Wednesday, 30 December 2015

విరించి || తరగతి గదిలో ఓ మూల ||
...............................
ఆ మూలలోని
ఆ నిశ్శబ్దం
ఆ రోజు
మా అందరితోనూ మాట్లాడింది.

సైలెన్స్ సైలెన్స్ అని అరవాల్సిన
అవసరం లేకుండానే
నిశ్శబ్దం ఆ గది అంతా
సహజ సిద్ధంగానే పరుచుకుని ఉంది

ప్రగతి వైపు నడిపించే తారు రోడ్డులా
ఒక నల్లటి బోర్డూ..
ఎంసెట్, ఐఐటీ కలల్ని
లెక్చర్లుగా లిఖించే
ఒక తెల్లటి చాక్ పీసూ..
ఆ లేలేత ముఖాల పిల్లల ముందు
తలదించుకుని నిలబడివున్నాయి.

భవిష్యత్తును భూతంగా చూపించే నేను
నాకు నేనొక ప్రేతంగా అనిపించ సాగాను
ఆ తరువాతి రోజయిన ఈరోజు
ఒక దయ్యంలా తరగతి గదిలోకడుగు పెట్టాననుకున్నాను

ఆ మూలగా కూర్చుని
పాఠం వింటున్నట్టుగా నటిస్తూ
నిదురపోయే ఆ పిల్లగాడు..
మీదకు విసిరిన చాక్ పీస్ ముక్కకు బదులుగా
చిరునవ్వు విసిరే ఆ కుర్రవాడు
వాడొక్కడే ఈరోజు మిస్సింగ్..
ఔను వాడొక్కడే మిస్సింగ్.

మార్కులు మార్కులు..
తరగతి గది మూలలో
ఒక చెదిరిపోని రిమార్కు

ర్యాంకులు ర్యాంకులు..
తరగతి గది మూలలో
ఆత్మహత్య చేసుకున్న ఒక ర్యాంకు

ఇపుడు తరగతి గదిలో
ఆ మూలనుండి ఓ నిశ్శబ్దం
మా అందరితోనూ మాట్లాడింది.
అల్లరి చేయటం శాశ్వతంగా ఆపేసి
మా అందరితోనూ నిశ్శబ్దంగా మాట్లాడింది
ఔను ఎన్నో విషయాలు మాట్లాడింది.

30/12/15

కవిత్వ సందర్భం- 6

ఏదీ...! ఎక్కడుంది ఆ ఇంధనం?.
...........................................
సునామీ అంటే అందరికీ తెలుస్తుంది. మెటియో సునామీ అంటే ఎవరికీ తెలియదు. కాదు, తెలియనీయలేదు. చేతకాని కొయ్యగుర్రం లాంటి ప్రభుత్వాలు, వ్యవస్థలు మనకు ఎన్నో విషయాల్ని తెలియనీయవు. దాచిపెడతాయి. సముద్రంలో భూకంపం వస్తే, సునామీ వస్తుందని మనకందరకూ తెలుసు. కానీ ఈ మధ్య వచ్చిన కమల్ హాసన్ 'దశావతారం' సినిమా, ప్రకృతికి మూర్తిమత్వాన్ని కలిగించి, బయో టెర్రరిజం నుంచి తనను తాను కాపాడుకోవటానికి ప్రకృతి ఉపయోగించిన అస్త్రమే సునామీ అనే ఊహతో ఒక సందేశాన్ని ఇచ్చింది. అందులో నిజం లేక పోవచ్చు. కానీ సునామీ లాంటి ఒక విపత్తు ఎన్నో ఆలోచనలను కూడా మోసుకొస్తుంది అనటానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. సాధారణంగా ఒక విపత్తు పుట్టుకొచ్చిన తర్వాత భాష, మాటలు అన్నీ నిశ్శబ్దాన్ని పులుముకుంటాయి. వాతావరణం మౌనంగా ఉండిపోతుంది.  కానీ కవి హృదయం, అక్కడి నుండి ఆ నిశబ్దం నుండి ముందుకు సాగుతుంది. అందుకే Maurice Blanchot అంటాడు, It is not you who will speak: let the disaster speak in you.  అని.

అలా ఒక విపత్తు వచ్చిన తరువాత, పోయెట్రీ ఆఫ్ డిసాస్టర్, పుట్టుకొస్తుంది. అలా వచ్చిందే నగ్నముని రాసిన కొయ్యగుర్రం. ఈ పన్నెండు కవితల చిన్న పుస్తకం మహాకావ్యమా కాదా అనే వివాదాన్ని కూడా సృష్టించింది. ఆ వివాదాలతో ఈ కవితలో చర్చించిన విపత్తుకి ఎలాంటి సంబంధం లేదు. ఈ అనవసర వివాదాల వల్ల కవి హృదయం అర్థం చేసుకునే వ్యవస్థ మరలా దారితప్పింది. అయినా కానీ విపత్తు సృష్టించిన నష్టానికి పోటీగా వివాదాలు ఉంటుంటాయి. సృష్టించబడతాయి. రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా అన్నట్టు, ఏ విషయాన్నయినా తప్పుదారి పట్చించటం ప్రభుత్వాలకి వెన్నతో పెట్టిన విద్య.  వాటిని చర్చించటం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. నగ్నముని ఈ విపత్తుని చూసి రాసుకున్న కవితలు స్వానుభవాన్నీ, రాజకీయ వాతావరణాన్నే కాకుండా...సామాజిక కోణాన్ని కూడా ఎత్తి చూపుతాయి. ఒక ఖచ్చితమైన ప్రయోజనాన్ని ఆశించి, నగ్నముని కవిత్వం చేశాడు.

ఈ వ్యవస్థ లో
పుట్టడం మోసపోవడానికే
పెరగటం మోసపోవడానికే
ప్రేమించటం మోసపోవడానికే
నమ్మడం మోసపోవడానికే

జీవితం చివర్న పొంచున్నది మాత్రమే
మృత్యువు కాదు
అజ్ఞానంలోనూ మూర్ఖత్వంలోనూ
బతుకు భయంలోనూ ద్వంద్వ జీవితంలోనూ
నయవంచనలోనూ ప్రతీక్షణం వెంటాడేది
మృత్యువే.

ఈ వాక్యాలన్నీ అకస్మాత్తుగా మృత్యువు కౌగిలిలోకి జారిపోయిన అభాగ్యులను చూసిన తరువాత వచ్చినవే. ప్రకృతే మోసం చేయలేదు, సముద్రమే మోసం చేయలేదు. వ్యవస్థ మొత్తంగా మోసం చేసింది. 1977 లో దివిసీమ లో తుఫాను చెలరేగింది. మన ట్రోపికల్ ప్రదేశాల్లో వచ్చే తుఫానులకూ, టెంపరేట్ దేశాల్లో వచ్చే తుఫానులకూ తేడా వుంటుంది. నీరు వేడెక్కి ఆవిరవటం మూలాన ఏర్పడే అల్పపీడనం తన చుట్టూ వుండే అధిక పీడన గాలుల్ని ఆకర్షిస్తుంది. ఈ అల్ప పీడన ద్రోణి ఎపుడయితే తీరం దాటుతుందో, దానితో పాటుగా సముద్రం కూడా పొంగి జనావాసాలను ముంచెత్తుతుంది. దీన్నే 'మెటియో సునామీ' అంటారు. వాతావరణ విశేషాలను తెలిపే శాస్త్రాన్ని 'మెటియొరాలజీ' అంటారు కాబట్టి, మెటియో సునామీ అనే పదం అలా వచ్చింటుంది. అలాంటిదే దివి సీమను 1977 novamber 19 న తాకింది. రాత్రికి రాత్రే గ్రామాలు ఈ  meteo tsunami లేదా storm surge బారిన పడి మునిగి పోయాయి. ఎప్పటిలాగే అనధికారిక మరణాల సంఖ్య విపరీతంగా పెరిగి పోయింది. అనధికార మరణాలు 50000 ఐతే, అధికారికంగా ప్రకటితమైన మరణాలు 10000 నాలుగు లక్షల పశుపక్షాదులు చనిపోయాయి. లక్షల ఎకరాల పంట నష్టం వాటిల్లింది. ఈ హృదయ విదారకర విషయాన్ని ఒక చోట ఇలా చెబుతాడు.

వృక్షాలపై పక్షులపై సమస్త జంతుజాలం పై
చీకటి ముసుగు హఠాత్తుగా కప్పి
నీటితో పేనిన తాల్లతో గొంతులు బిగించి
కెరటాల్తో,కాటేసి వికటాట్టహాసంతో
బుసలు కొడుతూ  పరవళ్ళు తొక్కింది
మనిషి బతికుండగా దాహం తీర్చలేని
ఉప్పునీటి సముద్రం
మిగిలింది కెరటాలు కాదు
శవాల గుట్టలు

శవాల గుట్టల్ని తీసేయటానికి కాకులూ గద్దలూ రాబందులూ లేకపోయినా ఫరవాలేదు, ప్రజాసేవ చేయటానికి పోటీలు పడే నాయకులున్నారనీ, కాంట్రాక్టర్లున్నారనీ అంటాడు.
ఈ కావ్యంలో కవి బాధంతా కనిపిస్తుంది. ఈ విపత్తులో చనిపోయిన వారందరూ పేదవారే. కవి కోపమంతా ప్రభుత్వం మీద, మతాలమీద, వ్యవస్థ మీద. అప్పటి ప్రభుత్వాలు తమ చేతకాని తనాన్ని వెనుకేసుకొచ్చాయేమో...ఈ పాపాన్ని ప్రకృతిమీదకి నెట్టివేసి చేతులు దులుపుకోజూసాయేమో, కొయ్యగుర్రంలా హృదయం లేని స్తబ్ద ప్రభుత్వాలమీద వ్యంగ్య విమర్శనాస్త్రాలను ఎక్కుపెడతాడు కవి.

ఒక విపత్తు జరిగాక, మేలుకునే ప్రభుత్వాలు నిజంగా మేలుకుంటాయా అంటే - లేదనే చెప్పాలి. కంటి తుడుపు చర్యగా ఎక్స్గ్రేషియాలు ప్రకటించేసి కొంత హడావుడి ప్రకటనలు చేసి నిమ్మకుండిపోతాయి. ఎందుకంటే పోయిన ఆ ప్రాణాలన్నీ నిర్భాగ్యులవే. ఎందుకంటే అనాథ శవాలు, కంకాళా లూ ఎలాంటి సంజాయిషీ కోరవు. అదే, పదవిని ఒంటినిండా బట్టగా చుట్టుకున్న నాయకుడు చనిపోతే, దేశ జండా విషాదంగా తలదించుకుంటుంది. ఈ పరిస్థితి ఇప్పటికీ మారలేదు. తీర ప్రాంతాల్ని ముంచెత్తే తుఫానులనుండి పూర్తి రక్షణ కలిగించటానికి ఇప్పటిదాకా ఎలాంటి సమర్థమైన చర్యలు చేపట్టనేలేదు. మద అడవుల ని పెంచాల్సిన ప్రభుత్వాలు అడవుల నరికివేతను విచ్చలవిడిగా కొనసాగిస్తున్నాయి.  ఔట్ వార్డ్ సూయిజ్ లు కూడా ఇప్పటికీ అదే శిథిలావస్థలో ఉన్నాయట. ఇకపై ఎపుడు ఉప్పెన వచ్చినా మరలా ఇలాంటి విపత్తే సంభవించబోతోందని అందరికీ తెలుసు. కానీ ఏమీ చేయలేని కొయ్యగుర్రం వ్యవస్థ మనది. ఇంకో విషాదమేమంటే ఈ విపత్తుకి గుర్తుగా కట్టిన స్థూపం కూడా కబ్జా పాలయిందట. ఇలాంటి కొయ్యగుర్రం వ్యవస్థని తగలబెట్టగల ఇంధనం కనిపెడతానన్నాడు నగ్నముని. ఏదీ..ఎక్కడుంది ఆ ఇంధనం. ఆ ఇంధన అవసరం అప్పటికన్న ఇప్పుడే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. చివరి విందు లో తనను ఎవరు మోసం చేస్తారో జీసస్ కి తెలుసు, హన్తకులెవరో మనకు తెలుసు- నెపం కాసేపు ప్రకృతిమీదకు ఎవరు తోసేస్తారో కూడా మనకి తెలుసు. అందుకే విపత్తు వ్యవస్థలోనే ఉంది. ఏదీ! ఎక్కడుంది ఆ ఇంధనం?.

30/12/15

Friday, 25 December 2015

కవిత్వ సందర్భం 4

ఈనాటికైనా మనం అసలులమా? నీడలమా?.
..............................................................

అభ్యుదయ కవితోద్యమాన్ని భావ కవిత్వపు ఫ్రేం ఆఫ్ రిఫరెన్సు ద్వారా చూసి, అటు ఆధునికతకూ, ఇటు భావ కవిత్వానికీ వారధిలా నిలిచాడు తిలక్. వస్తువు అభ్యుదయ కవిత వలె కొత్తది. శైలి భావ కవిత వలె రమ్యమైనది. ఆంగ్ల మోడర్నిస్ట్ కవులు కళాకారులుగా మిగిలిపోయారు. తోటి కళాకారుల కోసం రాసుకున్నారు. క్యూబిజం, డడాయిజం, సర్రియలిజం అంటూ కళ లో కవితలో ప్రయోగాలు చేశారు. తద్వారా సంక్లిష్టమైన సాహిత్యాన్ని అందించారు. కానీ అభ్యుదయ కవులు ప్రయోగాలు చేస్తూ ప్రజల వైపే నిలబడ్డారు. ప్రజల్లో తామూ ఒకరిగా నిలబడ్డారు. వెస్టర్న్ కవుల రొమాంటిసిజం పంతొమ్మిదవ శతాబ్దం మొత్తం సాగినా, తెలుగులో ఇరవైయవ శతాబ్దపు తొలి రెండు మూడు దశాబ్దాలకు పరిమితమైంది. అంతరించి పోతున్న భావ కవిత్వపు ఛాయల్లో నిలబడి అభ్యుదయ కవితను పలికించిన వాడు తిలక్. అమృతం కురిసిన రాత్రి కవితా సంకలనం లో 'నీడలు' అనే కవిత లో తిలక్ మనల్నందరినీ దగ్గరగా చూడటమే కాక మనలో ఒకడిగా కనిపిస్తాడు. రాత్రి పడుకునే ముందు ఆశల్నీ ఆశయాలనీ నెమరు వేసుకుని, ఉదయం నిద్రలేచాక అంతా మామూలే మనకు. యథాతథం.

నీడకూ, ప్రతిబింబానికీ తేడా ఉంటుంది. రెంటికీ ఒకానొక వస్తువే ఆలంబన. కానీ ప్రతిబింబం వస్తువుకి డిస్టార్టెడ్ వర్షన్ కాదు. వస్తువుకి కాపీ. కుడి ఎడమలే మార్పు. అద్దం ముందు నిలబడితే తెలిసిపోతుంది. కానీ, నీడ వస్తువుని పోలి లేదు. కురచది. వక్రమైనది. నీడ— అనే పదాన్ని ఎన్నో రకాల అర్థాల్లో వాడవచ్చు. ఈ కవితలో 'హిపోక్రసీ' అనే అర్థం స్పురిస్తుంది. ఎవరికి హిపోక్రసీ?. హిపోక్రసీ ఆఫ్ ఎ కామన్ మాన్. తిలక్ 'నీడలు' కవితలో ఈ కామన్ మాన్ మధ్యతరగతి మనిషి గా కనిపిస్తాడు. ఒక వ్యక్తి సంపాదన ఆధారంగా ఉన్నత, మధ్య, బీద తరగతికి చెందిన వాడనే విభజన ఉంది. మధ్య తరగతిలో మళ్ళీ అప్పర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్,  లోవర్ మిడిల్ క్లాస్ అని విభజన. ఈమధ్యటి లెక్కల ప్రకారం భారత దేశంలో మిడిల్ క్లాస్ 3 శాతం మాత్రమే. దాదాపుగా మిగిలిన వారందరూ బిలో మిడిల్ క్లాస్ వారేనట. బీదరికం నుంచి బయట పడి, వారంతా బిలో మిడిల్ క్లాస్ వారిగా మారిపోయారే తప్ప, మిడిల్ క్లాస్ వారిగా ఇంకా మారలేదట. ఆ సంగతి అటుంచితే, మేము మధ్యతరగతి మనుష్యులమని తమకు తాము చెప్పుకునే వారే ఈ ప్రపంచంలో ఎక్కువట. అంటే, మనుషులకి సంబంధించినంత వరకు ఈ 'మధ్య తరగతి' అనేది ఒక మానసిక స్థితికి సంబంధించినదే కానీ, ఎకనామికల్ డెఫినిషన్స్ కి సంబంధించినది కాదన్నది స్పష్టం. ఎకనామిస్ట్ ల డెఫినిషన్స్ తో మనకు సంబంధం లేదిక. మనమంతా మధ్య తరగతి మనుష్యులమే. ఇది అమెరికా లో అయినా, ఆస్ట్రేలియాలో అయినా అంతే. తమకు తాము మధ్య తరగతి వారిమని అనుకోవటం లో ఒక తృప్తి ఉంటుంది. రిడక్షన్ ఆఫ్ కాగ్నిటివ్ డిస్సోనాన్స్ అన్నమాట. హిపోక్రసీలో ఉండే గోపి (గోడమీద పిల్లి) తత్వం మనకు కలిసొస్తుందన్నమాట.

తనకు అనుకూలంగా ఉన్న వ్యవస్థలో ఉన్నది ఉన్నట్టుగా ఉండాలనుకునే వాడు వ్యవస్థను పరిపాలిస్తూ ఉంటాడు. తనకు అననుకూలంగా ఉన్న వ్యవస్థలో సమూలంగా మార్పు రావాలని కోరుకునే పీడితుడు తిరుగుబాటు చేస్తాడు. కానీ వ్యవస్థ తనకు అనుకూలంగా ఉందో ప్రతికూలంగా ఉందో తెలియక, తెలుసుకోలేక, దేన్ని ఔననాలో దేన్ని కాదనలో అర్థం కాక, ఊగిసలాడుతూ ఉండేవాడు కామన్ మాన్. మధ్య తరగతి మనిషి. అందుకే తనతో పాటు భారమైన హిపోక్రసీని కూడా మోసుకు తిరుగుతాడు. భూస్వామ్య వ్యవస్థ పతనమై పెట్టుబడిదారీ వ్యవస్థ కుదురుకుంటున్న సమయంలో సమాజంలోకి అకస్మాత్తుగా పుట్టుకొచ్చాడు ఈ మధ్యతరగతి మనుష్యుడు. అపుడే ఈ మధ్యతరగతి మానసికావస్థ కూడా పుట్టి వుండాలి. అదే సమయంలో వెస్టర్న్ రొమాంటిసిజం ద్వారా సాహిత్యంలోకి అడుగుపెట్టిన అతడు, రొమాంటిక్ పీరియడ్ లో దేవుడిని సైతం పక్కకు నెట్టి తానే 'ప్రొటాగొనిస్ట్' గా మారిపోయాడు. ఇరవైయవ శతాబ్దపు భారతదేశంలోకి శరత్ సాహిత్యం ద్వారా చొచ్చుకొని వచ్చాడు. పుట్టినప్పటి నుంచి ప్రపంచం మొత్తాన్నీ తన హిపోక్రసీతో నెట్టుకొచ్చాడు. ఇప్పటికీ పెద్దగా మార్పేమీ లేదు. ఎందుకంటే ప్రతీ ఒక్కరూ తమకు తాము మధ్యతరగతి మనుష్యులమని అనుకునేవారే. అస్తవ్యస్థ వ్యవస్థలో రిడక్షన్ ఆఫ్ కాగ్నిటివ్ డిస్సోనాన్స్ తో తమకు తాము సమాధాన పరచుకునే వారే.

ఈ కవిత శీర్షిక నీడలు. ఈ మనుష్యులు - "గతించిన కాలపు నీడలు" అంటాడు ఒకచోట. ఈ వాక్యంలోని 'నీడలు' పదాన్ని శీర్శిక లాగా వాడాడేమో అనిపించినా, నీడలు పదాన్ని హిపోక్రసీ తో నిండిన మధ్యతరగతి మనుషులు అనే అర్థంలో వాడి ఉండింటాడనిపిస్తుంది. కవిత మొత్తంలో ఒక మనిషిలో హిపోక్రసీని చూపిస్తాడు. తన చిన్నమ్మ కు మనుషుల గురించి తాను చెబుతున్నట్టు ఉంటుంది కవిత. ఆ చిన్నమ్మ శరత్ నవల్లోని ఒక స్త్రీ అయుండవచ్చని నా ఊహ. ఊహ మాత్రమే. ఆధారాలు లేవు. కవితలో "మనుషల స్వభావం ఇలాగే ఉంటుంది క్షమించేసెయ్ , ఓ.చిన్నమ్మా..!" అని అడుగుతున్నట్టు ఉంటుంది. "చిన్నమ్మా! వీల్లందరూ మధ్యతరగతి మనుషులు" అని ఒక చోట చెప్పి, వారి స్వభావాలూ, దైనందిన జీవితాలూ తెలుపుతాడు. కవితలో సగటు మనిషిని మనం దాదాపుగా చూడగలుగుతాం. డెఫినిషన్ అండ్ బేసిక్ కారక్టరిస్టిక్స్ ఆఫ్ కామన్ మాన్ ని మనం ఈ కవితలో నుంచి తీసుకోవచ్చు. ఒక పార్టీని నడిపించటం కోసం ఇంకో పార్టీని పెట్టుకుని హిపోక్రసీని ప్రదర్శించిన పవన్ కళ్యాణ్, ఫైవ్ స్టార్ హోటల్ లో కామన్ మాన్ కోసం పార్టీ పెట్టి హిపోక్రసీని బట్టయబలు చేసిన పవన్ కళ్యాణ్, మనుషుల హిపోక్రసీ ని వర్ణించే ఈ కవితను తన పార్టీ ఓపెనింగ్ స్పీచ్ లో వాడుకోవటం,  పీక్స్ ఆఫ్ ది హిపోక్రసీ.

చిన్నమ్మా వీళ్ళందరూ, సగం సగం మనుష్యులు,
 మరోసగం మరుగున పడిన భయస్థులు/బాధాగ్రస్థులు. ( అంటే అననుకూల ఆలోచనలే చేయలేని వారు)
భారతం భాగవతం చదువుతారు.( అంటే  ఎస్కేపిస్టులు)
పాపం పుణ్యం కేటాయిస్తారు. (మేథో అసంబద్ధత తగ్గించుకోవటం కోసం)
డైలీ పేపరు తిరగేస్తారు/ జాలీగా ఉన్నట్టు నటిస్తారు. (ఈ కాలంలో అయితే బిజీగా ఉన్నట్టు నటిస్తారు అనుకోవాలి).

"వాచకాలలో నీతుల్ని వల్లిస్తూ/దరిద్రంలో హరిద్రాశోభల్ని గుర్తిస్తూ"...గ్లోరిఫికేషన్ ఆఫ్ పావర్టీ ప్రతీ మతం లోనూ కనిపించే విషయం. మతాలకి ఆలంబన మధ్యతరగతి ప్రజలే. మతం వారి కాగ్నిటివ్ డిసోనాన్స్ ని రెడ్యూస్ చేసే అద్భుతమైన మందు . "ధైర్యంలేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ"...ప్రతీ ధర్మమూ పీడితుల్ని పీడకులకు గులాం కమ్మంటుంది. అందరికన్నా పెద్ద పీడకుడు దేవుడు. ఆ తరువాత రాజు, ఆ తరువాత పూజారి. నీవు భరించు, ఇవన్నీ పరీక్షలు. ఆ తరువాతే మోక్షం. నారు పోసిన వాడు నీరు కూడా పోస్తాడు. అదే ధర్మం.

మౌఢ్యం వల్ల బలాఢ్యులు
అవివేకం వల్ల అవినాశులు
వీల్లందరూ మధ్య తరగతి మనుష్యులు. (ఇంతకన్నా డెఫినిషన్ ఏం కావాలి. అయినా ఇంకా పొడిగించి నిర్వచిస్తే..)
సంఘపు కట్టు బాట్లకి రక్షకభటులు
శ్రీమంతుల స్వేచ్ఛావర్తనకి నైతిక భాష్యకారుల
శిథిలాలయాలకు పూజారులు.

