్ గానో
మలచటగలగటమే అసలైన దొంగల పని...ఈ దొంగలంతా పొలిటికల్లీ రిలీజియస్ అన్నమాట.
అదీ మేటర్!!
-------------------------------------------
*ప్రపంచంలోని  వైవిధ్యాలని గమనించి గౌరవించటం నేర్చుకుంటే, శాంతియుత సహజీవనం. నాగరికం.
వైవిధ్యాలను వైరుధ్యాలని పొరబడితే యుద్ధం. అనాగరికం
----------------------------------------------
* ప్రకృతి వైపరీత్యాలన్నీ క్రమతను సాధించటానికే
మానవ వైపరీత్యాలన్నీ అక్రమతను సృష్టించడానికే
----------------/////-------------------

No comments:

Post a Comment