కవితలో దాదాపు ఈ మధ్యతరగతి వాల ని నిర్వచించి, వివరించి చివరిలో ఈ పరిస్థితి మారాలి అంటాడు. ఇలాంటి వారి మధ్య డైనమైట్ లు పేలాలి, డైనమోలు తిరగాలి. ఈ కవిత చెప్పిన కాలమంతా ఒకానొక సాయంకాల మనుకుంటే, ఈ రాత్రికంతా ఏదో జరిగి, రేపు ఉదయానికల్లా మార్పురావాలి అంటాడు. "కాళరాత్రిలో కంకాళాలు చెప్పే రహస్యం తెలియాలి/ దారిపక్కన మోడు చెట్ల బాధలు వినాలి/పచ్చికలో దాక్కున్న పాముల్ని బుట్టలోకి పట్టాలి". ఈ పంక్తుల్లో ఈ రాత్రికల్లా అభ్యుదయం జరిగిపోవాలి అనే సూచన కన్పిస్తుంది. "రేపటి ఉదయానికల్లా ఈ వేళ వెలుగుల్ని సమకూర్చూకోవాలి". సంఘ సంస్కారమే వెలుగులనుకోవాలి. కవి చిన్నమ్మతో ఈ హిపోక్రసీని క్షమించమంటాడు. ఆడదానికి సాహసం పనికి రాదనే వీళ్ళని, ఈ సాంప్రదాయకులను విడిచి వెళ్ళొద్దనీ, వీళ్ళంతా నీ బిడ్డలనీ అంటాడు. కవిత చివరలో ఆ పని తానే చేయపూనుకున్నట్టు కనిపిస్తాడు కవి. ఇదిగో చిన్నమ్మా..! చీకటి పడుతోంది. దారంతా గోతులు. ఇల్లేమో దూరం. . చేతిలో దీపం లేదు. ధైర్యం ఒకటే కవచం.

కవితలో చెప్పినట్టు, ఈ మధ్య తరగతి వారి మధ్య, ఏ డైనమైటూ పేలలేదు. ఏ డైనమోలూ తిరగలేదు. కాళరాత్రి కంకాళాలూ ఏ రహస్యాల్నీ చెప్పలేదు, మోడు చెట్ల ఏ బాధల్నీ మనం అనువదించుకోలేదు, పాముల్ని బుట్టలోకి పట్టలేదు, మనం ఏ వెలుగులూ సమకూర్చుకోలేదు. మధ్య తరగతి స్థానం నుండి ఒక్క అంగుళం కూడా ముందుకు జరగలేదు. ఇది మన సేఫ్ జోన్. అందుకే మనం నీడలం. అసలులం కాదు.

చిన్నమ్మా
వీళ్ళ మీద కోపగించకు
వీళ్ళనసహ్యించుకోకు

నిన్నెన్నెన్నో అన్నారు. అవమానాల పాల్చేశారు
అవినీతి అంటగట్టారు
ఆడదానికి సాహసం పనికిరాదన్నారు

చిన్నమ్మా వీళ్ళందరూ భయపడిపోయిన మనుష్యులు
రేపటి గురించి భయం, సంఘ భయం
అజ్ఞాతంగా తమలో దాగిన తమను చూసి భయం
గతంలో కూరుకుపోయిన మనుష్యులు
గతించిన కాలపు నీడలు

చిన్నమ్మా
వీళ్ళందరూ తోకలు తెగిన ఎలకలు
కలుగుల్లోంచి బయటకి రాలేరు
లోపల్లోపలే తిరుగుతారు
మౌఢ్యంవల్ల బలాఢ్యులు
అవివేకం వల్ల అవినాశులు
వీళ్ళందరూ మధ్యతరగతి ప్రజలు
సంఘపు కట్టుబాట్లకి రక్షకభటులు
శ్రీమంతుల స్వేచ్ఛా వర్తనానికి నైతిక భాష్యకారులు
శిథిలాలయాలకు పూజారులు

చిన్నమ్మా వీళ్ళందరూ సగం సగం మనుషులు
మరోసగం మరుగున పడిన భయస్తులు, బాధాగ్రస్తులు
భారతం భాగవతం చదువుతారు
పాపం పుణ్యం కేటాయిస్తారు
డైలీ పేపరు తిరగేస్తారు
జాలీగా ఉన్నట్లు నటిస్తారు

చప్పబడిన నిన్నటి మాటల్నే మాట్లాడుతుంటారు
కప్పబడిన నిన్నటి కలల్నే తలుచుకుంటారు
సన్నంగా పళ్ళ సందున నవ్వుకుంటారు
హఠాత్తుగా జడుసుకుంటారు
నిటారుగా నిలబడలేరు

వీళ్ళందరూ ముక్కలైన గాజు పెంకులు
చెల్లా చెదురైన మూగ సత్యాలు
కల్లాకపటం తెలియని కబోది గుంపులు
తమని తాము మోసగించుకునే విద్యాధికులు, విదూషకులు
తమ చెట్టుని తామే నరుక్కునే అమాయకులు
సంప్రదాయకులు

చిన్నమ్మా వీళ్ళ ని విడిచి వెళ్ళిపోకు
వీళ్ళందరూ నీ బిడ్డలు
ఆకలి అవసరం తీరని కష్టాల గడ్డలు
వాచకాలలో నీతుల్ని వల్లిస్తూ
దరిద్రంలో హరిద్రా శోభల్ని గుర్తిస్తూ
ఓపికలేని భార్యలకు సహనాన్ని బోధిస్తూ
ధైర్యంలేని తమ స్వభావాల్ని ధర్మమని పిలుస్తూ
బరువుగా బెదురుగా బతుకుతున్న వీళ్ళ మధ్య
డైనమైట్ పేలాలి
డైనమోలు తిరగాలి

కాళరాత్రి వేళ కంకాళాలు చెప్పిన రహస్యం తెలియాలి
దారి పక్క నిల్చిన మోడు చెట్ల బాధని అనువదించాలి.
పచ్చికలో దాక్కున్న పాముల్ని బుట్టలోకి పట్టాలి
రేపటి ఉదయానికి ఈ వేళ వెలుగుల్ని సమకూర్చుకోవాలి.

చిన్నమ్మా
నేను వెళ్ళొస్తాను
చీకటి పడుతోంది
చిటారు కొమ్మల్లో నక్షత్రం చిక్కుకుంది
శిథిల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుతుంది
దారంతా గోతులు, యిల్లేమో దూరం
చేతిలో దీపం లేదు, ధైర్యమే కవచం.

9/12/15

కవిత్వ సందర్భం- 5

పట్టాభి రాముడిలో లేని కొంటెదనం పఠాభి రాముడిలో ఉండొచ్చు. అది ఆయుధం కూడా కావొచ్చు.
..............................................................................................................................
పల్లెటూరి గోధూళి వేళలూ, పిచ్చుక శబ్దాలు, పచ్చిక బయళ్ళ స్థానంలో...నగరం లోని బిజీ లైఫులూ, రణగొణ ధ్వనులూ, ఇరుకు సందులూ వచ్చి చేరితే..
ఆకాశం లోని జాబిల్లి నక్షత్రాలు, నగరం లోని మిణుకు మిణుకుమనే ఎలక్ట్రిక్ బల్లుల ముందు పేలవంగా, దరిద్రంగా, అనవసరంగా కనిపిస్తే..
ప్రేయసి కనులను, కనుబొమ్మలనూ, హృదయాన్ని, కరుణను వర్ణించే చోట ప్రియురాలి అధరాలు, వక్షోజాలూ, నడుము వంపులూ, చుంబనాలూ, కౌగిలింతలూ వెచ్చగా అనిపిస్తే...
ఒకప్పటి ప్లెటోనిక్ లవ్ స్థానంలో ఇప్పటి వన్ నైట్ స్టాండ్ సంబంధాలు స్త్రీ పురుషుల మధ్యన కనిపిస్తే....
ప్రస్తుత గ్లోబల్ ప్రపంచంలో ఉన్న మనకు ఏమనిపిస్తుంది?.

ఆ! దీనిలో కొత్తేముంది. రోజూ వింటున్నదే కదా..!  అనిపించటంలో మనకు వింత ఏమీ ఉండదు కానీ, 1930 వ దశకం లో, భావ కవిత్వపు నశాలో తేలియాడే సమయంలో, అకస్మాత్తుగా కవితల్లోకి ఇలాంటి నగర జీవితమూ, కామమూ వంటి వస్తువులతో ఒక ఫుస్తకం  'ఫిడేలు రగాల డజను'లా వస్తే ఏమౌతుంది?. రాగాల డజను కాదిది, రోగాల డజను అని అనాల్సి వస్తుంది. వలపు పస్తులతో నవసి మతి చెడిన యువకుని ఉన్మత్త ప్రేలాపన( mad ravings) గా స్పురిస్తుంది. ఇలా అంటారని ముందే తెలుసేమో పఠాభికి, అందుకే పద్యాల నడ్డి విరగ్గొట్టడానికి వచ్చేస్తున్నానంటూ, అహంభావ కవినంటూ ముందే ప్రకటించేసుకున్నాడు.
1939 లో ముద్రితమైన ఈ పుస్తకం తెలుగులో మొదటగా ప్రచురితమైన వచన కవిత్వపు పుస్తకం అనే విషయం చాలా మందికి తెలియక పోవటం ఎందుకంటే, చాలామందికి ఇది రాగాల డజనుగా కన్నా రోగాల డజను లాగా కనిపించటం. శ్రీశ్రీ రాసిన అభ్యుదయ కవితలు అప్పటికే పత్రికల్లో ప్రచురితమైనా అది పుస్తకం రూపంలో వచ్చింది మాత్రం 1950 లోనే. అభ్యుదయ కవిత్వానికి పఠాభి వలన ప్రత్యక్ష ప్రయోజనం ఏమీ లేకపోయినా పరోక్ష ప్రయోజనం విస్మరించదగినది కాదని వేల్చేరు నారాయణ రావు గారెందుకన్నారో తెలియనిదయినా, నగర జీవితాన్ని తెలుగు సాహిత్యంలోకి ప్రవేశ పెట్టిన వాడిగా పఠాభి మనకు వేస్ట్ ల్యాండు ఇలియట్ ని గుర్తుకు తెస్తాడు.

ఇదే ఫిడేలు రాగాల డజనులో మనకొక సీత కనిపిస్తుంది. అయితే ఈమె రామాయణంలోని సీత కాదు. రామాయణం సీతను గురించి తలుచుకునే 'ఆధునిక సీత'. ఈ సీత, కవితలో 'పఠాభి' అనే వ్యకికి స్నేహితురాలు. అయితే కవితలోని ,ఈ పఠాభి, కవి పఠాభి కాదు. ఆ విషయాన్ని పుస్తకం ముందే రాసుకున్నాడు పఠాభి. అలాగే కవితలోని పఠాభి, రామాయణంలోని పట్టాభి రాముడూ కాడు. కవితలోని విషయమేమంటే, ఈ ఆధునిక సీత, కవి పఠాభితో కాక కవితలోని పఠాభితో, రామాయణంలోని సీతా రాముల గురించి చర్చించుకోవటం. కవితకు రామాయణం, అందునా విశ్వనాథ వారి రామాయణం వస్తువయినా, కవిత నడవటానికి బలమైన ప్రోద్బలం కలిగించినది మాత్రం ముద్దుకృష్ణ రాసిన 'అశోకం' నాటకం. పఠాభి, ఉపజ్ఞ ఉన్న కవిగా పేరుతెచ్చుకున్నా..ఆ ఉపజ్ఞ చమత్కార రచనకే పరిమితమైందని అప్రతిష్ఠ ఉన్నా..గెస్టాల్ట్ థియరీ ప్రకారం, నేర్చుకోవటమన్నది అంతకుముందున్న జ్ఞాన సంపద మీద ఆధారపడుతుందని, మనకు ఈ కవిత చదివినపుడు, దీనికి 1934 లో వచ్చిన 'అశోకం' నాటకం ప్రోద్బలమని తెలుసుకున్నపుడు  అర్థం అవుతుంది. పఠాభి కవితలోని సీత, రాముడి సతిగా ఉండటం కన్నా రావణుని ప్రియురాలిగా ఉండి, "హృదయం ఉన్న రావణున్ని తన ప్రేమతో అమరుణ్ణిగా చేయగలనని"  అమాయకంగా నమ్మే ఆధునిక మహిళ. ఈ పిచ్చి నమ్మకానికి ప్రభావం ముద్దుకృష్ణ నాటకం అశోకం మాత్రమే. కాబట్టి వాల్మీకీ లాగా ఉపజ్ఞ వలన పఠాభికి దానంతట అదే వచ్చేసిన ఆలోచన కాదు. పఠాభి సీత "మాం హి ధర్మాత్మనః పత్నీం శచీమివ శచీ పతే" (నేను ధర్మాత్ముడైన రాముని భార్యను ఎట్లనగా శచి ఇంద్రుని భార్య అయినట్లు) అని ధైర్యంగా పలకగలిగిన వాల్మీకీ రామాయణంలోని సీతైతే కాదు.

అయితే కవితలో తనకు తాను రాముడిగా కన్నా రావణుడిగా ఉండటం వల్ల ఏమి లాభమో కవి చెప్పటం మనల్ని అబ్బుర పరుస్తుంది. ఎందుకంటే సీత అనే తన ప్రియురాలిని, ఆమె పెదవులను పది మూతులతో, ఆమె వదనమును ఇరవై కనులతో గ్రోలాలని ఉబలాటపడే ఫక్తు కొంటె కుర్రాడు పఠాభి.  అక్కడి సీత రావణుడు వేసిన ఎరలో చిక్కుకోలేదు గానీ, ఇక్కడి ఈ ఆధునిక సీత ఈ ప్రతిపాదనకి ఈజీగా పడిపోయిందట. అందుకే తన ధర్మ సహచారిణి అయిందంటాడు!. ధర్మ సహచారిణి అయింది అనటం, ఈ సీత ఆ సీతమ్మని పతివ్రతా శిరోమణి అనీ, భారతీయ స్త్రీ మూర్తీ అని అనటం, అలా సీతమ్మ లా ఉండగలగటం ఒక అపూర్వ భాగ్యమనటం పఠాభికి రామాయణం మీద గౌరవాన్నే సూచిస్తున్నాయి. ముద్ధు కృష్ణ లాగా రామాయణాన్ని వికృతం చేసే పని పెట్టుకోలేదు. చలం లాగా పురాణాల పట్ల గౌరవభావాన్నే చూపించాడు. అంతే కాకుండా రామాయణ కథని కాస్త కొంటెగా కవితలోని పఠాభి పాత్ర వినియోగించుకుని, ఈ ఆధునిక సీతను సొంతం చేసుకోవటానికి ఉపయోగించుకున్నట్టు అనిపిస్తుంది. ఇది టోటల్ గా సరదాగా రాసిన కవితగానే నాకు అర్థం అయింది. కృష్ణ శాస్త్రి అమూర్త ప్రేయసికి, విరుద్ధంగా పఠాభి మూర్త కామాక్షిని, లీలనూ ప్రవేశపెట్టాడేమో కానీ, సీత ని మాత్రం కాదని నాకనిపించింది. ఈ కవితలో సీతని సొంతం చేసుకోడానికి ఆధునిక పఠాభి తన కొంటెదనాన్నే చూపించాడనుకుంటాను. 1972 లో తన ఫీడేలు రాగాలు కు ఇంగ్లీషు రాసిన పీఠిక లో ఇలా అంటాడు "Baffoonery, egoism, and sex were all part of my arsenal". ఈ కవితలోని కొంటేతనమనే ఆయుధం చాందసులకు ఎంత షాక్ ఇచ్చిందో తెలియదు కాని...కవితలోని ఆధునిక సీతకు మాత్రం గిలిగింతలు పెట్టించి ఉంటుందని చెప్పక తప్పదు. కొంటె పఠాభి కదా మరి!!.

సీత
.....
సీత నా సహాధ్యాయిని, సీతా నేను గలసి
నవీనమగు విశ్వనాథ సత్యనారాయణ కృతి
రామాయణ మహా కావ్యమును
పఠించినాము

పఠన ముగిసిన తర్వాత
సీతవంక జూచి, సీత ఆలోచనలోచనాల
వంకజూచి, ప్రశ్నించా ఈలాగ!

"రామాయణాన్నంతా విన్నావు గదా,
ఆదర్శ  పురుషుండనబడు పురాణయుగం
నాటి రామయ్యతో
కవన జవ గమనుల మయి
భూతకాల కాలాడవిలోకి జొచ్చుకొని పోయి
కలిశాము గదా, అతన్ని
అనుసరించి అడవికి పొయాము
మరుగున నుండి వాలిని పరిమార్చుట జూచినాము

ఇదంతా చూచాక,
సీతా నువు పురాణ యుగం నాటి
రామయ్య సతి సీతలాగా
వుండాలని వాంఛిస్తావా? చెప్మా"

ఇటులనేను వచించటము విని
అనింది!
"పఠాభీ ! పతివ్రతా శిరోమణి సీత
భారతీయ స్త్రీమూర్తి సీత
అట్టి సీతగావుండే భాగ్యం
అది అందరాని అపూర్వ మహాభాగ్యం కదా!

కానీ సీతగా వుంటానికి నేను
కోరినా, రామయ్య సతిగా వుంటానికి మాత్రం
ఒప్పుకోను ఏమాత్రం నేను"

"బలే మాట అన్నావు సీతా, బలే"

"రామయ్య సతిగా నుంటకన్నా
రావణుని ప్రియురాలిగా వుండి
హృదయంగల అసురుణ్ణి అమరుణ్ణిగా
చేసివుండేదానిని నా ప్రేమ బలంతో

అది సరే పఠాభీ! నీకేమన్నా
రామయ్యగా వుండాలని కోరికవుందా?"

"ఆ ! ఏమ్మాటన్నావు, సీతా !
నీకు రామయ్య సతిగా వుంట ఇచ్ఛ లేకున్న
నాకు మటుకు
రామయ్యగా వుంటమ్ ఎలా యిష్టం ఉంటుంది?
రామయ్యగా వుండేదాని కంటే
రావణుని గావాలని నా వాంఛ
పది మూతులతోనూ, నీ పెదవులను
మృదు శరీరమును, వదనమును అదుముతాను
ఇరవయి కళ్ళ సంకెళ్ళ తో నిన్ను
నిరతము బందీ చేస్తాను

నా వక్షానికి లాగుకొని
చిక్కని కవుగిలింతలో
అయిక్యం చేసుకొంటాను నిను నాలో సీతా!! ".

సీత నా సహ ధర్మచారిణి
ఇపుడు.

Sunday, 6 December 2015

ll అమ్మతనం ll poem

విరించి  ll  అమ్మతనం  ll
...............................................
మనం పులులుగా, సింహాలుగా
నక్కలుగా తోడేళ్ళుగా పుట్టలేదుర బిడ్డా..
అందుకే మనల్ని చంపేస్తారు.

మనకు కోరలు లేవు
వాడిగా గోళ్ళూ లేవు
మనసులో ఎవరి మీదా కోపాలు లేవు
అందుకే మనల్ని చంపేస్తారు

మనకు ఏ శక్తులూ లేవు
ఏ విద్యలూ రావు. ఏ పవిత్రతా మనలో లేదు.
ఏ కిరీటాలూ, గుడులూ లేవు
కానీ మనుషులు మనకు దైవత్వం అంటగడతారు

మనం దేవతలమూ కాము
దయ్యాలమీ కాము
మనుషులం అంతకన్నా కాము
అయినా ఈ మనుషులెందుకో
మనకు పూజలు చేస్తున్నారు
అయినా ఈ మనుషులెందుకో
కసిగా మన పీకల్ని కోస్తున్నారు.

వాళ్ళంతా చిన్న పిల్లలుగా అంబాడినపుడు
ప్రేమ తో పలుచని పాలిచ్చినదాన్ని
నా కంటి ముందు పెరిగి పెద్దయిన ఈ పిల్లలకు
ఈ బలిసిన నా కండను ధారబోయలేనా?.
అమ్మను కదరా బిడ్డా...!
వారి ఆనందానికి అడ్డు తెలపగలనా?
అమ్మ మనసు కదరా బిడ్డా...!

ఎక్కడెక్కడో గడ్డి మేసి
సాయం నీరెండల్లో నీ కోసం పరిగెత్తుకొచ్చినపుడు
నా పొదుగు మీద నీ చిన్న నోరు ఉంచి పొడుస్తావు చూడు
అపుడు కాళ్ళను పాతేసినట్టు నిలబడి పోతాను చూడు
అది నొప్పి కాదురా బిడ్డా...అమ్మతనం రా!
నీ కోసం దాచిన పాలను, ఇంకొకడొచ్చి పిండుతున్నపుడు
నిశ్చలంగా నిలబడి పోతాను చూడు
అది చేతగాని తనం కాదురా బిడ్డా...అమ్మతనమేరా!

పాల కోసం నోరు తెరిచి ఏ పసి బిడ్డలోనైనా
నిన్నే చూసుకుంటాను చూడు
అది పిచ్చితనం కాదురా బిడ్డా...అమ్మతనమేరా!

పాలంతా గటగటా తాగేసి
చెంగు చెంగు న నీవు ఎగురుతుంటావు చూడు
తన బిడ్డకి నేను పాలిచ్చినందుకు ఇంకెక్కడో తల్లి
చేతులెత్తి మొక్కుతుంటుంది చూడు
అపుడు మౌనంగా కారే కన్నీరు ఏడుపసలే కాదురా బిడ్డా..
గర్వంతో నిలబడిన అమ్మతనమేరా!

కానీ బిడ్డా..
నీవు చెప్పగలిగితే నా మాటగా వాళ్ళకు చెప్పు.
నాకుగాదులూ లేవు ఉషస్సులూ లేవు
నాదైన జీవితం లేదు, నాదైన గొంతుక లేదు
నాకో పేరూ లేదు, మతమూ లేదు
ఒక్క అమ్మతనం తప్ప.
పొదుగులో ఒట్టిపోయిన పాలు తప్ప.

నీవు చెప్పగలిగితే నా మాటగా వాళ్ళకు చెప్పు
ఈ పండగ రోజు నన్ను ఆకలితో కోసుకు తినమను
కోసి కారం పెట్టడం ఒక ఆనందకర విషయమే అయినా
ఆ ఆనందాన్ని నాకు తెలవనీయకమను
ఇంతకాలం ప్రేమను నటించినట్లే
ఆ చివరి క్షణం నా ముందు ఆకలిని నటించమను

ఈ పిచ్చి చివరి కోరిక కూడా పిచ్చితనం కాదురా బిడ్డా..
అమ్మతనమేరా బిడ్డా..!

ఈ గోడు నీకయినా అర్థమయిందారా తండ్రీ..
మన 'అంబా' అనే అమ్మ భాష మనుషులకు అర్థం కాదు కదరా తండ్రీ..
అంబా...అంబా...అంబా...

6/12/15

Wednesday, 2 December 2015

Kavitwa sandarbham3 - చెరా రాసిన "వందేమాతరం" కవితలో దేశ ద్రోహమెక్కడుంది?.

చెరా రాసిన "వందేమాతరం" కవితలో దేశ ద్రోహమెక్కడుంది?.
...............................................................................

గ్లాసులో సగం దాకా నీరుందనేవాడు అధికార పక్షంవాడయితే, లేదోయ్ సరిగ్గా చూడు, సగం గ్లాసు ఇంకా ఖాలీగానే ఉంది అనేవాడు ప్రతిపక్షం వాడు. ఇద్దరూ ఒక సత్యాన్నే చెబుతున్నారు. కానీ ప్రాథమ్యాలు, స్వలాభాలు మారి, చెప్పే పద్ధతిలో మార్పులు చేసి, రెండు వేరు వేరు సత్యాల్లాగా భ్రమింపజేస్తున్నారు.

దేశం వెలిగిపోతోందని అధికార పక్షం వాడంటే, లేదోయ్ సరిగ్గా చూడు, అసహనం పెరిగిపోతోందని ప్రతిపక్షం వాడంటాడు. ఇద్దరూ రెండు వేరు వేరు సత్యాల్నే చెబుతున్నారు. కానీ, తాము చెప్పిన సత్యమే సత్యమని భ్రమింపజేస్తున్నారు.

గ్లాసులో నీరు ఒక ఆబ్జెక్టివ్ విషయం.కంటి ముందు కనిపించే దృగ్విషయం.
కానీ, ఇంత పెద్ద భారత దేశం గురించి, అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక మెతుకు పట్టుకుని చెప్పినట్టు, ఒకటి రెండు సంఘటనలాధారంగా నిర్ణయించి చెప్పటం సాధ్యమా?. అది అసలైన సత్యాన్నే చెబుతున్నట్టా?. "ఇదే సత్యం" అని మనతో నమ్మకంగా పలుకుతున్న ఇరు వర్గాల వారూ, వారి వారి రాజకీయ స్వలాభం కోసం నిర్మించుకున్న సత్యాలు, నిర్మిత సత్యాలు, కవిని ప్రభావితం చేస్తాయా?. కవి ఈ నిర్మిత సత్యాల ముసుగులోంచి, ముసురులోంచి బయటపడి అసలైన సత్యాన్ని దర్శించగలుగుతాడా?.  సమాజాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగే శక్తి, నిజాయితీ, నిబద్ధత కలిగిన కవి కన్ఫర్మేషన్ బయాస్ కి లోను కాకుండా పని చేయగలడా?.

కన్ఫర్మేషన్ బయాస్ అంటే ఏమిటి?. అంటే ఒక విషయం పై ముందే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొని ఉండటమే కాక, ఆ తరువాత ఆ విషయానికి సంబంధించిన ఏ సమాచారాన్నైనా, మొదట ఏర్పరుచుకున్న అభిప్రాయ దృక్కోణం లోంచే చూడటం. 'నిక్కములే తోచుచుండు' కూడా కన్ఫర్మేషన్ బయాస్ వలననే. స్నేహం చెడిపోయాక ఏర్పడిన వ్యక్తిగత విద్వేషం. మనిషికుండే ఈ బేసిక్ నేచర్ ని ఉపయోగించుకుని, పాలక ప్రతి పక్షాలు తమ తమ క్యాంపైన్ ని మొదలుపెడతాయి. చివరికి వ్యాపార సంస్థలు కూడా మనం కొనుక్కునే ప్రతీ వస్తువునూ అడ్వర్టయిజ్మెంట్ల ద్వారా మనలో ఒక కన్ఫర్మేషన్ బయాస్ ని ఏర్పరచి మనల్ని తమకు అనుగుణంగా మలచుకుంటాయి. మన 'ఏషియన్ ఫుడ్స్' వండటానికి పల్లీ నూనె స్రేష్టమైనదైనా, పెద్ద పెద్ద పూరీల నడుమ చిన్న పిల్లగాడు ఉరుకుతూ  మనలోకి సన్ఫ్లవర్ నూనె నే మంచిదనే ఒక అభిప్రాయాన్ని ముద్ర వేశాడు. మనం కన్వీనియంట్ గా నమ్మేస్తాం. నూనెలో సహజంగా వచ్చే నురగ కనపడటకపోయేసరికి స్వచ్ఛంగా మనకోసం ప్యూరిఫై చేశారనుకుంటాం. కానీ కంపెనీ వాడి ప్యాకేజీలకు అనుగుణంగా నురగను తీసేసే హైలీ ఎసిడిక్ ఆడిటివ్స్ ని వాడతారని కన్వీనియంట్ గా మరచిపోతాం. అసలు తెలిసి ఉంటేనేకదా. కంపనీ వాడు తెలియనీయడు. చాలా గొప్పదనే నమ్మకాన్ని మన మనసులోకి చొప్పించేశాడు. ఈ విధంగా సంస్థలూ, వ్యవస్థలూ సత్యాలను నిర్మిస్తాయి. ఈ నిర్మిత సత్యాలు, ఒక రకమైన కన్ఫర్మేషన్ బయాస్ ఉన్న వారికందరికి అబ్సొల్యూట్ సత్యాల్లాగానే కన్పిస్తాయి. దాన్ని దాటి కొత్తగా ఆలోచించటమన్నది అసలుకే సాధ్యపడని విషయం అయిపోతుంది. కవి కూడా ఈ నిర్మిత సత్యాల్ని కాలరాయలేని పరిస్థితిలోకి పోవటం, పాలక పక్షమో ప్రతి పక్షమో ఇంకో కొత్త పక్షమో చేరిపోవటం సాహిత్య పరంగా దారుణమైన విషయమే అవుతుంది.

కానీ మనకు ఇలాంటి బయాస్ కి అతీతంగా కొంతమంది కవులు కన్పిస్తారు. ముఖ్యంగా దిగంబర కవులు. అయితే దిగంబర కవిత్వపు లక్షణాల్నీ లక్ష్యాలనీ చర్చించటం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. ( ఆ పనిని మునుముందు రాబోయే వ్యాసాల్లో చేయాలి అనుకుంటున్నాను). కానీ ఇక్కడ తమ స్వంత ఆలోచనా శక్తితో, ఎలాంటి ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ల ప్రభావానికీ లోను కాకుండా ఈ దిగంబర కవులు ఎలా సమాజాన్ని నగ్నంగా ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగారన్నది చాలా ముఖ్యవిషయం.  వారి నిబద్ధత, సత్య సంధత ఇపుడు మనకు ఆదర్శం కావాల్సిన అవసరం ఉంది.  ఎందుకంటే ఇపుడు మనకు దొరికే ఇన్ఫర్మేషన్ అంతా కేవలం మీడియా ద్వారా లభించేదే. నిజానికి అది మనకు శుద్ధంగా చేరుతుందనే నమ్మకం లేదు. థియరీ ఆఫ్ సిమ్యులేషన్ అని ఉంది. బాద్రిల్లర్ ప్రతిపాదించినది.  'అసలు గల్ఫ్ యుద్ధం జరిగిందా?!' అని అడుగుతాడాయన. ఏమో ఎవరికి తెలుసు?. మనకు తెలిసిందంతా అమెరికన్  మీడియా చూపించినదే. అవి నిర్మిత సత్యాలయిండవచ్చు కదా!. వార్తలని కూడా స్టైలైజ్డ్ వర్షన్ లాగా ఫిక్షన్ లాగా చూపెట్టడం ప్రస్థుతం జరుగుతోంది. కొన్ని వార్తా ఛానల్స్ ఇంకాస్త అరాచకంగా 'పొలిటికల్ గాసిప్స్' ని ప్రసారం చేస్తున్నాయి. గాసిప్స్ అంటే పుకార్లు. పుకార్లు వార్తలెలా అవుతాయి?. పుకార్లని కనుక్కని, వీలైతే తయారు చేసుకుని ప్రజలకు చూపించటం జర్నలిజం అవుతుందా?. ఇలా వాస్తవమూ, ఫిక్షన్ కలిసిపోయిన ఈనాటి సమాజంలో, సత్య సంధుడైన కవి జాగరూకతతో ఉండక తప్పదు.

కవికి కార్య రంగం సమాజమే, కార్య ప్రేరణ సమాజమే, కవితా వస్తువూ సమాజమే అయినపుడు, సునిశిత దృష్టి కూడా అవసరమే. అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో కూర్చుని ఇండియా గురించి రాసే  వారికీ, అడుగు బయట పెట్టకుండా ఇంట్లో కూర్చుని రాసే వారికీ ఈ ప్రస్తుత సమాజానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి వస్తుంది?. అంతా మీడియా మీదనే కదా ఆధార పడేది. ఆ కవిత నిజమైన కవిత అవుతుందా. లేక ఒక వర్గం ని ఎలివేట్ చేసే అడ్వర్టయిజ్మెంటవుతుందా? ఇదేమీ ఎమోషన్ రి కలెక్టెడ్ ఎట్ ట్రాంక్విలిటి కాదుగా, భావ కవిత్వం రాసుకోవటానికి. సమాజాన్ని నగ్నంగా వర్తమానంలో ఉన్నది ఉన్నట్టు గా రాయాలి. అదిగో అలా రాసి ఒక దిశా నిర్దేశం చేసిన వారే దిగంబర కవులు. వీరి సామాజిక దృక్కోణం అస్తిత్వ వాదుల 'డిస్పెయిర్'( despair) కాదు. డిస్పెయిర్ మాత్రమే అయితే కవిత్వం రాయటమెందుకు, సార్త్రే 'నాసియా' చదివి సూయిసైడ్ చేసుకోవచ్చు. లేదా అల్బర్ట్ కామూ సృష్టించిన మెర్ సాల్ట్ లాగా మరణాన్ని చూసి దుఃఖ పడకుండా స్తబ్దుగా ఉండిపోయుండొచ్చు. మెర్ సాల్ట్ ని, రేయ్మండ్ బండ బూతుల లెటరు రాసియ్యమని అడిగినపుడు రాయనని అనటానికి కారణాలు కనిపించని స్థితిలో వీరేమీ లేరు. లేదా మెర్ సాల్ట్ లాగా 'దుఃఖాన్ని చూసి ప్రపంచం నిర్లిప్తంగా ఉండిపోతుందని తెలుసుకోగలగటమే ఎన్లైటన్మెంటు'  అనుకుని, ఒక భావాతీత ప్రశాంత స్థితిలోకి వీరు జారిపోనూలేదు.  అందుకు విరుద్ధంగా ధ్వంస రచన కు పూనుకున్నారు.

దిగంబర కవుల్లో ఒకరైన చెరబండ రాజు రాసిన "వందేమాతరం" కవిత, ఒక సత్యాన్ని ఎలాంటి ప్రలోభాలకీ లోనవకుండా దేశాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనముందు ఉంచుతుంది . ఈ కవితలో ఇంకో ప్రత్యేకత ఏమంటే 1965 లో చెరబండ రాజు చూసిన దేశ పరిస్థితికీ ఇప్పటికీ ఏ మాత్రం తేడా లేకపోవటం. అప్పటి పరిస్థితులకన్నా, ఇప్పటి పరిస్థితులకే ఈ కవిత ఇంకా చక్కగా అమరినట్టు కనిపించటం. తేడా ఉన్నదల్లా, ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్లని సమర్థవంతంగా మోస్తున్న మీడియా, అది ప్రజల్ని వర్గాలుగా చీల్చి ఒక్కొక్క వర్గాన్నీ ఒక నిర్మిత సత్యాన్ని నమ్మించగలిగి, అదే నిజమనుకొనే భ్రమలోనే ప్రజల్ని ఉంచగలగటం. చెరబండ రాజు కవితలో అరాచకం కనిపించదు. నిబద్ధతతో కూడిన దేశభక్తి కనిపిస్తుంది. అయితే దేశభక్తి అనే దాన్ని ఒక 'ఎమోషనల్ భావన'గా మార్చి వేసినపుడు ఈ పదమే హాస్యాస్పదం అవుతుంది. నిజానికి దేశమనే 'భావం' మిథ్య. కానీ 'దేశం' సత్యం. దీని వలన దేశ భక్తి రెండు రకాలుగా కనిపిస్తుంటుంది. దేశమనే పవిత్ర భావనలాంటి ద్వారా వచ్చిన భక్తి. ఇది ప్రేయసి లేదా దేవుడు స్థానంలో దేశాన్ని ఉంచటం వల్ల కలిగిన అవస్థ. అలాకాక దేశమనేది జవజీవాలు కలిగిన సత్యం లాగా తెలుసుకొని దానిలోని జీవులూ, వారి జీవితమూ, వేదనలూ, ఆకలిలోంచి వచ్చిన మానవతతో కూడిన దేశ భక్తి. దేశాన్ని ముందుకి నడిపించటం ఈ రెండవ రకం వారికి కేవలం ఒక భావన కాదు. యదార్థ సత్యం. వారికది ఒక పరిణామ విషయం. ఈ కవితలో ఇటువంటి భక్తి కనిపిస్తుంది. భారత దేశాన్ని తిట్టడం కాకుండా ఆమెని తమ స్వార్థానికి వాడుకుంటున్న శక్తుల మీద సటైర్ కన్పిస్తుంది. దీన్ని సరిగా అర్థం చేసుకోక పోతే, ఈ కవిత దేశ ద్రోహన్ని రెచ్చగొట్టేదానిలా కనిపిస్తుంది. అందుకనేమో కవితలో భారత దేశాన్ని కులటగా చిత్రించినట్టు గా అపార్థం చేసుకుని, చెరబండ రాజు మీద దాడి కూడా జరిగిందప్పట్లో. నిజానికి, ఇలా దిగజారిపోతున్న భారత దేశం మీద ప్రేమ దయ జాలి వంటివే కనిపిస్తాయి ఈ కవితలో. కవితలో నిరాశ కానీ, అసహ్యం కానీ కనిపించదు. కానీ ఒక ఆవేదన కనిపిస్తుంది. 'అమ్మా భారతీ, నీ గమ్యం ఏమిటి తల్లీ..!' అని అడగటంలో వ్వవస్థ మీద అసహ్యం ఎక్కడ కనిపించింది?.  సొల్యూషన్ కోసం అన్వేషణ కన్పిస్తుంది.

"దుండగులతో పక్క మీద కులుకుతున్న శీలం నీది".
ఈ దుండగులెవరు అంటే చెప్పటం కష్టం. దుండగులను ప్రోత్సహిస్తుందనే స్పృహ ఈ వాక్యంలో ఉంది. ఒక దేశం ఎందుకు దుండగులను ప్రోత్సహించాలి? ఎందుకు భరించాలి? అని మనం ప్రశ్నించుకుంటే విషయం చాలా పెద్దదవుతుంది. ఇక్కడ దేశం అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వమనుకోవాలి. రాజకీయ కారణాలే దుర్మార్గాల్ని ప్రోత్సహిస్తాయనేది అందరికి తెలిసిన విషయమే.

"అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది".
ఇంటర్నేషనల్ మార్కెట్ ఇపుడింకా ఎక్కువ అయింది. కానీ ఏకొద్దిగనో ఉండిన ఆ కాలంలోనే కవి గుర్తించి గర్హిస్తున్నాడు. తన అందాన్నే తాకట్టు పెట్టిందట. భారత దేశపు అందం ఏమిటి?. దాన్ని అంతర్జాతీయ విపణిలో తాకట్టు పెట్టి మనమేమి బదులుగా తెచ్చుకున్నాం అనేది మనం ఆలోచించాలి.

"సంపన్నుల చేతుల్లో మైమరచి నిద్రిస్తున్న యవ్వనం నీది".
సంపన్నుల చేతుల్లోనే రాజకీయాలు, ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఇది కవి యొక్క సునిశిత పరిశీలనకి తార్కాణమైన వాక్యం. ఇది ఇప్పటికీ మారలేదు. మారుతుందన్న నమ్మకం కూడా లేదు. ఈ విషయంలో నిత్య యవ్వనమే.

"ఊసినా దుమ్మెత్తి పోసినా చలనం లేని మైకం నీది".
దీనికి విరుద్థంగా ఇపుడు అతి చలనం కనిపిస్తుంది. దుమ్మెత్తి పోసే వారిలోనూ అతి, అలాగే స్పందించే వారిలోనూ అతి. చెరబండ రాజు సమయంలో లేని మీడియా అతి, మనకిపుడుంది. సమాచార విప్లవం సమాచారం కంటే అతినే అతిగా తీసుకుని వచ్చిందని టీవీ ముందు అయిదు నిముషాలు కూచుంటే చాలు. అర్థం అయిపోతుంది.

తరువాతి కవితంతా "రోటీ కప్డా అవుర్ మకాన్" లను అందించలేని దానిలా దేశాన్ని వర్ణిస్తాడు కవి . ఈ కవికి ఎంతటి లోతైన ముందు చూపుందో అనిపిస్తుంది. ఈ కవిత చూసే  తరువాత వచ్చిన ప్రభుత్వాలు రోటీ కపడా మకాన్ స్లోగన్ ఇచ్చాయేమో అనిపించినా, 1964 లో ఆకలి యువతరం(hungry youth) ప్రతినిధి గా కవి ఎంతగా నలిగి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు.ఈ స్లోగన్ ఆనాటి అందరి అవసరం అనిపిస్తుంది.

"కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న ఎలుకల్నీ పంది కొక్కుల్నీ భరిస్తూ నిల్చున్న భారతివమ్మా!..నోటికందని సస్య శ్యామల సీమవమ్మా!."
దేశంలో అభివృద్ధి జరుగుతున్నదనే కవి రాశాడు. దేశం సస్య శ్యామలంగా ఉందనే రాశాడు.  కానీ ఆ ఫలాల్ని తినే ఎలుకలూ పందికొక్కులు వాటిని అందరికీ అందనివ్వటం లేదు. ఎంత నిష్కర్షగా కవి చెప్పాడు. ఒక సంస్థ  వారికి ఈ కవితలో దేశ దూషణ ఎక్కడ కనిపించింది?. ఎందుకు కనిపించింది?. ఎందుకు కవి మీద దాడి చేశారు?. మనం ఇంతకుముందు అనుకున్నట్టు 'కన్ఫర్మేషన్ బయాస్' అయివుండవచ్చు.

దేశ పరిస్థితులను ఎలాంటి బయాస్ కీ గురికాకుండా చూడగలిగే చూపు, నిజాయితీ కలిగిన చూపు  దిగంబర కవుల్లో కనిపిస్తుంది. దాన్ని ఈ తరం కవులం అందిపుచ్చుకోవాలి. దానికి సరి అయిన తరుణం ఇదే.  సమాచార విప్లవం పేరుతో మన ఆలోచనల్ని పూర్తిగా కొల్లగొట్టి, తన ఆలోచనలని మాత్రమే మనలో చొప్పించే మీడియా, మనల్ని మనకు కాకుండా చేస్తున్న మీడియా, విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా విజృభిస్తున్న ఈ తరుణం లోనే చెరా ఈ కవితలో చూపిన స్పిరిట్ ని అందిపుచ్చుకోవాలి. ముందు కవి తనకుతాను స్వచ్ఛందంగా మేల్కొని, తరువాత సమాజాన్ని మేల్కొలిపే యజ్ఞంలో తలమునకలవాలి.

ఓ నా ప్రియమైన మాతృదేశమా
తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా
దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలం నీది
అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది
సంపన్నుల చేతుల్లో మైమరచి నిద్రిస్తున్న యవ్వనం నీది
ఊసినా దుమ్మెత్తి పోసినా చలనం లేని మైకం నీది
కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న
ఎలుకలూ పందికొక్కుల్నీ భరిస్తూ నుంచున్న భారతివమ్మా
నోటికందని సస్యశ్యామల సీమవమ్మా
వందేమాతరం వందేమాతరం
ఒంటిమీది గుడ్డలతో జండాలు కుట్టించి
వివస్త్రవై ఊరేగుతున్న ధైర్యం నీది
అప్పుతెచ్చి లేపిన మిద్దెల్లో, కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది
ఎండిన స్తనాల మీదికి ఎగబడ్డ బిడ్డల్ని, ఓదార్చలేని లోకం నీది
ఆకలికి ఎండి మాడి ఎరువు సొమ్ములతో వీధిన పడ్డ సింగారం నీది
అమ్మా, భారతీ నీ గమ్యం ఏమిటి తల్లీ
వందేమాతరం వందేమాతరం

2/12/15

Saturday, 28 November 2015

Recession / poem

విరించి ll  రిసెషన్  ll
..............................................
ఈ రోజు నీ మాటలు విన్నప్పటినుంచి
నాకెందుకనో ఒకింత భయంగా వుంది

ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ
ఈ రోజు నీవు చెప్పిన మాటలు
ఎందుకనో మొదటి సారి నాలో
ఒక ప్రేమ రాహిత్యాన్ని సృష్టించాయి.

మన మొదటిరాత్రి నాటి మల్లెల పరుపు మీద
మూసి ఉంచిన అకెడమిక్ సర్టిఫికేట్స్ ఫైల్ లాగా
ముడుచుకుని పడుకున్న నేను,
మరునాటి ఉదయానికల్లా
నిర్మలమైన నీ ప్రేమలో నలిగిపోయిన
పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్నయ్యాను.

ప్రతీ ఉదయం పూట, మధ్యాహ్నానికి లంచ్ బాక్స్ ను
తయారు చేసి నీ చేతికి అందించేటపుడు
పీ హెచ్డీ థీసీస్ పేపర్లు అందించిన జ్ఞాపకం.
థీసీస్ చివరి రిఫరెన్స్ నోట్స్ లో..
పెండ్లీ, సంసారమూ
ఎంగిలి అంట్లూ, విడిచిన బట్టలూ
పిల్లలూ, ఆచారాలూ ఎట్సెట్రా
ఇంక్లూడ్ చేయక పెద్ద తప్పు పనే చేశాన్నేను.

పేరు ముందర ఒక 'డా' అక్షరం
పక్కన రెండు నిలువు గీతల్ని ఊహించుకున్నపుడు
మారిపోయే ఇంటి పేరును పట్టించుకోకపోవటం
నిజంగా నాదే తప్పు.

కానీ ఈ రోజు,
ఒక రిసెషన్ పరిగెత్తి వస్తేనో..
పిల్లల స్కూలు ఫీజులూ, పెట్రోలు ధరలూ
పెట్రేగి పోతేనో.., చివరికి ఇన్ని రోజులకు,
నేనూ ఓ ఉద్యోగం చేస్తే బాగుంటుందన్నావు చూడు..
మొదటి సారి నా చదువుకొక వాల్యూ ఇచ్చావు చూడు..
ఇంట్లో ఇన్నేళ్ళుగా పడి ఉన్న నన్ను
అవసరానికి పనికొచ్చే ఒక యంత్రంలా
నీవు కొత్తగా నన్ను డిస్కవరీ చేసినట్టనిపించింది.

నేనో యంత్రాన్నే...మనిషిని కాదని
నాకు నేనుగా తెలుసుకోగలిగినపుడు
ఆనందం స్థానంలో...ఒక భయం పుట్టుకొచ్చింది.
నిర్మలమైన నీ ప్రేమ వెనుక ఒక జగన్నాటకం రక్తికట్టింది.

కానీ, ఓ. కే. చెప్పేముందు ఒక్కటే కోరిక
ఈ రిసెషన్ ముగిసిపోయాక
నా సైన్ బోర్డ్ మీద ఏం రాసుకోవాలో ఇపుడే చెప్పు
డాక్టర్ అనా..గృహిణి అనా?

24/11/15

Kavitwa sandarbham 1-కదం త్రొక్కుతూ పదం పాడుతూ హృదయాంతరాళం గర్జిస్తూ...పదండి పోదాం.

కదం త్రొక్కుతూ  పదం పాడుతూ  హృదయాంతరాళం గర్జిస్తూ...పదండి పోదాం.
-------------------------------------------------------------------------------------------------

ఒక కవిని, అతడి కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే సాధనాలూ పద్ధతులూ ఎన్నో వున్నా, వర్తమాన, అలాగే కడపటి భూతకాల సాహిత్య చరిత్ర కనుక మనకు తెలిసి వుండకపోతే, ఆ కవిత సంపూర్ణంగా అర్థమయిందని చెప్పగలగటం సాహసమే అవుతుంది. ఎందుకంటే కవి జీవితం, వ్యక్తిత్వం అలాగే అతడి కవిత అన్నీ కూడా కాలానితో అవినాభావ సంబంధాన్ని కలిగి వుంటాయి. కడపటి భూతకాలమూ, నేటి వర్తమాన పరిస్థుతులూ రెండూ కవి ఆలోచనల్ని ప్రభావితం చేస్తాయి, అలాగే కవి కూడా తన రచనలతో అతడి వర్తమాన, సమీప భవిష్యత్తునూ ప్రభావితం చేయగలుగుతాడు. మనకు చాలా మటుకు తాను జీవించి వున్న కాలం యొక్క ప్రభావానికి లోనయిన కవులే కనిపించినా...ఎక్కడో ఓ చోట ఒక మహా కవి, ఒక యుగ కవి, తాను నివసించిన కాలాన్ని శాసిస్తూ కూడా కనిపిస్తూంటాడు. అలాంటి కోవకి చెందిన వాడే శ్రీశ్రీ.

శ్రీశ్రీ మహా ప్రస్థానం పుస్తకంలోని కవితలు 1930 - 1940 సంll ల మధ్య కాలం లో రాసినవి. ఇలాంటి సమయంలో పశ్చిమ దేశాలయిన యూరోప్ అమెరికాల్లో మొదటి ప్రపంచ యుద్ధ ముగింపు ప్రభావమూ, గ్రేట్ డిప్రెషన్ ఆఫ్ 1929,  తద్వారా హంగ్రీ థర్టీస్ వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వీటి ప్రభావం పశ్చిమ దేశ సాహిత్యంలో పెను మార్పులు తీసుకువచ్చి, 'మోడెర్నిజం' అనే సాహిత్య దశ కనిపించటం మొదలయ్యింది. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా రాజకీయ సాంస్కృతిక రంగాల్లోనే కాక, సాహిత్య రంగంలో కూడా అధికారం మెల మెల్లగా బ్రిటీష్ చేతుల నుండి అమెరికాకు మారటం సంభవిస్తూ వుండింది. ఎజ్రా పౌండ్, టీ.ఎస్.ఇలియట్ వంటి అమెరికన్ కవులు మోడర్నిస్ట్ మానిఫెస్టోతో  ఆంగ్ల సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న తరుణమది. ఇక్కడ, భారత దేశంలో బ్రిటీష్ పరిపాలన ఉంది. దాని ప్రభావం వలన ప్రజా చైతన్యం, కేవలం రాజకీయ చైతన్యంగా మాత్రమే కాక ఇంకా రెండు రకాల చైతన్యాలుగా వృద్ధి చెందుతూ  వచ్చింది. మొదటగా, ప్రాచీన భారత వైభవాన్ని పునర్నిర్మించే దిశగా మత సంస్కరణలూ, సమాజోద్ధరణలూ ఊపందుకున్నాయి. అందుకు రాజా రామ్ మోహన్ రాయ్, స్వామీ దయానంద సరస్వతి, స్వామీ వివేకానందుడూ మున్నగు వారు తమతో నూతన చైతన్యాన్ని కూడా భారత సమాజం లోకి తీసుకు వచ్చారు. అందులో భాగంగానే ఏకేశ్వరోపాసన, పౌరాణిక సంస్కృతి స్థానే వైదిక సంస్కృతి యొక్క పునరుద్ధరణ, అగ్రవర్ణ ఛాందస వాద ఖండన, బాల్య వివాహాది మూఢ విశ్వాసాల ఖండన, విశ్వ మానవ అంకురార్పణ వంటి అంశాల్ని సమాజపు తెరమీదకి తెచ్చి ముందుకు నడిపించారు. మరో వైపు ఆంగ్ల విద్య పాశ్చాత్య సాహిత్య చైతన్యాన్ని కూడా అందించింది. బ్రిటీష్ లో వర్ధిల్లిన రొమాంటిసిజం మన దేశం లో కూడా తన ప్రభావాన్ని చూపించింది. బెంగాల్ లో రవీంద్రుడి మొదలు ఇక్కడ తెగులో విశ్వనాథ, కృష్ణ శాస్త్రి మున్నగు వారి చేత ప్రణయాలు, విరహాలు, వియోగాలు, విషాదాలూ అద్భుతంగా పలికించింది. ఇక్కడ గమనించినట్టైతే రాజకీయ చైతన్యానికి తప్ప, మిగిలిన ఈ రెండు చైతన్యాల్లో బ్రిటీష్ పాలనపై ఏహ్య భావమేమీ లేకపోగా, సానుకూల భావన కూడా అగుపిస్తుంది.

కానీ మొదటి ప్రపంచ యుద్ధం,  ప్రాశ్చాత్యానికి 'రెనీసా' అందించిన మానవత్వ భావననీ, 'రోమాంటిసిజం' అందించిన ప్రణయాది ప్రేమభావనల్నీ, విరహాది మేలంఖోలీని అకస్మాత్తుగా వెనుకకు లాగేసుకోవటం చేసింది. యుద్ధపు తరువాతి పరిస్థితులు మానవుడి స్థితి గతి ఏమిటని ప్రశ్నించాయి. ప్రపంచ వర్తమానం ఒక అయోమయావస్థకు నెట్టివేయబడేసరికి , 'గతకాలమే మేలు వచ్చే కాలము కంటెన్' అని విశ్వసించే రోజులెక్కువౌతున్నట్టనిపించింది. వేస్ట్ లాండ్, యులిసిస్ లు వర్తమానాన్ని చూసి పెదవి విరుస్తూ కనిపించాయి. చైతన్య స్రవంతిలో గొణుక్కుంటున్నట్టు వినిపించాయి. 'మంచి గతమున కొంచమేనోయ్, మందగించక ముందుకడుగెయ్యమ'ని దిశా నిర్దేశం చేసేవారు కావాల్సి వచ్చింది. సాహిత్య పరంగా పాశ్చాత్యాన్ని అనుసరించే భారత దేశం, ఈ పరిస్థితులనుంచి, చాలానే నేర్చుకుంటూ కనిపించింది. ఇక్కడి పరిస్థితులు కూడా ఇంచుమించు అక్కడిలాగా అస్ధవ్యస్థంగానే సాగుతున్నట్టుగా తెలుసుకోగలిగింది. అలాంటి సమయంలోనే దారిలో లాంతరులా తెలుగులో నవ యుగ వైతాళికుడిలా గురజాడ నవ సాహితీ లోకానికి రోడ్డు వేయటం మొదలెట్టాడు. ఆ తరువాత వచ్చిన శ్రీశ్రీ గురజాడ వేసిన రోడ్డును వెడల్పు చేయటం మొదలెట్టాడు. అందుకే ఛంధో బద్ద కవిత్వపు సర్ప కోరల్ని గురజాడ జాగ్రత్తగా పెకిలింప ప్రయత్నిస్తే,  శ్రీశ్రీ ఆ సర్ప పరిష్వంగం నుంచి పూర్తిగా తప్పించగే ప్రయత్నం చేసి విజయుడిగా నిలబడ్డాడు.

అందుకే 'మహా ప్రస్థానం' కవితలో వినిపించే పిలుపు మరో ప్రపంచపు పిలుపు. ఆధునికతవైపు నడవమని కవి మనల్ని పిలిచే పిలుపు. మనిషి మరణం తరువాత పొందే పరలోకమో, స్వర్గమో కాదు ఆ మరో ప్రపంచం. అట్టి స్వర్గాదులకు పోవాలంటే పదండి ముందుకు అనే బదులు, చావండి ఇపుడే అనవలసి వచ్చేది. కానీ పదండి ముందుకు పదండి తోసుకు అని అంటున్నాడంటే, అది ఇపుడే, ఈ క్షణమే, మనం మారిన తక్షణమే కనిపించే కొత్త ప్రపంచమే. అందుకే మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పైపైకి. ఉన్న స్థానం నుండి కేవలం ముందుకు మాత్రమే కాకుండా, కేవలం పైకి మాత్రమే కాకుండా , ముందుకీ ఆపై, పైకీ కూడా ఒకేసారిగా పయనం. ఈ కవిత తెలుగు సాహిత్యంలో ఒక ల్యాండ్ మార్క్. ఒక నవ్యత వైపు కదలమని వినిపించిన మొట్ట మొదటి పిలుపు. కదం త్రొక్కుతూ  పదం పాడుతూ  హృదయాంతరాళం గర్జిస్తూ...పదండి పోదాం. కవితలో కవి ఆ మరో ప్రపంచానికి ఎలా సమాయత్తమై పోవాలో..ఎవరు పోవాలో ఎవరు పోకూడదో స్పష్టంగా చెబుతాడు కానీ ఆ మరో ప్రపంచం ఎలా వుంటుందో చూచాయగా తప్ప స్పష్టంగా చెప్పడు.

మరో ప్రపంచానికి ఏ విధంగా పోవాలి?. కదం త్రొక్కుతూ,  పదం పాడుతూ,  హృదయాంతరాళం గర్జిస్తూ, దారి పొడగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ, ప్రభంజనం వలె హోరెత్తుతూ,  భావ వేగమున ప్రసరిస్తూ , సైనికుడి వలె, వర్షకాభ్రముల ప్రళయ ఘోషవలె, పెళపెళ విరుచుకు పడుతూ,  త్రాచుల వలెనూ, రేచుల వలెనూ, లక్ష్యాన్ని ఛేధించగల ధనంజయునిలా, నయగారా శివసముద్రమూ జలపాతాల వలె ఉరుకుతూ..ముందుకు సాగాలంటాడు. ఎంతటి ఆశని నమ్మకాన్ని ఇస్తున్నాడో కవి ఇక్కడ. ఇది దిశా నిర్దేశమే.  మరి అక్కడికి ఎవరు పోవాలి?. ఎముకలు కుళ్లిన వయస్సు మళ్లిన సోమరులు కాకుండా, నెత్తురు మండే శక్తులు నిండే సైనుకులే పోవాలి. 'వట్టిమాటలు కట్టి పెట్టోయ్ గట్టిమేల్ తల పెట్టవోయ్' అని గురజాడ అంటున్నట్టే వుంది కదా ఇక్కడ!.

మరి ఆ మరో ప్రపంచం ఏమిటి?. ఇందాకా చెప్పుకున్నట్టు మనిషి చచ్చాక పొందే పరలోకమో స్వర్గమో ఖచ్ఛితంగా కాదది. అందుకే ఈ మహా ప్రస్థానం మహాభారతంలో వచ్చే చివరి మరణం కాదు. పైగా అందుకు విరుద్ధంగా ఇది కొత్తగా మొదలయ్యే మహా ప్రయాణం. ఇది ఇలియట్ కవి వేస్ట్ ల్యాండ్ లోని 'క్రూర ఏప్రిల్ మాసం' లాంటి ప్రయోగం. అందుకే ఇది ప్రగతి వైపుకి, ఆధునికత వైపుకి ప్రయాణం. ఈ ధరిత్రి అంతటా ఆ మరో ప్రపంచం నిండి వుందట.  అంటే ఆధునికతనే ఆ మరో ప్రపంచం అన్నది మరోసారి స్పష్టం. పురాణేతిహాసాల్లోని స్వర్గమో, పరలోకమో అయితే ఇలా ధరిత్రి అంతటా నిండి ఉండదు కదా?. కవితలో ఈ మరో ప్రపంచానికి సంబంధించిన ప్రతీకలుంటాయి. వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం అని అడుగుతాడు కవి. ఆ జలపాతపు ఘోష అని ఉద్దేశం కావొచ్చు. కంచు నగారా విరామ మెరుగక మ్రోగిందని శబ్ద సంబంధ ప్రతీక ఇంకొకటుంటుంది. నయాగారా జలపాతంలా శివసముద్రంలా ఉరకండి అని జలపాతాల్ని ఇంకొక చోట రూపకాలంకారంలతో ఉద్రేకాల్ని స్తబ్ద ఉపమేయాలకి అద్దుతాడు కవి. నయాగారా ఉత్తర అమెరికాలో వుండటం, అక్కడే ఆధునిక సాహిత్య అంకురార్పణ జరగడం యాదృచ్చికం కాకపోవచ్చు. కానీ ఏ సంబంధం లేకుండా కర్ణాటక లో వుండే శివ సముద్రమనే జలపాతాన్ని కూడా కలపటం వల్ల, నిగూడార్ధ దృష్టితో కాక, ఇవి అతి పెద్ద జలపాతాలు కాబట్టి మాత్రమే కవితలోకి తీసుకున్నట్టనిపిస్తుంది.

కణ కణ మండే త్రేతాగ్ని, అగ్ని కిరీటపు ధగధగలు, ఎర్ర బావుటా నిగనిగలూ, హోమ జ్వాలల భుగ భుగలూ మరో ప్రపంచంలో కనబడటం లేదా అని అడుగుతాడు కవి. అగ్నికిరీటం జ్ఞానానికి, ఎర్ర బావుటా సోషలిజానికీ, హోమ జ్వాలలు పారిశ్రామిక శక్తికీ ప్రతీకలనుకోవచ్ఛు. అయితే శ్రీశ్రీ ఈ కవిత రాసే సమయానికి తనకి కమ్యూనిజం అంటే అవగాహన లేదన్నాడు కాబట్టి, ఇదమిత్తంగా ఎర్ర బావుటా అంటే ఇదీ అని చెప్పలేము. కాబట్టి ఈ మరో  ప్రపంచానికి సంబంధించిన ప్రతీకల్లో అర్థాన్ని అనిర్దిష్టంగా ఉంచబడింది. ఈ ప్రతీకల్ని అస్పష్ట అర్థస్ఫూర్తి కోసమే వాడుకున్నారు తప్ప, నిర్ధిష్టార్థంతో వాడుకోలేదు అనిపిస్తుంది. తద్వారా కవి యొక్క దృష్టి మరో ప్రపంచపు వివరణ పై కాక ఆ ప్రపంచం వైపుగా తిప్పటమే ప్రధానమనిపిస్తోంది. అలాగే త్రేతాగ్నిని జీవితం మొత్తం సాగే అగ్నిగా, అంటే నిరంతర జ్ఞానంగా భావన చేసి ఉండవచ్చు. శ్రౌత యాగాలల్లో ఈ త్రేతాగ్నులు వస్తాయి. గార్హపత్య, ఆవహనీయ, దక్షిణాగ్నులు. పెండ్లి అయినప్పడు లాజహోమంలో వెలిగించే ఆవహనీయ అగ్నిలా మొదలయ్యి, జీవితాంతము వరకు గార్హపత్య అగ్నిగా వ్యక్తిని నడిపి, చివరకు తన చితిని కూడా, అప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చిన అగ్నితో, దక్షిణాగ్నిలా ముగించే ఒక ప్రక్రియ ఇది.  అలాంటి ప్రక్రియని కొనసాగించే వ్యక్తిని అగ్ని హోత్రుడంటారు. మరో ప్రపంచంలో జీవిత మంతా అగ్నిహోత్రుడి తపస్సులా సాగే జ్ఞానాన్ని, కణ కణమండే త్రేతాగ్ని లా భావన చేసి ఉండవచ్చు. అగ్ని జ్ఞానానికి సిద్ధ ప్రతీక.

తరువాత ఈ కవితలో హరోం హరోం హర, అనే పదము కనిపిస్తుంది. శివుని ప్రమథ గణాలు వీరభద్రుని ఆధ్వర్యంలో దక్ష యజ్ఞాన్ని కూల్చినపుడు హర హర మహాదేవ అంటూ హరుడిని స్తుతించాయంటారు. దానికి తెలుగు రూపం హరోం హరోం హర అయిందనుకోవాలి. సంస్కృత వ్యాకరణం రీత్యా..'ఓం కారం' మంత్ర మధ్య భాగం లో రాదు. కాబట్టి, ఇది తెలుగు పదమే. లేదా శృతి సంబంధం కాక, కావ్య సంబంధమైన సంస్కృతమై ఉండిండాలి. అలాగే కవితలో ప్రళయానికి సంబంధించిన ప్రతీకలు కనిపిస్తాయి. ఎనభై లక్షల మేరువులు సముద్రాల తిరిగి జల ప్రళయ నాట్యం చేయటమనే దృశ్యం కనిపిస్తుంది. వీటి పరమార్థం బోధపడదు. 'సలసల కాగే చమురా కాదిది, ఉష్ణ రక్త కాసారం'  అనేది, యంత్రం కాదు మనిషి అనే భావనని ఇస్తోంది. దీని పరమార్థం కూడా ఇదమిత్తంగా ఇదీ అని చెప్పటం కష్టం. మరో ప్రపంచం మరో ప్రపంచం అనే కవితా ముఖభాగం శబ్ద పరంగా త్యాగరాజ కృతి 'భజ గోవిందం భజగోవిందం' తో సమానంగా ఉందనే ఇంకో పరిశీలన కూడా ఉంది. కవిత చాలా మటుకు వృత్త్యనుప్రాసాలంకారంలో కొనసాగుతుంది. దాని వలన నిజంగానే ప్రవాహ ఉధృతి కవిత గమనంలో కనిపిస్తుంది. వినిపిస్తుంది.

విప్లవాన్ని రగిలించే, విప్లవ నాయకుడు పుట్టాలంటే మొదట ఒక విప్లవ కవి పుట్టాలి. రష్యాలో ఒక లెనిన్ పుట్టడానికి ముందు, దాదాపు రెండు వందల సంవత్సరాలుగా ఆ నేలని విప్లవ భావాలతో తడిపేసిన పుష్కిన్, టాల్స్టాయ్, ఛేకోవ్, గొగోల్, తుర్జెనీవ్, దాస్తోయెవస్కీ లు పుట్టాల్సి వచ్చింది. శ్రీశ్రీ మహాప్రస్థానం కవితా సంకలనం 1950లో మొదటి ముద్రణతో మనముందుకు వచ్చింది. ఇపుడు యువ కవులు కూడా పుట్టుకు రావాలి. నవ్యత వైపు కొనసాగాలి. శ్రీశ్రీ కవిత్వంతో పాటు అతడు అనుసరించిన నవ్యత మనకు స్ఫూర్తి కావాలి.  రేపటి తరం విప్లవ నాయకులకోసం కవులు కవిత్వంతో ఇప్పటి ఈ నేలని సారవంతం చేయాలి. ఇప్పటికి ఇరవైకి పైగా పునర్ముద్రణలు పొందిన మహా ప్రస్థానం, మనల్ని మన ఆలోచనల్ని ఎంతగా ఆధునీకరించ గలిగిందో మనకు మనం సమీక్షించుకోవాలి.

చివరగా ఈ వ్యాసాల పై ఒక మాట. మనం అభిప్రాయాల్ని, లభించిన దృక్కోణాలాధారంగా ఎప్పటికప్పుడు సాధించుకుంటాము కాబట్టి, వీటికి మత సూత్రాల మాదిరిగా ఎమోషనల్ వ్యాల్యూని ఆపాదించి యూనివర్సాలిటీని ప్రతిపాదించవలసిన అవసరం లేదని చెప్పదలచాను. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే చర్చకు ఆస్కారమివ్వటం వలన కొత్త విషయాలను ఇచ్చిపుచ్చుకునే జ్ఞాన విస్తృతికి అవసరమైన సత్ వాతావరణాన్ని మనమే నెలకొల్పుకోవాలని మనవి.

శ్రీ శ్రీ కవిత 'మహా ప్రస్థానం' వ్యక్తమవటానికి గల చారిత్రక తాత్విక పరిస్ధితులను అవగాహన చేసుకోవటానే విషయంలో ఒక అడుగు ముందుకే వేయగలిగామని విశ్వసిస్తూ సెలవు. వచ్చే వారం మరొక కవిత్వ సందర్భంతో కలుద్దాం.

Kavitwa sandarbham 2- సరస్వతీ భక్తుల్లారా!..బ్రహ్మనే వెక్కిరిస్తారా!

సరస్వతీ భక్తుల్లారా!..బ్రహ్మనే వెక్కిరిస్తారా!
(కాళోజీ యాంటీ థీసీస్ లోంచి పుట్టుకొచ్చిన సింథెసిస్)

సాహిత్యానికేది ప్రమాణం. పదమా వాక్యమా అని ప్రశ్న వేసుకున్నపుడు, వాక్యమే ప్రమాణమని సమాధానం వస్తుంది.
పదం నిత్యం మార్పుకి గురవుతుంటుంది, మనుషుల కష్టాలూ బాధలు మారిపోతున్నట్టే పదాలూ మారిపోతాయి.
ప్రపంచ కష్టమే తన కష్టం కదా కవికి. బాధని ఒక కళగా అభ్యసించేవాడే కదా కవి.
కాలాన్ని పరిగెత్తించే వాడికి కాలానికి అనుగుణంగా భాష కూడా కావాలి. కొత్త పదాలు కావాలి.
వ్యాకరణం ఒక భాషలో ఉన్న వాక్యాల తీరు తెన్నులను విశద పరచటమే కాక,  కాలంతో పాటు  పదాలలో ఎటువంటి మార్పులు జరుగుతుంటాయో...మూల శబ్దమేదో, ప్రత్యయమేదో, ప్రత్యయం చేరటంతో శబ్దంలో వచ్చే మార్పులేవో, కాలానుగుణంగా ప్రత్యయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో, ఇలాంటి ఎన్నో విషయాల్ని వివరిస్తుంది.
ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, తెలుగు వారికి ఉన్న ఎన్నో సమస్యల్లో ఒక సమస్య,  ఎలాంటి తెలుగును సాహిత్యంలో వాడాలి అనేది.
ఇది ఎలాంటిదంటే వ్యాకరణం మన కోసమా...లేక మనం వ్యాకరణం కోసమా అనే ప్రశ్న వంటిది.

ఈ చర్చ ప్రధానంగా ఇరవైయవ శతాబ్దపు మొదటి అర్ధ కాలంలో తెర మీదికి వచ్చింది.
కావ్య భాష  అనబడే నిఘంటువు భాషకూ, ప్రతి రోజూ మనం మాట్లాడే తెలుగు భాషకూ అంతరం రాను రానూ విపరీతంగా పెరిగి పోయిందనే స్పృహ బహుశా అప్పటికి మనకు కలిగి ఉండటమే కారణం అయుండొచ్చు. బ్రిటీష్ పాలన తెచ్చిన ఆధునిక సాహిత్యం కూడా మనకీ స్పృహను కలిగించి ఉండవచ్చు.  తెలుగు కావ్య పరిశోధన చేసిన ఎందరో బ్రిటీష్ మేధావులు తోటి తెలుగు వారితో సరిగా మాట్లాడలేక పోయేవారట. మన వ్యాకరణం, నిఘంటువులు అన్నీ కావ్య భాషకు మాత్రమే రాసుకున్నవి కావటం వల్ల, ఎలా మాట్లాడాలో తెలియక తికమక పడేవారట. ఇలా గ్రాంధిక వ్యావహార భాషలుగా ఒక భాష చీలి పోయి వుంటే ఆ భాషని డైగ్లోస్సియా అంటారు. ప్రపంచంలోని ఇలాంటివి ఎన్నో భాషలున్నాయి. అందులో మన తెలుగూ ఒకటి.
మనకున్న సాహిత్యమంతా కావ్యాలే అనుకుంటే, వ్యాకరణ సూత్రానుసారమైన భాషనే కావ్యాల్లో వాడబడింది కాబట్టి ప్రస్తుత సాహిత్యానికి కూడా కావ్య భాషనే సరి అయినదని కొందరూ, కాదు వ్యావహారిక భాషనే సరైందని మరి కొందరూ వాదించారు. తెలుగు సాహిత్య లోకమంతా ఇలా యతాతథ వాదులూ, ఆధునిక వాదులని రెండు రకాలుగా చీలిపోయిందనుకోవాలి.

కావ్య భాషని కాదని, వ్యావహారిక భాషోద్యమాన్ని మొదటిసారి గిడుగు రామ్మూర్తి పంతులు గారు మొదలు పెడితే, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు వంటి వారు దాన్ని మరింత ముందుకి తీసుకు పోయారు. ఈ వ్యావహారిక భాషోద్యమానికి ఏమైనా చారిత్రకత తాత్వికత ఉందా అంటే, ఉంది అని చెప్పకతప్పదు.
దాని గురించి తెలుసుకునే ముందు అసలు కావ్య భాషంటే ఏమిటి?. తెలుగులో మొదటగా కావ్య భాష, మహాభారతాన్ని తెనిగించిన నన్నయతో మొదలైందని మనకు తెలుసు.
 నన్నయ భారత చరిత్ర కాలం రమారమి1050సం.

కోరాడ మహా దేవ శాస్త్రి గారి ప్రకారం,..(Historical grammer of Telugu-1961)
క్రీ పూ 600 నుంచి క్రీ. పూ. 300 వరకు చరిత్ర పూర్వ యుగం,
క్రీ పూ 300  నుంచి క్రీ..శ 1000  వరకు ప్రాచీనాంధ్ర యుగం,
క్రీ.శ. 100 నుంచి క్రీ. శ1600. వరకు మధ్యాంధ్ర యుగం,
క్రీ. శ1600 నుంచి నేటి వరకు ఆధునికాంధ్ర యుగం అనుకుంటే,

తెలుగులో ఆది కవి నన్నయ కాబట్టి, కావ్య భాష క్రీ.శ.1050 సమయంలో, మధ్యాంద్ర యుగంలో మొదలైందనుకోవచ్చు.
మరి అంతకు ముందు ఉన్న తెలుగేమిటి?.
దీనికి సమాధానం, బూదరాజు రాధాకృష్ణగారిస్తారు. ఆయన తెలుగునాట కావ్య భాష ఏనాడూ వ్యవహారంలో లేదని శాసనాధారాలతో నిరూపించారు. (Historical grammer of early Telugu -1963).
అంటే నన్నయ రాసినదైనా ఆనాటి వ్యావహారిక భాష కాదనేది అర్థమౌతుంది.

భాషా శాస్త్రం లో ఇటువంటి సిద్ధాంత గ్రంథాలు రాకముందే అభ్యుదయ కవులు సకల జనులకూ అర్థమయ్యే, వ్యావహారిక భాషలోనే సాహిత్య రచన జరగాలని ఉద్యమించారు.

మరి నన్నయ రాసిన మహా భారతానికి వ్యాకరణం ఏది? అంటే సమాధానం నన్నయ్యే చెప్పాలి.
శబ్దానుశాసనుడనని భారత అవతారికలో చెప్పుకున్న నన్నయే తెలుగుకి మొదటి వ్యాకరణం చేకూర్చి, సంస్కృత భారతాన్ని తెనిగించాడు. ఆ వ్యాకరణమే  నన్నయ కృత "ఆంధ్ర శబ్ద చింతామణి". ఇది సంస్కృత గ్రంథం.
భారత దేశంలో అచ్చు యంత్రం వచ్చాక అచ్చు వేయబడ్డ తాళ పత్ర గ్రంధాలన్నీ మను చరిత్ర, వసు చరిత్ర వంటి పౌరాణిక కావ్యాలకి అనుకరణలు మాత్రమేనని గమనించిన కందుకూరి వీరేశలింగం పంతులు, సంఘజనోద్ధరణకు ఇటువంటి భాష పనికిరాదన్నాడు. గురజాడ కూడా కదం తొక్కాడు. ఆ విధంగా ఇద్దరూ నవీన భాషోద్యమానికి చారిత్రక తాత్విక భూమికని కలిగించారు. ఆ అవసరాన్ని గుర్తించి వచన పద్య గద్యాల్ని ముందుకు నడిపించారు. తెలుగులో వ్రాయబడ్డా తెలుగు వారికి అర్థంకాని స్థితిలో కావ్య భాష ఉంది కాబట్టి, నిత్య జీవితంలోని భాషనే సాహిత్య భాషగా మార్చాలనే ఈ ప్రయత్నం, వడ్లమూడి గోపాలకృష్ణయ్య గారు వ్యావహారిక భాషా వ్యాకరణం అనే గ్రంథాన్ని రాసే దాకా కొనసాగింది.

భాష లక్ష్యం అయితే, వ్యాకరణం ఒక లక్షణం. కానీ, లక్ష్యం స్థానంలో లక్షణమే ప్రధానమై కూర్చుదేంటని ప్రశ్నించే వారు తమ వాదాన్ని ఆ కాలంలో బలంగా వినిపించారు. 1952 లో శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయ స్వర్ణోత్సవాల సందర్భంగా శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు ఉపన్యసిస్తూ, ఫరీద్ అనే తెలంగాణా కవి రాసిన 'కన్నీటి కబురు' అనే పుస్తకాన్నీ అందులో వాడబడిన భాషనీ, శీర్షికతో సహా తీవ్ర పదజాలంతో విమర్శించారు. ఆ మరునాడు జరిగిన కవి సమ్మేలనంలో శ్రీ పాద వారి విమర్శకు ప్రతి విమర్శగా కాళోజీ రాసిన కవితే 'సరస్వతీ భక్తుల్లారా!'. శ్రీ పాద గారి విమర్శలో గ్రాంధిక తెలుగు భాషపై ప్రీతియే కాక తెలంగాణా భాషమీద అవహేళన కూడా ఉండిందనే విషయం, కాలోజీ గారు ఈ మధ్య కాలంలో తెలంగాణా రచయితల వేదిక ప్రథమ వార్షికోత్సవ సమయంలో ఇచ్చిన అధ్యక్ష ఉపన్యాసంలో స్పష్టమౌతుంది. గిడుగు రామ్మూర్తి గారితో స్ఫూర్తిని పొందానని చెప్పుకుని వచనంలో కథలు రాసిన శ్రీపాద గారు, ఇలా వ్యావహారిక భాషని విమర్శించటం, ఈ అన్య కారణాలు ఉన్నాయనే ఊహకి ఊతమిస్తోంది.

కైతకు లక్షణాలున్నాయి కోటొక్కటి                               కన్నులకద్దుకుని భక్తులు పూజకై దాచుకున్నట్లు                    హైడ్రాలిక్ బ్రేక్సు కూడా ఫేలవుతున్నపుడు
వానిలో వ్యాకరణం కూడా ఒక్కటి                                మా నోట రాలిన మాట                                                   ప్రణయ జలనిధి నింపదలచిన ప్రవాహాన్ని
మీకు దాని సూత్రాలే సర్వస్వం.                                  ఆనోటా ఆనోటా                                                            ఆపడానికి మీ ఆనకట్టలు పనికొస్తాయా ?
గొంతుకు పోసుకుని వ్రేలాడి సతతం                             వినవిందై మనసుకు పసందై                                            హిమాలయ పర్వతాలే తలలు వంచుకుంటున్నపుడు
చేస్తారు ఆక్రందన, అంటారు కవిత్వం                            జపించి జపించి                                                             ఎన్నెన్ని జన్మాలెత్తి
'కైతకు వ్యాకరణమే పరమావధి                                  సూత్రాలలో బిగించి                                                        ఎంత పొంకంగా రాసినా లేఖకుడు
కాదు అసలే కాదు' అన్నాడు దాశరథి                          సారస్వత పూజా ద్రవ్యంగా                                               మహా రచయిత అనబడడు
మా రచనలో వ్యాకరణం మాత్రమే లేదు                        భద్రపరుచుకున్నారు మీ వైయాకరణులు                              వలయాలూ, చతుర్భుజాలూ
మీ రచనంతా వ్యాకరణం. మరేమీ కాదు                        అప్పుడప్పుడూ మేమన్నదే అయినది                                   వివిధ కోణాకారాలు
వ్యాకరణ సూత్రాలు పెట్టితే భట్టీ                                   మీ అప్ప కవీయం, కౌముది                                              నీటుగా రాసే రేఖా గణితజ్ఞుడు
కాదెప్పుడూ కైత పాకం గట్టి                                       సరస్వతీ భక్తుల్లారా  !                                                     మహా చిత్రకారుడనబడడు
పాతబాటల బట్టియే నడువగలరు మీరు                        బ్రహ్మనే వెక్కిరిస్తారా  !                                                    చిత్రకారుడు గీసిన
మా నడకలో పడుతుంది క్రొత్త త్రోవలకు తీరు                  మెరుపువలె పరుగిడు                                                    జీవితముట్టిపడే చిత్తరువులో
శతాబ్దాల తరబడి ప్రవాహంలో పడి                               మా ఊహా తరంగాలకు                                                    అవయవాల సొంపునుజూపే
రాపిడి ఫుణ్యాన రూపు రేఖలు దిద్దుకున్న                     బక్కెద్దులనాపే                                                              ఎత్తువంపుల కాధారమైన గీతలు
ముద్దు వచ్చే రాల్లను శివలింగాలని                             పగ్గాలు పనికొస్తాయా?                                                    వంకరటింకరగా ఉన్నాయన్న లేఖకుడు -
                                                                                                                                                         మా రచనల్లో తప్పులున్నాయనే వైయాకరణి

ఈ కవితలో, " సరస్వతీ పుత్రులారా..బ్రహ్మనే వెక్కిరిస్తారా" అనే వాక్యం చాలా తీవ్రమైన ధిక్కారాన్ని సూచిస్తుంది.
సరస్వతీ పుత్రులంటే వ్యాకరణం తెలిసిన పండితులు. బ్రహ్మ  అంటే కవు. కవి బ్రహ్మ అని తిక్కన బిరుదు.
బ్రహ్మనే ఆది కవి అంటాం. అతడు రచిస్తాడు కాబట్టి, విరించి అంటాం.
బ్రహ్మ రూపాలైన కవుల్ని, ఓ సరస్వతీ పుత్రులైన పండితులారా వెక్కిరిస్తారా? అని కవి ఆక్షేపణ.

గద్య తిక్కన వీరేశలింగం గారు 'సరస్వతీ నారద సంవాదం' అని ఒక కవిత రాశారు( 1887 ).
పదహారవ శతాబ్దంలో స్పెన్సర్ అనే కవి రాసిన టియర్స్ ఆఫ్ మ్యూజెస్ (Tears of Muses) అనే కవితను పోలి వుంటుంది
మ్యూజెస్ అంటే గ్రీకుల ఆరాధ్య చదువుల దేవత, మన సరస్వతీ అమ్మవారిలాగే.
ఒక రోజు నారదడు తన తల్లి సరస్వతి దేవి చాలా విచారకర వదనంతో ఉన్నట్టు గమనించి, కారణమేమని అడుగుతాడు.
నా బిడ్డలైన కవులు, రసాన్ని వదిలిపెట్టి పైపై మాటలతో విన్యాసాలు చేస్తున్నారనీ,
భావాన్ని కోల్పోయిన తన మాటలు తనకే అర్థం కాకుండా ఉన్నాయనీ,
వ్యాకరణాదులతో అలంకరించి తనకు సంకెల్లు వేస్తున్నారనీ, అవి నొప్పిని కలుగజేస్తున్నాయనీ సరస్వతీ దేవి బాధ పడుతుంది.
కవయః నిరంకుశః.
నిరంకుశత్వం భావ రసాల్ని పిండుకోవటంలో కాక భాషకు సంకెల్లు వేయటంలో ఏంటని అడిగినట్టుగా ఉంది కదూ ఈ సంవాదం. ఎంతో విశాలమైన సాహిత్యాన్ని, వ్యాకరణం బంధిస్తున్నట్టుగా వుంది కదూ..
ఏం సరస్వతీ భక్తులారా...బ్రహ్మనే వెక్కిరిస్తారా..?
"మా రచనలో వ్యాకరణం మాత్రమే లేదు
మీ రచనంతా వ్యాకరణం, మరేమీ కాదు".

మిగిలిన కవిత మొత్తం ఇవ్వబడిన అంశానికి యాంటీ థీసీస్ లాగా ఉంటుంది. ఒక ఆర్గ్యూమెంట్ ని వ్యతిరేకించటానికి సాగే ప్రతి వాదం లాగా సాగుతుంది. కాబట్టి తన వాదనకి తగ్గ సపోర్ట్ కోసం దాశరథిని కూడా ఖోట్ చేస్తాడు కవి.
"కైతకు వ్యాకరణమే పరమావధి
కాదు అసలే కాదు అన్నాడు దాశరథి" అని. ఇది కవితకు వచ్చిన అదనపు బలం.

కవితలో మొదట వ్యాకరణాన్ని నిర్వచిస్తాడు.
"కైతకు లక్షణాలున్నాయి కోటొక్కటి,
వానిలో వ్యాకరణం కూడా ఒక్కటి".

ఆ తరువాత కవిత మొత్తం ఆక్షేపణలతో స్టేట్మెంట్స్ తో సాగుతుంది.

ప్రతి వాదాన్ని పదే పదే బలంగా వినిపించాలి కాబట్టి, ఇటుకలు ఒకదాని తరువాత ఒకదాన్ని పేర్చినట్టు..థీసీస్ కి వ్యతిరేకంగా యాంటీ థీసీస్ ను ఒక క్రమ పద్ధతిలో నిర్మిస్తాడు కవి. ఇది మోడర్నిస్టు పద్దతి. ఈ క్రమంలో వ్యాకరణాన్ని బక్కెద్దులతో, ప్రళయ జలధిని ఆపలేని ఆనకట్టలతోనూ పోలుస్తాడు. వైయాకరణులను వలయాలూ చతుర్భుజాలూ రాసుకునే రేఖా గణితజ్ఞులతోనూ పోలుస్తాడు. జీవితముట్టిపడే చిత్రాన్ని చూసి, అవయవాల సొంపును చూసి, ఎత్తు వంపుల కాధారమైన గీతలు వంకరటింకరగా ఉన్నాయనుకునే రేఖాగణితజ్ఞుడిలాంటి లేఖకుడా..నీవా మా రచనల్లో తప్పులు వెతికేది అంటాడు.
ఈ కవితలో అప్పకవీయమనే శబ్దముంది. అపడపుడూ మేము మాట్లాడిన మాటలే మీ అప్పకవీయమైనదని అంటాడు కవి. నన్నయ సంస్కృతంలో రాసిన 'ఆంధ్ర శబ్ద చింతామణి'ని తెలుగు చేసిన వాడు, పదిహేడ శతాబ్దానికి చెందిన కాకునూరు అప్పకవి. అదే 'అప్పకవీయం'. మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ వాస్తవ్యుడు కావడం వల్లేమో..ఈ అప్పకవీయం చాలా అవమానాల్ని మోస్తోందనిపిస్తోంది. అప్పకవిని కాళోజీ కూడా వదిలి పెట్టలేదు మరి.

ఏది ఏమైనా, వ్యావహారిక భాషోద్యమం రావటం, ఒక చారిత్రక అవసరం అయింది. దాని తర్వాత వచ్చిన అభ్యుదయ కవిత్వాలకి, అస్తిత్వ వాదాలకీ ఈ ఉద్యమం ఆలంబనగా నిలిచింది. అయితే వ్యావహారిక గ్రాంధిక భాషోద్యమాలు సైంద్ధాంతిక విబేధాల్నే కాక ప్రాంతీయ వ్యక్తిగత విబేధాల్ని కూడా మోసి ఉండవచ్చు అనిపిస్తుంది. అందువలన చైతన్యమూ మాధుర్యమూ వివేకమూ అందించవలసిన సాహిత్యం, తగవులనీ అణచివేతనీ కూడా అందించాయి. ఆ పునాదుల్లోంచి పుట్టుకొచ్చిన మనం ఆధునిక భాషని అందిపుచ్చుకున్నామేగానీ, ఆధునికతను కాదు. పాత భాషని ఒదిలించు కోవటంతో పాటు ఆ జీవన మాధుర్యాన్నీ, స్నేహశీలతనూ ఒదిలించుకున్నాం. పాత కొత్తల్లోని మంచిని గ్రహించి మనకు మనమే కొత్తగా సింథెసిస్ ని రూపొందించుకోలేకున్నాం.
చివరికి కాలమే గెలిచింది. మన భాషలో మనం కవిత్వం రాసుకునే రోజులొచ్చాయి.
చివరికి కాలమే గెలవాలి. సాహిత్యం మధురంగా, చైతన్య వంతంగా సాగాలి. పరిణామం చెందాలి.
అందుకే
కవి బ్రహ్మ, కాలో యం బ్రహ్మ. కాళోజీ బ్రహ్మ.

25/11/15

Thursday, 29 October 2015

Sick leave ( poem)

విరించి ll సిక్ లీవ్ ll
...............................
నా టేబుల్ కి ఎదురుగా
ఒంటరిగా కూర్చుని వున్న
అతడిని చూస్తే
ముడతలు పడిన రాళ్ళ ను చూసినట్టుంది

అయస్కాంతంలా అతుక్కుపోయే ఆ కళ్ళు
ఆకాశపు ఆవలి గట్టుని
దిగుడు బావుల్లోంచి వెతుకుతున్నట్టున్నాయి

పొగ గొట్టాల్లాంటి చేతివేళ్ళ నడుమ
ఎన్ని ఆలోచనలు బీడీ పొగలా మారివుంటాయో..

ఆ మసిబారిన పెదవుల నడుమ
ఊపిరితిత్తులు కాలిన వాసన

యంత్రపు శబ్దాల్ని చెవులకు బిగించుకుని
ఏకబిగిన మాట్లాడే అతడి మాటల్లో..
నామీదొక నిర్దాక్షిణ్యమైన నిర్లక్షం.

అపుడపుడూ మా మధ్య తారసిల్లే నిశబ్దంలోకి
అతడు కొత్తగా తొంగిచూస్తున్నట్టు కనిపించాడు.

తెరలుగా లేచే దగ్గు అంకాల నడుమ
నీటి ఒరిపిడికి నునుపు తేలి
బయటపడిన మైలు రాయిలా కనిపించాడు

సరే...సిక్ లీవ్ కి డాక్టర్ సర్టిఫికేటే కదా...!
ఇస్తానన్నాను.
రాసిస్తే మౌనంగా తీసుకున్నాడు.

శరీరాన్ని ఒక ఎక్స్ప్రెషన్ గా మార్చినవాడి దగ్గరినుంచి
నేనే ఎక్స్ప్రెషన్నీ ఆశించలేదనే చెప్పాలిపుడు.

అతడి కాలి కింద నలిపేసిన బీడీ ముక్కలో
అస్పష్టంగా ఒక నిప్పుకణం కనిపిస్తోందిపుడు.

28/10/15

Sunday, 25 October 2015

Telangana news of tomorrow

రేపటి తెలంగాణా వార్తలు
.................................        
* అంతరించి పోతున్న పులులు..ఐటం గర్ల్ లు గా మారి భారతదేశంలో కనుమరుగవుతున్న పులులు.

* ఐటం గర్ల్ స్థానం కోసం సడన్ గా పోటీ పెరిగిందంటున్న సినీ రాజకీయ విశ్లేషకులు

* తమని చివరికి ఒక దొంగతో పోల్చినందుకు మనోభావాలు దెబ్బతిన్నాయంటున్న ఐటం గర్ల్స్.

* ఐటం గర్ల్ ను సభా ప్రాంగణం లో చూసి కేరింతలు కొట్టి విజిల్లేసిన ఆంధ్రా జనం.

* ఐటం గర్ల్ గా మారినందుకు ఊరేగింపుగా పండగ చేసుకుంటూన్న అభిమానులు.

* తన బిడ్డ ఐటం గర్ల్ గా మారినందుకు అడవిలో ఉరేసుకున్న పులి.

* కొత్త ఐటం గర్ల్ కోసం ఐటం సాంగ్ ను రెడీ చేసుకుంటున్న దర్శకేంద్రుడు.

* ముంబాయి భామల అవసరం లేకుండా ఎట్టకేలకు తెలుగు నేలలోనే దొరికిన ఐటం గర్ల్.

* కొత్తగా వచ్చిన ఐటం గర్ల్,  తొడగొడుతూ,  మీసం తిప్పుతూ  డాన్స్ ఇరగదీసిందంటున్న అభిమాన సంఘాలు.

* చీకట్లో పనిచేసినందుకే తనకీ ఐటం గర్ల్ ఛాన్స్ ఒచ్చిందటున్న ఈ కొత్త భామ.

* తప్పించుకున్న పులి ఐటం గర్ల్ గా మారిందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్న జూ అధికారులు.

Amaravathi. A telanganite view

అవశేషాంధ్రలో అమరావతి..తెలంగాణైట్ వ్యూ
..........................................................
ఇక ఈ రోజు నుండి ఆంధ్ర ప్రజలు హైదరాబాదు మీద ఉండే మమకారాన్ని వదలుకుని తమ స్వంత రాజధాని మీద మమకారాన్ని పెంచుకుంటారని ఆశించవచ్చు. తెలుగు వారికందరికీ హైదరాబాదు మీది మమకారం ఈ రోజుదికాదు. అది ఒకే సారి తెగిపోమంటే తెగిపోదు. తెలంగాణా వచ్చిన మరుక్షణమే "మీరిక హైదరాబాదుతో ఉండే మానసిక బంధాన్ని తెంచివేయాల్సిందే" అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తట్టుకోలేక పోయారు. ఉద్వేగానికి గురయ్యారు. దీనికంతటికీ కారణం అయిన కేసీఆర్ ను విమర్శించటం వల్ల వారి మనస్సును కాస్త శాంతింపజేసుకునే వారు. అకస్మాత్తుగా రాజధాని లేకుండా ప్రజలు పాలకులు కొంత అస్థిరతను అనుభవించి ఉండింటారు. అది గమనించే చంద్రబాబు ఘనంగా ప్రతిష్ఠాత్మకంగా నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన చేపట్టి ఉండింటాడు. దీనితో చంద్రబాబు, హైదరాబాదు పట్ల ఆంధ్రా ప్రజలకు మానసికంగా ఉండే కనెక్టివిటీని సమర్థవంతంగా అమరావతి వైపు తిప్పగలిగాడు. ప్రజలలో హైదరాబాదును తన్నుకుపోయిన తెలంగాణా పట్ల ఉండే వ్యతిరేకత కూడా దీనివల్ల సమసి పోతుంది. ఇకపై పక్క రాష్ట్రంలో పుల్లలు పెట్టకుండా ఎవరి రాష్ట్రాన్ని వారు అభివృద్ధి చేసుకునే పనిలో పడటం వల్ల మాత్రమే మంచి జరుగుతుందని తెలుసుకుంటారు. తెలుగు వారంతా ఒకే రాష్ట్రంలో ఉండాలనే సెంటిమెంటు-సమైక్య వాదులు, ఇకనైనా కాస్త నోరు మూసుకుని ఉండే అవకాశం ఉంది. పనీ పాట లేక ఎంత సేపూ తెలంగాణా ప్రభుత్వాన్నీ, కేసీఆర్ నూ, తెలంగాణా ప్రజలనీ చులకన చేసి మాట్లాడే వెధవలకీ, పత్రికలకీ, ఛానల్స్ కి, ఇకపై వేరే పని దొరికింది కాబట్టి, వారి నోరూ కూడా మూలనపడే అవకాశముంది.

ఎటొచ్చీ రాయలసీమ వాసులు అసంతృప్తితో ఉన్నారు. అమరావతివల్ల సమీప భవిష్యత్తులో రాయలసీమకు ఒచ్చే లాభమేమీ కనిపించటం లేదనే ఉద్దేశం వారిలో కనిపిస్తున్నది. ఇప్పటికే ఒకసారి కర్నూలు ని రాజధానిగా చూసుకోవటంలో అవకాశాన్ని కోల్పోయిన వారు, మరలా ఇంకోసారి రాజధాని తమకి రాకుండా కాకుండా పోయిందనే బాధలో ఉన్నారు. ఇదే సమయంలో ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర కల కూడా సాకారమౌతుందనే దిశగా ప్రజలు ఆలోచిస్తున్నారు. అయితే ప్రజల్లో ఈ కోరిక ఎంత బలంగా ఉన్నదో..ఎంత బలమైన నాయకత్వం దీనిని పార్లమెంటుదాకా తీసుకు పోగలదో అనేది మునుముందు మనకు తెలిసే అవకాశమున్నా ప్రస్తుతానికి ఈ అంశం అకడక్కడా మిణుకుమంటూ కనిపిస్తుంది. తెలంగాణా కల అరవై యేండ్లకు సాకారమయింది. చైతన్య వంతులైన ప్రజలు, సమర్థ నాయకత్వం రెండూ కలిస్తేనే ఇలాంటి ఉద్యమాలు ముందుకు సాగుతాయి. ప్రత్యేక తెలంగాణా కల ఏ ఒకరిద్దరి కలనో కాకుండా యావత్ తెలంగాణా ప్రజల కల కనుక, ఆ ప్రజల్లోంచే ఒక బలమైన నాయకత్వం పుంజుకుంది. ప్రజల్లో బలంగా ఆ కోరిక లేనిదే ఒక్క కేసీఆర్ ఏమీ చేయలేడని, కేసీఆర్ మీద మాత్రమే నిప్పులు చెరిగే ఆంధ్రా మిత్రులు ఈ సందర్భంగా తెలుసుకోవాలి. అదే విధంగా ప్రత్యేక రాయల సీమ ని కాంక్షించే వారు మొదట ప్రజల్లో ఆ కోరిక ఎంతవరకు ఉందనేది తెలుసుకోవాలి. తెలంగాణాలోలాగా పల్లె పల్లెలో మనిషి మనిషిలో గూడు కట్టుకుని ఉన్న ఆ సాహిత్యం నిజంగా ఉందా అని పరిశీలించుకోలాలి. ఒక నాయకుణ్ణి విమర్శించటమో ఇంకో నాయకుణ్ణి పొగడటమో చేసినంత మాత్రాన ప్రత్యేక రాష్ట్రం రాదని, ప్రజల్లోనే ఉద్యమమన్నది రావాలని తెలుసుకోవాలి.

ఏది ఏమైనా అవశేషాంధ్ర ప్రదేశ్ కి ఒక రాజధాని ఉండటం, నిజమైన తెలంగాణా వాదులకి, పట్టిన దయ్యం విడిచిందన్నంత ఊరట.

Highlites of Amaravathy inaugaration

అమరావతి శంకుస్థాపన హైలైట్స్.
..............,,........................
*రేవంత్ రెడ్డి సభా ప్రాంగణంలో కనబడగానే ఆంధ్రా జనం చప్పట్లు కొడుతూ కేరింతలు పెట్టారని ఒక టీవి ఛానల్ ఆంధ్ర ప్రజల్ని అవమానించింది.
మరీ దొంగను చూసి అంత ఆనంద పడే ప్రజలు ఆంధ్రా ప్రజలని అలా ఎలా చెప్పిందో అర్థం కాలేదు. ఆ ఛానల్ ఏదో సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదనుకుంటాను.

*"మా తెలుగు తల్లికీ మల్లె పూదండ" పాటను ఎందుకనో ఏడుపు పాటలా పాడిన సింగర్ సునీత. పాట ఎత్తుకున్నపుడు శ్రావ్యంగా వినిపించినా..పాట చివరికి వచ్చేసరికి మరీ బాధతో పాడుతున్నట్టుగా పాడింది. శంకుస్థాపన రోజు ఇలా పాడటమా?. నరేంద్ర మోడీ ఈ పాట విని ఖంగు తిన్నట్టే అనిపించింది.

*ఒక్క కేసీఆర్ ముఖం తప్ప అందరీ ముఖాల్లో ఎందుకనో నవ్వే కనిపించలేదు. ముఖ్యంగా మోడీ చంద్రబాబు అసలు నవ్వలేదు. మోడీ కి పుష్ప గుచ్ఛం ఇచ్చేటపుడు చంద్రబాబు ఎందుకనో వంగి వంగి నవ్వాడు. కేసీఆర్ మాత్రం చాలా నిర్మలంగా కనిపించాడు. వేదిక మీదే కాక కింద కూర్చుని ఉన్న నారా లోకేష్ తదితరుల ముఖాల్లో కూడా ఆనందం కనిపించనే లేదు.

*అనర్గళంగా ఉపన్యసించే కేసీఆర్ సూటిగా సుత్తి లేకుండా తెలంగాణా ప్రజల ఆకాంక్ష ని వినిపించారు. మూడు నిముషాల్లో తన ప్రసంగాన్ని ముగించేసాడు.

*చంద్రబాబు ఉపన్యాసం పేలవంగా సాగింది. గతం లో హైదరాబాదు నేనే కట్టాను అని అంటాడనుకున్నాం కానీ ఎందుకో ఆ ముక్క మరచినందుకేమో పేలవంగా ముగిసింది. ఎక్కడా ప్రత్యేక ప్రతిపత్తిని గురించి ఊసెత్తలేదు. పైన్నుంచి ఊసెత్తొద్దని ఆర్డర్స్ ఉండిండొచ్చు.

*అలవాటులో పొరపాటుగా చంద్రబాబు ఉపన్యాసాన్ని ముగిస్తూ...జై హింద్...జై జన్మభూమి..అని మరోసారి జన్మభూమిని వేదికనెక్కించాడు. అంటే సింగపూరు ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రజలందరూ ఉచితంగా పని చేసి రాజధాని కట్టుకోవాలని పిలిపిచ్చాడేమో. జై ఆంధ్ర ప్రదేశ్ ..జై అమరావతి అనకుండా జై జన్మభూమి అనటం అర్థంకాలేదు.

*పచ్చని బట్టలలో వేదిక మీద ఉన్న వారందరికంటే చాలా నీట్ గా హుందాగా చంద్రబాబు కనిపించాడు. మాట్లేడపుడు కూడా చెప్పదలచుకున్నది చాలా చక్కగా ప్రజెంట్ చేశాడనిపించింది.

*వెంకయ్య నాయుడు ఒక కన్ను మూసుకుని మాట్లాడినా రెండు రాష్ట్రాల గురించీ..తెలుగు ప్రజల గురించి మాట్లాడటంతో, కేంద్రం ఇరు రాష్ట్రాల అభివృద్ధికీ సహాయాన్నందిస్తుందన్న సందేశమిచ్చారు.

*నరేంద్ర మోడీ హిందీలోనే మాట్లాడింటే బాగుండేది. వెంకయ్య నాయుడు తెలుగు అనువాదం వల్లనేమో ఆయన సహజమైన ఫ్లో కాస్త తగ్గినట్టనిపించింది. ప్రత్యేక ప్రతిపత్తిని గురించి గానీ, ప్రత్యేక ప్యాకేజీగానీ ఏదైనా చెబుతాడేమో అని నాలుగు వందల కోట్లు ఖర్చు పెడితే...ఇంత మట్టి మొఖాన కొట్టి పోయాడని జనాలు గుసగుసలాడుకుంటున్నారు.

*వేదిక మీద జరిగే అంశాలను వివరిస్తూ యాంకరింగ్ చేసిన సాయి కుమార్ అండ్ సునీతల మాట్లడే తీరు హుందాగా కాక సినిమా ఫక్కీలో జరిగింది. ఏదో సినిమా హీరోని మాట్లాడటానికి పిలుస్తున్నట్టు ఒక్కో నాయకున్ని పిలుస్తున్నపుడు ఆ నాయకులు కాస్త విసుక్కున్నట్టు కనబడింది.

*ప్రతిపక్ష హోదా ఉన్న నాయకుడు జగన్ ని చంద్రబాబు నాయుడు పర్సనల్ గా వెళ్ళి పిలిచి ఉంటే బాగుండేది. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సభలో లేకపోవటం ఒక లోటుగానే వుంటుంది.

*మొత్తానికి చంద్రబాబు నాయుడు అనుకున్నట్టుగానే శంకుస్థాపనా కార్యక్రమాన్ని అదరగొట్టారనిపించారు..

Tuesday, 20 October 2015

REM (poem)

విరించి ll రెం (REM) II
................................
తలుపులెవరో బాదుతున్నారు.
అతడి ఒంటి నిండా రక్తం.
కాదు అతడి ఒంటి నిండా ఇంకు
వేలమంది ముందు వేదికనెక్కాను నేను
తలుపులు పగులగొట్టేశారు వాళ్ళు
ఇవ్వాల్సిందే గద్దించారు వాళ్ళు
ఒక ఇనుప ముక్క నా చేతిలో వుంది
ఎన్ని పదాలు కూర్చాను..ఎంతగా శ్రమించాను
అతడి ఒంటి నిండా రక్తం
కాదు కాదు అది రక్తం కాదు ఇంకు
వాళ్ళు నా ఇంటిలోకి దూరారు.
వాళ్ళు తలుపులు బద్దలు కొట్టేశారు.
నా భార్యా పిల్లలు ఎగిరి గంతేశారు.
నా తల్లిదండ్రుల కళ్ళ లో ఆనందం
అతడిని దారుణంగా చంపేశారు.
అవును అతడినే చంపేశారు
ఎంతగా నా వాళ్ళ ని దూరం చేసుకున్నాను.
నా చేతిలో ఒక కాగితం ముక్క ఉంచారు.
చంపి అవతలికి ఈడ్చేశారతన్ని.
జనాలందరూ చప్పట్లు చరిచారు
హాలంతా మారు మ్రోగేలా చప్పట్లు
ఇచ్చి తీరాల్సిందే పూనకం పట్టిన వాడిలా అరిచాను
నల్ల బ్యాడ్జీ ధరించి ఊరేగింపుగా నిరసన చేశాం
అలమారాలో అందంగా అలంకరించబడిన బహుమతి
ఇంటినిండా జనం గుమిగూడారు
పత్రికల్లో నా ఇంటర్వ్యూలు,ఫోటోలు.. నా మీద ఆర్టికల్సూ
అలమారా బద్దలు కొట్టేశారు వారంతా
నా నరాలు బిగుసుకున్నాయి
గుండెలనిండా గర్వం ఉప్పొంగింది
కాళ్ళు పట్టి ఒక మూలకి పాడేశారతని శవాన్ని
ఆనంద భాష్పాలు నా కంటిని కప్పేశాయి
నిన్నెపుడో మరచారు జనం అన్నారు వాళ్ళు
ఇది అన్యాయం అక్రమం అని గట్టిగా అరిచాం అందరమూ
ఎన్ని పదాలు కూర్చాను..ఎంతగా శ్రమించాను
ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపాను
ఎంతగా నా వారిని దూరం చేసుకున్నాను
అలమారాలోంచి బహుమతిని బయటకు లాగారు
నేను నా భార్య పిల్లలూ, అందరం అడ్డుకున్నాం
ఇస్తావా ఈయవా ఈ బహుమతిని..వారంతా బెదిరించారు
ఆ పెద్దమనిషి..నవ్వుతూ  నా మెడలో మెడల్ వేశాడు
నీ పుస్తకం నేనూ చదివాను గొప్పగా ఉందంటూ బహుమతి అందించాడు
గట్టిగా అరుస్తున్నాను నేను
నశించాలి నశించాలి దౌర్జన్యం నశించాలి
అతడి ఒంటినిండా రక్తం...కాదు కాదు అది ఇంకు
ఇంటినిండా జనం గుమిగూడారు...
ఇది అరుదైన బహుమతని కొనియాడారు
మరొక్క సారి ఆలోచించుకోండని ప్రాధేయపడింది భార్య.
అసలు ఇచ్చేయటమేంటని కసరుకున్నారు పిల్లలు

నాది నాది అని అరిచాను నేను
నాకిచ్చారు నాకిచ్చారని ఏడ్చాను
వెనక్కిచ్చేసేయ్ గద్దించారు వాళ్ళు
నా ఇన్నేళ్ళ కష్టం..ఇన్నేళ్ళ శ్రమ,కృషి
నా పదాలు..నా వాక్యాలు..నా కవితలు..
నా పేరుప్రఖ్యాతులు...నా బహుమతి
గట్టిగా నవ్వారు వాళ్ళంతా
నిన్నెపుడో మరచి పోయారు జనం..
వెనక్కిస్తే మళ్ళీ ఇపుడు గుర్తుచేసుకుంటారన్నారు
చరిత్రలో రాస్తారన్నారు.
అతడి ఒంటి నిండా రక్తం...అవునదిరక్తం
కాదది ఇంకు
ఆయన చచ్చి పోయాడు
నన్ను వీళ్ళు చంపేశారు
నా బహుమతిని చంపేశారు
ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో చంపేశారు..
అందరూ ఇచ్చారు..నీవూ ఇచ్చేయాలన్నారు
నిరసన జెండాలెత్తి...వెనక్కివ్వాల్సిందేనని అరుస్తున్నాను నేను
ఇంకొక్కసారి ఆలోచించండంటోంది భార్య

మూసి వుంచిన నా కనుగుడ్లు వణుకుతున్నాయి
నా నరాలు కండరాలు బిగుసుకున్నాయి
అతడు చచ్చిపోయాడు.
తెగిన ఏనుగు తలలు, కంకాళాలు
తలకిందులుగా నడిచే మనుషులు
జడలు విరబోసుకుని నవ్వే పిశాచాలు
వికృతమైన రూపంతో మీదికొచ్చిన దయ్యం...

చెమటలు చెమటలు..
నిద్రలోంచి దుడుక్కున లేచి కూర్చున్నాను నేను
మనోజవం మారుత తుల్య వేగం..
అలమారాలో బహుమతి నవ్వుతూ కనిపించింది.
ముఖం కడుక్కున్నాను.
నిరసన వాదులంతా బయట నాకోసం వేచి ఉన్నారు.
వెనక్కివ్వాల్సిందే..ఇక తప్పదు.

20/10/15

Siraa pootha (poem)

విరించి ll సిరా పూత ll
.................................................................
పరిస్థితులు ప్రచండ వేగంగా మారిపోతున్నందుకేమో..
ప్రపంచానికి కావలసినంత తీరిక దొరికినట్టున్నది
నా ఏడుపు మీద పడి ఒకటే ఏడుస్తున్నది.

రాయీ రప్పల నడుమ ఎండుతున్న మొండి తలకాయతో
పెన్ను రీఫిల్ లోకి గాలివూపుకుంటూ బతికేవాడిని
సిరా వాసనలోంచి పచ్చి రక్తపు వాసనని పిండాలని
బొట్లు బొట్లుగా అక్షర కొలిమిలో కాలిపోయే రసవాదిని

ఈ లోకం దూరంగా విసిరేయబడిన అసైలమని తెలిసికూడా
ఒక చేతిలో స్వర్గాన్నీ ఒక చేతిలో పరుసవేదినీ చేజిక్కించుకుని
ఊహల్లోంచి, చరిత్రల్లోంచి పదాలై జారిపోయే మనుషులకోసం
ఆశగా ఆత్రంగా వెతుకుతూ  పుస్తకాల్లోకి ఉరికినవాణ్ణి
చివరికి సమాధి పలకలమీది పదాలుగా మిగిలిపోయే
మనుషుల కథల్ని అదృశ్యంగా అల్లిందెవరో...

అదిగో..కలత నిద్రలో నడిచే ఆ పిచ్చివాళ్ళిపుడే వచ్చారు.
సిరానూ, మకిలి మనసుల్నీ నా ముఖమంతా పులిమి
నేనొక కవితగా కథగా నిలబడగలనో లేదో చూద్దామని బెట్టు చేశారు.

చచ్చిబతికిన వాడెపుడూ జీవితాన్ని కొత్తగానే చూడాలనుకుంటాడు
తెల్లని గోడమీది చిన్న మరకైనా పెద్దదిగానే కనిపిస్తుంటుంది.
మంచులా కురిసిన ఆశ, క్షణాల్లో నిరాశగా ఘనీభవిస్తుంటుంది
కాళ్ళ కింద జేబుర్లాడుతున్న చీకటి మెట్లకోసం తడుముకుంటుంది.
ఏ ఆకాశ వాణో..స్నేహితుడేసిన భుజం మీది చెయ్యో..
పలికే పదాలు నిజమైనపుడు పెదవులెందుకు వణుకుతాయని అడిగినట్టుంటుంది.
పౌర్ణమి ఆటుపోటుల తాకిడి దాటిన సముద్రానికి కాసింత తీరిక దొరికితే..
అలలన్నిటినీ అదిమి ప్రశాంతంగా పాడ్యమి నిదుర చేయాలని ఉంటుంది.

అయినా వేగంగా తిరిగే ప్రపంచంకదా..
కావలసినంత తీరిక దొరికినట్టున్నది.
నా ఏడుపు మీద పడి ఒకటే ఏడుస్తున్నది.
నా ఏడుపు చూసి నేనే నవ్వుకుంటానని దానికి తెలియనట్టున్నది.

17/10/15

Wednesday, 14 October 2015

Kankara raallu (poem)

విరించి ll కంకర రాళ్ళు ll
.....................................
మనమిద్దరమూ కలిసి తిరిగే రోజుల్లో
వారంతా ఎంతటి అనుమానాస్పదంగా చూసేవారు..!

అంకం తరువాత అంకంగా
ఒక షేక్స్పియర్ నాటకంలా
మన ఉద్వేగాలూ మన స్నేహాలూ
కలిసి జీవించేవి ఆ రోజుల్లో

ఇబ్బడిమబ్బడిగా మనుషులు తిరిగే వీధుల్లో
తెలియని ముఖాల మధ్య వెలిగి పోయే తెలిసినముఖాల్లా
అటునుంచి నీవూ ఇటు నుంచి నేనూ ఒకరికొకరం ఎదురుపడినపుడు
సంవత్సరాల తరబడి కలువని ప్రేమ జంటలాగ
ఒకరి ఛాతి మీద ఒకరి ఛాతిని వుంచి గట్టిగా హత్తుకునే వాళ్ళం

అయిదురూపాయల ఇరానీ ఛాయ్ ని వన్ బై టూ తాగుతూ
మధ్య మధ్య లో మలాయ్ లో చక్కర కలుపుకుని తింటూ
ఛాయ్ వాడు చేతులెత్తి దండం బెట్టి నెట్టివేసే వరకూ
గంటలు గంటలు అమ్మాయిల గురించి మాట్లాడుకునే వాళ్ళం

మిరపకాయ బజ్జీలోడి దగ్గర ముక్కులోంచి కారే కన్నీటిని తుడుచుకుంటూ
కట్లెట్ బండీ దగ్గర ప్యాస్ నింపిన పానీపూరీని
నోరంతా తెరచి కుక్కుకుంటూ
ఇండియా గ్రేట్ నెస్ గురించి చర్చించుకునే వాళ్ళం

చార్మినార్బ స్టాప్ లో బస్ గురించి వెయిట్ చేసే వారి మధ్యన కూర్చుని
దేశ రాజకీయాల గురించి, సినిమా హీరోల గురించి
ఊగిపోతూ  గొడవపడి..అదే కోపంతో వెళ్ళి పోయేవాళ్ళం

అడ్డదారిలో వచ్చి ట్రాఫిక్ పోలీసుకి దొరికి జేబులంతా గుల్ల చేసుకున్నపుడు
నో స్మోకింగ్ జోన్ లో స్మోకింగ్ చేసిన పొల్లగాడిని పొటుకు పొటుకు తిట్టి పంపించినపుడు
తెలంగాణోళ్ళమని చిన్న చూపు చూసిన సాలే గాణ్ణి పడేసి తొక్కినపుడు
అవసరమొచ్చిన ప్రతీ అడ్డమైన సందర్భాల్లో
మా కీ కసం అంటూ మనం చెప్పిన అబద్ధాల్లో..
ఊపర్ వాలాకీ కసం అంటూ మనం చెడగొట్టిన ప్రమాణాల్లో..
బేగం బజార్ సెంటు సీసాల్లాగా అమాయకమైన స్నేహమే గుభాళించేది.

ఆ రోజుల్ని ఈ రోజు గుర్తు చేసుకున్నప్పుడు
మనల్ని అనుమానాస్పదంగా చూసిన ముఖాలే గుర్తుకు వస్తాయి.
పాత బస్తీ అల్లర్ల లో మనల్ని చెదరగొట్టిన కంకర రాళ్ళే గుర్తుకు వస్తాయి

నేను హిందువుననీ
నీవు ముస్లిమువనీ..
మన స్నేహం ఈ లోక సమ్మతం కాదనీ
నమ్మకాల్ని కలిగున్న వారెవరూ
మనిషికి మరో మనిషి స్నేహం తప్ప
ఇంకేమీ అవసరం లేదని నమ్మగలిగిన వారైతే అయ్యుండరు

ఒక సూర్యుడూ..ఒక చంద్రుడూ
కలిసి ఉండలేరనుకునే లోకానికి
మనం గ్రహణాల్ని ఊతంగా చూపించలేక పోయాం
గ్రహణం మూఢనమ్మకం కాదు
ఆకాశం లో జరిగే అద్భుతమని చెప్పలేకపోయాం

అందుకే కదా నేస్తం
ఒకనాడు చిన్న చిల్లు కూడా లేని మన స్నేహం లాగే
ఇపుడు మనమధ్య పెరిగిన గోడకు చిన్న చిల్లు కూడా లేకపోయింది
ఇన్షా అల్లాహ్ అనుకుంటూ నీవు, నేను బాగుండాలనీ
రాముడి గుడిలో చేతులు జోడించి నేను, నీవు బాగుండాలనీ
కోరుకోవటమొక్కటి మనకు దేవుడిచ్చి ఉండకూడదనే మనం కోరుకుందాం.
మనరోజొకటి మనకోసం మునుముందు వేచి ఉంటుందనే ఆశపడదాం.

14/10/15

Friday, 9 October 2015

Oka kitikee deggara (poem)

విరించి ll ఒక కిటకీ దగ్గర ll
.......................................
ప్రతీ సాయంత్రమూ ఎందుకనో
మసిబారిన పాత జ్ఞాపకాల్ని వెంటబెట్టుకొస్తుంది.

ఆ చల్లటి నీరెండల్లో..
నీరెండలు చిత్రించే పొడుగాటి నీడల్లో
మంద్రంగా ఊగే పచ్చని చెట్లల్లో
ఇంటికి గుంపులు గుంపులుగా తిరిగెళ్ళే
పక్షుల్లో..ఆవుల మందల్లో
నావంటూ కానివాటన్నింటిలో
నా జ్ఞాపకాలెందుకు దాగున్నాయో
అర్థం కాకుండా ఉంటుంది.

ఏ సముద్రపు ఒడ్డో..నదీ తీరమో..
కనీసం చెరువు గట్టో లేని
ఈ మహా నగరంలో..
ఉతికిన  దుస్తులు ఆరేసుకోవడానికి తప్ప
పనికిరాని నా గది కిటికీ కూడా,
మండువేసవి ఉక్కపోతలో తెరుచుకున్న
ఒక కిటికీ రెక్కలా మారిపోయినపుడు
సాయంత్రపు నీరెండలలో దాగున్న జ్ఞాపకాలు
ఉప్పెనలా పిల్లగాలిలోకి దూరుతుంటాయి.
కిటకీ లోంచి కనిపించే కొత్తటి తారు రోడ్డు మీద
ఒక సన్నటి సంతోషం వేలాడుతూ  కనిపిస్తుంది.

రణగొణ శబ్దం  చేస్తూ బర్రున దూసుకు పోయే
కార్లూ, బైక్ లూ, బస్సులూ
నిశ్శబ్దంగా ఒక పద్దతిగా నడుస్తూ పోయే మనుషులూ,
ఎవరూ కూడా, ఏవీ కూడా
నాతో సంబంధం లేనట్టు
నన్ను పలకరించకుండా పోతున్నందుకు
నా సంతోషంలో ఒకరకమైన నిశ్శబ్దం అలుముకుని ఉంటుంది.

యూట్యూబ్ లో పిచ్చుక శబ్దాల్ని
ఇయర్ ఫోన్లో వినే నేను
కిటికీ లోంచి ఒక పిచ్చుకైనా కనిపిస్తుందని
ఆరాటపడటంలో తప్పేమీ లేదనుకుంటాను.
గూగుల్ పిక్చర్స్ లో
డెస్క్ టాప్ వాల్ పేపర్ లో
అందమైన పూలనూ, చెట్లనూ, లాండ్ స్కేప్ లనూ
చూసి ఆనందపడే నేను
తామూ ఇక్కడే ఉన్నామని తలలూపే పచ్చని చెట్లకోసమైనా
వెతకటంలో ఆశ్చర్యమేమీ లేదనుకుంటాను.

కిటికీ ఊచలు పట్టుకుని నిలబడుకున్నప్పుడు
అందమైన ఊహాలోకాలకు దూరంగా
ఎక్కడో కారాగారంలో ఉన్నట్టు ఉంటుంది.

చల్లని జ్ఞాపకం కోసం కిటికీ దగ్గర నిలబడిన
నన్ను చూసిన మా అమ్మ అంటుంది కదా..
"కన్నా..! దుమ్మూ, ధూలి, పొగ తో కాలుష్యమైపోయిన ఆ గాలి
నీ ఆరోగ్యానికి మంచిది కాదు..కిటికీ రెక్క మూసేయమని"
జ్ఞాపకాలతో పాటు కిటికీ రెక్కను మూసేసిన నేను
అమ్మ ఒడిలో ఆ ప్రకృతినంతా కలగంటూ పడుకుంటాను.

9/10/15
విరించి   ll నొప్పి అనుభవం ll
...................................................
రోజంతా తీవ్రమైన నడుము నొప్పితో
నొప్పిని మరచి పోవటానికి మధ్య మధ్యలో
కునుకులాంటి నిద్రతో గడిపేసాక
అర్ధరాత్రికి అయిదు నిముషాలముందు
ఈ విషయం గుర్తుకు వచ్చింది.

ఉదయం నిదుర లేచినప్పటినుంచి
సీలింగు మీద తిరిగే ఫ్యాను
గిర్రున తిరుగుతూ  కనిపించినప్పటికీ
నా కళ్ళు కూడా దానితో పాటు గిర్రున తిరగకుండా
దానినే నిర్లిప్తంగా చూస్తూ ఉంటాయి
రాత్రి పదకొండు యాభై ఐదు అయ్యే వరకు
ఈ ఫ్యాను ఎంతగా తిరిగి అలసిపోవాల్నో...

సీలింగు మీద బల్లితో సహవాసం చేశానని
ఎవరైనా ప్రగల్భాలు పలకొచ్చేమో..
కానీ, బల్లుల్లేని తెల్లటి సీలింగు మీద
ఆలోచనల్ని అతికించుకుని చదవాలనిపిస్తుంటుంది.
ఆలోచనలు రావాలని కోరుకునే ధ్యానమిదేనేమో..
బెడ్ మీదే పడుకుని బయటి లోకం తెలియనపుడు..
ఒక కిటికీ కూడా నా వైపు చూడనపుడు
ఉన్న ఆలోచనలు కూడా అరిగిపోయిన క్యాసెట్టులా
బరువైన తలను గిర్రున తిప్పేస్తాయి.

కుడివైపుకి తిరిగితే ఒక నొప్పి..
ఎడమవైపుకి తిరిగినా మరలా కలుక్కున అదేనొప్పి
కండరమో..నరమో..ఉడుం పట్టులా పట్టి..
నడ్డిని మొసలి చీల్చినట్టు చీలుస్తుంటే...
నెత్తి మీద ఇనుప ఫ్యాను రెక్కలు కాకుండా..
స్వర్గాలు కనిపిస్తాయా..
కంటి ముందు అప్సరసలూ నర్తిస్తారా?.

మధ్య మధ్యలో టీ బ్రేక్..టిఫిన్ బ్రేకూ..
లంచ్ బ్రేక్..డిన్నర్ బ్రేకూ నూ..
ఇక ఒకటీ రెండు బ్రేకులంటావా తప్పనిసరి.
బ్రేకు ఏదయినా..పదింతలయ్యే నొప్పి
ఆ తరువాత పది రకాల టాబ్లెట్లు.
ఒకటి పసుప్పచ్ఛగా జారుతున్నపుడే అనుకున్నా
కడుపులో టాబ్లెట్ల జనాభా పెరిగి
కిడ్నీని బంజారా హిల్స్ చేసుకున్నాయని.

అమ్మా..నాన్న..భార్య ఎవరో ఒకరు
అన్నం కలిపి ముద్దలు నోట్లో పెడుతూ
కాసేపు బాధ పడుతూ  నొప్పిని పదింతలు చేస్తూ
కాసేపు ధైర్యం చెబుతూ..నొప్పికి సున్నా చుడుతూ
ఈ పదిహేను రోజులూ సపర్యలు చేశారు.
కంటికి రెప్పలా అనే కదా మామూలుగా చెప్పేది..
అలాగేనన్నమాట.

రాత్రయ్యాక అందరూ పడుకున్నాక
దిక్కు తెలియని సమయంలో..
ఒక దిక్కుమాలిన ఆలోచన ఒచ్చింది
ఒస్తే ఒచ్చింది..
అదెప్పుడొచ్చినా కవితలాగే వస్తుందని తెలుసుకదా.

ఇంకేముంది చకచకా కవిత రాసేసాక..
నడుము నొప్పిలోని అనుభవ సారమంతా పిండేశాక
అర్ధ రాత్రికి అయిదు నిముషాలకు ముందు
ఈ విషయం గుర్తుకు వచ్చింది.
వేసి ఉంచిన ట్యూబు లైటు తీయనేలేదని.
ఇపుడెవరు తీయాలి..?
ఎడతెగక రాత రాసే కవిత తీయాలా..?
ఎడతెగక తీపు తీసే నొప్పి తీయాలా..?

7/10/15

Monday, 5 October 2015

భాను మూర్తి గారూ...నన్ను ఇరికించారా..?
మా ఇంట్లో మీరూ, హెచ్చార్కే గారూ, నేనూ ఎదురెదురుగా కూర్చుని ఒక అందమైన సాయంత్రాన్ని మన మాటలతో నింపేసిన రోజు గుర్తుకొస్తోందిప్పుడు. హెచ్చార్కే గారు రాసిన ఈ పోస్ట్, కల్యాణీ గారు రాసిన 'పిపీలక సోదరులారా' అనే వ్యాసం లోనిది. అందులో ఆమె మధ్యతరగతి మేధావులు రాజ్యం చేస్తున్న దౌర్జన్యాన్ని ఖండించాలని పిలుపునిచ్చింది. రాజ్య దౌర్జన్యాన్ని శతృవుగా, పాముగా,  మధ్యతరగతి వారందరూ చీమలుగా రాశారు. మొత్తానికి కల్యాణి గారి వ్యాసము కూడా ఇంకేదో వ్యాసానికి వ్యంగ్య సమాధానమనేది హెచ్చార్కే గారి సమాధానం చదివాక అర్థం అయింది. అసలును వదిలేసి మనం సమాధానాలు చదువుతూ పోయాము కాబట్టి, అసలు ఎవరు దేని గురించి మాట్లాడుతున్నారో చూచాయగా తప్ప వివరంగా అర్థంకాలేదు.

అయితే హెచ్చార్కే గారి సమాధానం సడన్ గా మహాభారతమూ, బ్రాహ్మణులూ, శూద్రులూ ఎందుకొచ్చారో అర్థంకాలేదు. అసలు మొత్తానికీ ఏమీ అర్థం సరిగా కావటం లేదు కాబట్టి, ఈజీగా అర్థం అయిన ఈ ముక్క అందర్నీ ఆకర్షించింది. ప్రతీ పది పద్యాలకొకసారి బ్రాహ్మణులను పూజించాలని చెప్పిన ఆ మహాభారత పుస్తకమేదో, ఆ గ్రంధకర్త ఎవరో మనకు తెలియదు. ఆయన కూడా రిఫరెన్స్ ఇవ్వలేదు. మహా భారతం రాసిన వేద వ్యాసుడు పడవనడిపేవాడి కూతురైన సత్యవతికీ, పరాశరుడికీ కలిగిన కుమారుడు. జన్మ రీత్యా బ్రాహ్మణుడు అనటానికి లేదు. అయితే ఇక్కడ రెండే విషయాలు చెప్పదలచాను. ద్వాపర యుగం లో జరిగిన మహాభారత కథని, ఇపుడు ఈ సమాజానికి ఆపాదించి మాట్లాడుకోవటం విడ్డూరం. ఆ సమాజమే వేరు కదా. ఎంతో మార్పు వచ్చింది. గతి తార్కిక భౌతిక వాదం ప్రకారం ఆ మార్పు ఎక్కడినుంచో ఊడిపడదు. ఆ వస్తువు లోపలే ఉంటుంది. ద్వాపర యుగం నుంచి ఇప్పటి దాకా అసలు మార్పే జరగలేదంటే అది రీజన్ కి అతకదు. మహాభారతం ఒకప్పటి సాహిత్యంగా పరిగణిస్తే, నికరంగా చరిత్ర తెలియని సాహిత్యాన్ని కూడా మార్క్సిస్టు దృక్పథంతో విమర్శ చేయటం ఒక దోషమని వేల్చేరు నారాయణ రావుగారి అభిప్రాయం. ఆ విషయాన్ని అటు వదిలేస్తే...

మహభారత కాలంలో వర్ణాశ్రమ ధర్మం ఉండేది, కుల వ్యవస్థ కాదు. ఆ కాలంలో ప్రతీ నాలుగు సంవత్సరాలకొకసారి వర్ణాశ్రమ ధర్మం మార్చుకునే అవకాశం ఉండేదని బొజ్జాతారకం గారి ఒక పుస్తకంలో చదివినట్టు గుర్తు. రిఫెరెన్స్ తప్పక తరువాత ఇస్తాను. గీతలో కూడా శ్రీకృష్ణుడు 'చాతుర్వర్ణం మయా సృష్ట్వా గుణ కర్మ విభాగశః' అన్నాడు. గుణాన్ని బట్టి, కర్మని బట్టే ఆ కాలంలో వారి వారి వర్ణాన్ని నిర్ధారణ చేసేవారనేది స్పష్టం. రాధేయుడి ఉదంతమే ఇందుకు ఉదాహరణ. క్షాత్రమున్న వాడే క్షత్రియుడని, కర్ణుని క్షాత్ర పరిక్ష కు గురి చేసి, అతడు ఆ పరీక్షలో నెగ్గాకనే క్షత్రియుడయ్యి అంగ రాజ్యాధిపతి అయ్యాడు తప్ప, ఇప్పటి సమాజంలా క్షత్రియ కుమారుడు కాబట్టి క్షత్రియుడు కాలేదు. ఇక హెచ్చార్కే గారు, 'గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు' అనే అంశాన్ని ఉటంకించి ఇలా ప్రతీ పది పద్యాలకూ....అనే ఆరోపణ చేసినట్టైతే..ఆ సమాజంలో మేధావులనేవారు ఎవరైనా బ్రాహ్మణులనబడుతున్నారని అర్థం అవుతున్నది. అంటే మేథావులపై రాజ్య హింస ఉండేది కాదనేది కూడా స్పష్టం. గోవులు వ్యవసాయానికీ, ఎద్దులను కనటానికీ, తద్వారా రైతులకూ లాభం చేకూర్చుతాయి కాబట్టి, అవి శుభంగా ఉండాలి అని అంటే..కష్టజీవుల మీద కూడా రాజ్య దౌర్జన్యం లేదనేది స్పష్టం. మొత్తానికి మహాభారతం వర్గ పోరాటం కాదు. రాజ్యంకోసం ఒక రాజకుటుంబంలోని అన్నదమ్ముల మధ్య పోరాటం.

కాబట్టి హెచ్చార్కే గారు ఉటంకించిన ఈ ఉదాహరణ సందర్భానికి అతకదు. అయితే తరువాతి కాలంలో బ్రాహ్మణులు శూదృలమీద చేసిన దాష్టీకాలు ఖండించవలసిందే. దానికి మహాభారతాన్ని బూచిగా చూపటమంటే ఇంకా గతంలో, ద్వాపర యుగంలో జీవించటమే. హెచ్చార్కే గారు ఒకరు సేఫ్ పొజిషన్ లో కూర్చుని ఇంకొకరిని పోరాటం చేయండని పురమాయించటమేమిటని ప్రశ్నించారు. అంత వరకు బాగుంది. ఆ కాంటెక్స్ట్ల్ లో ఈ మహాభారత బ్రాహ్మణ ఉదాహరణ పొరపాటున ఒక రకంగా తొందరపాటున ఉటంకించి ఉంటారని నా అవగాహన. ఘటుగా రెస్పాండు అయ్యారు కాబట్టి ఇలాంటి తొందరపాటు పొరపాటు దొర్లి ఉంటుందని నా అవగాహన.  అయితే "మిమ్మల్ని కలాలు పట్టుకోమని ఎవరు నిర్ణయించారు, మీరే నిర్ణయించారు.. "అని అన్నపుడు, ప్రజల్ని కలాలు పట్టుకోమని ఇంకెవరు నిర్ణయించాలబ్బా అని నేను ఆలోచనలో పడ్డాను. మీరు రాయాలి, మీరు రాయకూడదు అని నిర్ణయించేవారున్నారా ఎవరైనా..? నాకైతే తెలియదు. వారెవరో చెబితే అసలు నేను రాయవచ్చో రాయకూడదో తెలుసుకుంటాను.
విరించి ll వెలుగుముద్దలు ll
......................................
ఈ దీపాలు ఎక్కడ ఆరిపోతాయో తెలియదు
ఈ మల్లెలు ఎపుడు విరబూస్తాయో తెలియదు
                *
చెట్ల ఆకుల మధ్య ఖాళీల్లోంచి
దట్టమైన అడవుల్లోకి చొచ్చుకెళ్ళే కిరణాలు
కారు చీకట్లలో కలలుగనే
ఒక వెలుగు ముద్దలా కనిపిస్తుంటాయి

కంటిముందు నాటకంలా వేలాడే ప్రపంచంలో
కొన్ని పగటి కలలు రాత్రి నిద్రని కలగంటాయి

బొంగురుబోయిన ఇనుప గొట్టం గొంతులోంచి
తుప్పుపట్టిన తూ టాలు కూని రాగాలు తీస్తుంటాయి

ఏమో ఎవరికి తెలుస్తుంది..!
దూరంగా ముసురుకున్న మేఘం
నిజంగానే వర్షంలా కురిసిందో..
గుట్టుగా రెండు పిడుగుల్ని రాల్చిపోయిందో..

రక్తపు ముద్దలుగా పాలిపోయిన వెలుగు ముద్దల్ని
పతాక శీర్షికల్లో చూస్తున్నపుడు
నాకెందుకనో తెలిసిరాలేదు
ఈ మల్లెలు నలిపివేయబడ్డాయని,
ఆ దీపాలిపుడే వెలగటం మొదలయ్యిందని

5/10/15

Friday, 2 October 2015

ఫేస్బుక్ సరదాలు (నాలుగున్నరవ భాగం part 4 1/2)
............................................................................
కొన్ని అనివార్య, అత్యవసర కారణాల వల్ల పార్ట్ ఫోర్ చిన్నగా రాయటమైనందుకిది నాలుగున్నరవ భాగం. వేషాల్రావుల కథలను ఇలా ఎగ్గొట్టి తెగ్గొట్టిన భాగాల్లో రాసుకుంటే తప్ప ఓ పది పన్నెండు భాగాల్లో ముగించలేం. లేకపోతే టీవీ సీరియల్స్ లాగా నెలల తరబడి సాగాదీయాల్సిన పరిస్థితి వచ్చే అవకాశమూ ఉంది. ఇలా నాలుగున్నరా, నాలుగూ ముక్కాల్ వంటి భాగాలు త్వరలోనే టీవీ సీరియల్స్ కి కూడా పాకి ఎంటర్టైన్మెంటు పీక్ స్థాయిలోకి పోతుందనే అనిపిస్తుంది. క్రికెట్టూ, సినిమాలూ, టీవీ, ఇంటర్నెట్టూ అన్నీ ఒక రోజులోని ఎక్కువ సమయాన్ని ఆక్రమించేసి, ఎంటర్టైన్మెంటు, ఎంజాయ్మెంటు తప్పిస్తే ఇంకోటి లేదు జీవితంలో అనే స్థాయికి తీసుకొచ్చేసాయి. సమాజంకోసం సినిమాలు తీస్తున్నాం అని చెప్పుకున్న దర్శకులు కూడా, ఇపుడు ఎంటర్టైన్మెంటు కోసం దయ్యాల సినిమాలు తీసుకుంటూ క్రియేటివ్ డైరెక్టర్స్ గా, మేధావులుగా చలామణి ఐపోతున్నారు. జిడ్డు కృష్ణమూర్తి గారినొకసారి అడిగారు, ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని..."రాబోయే కాలంలో సంస్థలు, పరిశ్రమలు, ఉద్యోగాలూ అన్నీ ఖాళీగా ఉన్న మనుషులను ఎంటర్టైన్ చేయటానికోసమే ఏర్పడతాయని" చెప్పారాయన. అది నిజమే కదా.

ఇక, వేషాల్రావు ఫేస్బుక్ లో వేసే రకరకాల వేషాల్లోకి వచ్చేస్తే, ప్రొఫైల్ పిక్ లో గానీ ప్రొఫైల్ నేమ్ లో గానీ ఫీమేల్ జండర్ కన్పిస్తే, వేషాల్రావు కండ్లు చాటంతవుతాయి. కేవలం గుడ్ మార్నింగ్ కామెంటు దగ్గరే ఆగడనీ, కవితల్రావు వేషం కట్టి కష్టపడి తస్కరించిన కవితనో, తిరస్కరించిన కవితనో కామెంటుతో కూడా జత చేస్తాడనీ అనుకున్నాం. కానీ అక్కడే ఆగితే వేషాల్రావెందుకవుతాడు. ఇన్ బాక్స్ కి చేరతాడు. సందర్భాన్ని బట్టి మెసేజ్ చేస్తాడు. ఒక్కో ప్రొఫైల్ కి ఒక్కో మెసేజ్ పెడతాడు. "మీ నవ్వు అద్భుతం మేడం. మీ పలు వరుస సూపర్బ్. మీరు రోజా పువ్వులా నవ్వుతారు. మీ నవ్వుతో నవ లోకాలూ నవనవలాడుతున్నాయి. మీ పెదవులు సీతాకోక చిలుక రెక్కల్లా విచ్చుకుంటే..నేను బద్దె పురుగులా ఒచ్చేస్తా". ఇలా ఒక్కొక్కరికే ఒక్కో మెసేజ్. పెళ్ళయి ఇద్దరు పిల్లలుండిన ఒక మహిళకు 'ఐ లవ్యూ' అని ఒకరోజు పెట్టాడు. ఇలా ఎందుకు మెసేజ్ చేశావని ఆమె అడిగితే, చాంతాడంత కథ చెప్పాడు. తను ప్రేమ రాహిత్యంలో కొట్టుమిట్టాడుతున్నాననీ, తనకిపుడు ప్రేమ కావాలనీ, దిగ్విజయ్ సింగయిపోయాడు. ఖంగుతిన్న ఆ మహిళ బ్లాక్ చేసేస్తుంది. ఏముందీ..ఇంకో ఇన్ బాక్స్ లో ఐలవ్యూ కనిపిస్తుంది. గొప్పవాడనీ, ఉదార స్వభావుడనీ, గొప్ప చదువులు చదివినవాడనీ, మర్యాదగా మాట్లాడతాడనీ ఫ్రెండు రిక్వెస్ట్ ఆక్సెప్ట్ చేసిన ఆమె, ఈ కంగాలీ మెసేజ్ చూసి కంగారు పడక తప్పదు కదా. అసలాడవారెవరైనా ఈయననెందుకు ఆక్సెప్ట్ చేస్తారంటే..పరిచయమైన కొత్తలో 'కోతల్రావు' వేషం కట్టింటాడు కాబట్టి. లోపలున్న వేషాల్రావుని ఇంకా అప్పటికి రిలీజ్ చేయలేదు కాబట్టి.

కోతల్రావుగా వేషాల్రావు నాటకాన్ని రక్తి కట్టిస్తాడు. యూనివర్సిటీ ప్రొఫెసర్ననో, డాక్టర్ననో, లాయర్ననో చెప్పుకున్నా పరవాలేదుగానీ, తనకు తానో పెద్ద సెలబ్రిటీననేంతగా బిల్డప్ ఇస్తాడు.అసలు సమాజం ఎంతగా చెడిపోయిందోనని లెక్చర్లిస్తాడు. ఇంగ్లీషులో మూడు నాలుగు కవుల పేర్లూ, రచయితల పేర్లూ బట్టీకొట్టి, వారి రచనల్ను చదువుతానంటాడు. ఇంగ్లీషు సినిమాలు తప్ప తెలుగు సినిమాలు చూడనంటాడు. ఈ కుళ్ళు సమాజాన్ని చూసి భరించలేక పోతున్న సమయంలో...నా సత్తా తెలిసిన నా మిత్రబృందం నన్ను ప్రాధేయపడటం వల్ల తాను కలం పట్టి కవిగా మారాననీ, సమాజోద్ధరణే ధ్యేయమనీ వివేకానంద లెవెల్లో ఫోజిస్తాడు. కావాలంటే ఈ కవిత చూడండి అని ఒకటి విసురుతాడు. "బండికింద కుక్కపిల్ల బండి లాగుతున్నదా..ఇంటిలోన పిల్లి పిల్ల పాలు తాగకున్నదా...రాజ్యం రెండు ముక్కలైతే రామరాజ్యమొస్తదా...కౌరవుల సేనలోన శకుని దాగి ఉన్నడా..వేర్పాటు వాదమా లేక సమైక్య నినాదమా..కుస్తీ పోటీలు పెట్టి లెక్క తేల్చుకుందమా..?" తెలంగాణా విడిపోతుంటే కడుపుమండి ఇలా రాసుకున్నానని చెప్పుకున్నాడు. ఈ వీర లెవెల్లో బిల్డప్ ఇచ్చేవాడు అలా సడెన్ గా ఈమెకి రోజుకొకసారి ఐలవ్యూ చెప్పటమే కాక, రోజుకోసారి మీ ఫోటో చూడకపోతే బతకలేనేమో అని కళ్ళల్లో ఒత్తులు పెట్టుకున్నానంటాడు. మీ చెప్పు తెగినా, నా పండ్లు రాలినా మీరే నాలోకమంటాడు. ఇక విషయం భర్తగారి దగ్గరికి తీసుకుపోతుంది పాపం ఆ ఇల్లాలు. ఏముందీ రెండు తిట్లు ఆవిడనే తిట్టి, ఫేస్బుక్ ఐడీ డీ-ఆక్టివేట్ చేయమంటాడాయన. కథ ముగుస్తుందనుకుంటామా..నోనో...వేషాల్రావు చేతిలో ఇంకా చాలా రాళ్ళు ఉన్నాయి విసరటానికి.
ఫేస్బుక్ సరదాలు ( part 4)
......................................
నిజానికి ఇవి సరదాల్లాగా కనిపిస్తున్నా..ఆడవారి మీద జరుగుతున్న అన్యాయాలు. కొంతమంది ఆడవారు ఇలాంటి సరదా రాయుల్ల ని తమ 'గుడ్డు పోస్ట్ల' తో ప్రోత్నహించటం వలన కూడా కొంతమంది వేషాల్రావులు దాన్ని గ్రాంటెడ్ గా తీసుకుని, కనిపించిన ప్రతీ లేడీ తో పిచ్చి వేషాలు వేయటం కనిపిస్తోంది. గాడిదెక్కడైనా గాడిదే. నువ్వు గాడిదవు గాడిదవు అని ప్రోత్సహించినంత మాత్రానికే గాడిదలా మారిపోదనే విషయమూ ఇందు మూలముగా మరచి పోకూడదు. 'గుడ్డు పోస్టు'లతో గాడిదల పెంపకం చేపట్టొద్దని మనవి.

ఇక,  వేషాల్రావు, ఏం చేస్తాడంటే...కనపడిన ఆడవారి ప్రోఫైల్ పిక్ కనుక ఒరిజినల్ ది ఐతే...ఆ ఫోటోని లాగి, బయటకు తీసి, దాన్ని ఫోటోషాప్ లో మెరుగులు దిద్ది, మల్లీ ఆమెకే పంపిస్తాడు ఇన్ బాక్స్ లో, ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు. వేషాల్రావుకి ఫోటోషాప్ చేయటమంటే అదో పెద్ద విషయం అన్నట్టు.  'అమ్మ, వెధవ, జన్మ,  కొడతా, సిగ్గు, లేరురా, తీసి, లేని, అక్క, చెప్పుతో '  వంటి పదాల్ని కలిపి పాపం ఆవిడ బాగానే వడ్డిస్తుంది. సిగ్గు లేని వేషాల్రావు,ఒక వెకిలి నవ్వు నవ్వి ఊరుకూుంటాడు తప్ప, మారడు. ఇలా కాదని ఆవిడ, తన భర్తతో దిగిన ఫోటోని ప్రొఫైల్ పిక్ గా పెట్టుకుంటుంది. అయినా వేషాల్రావు వేషాలకేం తక్కువ, ఆమె భర్తని తొలగించి, మిగిలిన ఫోటోకి ఫోటోషాప్ చేసి మరలా పంపిస్తాడు. ఇలా చేసే ఎంతో మంది వేషాల్రావులున్నారు. కానీ ఇలా చేసి నాకు దొరికిపోయిన ఒక వేషాల్రావు గారి వయసు డెబ్భై. బాబాయ్ గారు, బాబాయ్ గారూ అంటే, బురిడీ బాబా అవతారమెత్తాడు. ఈ మధ్య ఒక వేషాల్రావు, పోర్న్ ఫోటోస్ ని కనిపించిన ఆడవారికందరికీ పంపిస్తుంటే...తెలిసి, అయ్యగారిని బహిరంగంగా ఫేస్బుక్ వాల్ మీద వేలాడతీశాము ఫోటోతో సహా. సైబర్ క్రైం కి కూడా కంప్లయింట్ చేశారు. వేపమండలతో దయ్యం దిగే దాక బాదేలా ఉన్నారు ఆ కంప్లయింట్ ఇచ్చిన ఆడవారు. కాబట్టి వేషాల్రావుల సరదాలు ఇలా కూడా ఉంటాయని, జాగ్రత్త పడమని సలహా.
ఫేస్ బుక్ సరదాలు. (Part 3)
...............................................
పార్ట్ టూ లోని వేషాల్రావు ని గురించి చదివిన పార్ట్ వన్ లోని గుడ్డు అమ్మాయి ఒకామె నిన్న నాతో మాట్లాడింది. ఆ అమ్మాయి మా బంధువులమ్మాయి. అయితే ట్విస్ట్ ఏమంటే ఈ 'గుడ్డు అమ్మాయి' కావాలనే 'గుడ్డు పోస్ట్లను' పెడుతూ  ఉంటుందట. ఇలాంటి వేషాల్రావుల కామెడీలు చూసి తెగ నవ్వుకోవటానికి. వారి కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ కామెంటులపుడు ఒక్కోరు ఒక్కో ఐడియా ఇచ్చి ఈ వేషాల్రావుల ఓ..తెగ ఇదై పోవటాన్ని, వాళ్ళ తింగిరితనాన్ని చూసి కడుపుబ్బ నవ్వుకుంటుంటారట. హమ్మయ్య తెలుగోడికి హాస్య ప్రియత్వం చావలేదని భరోసా ఒచ్చేసింది.

ఇక, వేషాల్రావు కవితల్రావు వేషం కట్టాడు. చెప్పాకదా, మనోడికి కవితల్రావు. అయినా కవితల్రావవతారం ఎత్తాడు. కారణాలు రెండు. ఎంత కాలమని గుడ్ మార్నింగులతో గుడ్ నైట్లతో గూడు పుఠానీ నడపగలడు. హి మస్ట్ డూ సంథింగ్ నో..ఇక రెండవది తన ఫ్రెండులిస్ట్ లో ఉండే కవితల్రాయుడు అనేవాడు కవితలతో అదరగొడుతుంటే..కింద కామెంట్ లలో లేడీ ఫాలోవర్స్ అదుర్స్ అంటుంటే..మనోడు బెదుర్స్ ఐపోతున్నాడు.జెలసీ తన్నుకొస్తుంది. ఎలాగోలా వన్ ఫైన్ మార్నింగ్ డిసైడ్ అయిపోయాడు. కవితలను అదరగొట్టాలని.

ఇంతలో ఓ గుడ్డు అమ్మాయి గుడ్ మార్నింగ్ పోస్ట్ తో పాటు, ఓ కవిత రాసేసింది. "నిశి వంచిన విల్లంబులో పదనిసల కోలహలపు ప్రచ్ఛన్న కరుణాలయం, విద్వత్ మహోగ్రధ వింజామరల సమయంలో బూటకపు బెల్లపు పాకపు బలిస్థానం, వారుణి పీడిత బృహత్ తాడిత పద ఘట్టనలో చామంతి పూవుల చకోర పిండి పదార్థం, గజ రజనీ సమోజ్జ్వల విశ్వాఖిల ఝంఝామారుత ఉల్లి గడ్డల పద కోణం". అని రాసింది. మనోడికి అర్థం కాలే. బెల్లం, ఉల్లి గడ్డ తప్ప. ఇంత అద్భుతమైన కవిత్వమా అని నోరెల్ల బెట్టాడు. ఇందుకు తగ్గ కవితనే పెట్టి గుడ్ మార్నింగ్ చెప్పాలని డిసైడ్ అయ్యాడు. ఇంతలో ఒకడు కామెంటాడు. "ఇది మేడం కావాల్సింది. ఇది. మీరు కేకో కేక మాడం. ఇట్లా అడిగేటోల్లే కావాలి ఈ దేశానికి. లేకుంటే సామాన్య మానవునికి అందకుండా ఉల్లిగడ్దల ధరలు పెంచేస్తే ఎలా మేడం. ఏం చేస్తున్నాయీ ప్రభుత్వాలు. ఇక మారరా..థూ తుచ్చపు రాజకీయనాయకులు. మీ సామాజిక స్పృహ నాకు చాలా నచ్చింది మేడం. మీ కవితలు నాలో స్పూర్తిని రగిలిస్తున్నాయి. ఎప్పటినుంచో నేను మీ కవితల్ని ఫాలో అవుతున్నాను. థ్యాంక్యూ."  అని ఆకాశానికి ఎత్తేసాడు అనే బదులు, ఆకాశంలోకి వాడే  ఎగిరి దూకాడు అనుకోవచ్చు.  పొరపాటున అటుగా ఏ రాజకీయ నాయకుడు పోతుండినా ఈ కవిత ఇచ్చిన స్పూర్తితో ముఖం మీద ఉమ్మించినా ఉమ్మిస్తాడు. మన వేషాల్రావుకి వొళ్ళు మండిది. మాటర్ అయితే క్లియర్. ఉల్లి గడ్డల మీద రాసిందన్న మాట. ఇంతకు మించిన జంబలహా కవిత రాసి కామెంటులో పెట్టాలని డిసైడ్ అయ్యాడు. సామాజిక స్పృహ ఉట్టిపడేలా ఉండాలనుకున్నాడు. బాగా థింకాడు. చివరికి తట్టింది. "పల్లం వైపు నీరు, పట్టాల వైపు రైలు, ఆకాశం వైపు ఉల్లిగడ్డలు, ఆవేశం వైపు రాజకీయ నాయకులు, నీ వైపు నేను, నా లైఫు నీవు. గుడ్ మార్నింగ్ మాడం" అని రాసేశాడు.

చూస్తూ ఉన్నాడు నిముషానికోసారి. ఇక ఫ్లాట్ అనుకున్నాడు. ఆ అమ్మాయి రెస్పాన్స్ ఇవ్వలే. ఇంతకు ముందు కామెంటిన వీరుడికి "థ్యాంక్యూ సో మచ్ అండీ..నా కవిత మీకు నచ్చినందుకు, చాలా చాలా థ్యాంక్స్. యూ మేడ్ మై డే". అని రిప్లై ఇచ్చింది. వేషాల్రావుకి జలసీ నషాళానికెక్కింది. తన కవితకి రెస్పాన్స్ రాలేదు. ఇక కామెంటాడు. "ఉల్లి గడ్డలేంటండీ ఉల్లి గడ్డలు. ఎంత సేపూ రాజకీయ నాయకులని ఆడి పోసుకోవవటమేనా..?మనం ఉల్లిగడ్డలు వాడటం తగ్గించాలి. అప్పుడే వాటి ధరలు తగ్గుతాయి. ఈ రోజు నుంచి మనం ఉల్లి గడ్డలు నెల పాటు వాడకూడదని ఒట్టేసుకుందాం. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలండీ, ఏమంటారు?" అని. "వావావావావ్. ఆసం ఐడియా. యూ మేడ్ మైడే" అని రిప్లై ఇచ్చింది. ఎంత మంది డే చేస్తారో. ఆ తరువాత మనోడి కవితకీ లైకింది. ఉత్తర కుమారుడి చరిత్ర తంతే బూరెల గంపలో పడ్డట్టు ఇన్ బాక్స్ కి వచ్చింది. హాహాహాహాయ్య్య్య్య్.

Saturday, 26 September 2015

ఫేస్బుక్ సరదాలు( part 2)
.................................
పార్ట్ వన్ లో నేను ఆడవారిని వేలెట్టి చూపానని, కొందరు మిత్రులు వేలెట్టి చూపించారు. అలాంటిదేమీ లేదనీ, ఈ విషయాలు ఎవరినీ ఉద్దేశించినవి కావనీ, భుజాలు తడుముకున్న వారికి మాత్రమే వర్తించే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ భయపడనవసరం లేదనీ నా మనవి. ఆడవారి పోస్ట్ ల వెనుక పడే మగ పుంగవుల గురించే నేను రాసి వుంటిని తప్ప ఇంకోటికాదు. వచ్చిన వంద కామెంటులకి అన్నింటికీ సమాధానాలిచ్చిన ఆడవారి ఓపికకీ ఈ సందర్భంగా వందనాలు. ఇవన్నీ ఫేస్ బుక్ లో కనిపించే సరదా సన్ని 'వేషాలు' మాత్రమే. ఎవరూ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. నవ్వుకుంటే భోగం, నవ్వుకోలేక పోతే రోగం. తెలుగు వాడు హాస్య ప్రియత్వం మరచిపోకూడదు మరి.

ఇక, వేషాల్రావు ఉదయాన్నే లేచి కూచుంటాడు. ఏజీ ఎంతని వీజీ గా అడగకండి, ఎంతున్నా వేషాల్రావు కదా..మేనేజ్ చేసేస్తాడు. పాచి పండ్లు తోముకుంటూ, ఫేస్ బుక్ లో సెర్చ్ లోకి పోతాడు. స్వాతి, స్వేత, పూజ, అర్చన, హారతి, కర్పూరం, అగరొత్తి, గుర్తుకొచ్చిన అమ్మాయిల పేర్లన్నీ వరుసగా చూస్తాడు. ఫ్రెండు రిక్వెష్ట్ పెట్టేస్తాడు. ఇంకా డిటైల్స్ లోకి పోతే చాలా బాగోదు గనక, కామా ని కాస్త పక్కకి తిప్పితే..మనోడు ఆడవారి పోస్ట్ లు చదువుతుంటాడు. "ఇవాళ మా అక్క కొడుకు పుట్టిన రోజు, విష్ చేయండి" అని ఒకామె ఓ పిల్లగాణ్ణి ఎత్తుకుని ఉన్న పోస్ట్ పెట్టి వుంటుంది. ఓ పదిహేను వందల మంది కామెంటి వుంటారు అప్పటికే. జస్ట్ అయిదు నిమిషాల ముందు కూడా ఒక వీరుడు ఓ కవితలాంటి తవిక తో 'హాపీ బర్త్ డే' అని విష్ చేసి ఉంటాడు. మనోడికి చిర్రెత్తుతూంది. పోటీ కి ఇంకెవడో వచ్చాడనుకుని బుర్ర గోక్కుని కష్టపడి, ఆ తవిక కి తాత లాంటి తవికతో విష్ చేస్తాడు. నాలాంటి ముదనష్టపు వెధవలకి పొరపాటున ఆ పోస్ట్ కనిపిస్తుంది. మన కళ్ళు ఊరికే ఉండవు కదా..సెర్చ్ లోనే రీసెర్చ్ కూడా ఉంటుందేమో..అక్కడ జరిగే భూంశకలక ఇషయమంతా ఒకే ఒక్క సెకనులో కనిపిస్తుంది. అది టూ థౌజండ్ టువల్వ్ (2012) లో పెట్టిన పోస్ట్. ఇప్పటికీ దానికింద కామెంటులు వస్తూనే ఉంటాయి. అది ఎవరు ఎప్పుడు పెట్టారు అనవసరం. అమ్మాయి ఫోటో కనబడింది. ఐదు నిముషాల కిందే పోటీదారుడు పోస్ట్ పెట్టాడు. మనమూ పెట్టాలి. గొర్రె తోక వెనుక గొర్రె మూతి.

గుడ్ మార్నింగ్ అని పోస్ట్ పెడితే 'వెరీ గుడ్ మార్నింగ్' అని సమాధానం పుచ్చుకున్న వేషాల్రావు ఇక భూమి మీద ఉండడు. ఇక ఆ అమ్మాయి ఏ పోస్ట్ పెట్టినా గుడ్ మార్నింగ్ అని పెట్టి, ఆశగా ఆకాశంకేసి చూస్తుంటాడు. ఆ అమ్మాయి కష్ట పడి ఒక కవిత రాస్తుంది. మన వేషాల్రావుకి కవితల్రావు. తవికలైతే ఒస్తాయి. ఇంకేముంది అలవాటుగా గుద్దేస్తాడు 'గుడ్ మార్నింగ్' అని. నేను కవిత రాస్తే గుడ్ మార్నంగ్ అంటాడేంటని ఆ అమ్మాయి నిరాశగా ఆకాశానికేసి చూస్తుంటుంది. అయినా మేనేజ్ చేయడం ఎలాగో తెలిసినోడు కాబట్టి సాయంత్రం దాకా ఓపిక పట్టి అదే కవిత కింద గుడ్ ఈవెనింగ్...ఇంకాస్త రాత్రి దాకా ఓపిక పట్టి, గుడ్ నైటూ చెప్పేసి, ఉబ్బితబ్బిబ్బవుతుంటాడు. పాపం ఆ అమ్మయి ఉక్కిరిబిక్కిరౌతుంటుంది. ఇలా నడుస్తున్న చోద్యాన్ని చూసి మనం నవ్వుకునే లోపల తెల్లారుతుంది. వేషాల్రావు మళ్ళీ అదే కవిత కింద గుడ్ మార్నింగ్ అంటూ కనిపిస్తాడు ఎంతకీ వదలని ఉత్తర కుమారుడిలా.

Friday, 25 September 2015

భూమధ్య రేఖ ll కాశిరాజు కవిత్వం ll ఒక అవగాహన
....................................................................
దాదాపు గత సంవత్సర కాలంగా నా బుక్ షెల్ఫ్ లో ఒక మూలకు పడి వుంది ఈ భూమధ్య రేఖ. ఏదయినా పుస్తకాన్ని తీసుకుంటున్నపుడో వెతుక్కుంటున్నపుడో..భూమధ్య రేఖ కదా..చేయిని వేడిగా తాకుతుా కనిపించేది. వేడిగా ఉంటుందేమో తర్వాత చదువుదాం లే అని వదిలేసే వాడిని. కానీ  ఇపుడు వర్షం మొదలైంది కదా..కాసింత వెచ్చగా ఉంటుందేమో అనుకుని భూమధ్య రేఖను పట్టుకున్నాను. అమ్మా నాన్నల ప్రేమంత వెచ్చగా గుండెని తగిలి, వాన నీళ్ళలా మనసులో మట్టిని కడిగేసింది. ఇంత కాలం చదవనందుకు బాధ పడాలో ఇపుడు ఈ వర్షం కురిసిన రోజు చదివి ముద్దయినందుకు సంతోష పడాలో అర్థం కాలేదు.

రవీంద్రుడి గీతాంజలిలో ఆయనకూ దేవునికీ పేచీ. ఎడ తెగని పేచీ. ఆ సంభాషణ లో అంతర్లీనంగా ఒక ఫిలాసఫీ. దేవుడంటే ఎవరో ఎక్కడుంటాడో తెలిపే ఫిలాసఫీ. అది మధురం. అమృతం. మళ్ళీ అంతటి ఆ అమృతాన్ని ఇంకో రకంగా కురిపిస్తాడు కాశీరాజు. ఇక్కడ దేవుడుండడు. జీవితం ఉంటుంది. అమ్మ ఉంటుంది. నాన్న ఉంటాడు. ఊరు ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతీ రోజునీ, ప్రతీ అంశాన్నీ తరచి చూసే కవి ఉంటాడు. జీవన సౌందర్యాన్ని ప్రతీ సంఘటనలో ప్రతీ పండగలో చూపించే కాశీరాజు ఉంటాడు. కవిత్వాన్ని చదువుతూ  చాలా చోట్ల ఆగిపోతాం. ఒక ఉద్వేగాన్ని మనస్సు అకస్మాత్తుగా పొందినపుడు, చలనం లేకుండా ఐపోతుందేమో. 'ఇంక ఇది చాలు అనుభవించటానికి' అనిపించేలా ఉండే ఆ పదాల్లోంచి అంత త్వరగా బయటకి రాలేకపోతాము. 'పుస్తకం మొత్తం చదవాలి కదా..!' అనే స్పృహ మనల్ని ముందుకు తోయాలే తప్ప, మనల్ని ఆ భావాలంత సులభంగా వదిలి పెట్టవు. అవి కేవలం భావాలు కాదు. వాస్తవ జీవిత చిత్రాలు. ఆ జీవిత చిత్రాల్ని కంటి ముందు చూపిస్తూ, కవిత్వం చేస్తాడు కాశీరాజు.

ఒక్కో కవిత ఒక జీవితం లోని ఒక సంఘటనను చూపిస్తుంది. అందుకే కోట్ చేయటానికీ, ఇదిగో ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగాలేదు అనటానికీ ఏమీ ఉండదు. చేస్తే కవితనంతా కోట్ చెయ్యాలి. పుస్తకమంతా వేరు వేరు కవితలు కాదు. అందుకే ఇది కవిత్వ సంకలనం కాదు. కవిత్వం. కాశిరాజు కవిత్వం. అన్ని కవితలూ ఒక విషయాన్నే చెబుతాయి. ఒక జీవితాన్ని, ఊరినీ, అమ్మనీ, నాన్ననీ, ఆ తీయటి సంబంధాల్నీ చూపుతాయి. నేరేడు లంక ఊరినుంచి మొదలై..జీవితంలోని ప్రతీ చిన్న అంశాన్నీ అందంగా మనముందు చిత్రిస్తాడు. ఆ చిత్రణలో పాత్రలు అమ్మా, నాన్న, కాశీరాజులతో పాటు ప్రకృతిలోని గడ్డిపరక, వొంగపువ్వు, జమ్మి చెట్టు, మందారపువ్వు, మిణుగురు పురుగు, చిరు దీపం, దేవగన్నేరు, అర్ధరూపాయి, చేతి రుమాలు, పాత మొలతాడు, రేమండ్ ప్యాంటూ, రాతిరి, నిశ్శబ్దం, ఆకలి ఇలా అన్నీ పాత్రలై మనల్ని పలుకరిస్తాయి.

"అరచెయ్యి ఆనంద భాష్పాల్ని వడ్డిస్తుంటే..గిన్నెలోని గుప్పెడు మెతుకులు ఎంతకీ ఐపోవు/ అక్కడ మమకారం ఎక్కువై మెడబడితే..తాగాల్సింది నీళ్ళు కాదు, ఎదురుగా కూర్చున్న కళ్ళ లోని కంగారు/ అపుడు చేయి కడగటానికి చెంబు నీళ్ళి స్తే..అవి ఊటబావులైన హృదయాంతరాలు .." ఇలాసాగుతుందీ కవిత్వం...ఎక్కడ ఆపగలం..ఎక్కడ ముందుకి సాగగలం. నేరేడులంకలో రాత్రిని ఎంతో రొమాంటిక్ గా చూపిస్తాడు. "కూరదాకలోని కుతుహలం కుతకుతమంటోంది. సలాది సుబ్బయ్య వీధి దీపాలార్పేశాక నా సామిరంగా...గుట్టుగా గుసగుసలాడుతూ మా నేరేడులంక నిద్దరోతుంది".

 వానొస్తే బస్సులో కలిసిన వైజాగ్ శర్మగారు ఏం చేస్తాడో మనం పట్టించుకోక పోవచ్ఛు, కానీ కవి ఎవరినీ వదిలి పెట్టడు. అలాగే కమలమ్మతో తిట్లుతింటూ, గుమ్మంముందు పారే వాననీటి లాగే గలగలా నవ్వేసి తల తుడుచుకోవటానికి కమలమ్మ మొగుడు దగ్గరికొస్తాడట. చిల్లులున్న చోట చెంబులూ గిన్నెలూ పెడితే..టిక్ టిక్ మనే వర్షపు చినుకుల సంగీతానికి పేదరికపు దర్శకత్వం భలే బాగుంటుందంటాడు. తన తల్లిని భూమితోనూ, తండ్రిని ఆకాశంతోనూ పోల్చటం రెండు మూడు కవితల్లో కనిపిస్తుంది. అంతా నింపుకున్న శూన్యం ఆకాశమనీ, వొట్టి ఓర్పుతో నిండిన ఖాళీ గుండె భూమిదనీ ఒక కవితలో చెప్పి, 'ఆకాశమేమో నేలపైకి దిగొచ్చి, అమ్మ పక్కన నిల్చుని నాన్నై పోయేదట' అని భావన చేస్తాడు.

పల్లెలో కరెంటు పోయినా అందమైన కవిత్వం చేస్తాడు. "ఆ సందామాట్ల చీకట్లో, ఎంతకీ రాని కరెంటుని అందరం కల్సి తిట్టుకుని, తిందామని తీర్మనించుకున్నాక/, ఆ చిన్న దీపం వెలుగులో..నవ్వుతున్న ముఖాలు మాత్రమే కనబడే వెలుతుర్ని మనకెందుకిచ్చాడో అర్థమై మరింత నవ్వొచ్చేది నాకు/పేదరిక మని విసుక్కున్నా, ప్రశాంతత బాగున్నపుడు, నవ్వు మాత్రమే నేర్వాలి మనం. "  ప్రతీ కవితలో ఒక సందర్భం వుంటుంది, నాన్న జోబులో అర్ధ రూపాయి కొట్టేయటమో..పెళ్ళి సంబంధానికి పోవటమో..అమ్మ పురుడు పోసుకోవడమో..వాగులో స్నానాలు చేయటమో..ఉగాదో, దీపావళో .. ఒకటని కాదు, నిత్య జీవితంలోని ప్రతీ చిన్న అంశమూ కవితలోకి ఒదిగిపోతుంది. ఆ ప్రతీ అంశాన్ని ఆనుకుని ఒక ప్రేమ, ఒక ఆర్ద్రత, ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఇలా కవిత్వాన్ని చేయటం అంత సులభం కాదు.

ఈ కవిత బాగుంది, ఈ కవిత బాగాలేదు అని చెప్పటానికి అవకాశమివ్వడు కాశీరాజు. జీవితంలోకి చొచ్చుకుపోయి ఈ గ్రామీణ జీవన సౌందర్యాన్ని తలమునకలుగా ఆస్వాదించాలంటే చదవాల్సిందే. ఏకాంతం మీద బాణమేసినట్టు ఒక్కో కవిత సాగుతుంది. ఈ కవితల్లో దుఃఖమూ సంతోషమూ తీసుకున్నోళ్ళ కు తీసుకున్నంతగా ఉంటుంది.  పుస్తకమంతా చదివాక సీసాలూ గ్లాసులూ కాదు గానీ, గడ్డ కట్టిన గాజు హృదయాలు ఖాళీ అవుతాయి. ఒక ఆశ్చర్యానందానుభూతికి లోను చేసి, 'ఆహా ఈ వాక్యం చాలు' అనిపించే ఎన్నో కవితా వాక్యాలున్నా,  కొన్నిటిని ఈ కింద తెలుపుతున్నాను.

కాలాన్ని వెనక్కు తిప్పలేమని అన్నాక
తీస్కొచ్చి నిన్ను చూపించాలనుంది.
                     *
ఎక్కడ బతుకు బాసగా మారి
ఎక్కడ మనుషులు సాహిత్యమయ్యారో..
అక్కడ మనం నవ్వుతూ ఉండాలి
నవ్వుల్ని లిఖిస్తుండాలి.
                      *

వర్షం వచ్చిన జాడ ఆ వానకళ్ళకి తెలీదు
అమ్మది ఆకాశమంత దుఃఖం.
అమ్మ కళ్ళకి నాన్న ఉపనది.
                        *
అరచేతిలోని ఉగాది పచ్చడి
అందరివొంకా చూసి తింటే అదో తృప్తి.
ఏండ్లు గడిచి మేం గడసరులయ్యాక కూడా
ఆ పచ్చడిది అదే రుచి.
                        *

చివరిగా ఇది చూడండి.

వదిలి రాలేని ప్రేమతో వచ్చిన ఒక తల్లి
వొరిసేలో ఏం చేస్తదో తెలుసా..?
ఆకు కట్ట ఇప్పినట్టే అమ్మ గుండెని ఇప్పేస్తది.
గుబులు మూన నీట్లో గుచ్చి వరి నాటుతున్నట్టు
ఓ రోజంతా ప్రేమను దుఃఖంతో నాటేస్తది.
రోజుకూలీ బతుకులో రోజంతా అలా బిడ్డ తలపులో వుండి
ఇంటికి పోయాక  పిల్లాన్నెత్తుకుని మొగుడు దేవుడిలా కనిపిస్తే
కళ్ళ నీళ్ళు కారుస్తూ ఆ తల్లి దేవగన్నేరైపోతాది.
                           *

ఇంతకు మించి చెప్పేదేమీ ఉండదు, చదివి కవిత్వం లోని ఆనందాన్ని అనుభవించటం తప్ప. ఇక ఆలోచించేదేమీ లేదు. పుస్తకాన్ని చేతిలోకి తీసుకోవటమే కదా మిగిలింది.

25/9/15